ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఇరుదేశాల మధ్య నిధుల బదిలీ విధానాన్ని ప్రారంభించిన భారత్- నేపాల్
ద్వైపాక్షిక ఆర్థిక అనుసంధానాన్ని బలోపేతం చేసే దిశగా కీలక చర్య
భారత యూపీఐ, నేపాల్ జాతీయ చెల్లింపుల వేదికలను నేరుగా అనుసంధానించడం ద్వారా.. అంతరాయం లేని, సురక్షిత, తక్షణ ప్రత్యక్ష (పీ2పీ) నగదు బదిలీ
ఆర్థిక సమ్మిళితత్వం బలోపేతం, డిజిటల్ - ఆర్థిక ఏకీకరణకు ఊతం, ఇరుదేశాల్లోని ప్రయాణికులు, వ్యాపారాలకు మెరుగైన సౌలభ్యం
प्रविष्टि तिथि:
11 JUN 2026 3:47PM by PIB Hyderabad
డిజిటల్ ఆర్థిక అనుసంధానం, పొరుగు దేశాలతో పరస్పర సహకారానికి మరింత ఊతాన్నిస్తూ... ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష (పీ2పీ) నిధుల బదిలీ విధానాన్ని 2026 జూన్ 6న భారత్, నేపాల్ అధికారికంగా ప్రారంభించాయి.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ వ్యవస్థ.. భారత ఏకీకృత చెల్లింపుల వేదిక (యూపీఐ), నేపాల్ జాతీయ చెల్లింపుల వేదిక (ఎన్పీఐ)ల మధ్య ప్రత్యక్ష అనుసంధానాన్ని ఏర్పరుస్తుంది. ఈ అనుసంధానం ద్వారా ఇరు దేశాల ప్రజలు మొబైల్ బ్యాంకింగ్ యాప్లు, డిజిటల్ వాలెట్ల ద్వారా.. అంతరాయం లేకుండా, నేరుగా, సురక్షితంగా తక్షణమే నిధులను బదిలీ చేసుకోవచ్చు.
ఆర్థిక సమ్మిళితత్వం, భారత్ - నేపాల్ మధ్య బలమైన ఆర్థిక, డిజిటల్ సంబంధాలను పెంపొందించుకోవడంలో ఈ యూపీఐ - ఎన్పీఐ అనుసంధానం కీలకమైన ముందడుగు. సులభంగా అందుబాటులో ఉండే, సురక్షితమైన, తక్కువ వ్యయంతో ఇరు దేశాల నడుమ చెల్లింపులకు సంబంధించిన ప్రాంతీయ లక్ష్యాలతో ఇది పూర్తిగా సరిపోతుంది. దీర్ఘకాలంగా ఉన్న సామాజిక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తుంది.
ఆర్థిక, డిజిటల్ ఏకీకరణకు చోదకశక్తి:
భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్పీసీఐ) అంతర్జాతీయ విభాగమైన ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) - నేపాల్ క్లియరింగ్ హౌస్ లిమిటెడ్ (ఎన్సీహెచ్ఎల్) మధ్య సంయుక్త భాగస్వామ్యంతో ఈ సాంకేతిక అనుసంధానం సాకారమైంది.
వ్యూహాత్మక ప్రభావం: యూపీఐ - ఎన్పీఐ చెల్లింపుల అనుసంధానంలో ముఖ్యమైన అశాలు:
రెండు దేశాల మధ్య వాణిజ్యం జరిగే విధానంలో కీలక మార్పును సూచిస్తూ.. ఈ డిజిటల్ చెల్లింపుల విధానం తక్షణ ప్రయోజనాలను అందిస్తుంది:
-
ప్రయాణికులకు మెరుగైన సౌలభ్యం: భౌతికంగా నగదు వినియోగాన్ని, భారీ మొత్తంలో నగదును వెంట ఉంచుకోవాల్సిన అవసరాన్ని, విదేశీ మారకపు రుసుములకు సంబంధించిన అయోమయాన్ని దూరం చేస్తుంది.
-
స్థానిక వర్తకులకు ఆర్థికంగా ఊతం: సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న పెద్ద సంఖ్యలోని భారతీయ పర్యాటకులు.. నేపాల్ వ్యాపార సంస్థలకు మరింత సులభంగా చేరువవుతారు. దీంతో లావాదేవీల పరిమాణం గణనీయంగా పెరుగుతుంది.
-
నిర్వహణ సామర్థ్యం: స్థానిక వ్యాపారులకు నగదు నిర్వహణ సులువవుతుంది. భౌతికంగా నగదును నిర్వహించడం, భద్రపరచడానికి సంబంధించిన అదనపు ఖర్చులు తగ్గుతాయి. లావాదేవీల సొమ్ము ఎప్పటికప్పుడు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతుంది.
-
నేరుగా, అంతరాయం లేకుండా నగదు బదిలీ: సరిహద్దులు దాటి ప్రయాణించేటప్పుడు భౌతికంగా నగదును వెంట తీసుకెళ్లాల్సిన అవసరాన్ని దూరం చేస్తుంది. అలాగే కాలయాపనతో కూడిన పాతకాలపు బ్యాంకింగ్ విధానాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా యూపీఐ విస్తరణ:
తొమ్మిది దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి – సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, భూటాన్, ఖతార్, శ్రీలంక, కంబోడియా. ఇది భారతీయ పర్యాటకులు తమకు అలవాటైన డిజిటల్ వేదికల ద్వారానే ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా చెల్లింపులు చేసే సదుపాయాన్ని కల్పిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2271851)
आगंतुक पटल : 9