హోం మంత్రిత్వ శాఖ
ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలపై కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షాతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు కింజరాపు సమీక్ష
ప్రయాణికుల రాకపోకలు సాఫీగా సాగేలా నిర్ధారించడానికి విమానాశ్రయంలో ప్రతి ఒక్క టచ్-పాయింట్ వద్దా
సమన్వయ ప్రణాళికకు రూపురేఖల కల్పన
అన్ని విమానాశ్రయాల్లో దశలవారీ పద్ధతిలో ఆటోమేటెడ్ ఎక్స్-రే ట్రే రిటర్న్ వ్యవస్థ అమల్లోకి
అన్ని రాష్ట్రాల ప్రధానకేంద్రాల్లో 2027 కల్లా ఎఫ్ఆర్ఆర్ఓ కార్యాలయాలు ఏర్పాటు
అగర్తల, జేవర్ విమానాశ్రయాల్లో అధీకృత ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ఏర్పాటుకు ఆదేశాలు జారీ
ఎఫ్టీఐ-టీటీపీకి ఆదరణ లభించేలా చూడడానికి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా
అంతర్జాతీయ ప్రయాణికులను విమానయాన సంస్థల సహకారంతో ప్రోత్సహిస్తారు
प्रविष्टि तिथि:
08 JUL 2026 4:27PM by PIB Hyderabad
ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలపై కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షాతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు కింజరాపు సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టరు, పౌర విమానయాన శాఖ కార్యదర్శి, కేంద్రీయ పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్, భారత విమానాశ్రయాల ప్రాధికరణ సంస్థ చైర్మన్తో పాటు హోం శాఖ, పౌర విమానయాన శాఖలకు చెందిన అనేక మంది ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
మానవ వనరులకయ్యే ఖర్చును తగ్గించే ఉద్దేశంతో అన్ని విమానాశ్రయాల్లో దశల వారీగా యంత్రసాయంతో పనిచేసే (ఆటోమేటెడ్) ఎక్స్-రే ట్రే రిటర్న్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆదేశించారు. ఈ ఆటోమేటెడ్ ఎక్స్-రే ట్రే రిటర్న్ వ్యవస్థను కొత్త విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసేటప్పుడు తగిన ప్రమాణాలను ఖరారు చేయాలని ఆయన అన్నారు.
ప్రయాణికుల రాకపోకలకు ఏ ఒక్క ప్రాంతంలోనూ ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా ప్రవేశ మార్గాలూ, తనిఖీ కేంద్రాలు, భద్రత పరీక్ష మార్గాలు, ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల మధ్య పరస్పర ఆధారిత పద్ధతిని దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్ర ప్రాథమిక ప్రణాళికను రూపొందించాలని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆదేశాలిచ్చారు. ప్రయాణికుల రాకపోకలు సాఫీగా సాగేటట్లు చూడడానికి విమానాశ్రయాల్లో ప్రయాణికులతో సంబంధం ఉన్న ప్రతి ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ఒక సమన్వయ ప్రణాళికను సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
ప్రయాణికుల రాకపోకల ఆధారంగా ప్రస్తుతం అభివృద్ధి పనులు పురోగమిస్తున్న 21 విమానాశ్రయాలతో పాటు మిగిలిన 41 విమానాశ్రయాలను కూడా పౌర విమానయాన భద్రత మండలి (బీసీఏఎస్) భద్రత ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి పరచడానికి ప్రాధాన్యాలను నిర్ధారించాలని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఆదేశించారు. వాణిజ్య ప్రాంతాలు నిర్దిష్ట ప్రమాణాల్లోనే ఉండేటట్లు జాగ్రత్తచర్యలు తీసుకుంటూ, ప్రయాణికుల సౌకర్యాలను పెంపొందించడం ముఖ్యోద్దేశం కావాలని ఆయన స్పష్టం చేశారు. ఈ 62 విమానాశ్రయాల్లోనూ పనులను రాబోయే రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఆయన అన్నారు.
ప్రయాణికుల రాకపోకలు, ఎయిర్ ట్రాఫిక్ ఆధారంగా అన్ని విమానాశ్రయాలకూ ఏరోబ్రిడ్జుల సంఖ్యకు సంబంధించిన ప్రమాణాలను నిర్దేశించాలని పౌర విమానయాన శాఖను శ్రీ అమిత్ షా ఆదేశించారు. బ్యాగేజి డ్రాప్ సదుపాయం ప్రస్తుతం 16 ప్రధాన విమానాశ్రయాల్లో అందుబాటులో ఉండగా, ఈ సదుపాయాన్ని ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్న ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాలకు కూడా విస్తరించాలని ఆయన ఆదేశాలిచ్చారు. ఎక్స్-రే స్క్రీనింగ్ కోసం నియమించే కేంద్రీయ పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బంది విద్యార్హతలో ఎలాంటి సడలింపునకూ తావు ఇవ్వకూడదని ఆయన స్పష్టం చేశారు. దీంతోపాటు, కావలసిన విద్యార్హతలు పొందిన అందుబాటులోని అధికారులనూ, సిబ్బందినీ ఎక్స్-రే స్క్రీనింగ్ విధులను అప్పగించాలని కూడా ఆయన ఆదేశించారు.
అన్ని రాష్ట్రాల ప్రధాన కేంద్రాల్లో 2027 కల్లా ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) కార్యాలయాలు త్వరగా పని ప్రారంభించాలని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు.
అగర్తలా, జేవర్ విమానాశ్రయాల్లో అధీకృత ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్లను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని కూడా ఆయన ఆదేశాలిచ్చారు. ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్-ట్రస్టెడ్ ట్రావెలర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్టీఐ-టీటీపీ)కి మరింత ఆదరణ లభించేలా విమానయాన సంస్థతో సమన్వయాన్ని ఏర్పరుచుకొని అంతర్జాతీయ టికెట్టు బుకింగు సమయంలో, ఎఫ్టీఐ-టీటీపీలో నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతూ సంబంధిత ప్రయాణికులకు వాట్సాప్ సందేశాన్ని పంపించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా ఆయన అన్నారు.
ప్రతి సంవత్సరంలోనూ ప్రయాణాలు అత్యధిక స్థాయిలో నమోదయ్యే కాలంలో ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అవసరం ఉన్న అన్ని ప్రాంతాల వద్దా జాప్యాన్ని అంచనా వేసి, ఆ జాప్యాన్ని తగ్గించడం కోసం పౌర విమానయాన శాఖ, సీఐఎస్ఎఫ్ వేర్వేరుగా మూడో పక్షం సాయంతో అధ్యయనాలను నిర్వహించాలని శ్రీ అమిత్ షా అన్నారు.
***
(रिलीज़ आईडी: 2282706)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam