నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన: 50 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్తు
ప్రతి ఆరు రోజులకు పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన పరిధిలోకి వస్తున్న ఒక లక్ష కుటుంబాలు
ఈ పథకం పరిధిలో 2026 జులైలో అత్యధిక నెలవారీ రూఫ్టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటు
దాదాపు 19 లక్షల కుటుంబాలకు సున్నా విద్యుత్ బిల్లులు: 14.8 గిగావాట్ల రూఫ్టాప్ సోలార్ సామర్థ్యం ఏర్పాటు
పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన పరిధిలో 25,000కు పైగా కేంద్ర ప్రభుత్వ భవనాలకు సోలార్ ఏర్పాటు
प्रविष्टि तिथि:
04 AUG 2026 2:26PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా 50.06 లక్షలకు పైగా గృహాల పై కప్పులపై సోలార్ ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన చరిత్రాత్మక ప్రస్థానాన్ని అధిగమించింది.
ప్రారంభమైన నాటి నుంచి రెండేళ్ల వ్యవధిలోనే ఈ విజయం సాధ్యమైంది. అంతకు ముందు పదేళ్లలో కేవలం 7.94 లక్షల రూఫ్టాప్ సోలార్ ఇన్స్టలేషన్లతో పోలిస్తే.. సాధించిన గణనీయమైన పురోగతిని తాజా విజయం సూచిస్తుంది. ఇది రూ.75,021 కోట్ల వ్యయంతో చేపట్టిన, ప్రపంచంలోనే అతిపెద్ధ రూఫ్టాప్ సౌర కార్యక్రమం... వేగంగా అమలవుతున్న తీరును ప్రతిబింబిస్తుంది. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మక రూఫ్టాప్ సోలార్ పథకమే పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ప్రతి ఆరు రోజులకు ఒక లక్ష కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వస్తున్నాయి. ఫలితంగా ప్రపంచంలోనే వేగంగా విస్తరిస్తున్న శుద్ధ ఇంధన కార్యక్రమాల్లో ఒకటిగా ఈ పథకం నిలిచింది. గడచిన తొమ్మిది నెలల కాలంలో ఇన్స్టలేషన్ వేగం 3.2 రెట్లు పెరిగింది. ఇన్స్టలేషన్ల సంఖ్య 2025 అక్టోబర్లో రోజుకు 5,038గా ఉంటే 2026 జులై నాటికి రోజుకి దాదాపు 16,328కి చేరుకున్నాయి.
కేవలం జూలై 2026 నెలలోనే 5.06 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి నెల వారీగా జరిగిన ఇన్స్టలేషన్ల సంఖ్యలో ఇదే అత్యధికం.
ఈ వేగాన్ని కొనసాగించడానికి రూ.28,024 కోట్లను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా అందించారు. ఫలితంగా దాదాపు 19 లక్షల కుటుంబాలు ఇప్పుడు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తోంది. మిగులు విద్యుత్తును అమ్మడం ద్వారా 12 లక్షలకు పైగా కుటుంబాలకు మొత్తం రూ.421 కోట్ల ఆదాయం చేకూరింది. అంటే గ్రిడ్కు విద్యుత్తును ఎగుమతి చేసే ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.3,500 అదనపు ఆదాయం సమకూరుతోంది.
యుటిలిటీ–లెడ్ అగ్రిగేషన్ విధానం పరిధిలో నాలుగు రాష్ట్రాల్లో పీఏంఏవై, బీపీఎల్, ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకు 1.6 లక్షల ఇన్స్టలేషన్లు పూర్తయ్యాయి. అలాగే ఈ విధానాన్ని 12 రాష్ట్రాల్లో అమలు చేయడానికి ఆమోదం లభించింది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు రూఫ్టాప్ సోలార్ను పొందేందుకు ఈ విధానం వీలు కల్పిస్తుంది. అలాగే రాష్ట్రాలపై టారిఫ్ సబ్సిడీ భారాన్ని తగ్గించడంలో సహాయపడుతోంది. రెపో రేటుకు 50 బేసిస్ పాయింట్లు కలిపి దానికి బెంచ్మార్క్గా 5.75 శాతం రాయితీ రుణాలను 21.87 లక్షల దరఖాస్తుదారులకు మంజూరు చేశారు. వీటిలో జన్ సమర్థ్ అనుసంధానం కాగిత రహిత రుణ ప్రక్రియ ద్వారా ఇప్పటికే 17.5 లక్షల ఇన్స్టలేషన్లు పూర్తయ్యాయి.
ఈ పథకం విస్తృతమైన వ్యాపార, ఉపాధి వ్యవస్థను రూపొందించింది. దేశవ్యాప్తంగా 34,219 మంది నమోదిత విక్రేతల్లో 29,469 మంది క్రియాశీలకంగా ఉన్నారు. రూఫ్టాప్ సోలార్ రంగానికి మద్దతు అందించే సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల ద్వారా 2.32 లక్షల మందికి పైగా శిక్షణ పొందారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 14.8 గిగావాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్టాప్ సోలార్ ఫలకాలను ఏర్పాటు చేశారు.
దరఖాస్తు నుంచి సబ్సిడీ విడుదల వరకు ఈ పథకం 100 శాతం ఆన్లైన్ విధానంలో, పూర్తిగా డిజిటల్ ప్రక్రియ రూపంలో జరుగుతుంది. వినియోగదారులకు కాగితాలతోగానీ, కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరంగానీ ఉండదు. కాగిత రహిత రుణాలను అందించేందుకు జన్ సమ్మర్థ్ అనుసంధానం, 15 రోజుల్లోగా రాయితీ విడుదలకు అనుమతించే పీఎఫ్ఎంఎస్ ఏకీకరణ, ప్రక్రియ సజావుగా సాగేందుకు 80కి పైగా డిస్కమ్లతో ఏపీఐ అనుసంధానం, జాతీయపోర్టల్ ద్వారా డిజిటల్ నెట్ మీటరింగ్ ఒప్పందం, వినియోగదారులకు స్టార్ రేటింగులు కనిపించేలా వెండర్ రేటింగ్ నిబంధనల ద్వారా ఈ విజయం సాధ్యమైంది. డీసీఆర్ పోర్టల్తో ఏకీకరణ.. దేశీయ కంటెంట్ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేస్తుంది.
సోలార్ ఏర్పాటును సులభతరం చేసేలా పది కిలోవాట్ల వరకు ఉండే ఇళ్ల పైకప్పు సోలార్కి ముందస్తు అనుమతులు లేదా పరిశీలనల అవసరాన్ని తొలగించారు. అలాగే 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రూఫ్టాప్ సోలార్ దరఖాస్తు, నెట్ మీటరింగ్ రుసుములను పూర్తిగా రద్దు చేశాయి. డిస్కంలకు ప్రోత్సాహకంగా రూ.3,807.6 కోట్లను, పట్టణ స్థానిక సంస్థలకు రూ.104 కోట్లను మంజూరు చేశారు. 46 నగరాల్లో సిటీ యాక్సిలేటర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విక్రేతల జవాబుదారీ వ్యవస్థ పరిధిలో సుమారు 23,000 తృతీయ పక్ష నాణ్యతా తనిఖీలను నిర్వహించారు.
సోలార్ ఫలకాల ఏర్పాటు సాధ్యమయ్యే సుమారు 41,542 ప్రభుత్వ భవనాలను కేంద్ర మంత్రిత్వ శాఖలు గుర్తించాయి. వీటికి 1,418 మెగావాట్ల సామర్థ్యం ఉంది. ఇందులో ఇప్పటికే 872 మెగావాట్ల సామర్థ్యంతో 25,255 భవనాలకు సౌర విద్యుత్ ఫలకాలు అమర్చారు. అలాగే రాష్ట్రాలు కూడా 3,20,000 ప్రభుత్వ భవనాలను గుర్తించగా, వాటికి 4,400 మెగావాట్ల సామర్థ్యం ఉంది. ఇందులో ఇప్పటికే 1,450 మెగావాట్ల సామర్థ్యంతో 81,329 భవనాలకు సోలార్ అమర్చారు. ఇప్పటివరకు మొత్తంగా 1.06 లక్షల ప్రభుత్వ భవనాలకు సోలార్ సౌకర్యాన్ని కల్పించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సోలార్ ప్రాజెక్టుల్లో చెల్లింపుల నష్టాన్ని తగ్గించడానికి, సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడటం ద్వారా ఆర్ఈఎస్సీవో బిడ్డర్లను ప్రోత్సహించడానికి చెల్లింపు భద్రతా విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు.
ఈ పథకం ద్వారా ప్రస్తుతం 50 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. అలాగే సౌరఫలకాల ఏర్పాటు చేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భారతీయ కుటుంబాలకు విద్యుత్ భద్రత, విద్యుత్ స్వాతంత్ర్యాన్ని అందించాలనే జంట లక్ష్యాలను ముందుకు తీసుకెళుతూ.. వికేంద్రీకృత, పౌర భాగస్వామ్యంతో కూడిన శుద్ధ ఇంధన వినియోగంలో ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా భారత దేశ స్థానాన్ని పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పటిష్టం చేస్తోంది.
***
(रिलीज़ आईडी: 2294528)
आगंतुक पटल : 11