హోం మంత్రిత్వ శాఖ
ఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ల నిర్వహణ వ్యవస్థను (వినిమయ్) ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
భారత్లో అత్యంత సుదీర్ఘకాలం నిర్విరామంగా పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా రేపు రికార్డు సృష్టించనున్న మోదీ.. ఇది దేశం మొత్తానికి గర్వకారణమైన క్షణం
ఎల్పీఎంఎస్, స్మార్ట్ సరిహద్దులు కలిసి మరింత సురక్షితమైన, ఆధునిక సరిహద్దు నిర్వహణ వ్యవస్థను తయారుచేస్తాయి: హోం మంత్రి
ఇది అక్రమ కార్యకలాపాలను అరికట్టడంతో పాటు ఒక బలమైన, సురక్షితమైన వ్యవస్థను నిశ్చయంగా అందిస్తుంది: హోం మంత్రి
చతుర్ముఖ సరిహద్దు భద్రతా వ్యూహంలో ల్యాండ్ పోర్ట్ల ప్రాధికార సంస్థ ఒక కీలకమైన ఆధారంగా ఎదుగుతోంది: హోం మంత్రి
ప్రారంభమైన ల్యాండ్ పోర్ట్ల నిర్వహణ వ్యవస్థ (ఎల్పీఎంఎస్).. తొలగిన 90 శాతం కాగితపు పనులు: హోం మంత్రి
'సింగిల్ ఎలక్ట్రానిక్ విండో' విధానం ప్రవేశపెట్టడం, ప్రాసెసింగ్ సమయంలో 40-60 శాతం తగ్గింపు సాధించడం ద్వారా స్మార్ట్ సరిహద్దులకు పడ్డ సరికొత్త డిజిటల్ పునాది: హోం మంత్రి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న పదిహేను ల్యాండ్ పోర్ట్లు.. రాబోయే మూడేళ్లలో మరో 11 ల్యాండ్ పోర్టులను అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్న ప్రణాళికలు: హోం మంత్రి
సరిహద్దు జిల్లాల నుంచి వలసలను తగ్గించడంలో, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడంలో, సరిహద్దుల అంతటా సాంస్కృతిక- ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ల్యాండ్ పోర్ట్లు: హోం మంత్రి
2014లో రూ. 5,000 కోట్ల నుంచి నేడు రూ. 83,000 కోట్లకు చేరుకున్న ల్యాండ్ పోర్ట్ల వ్యాపారం.. మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో నమోదైన 16 రెట్ల వృద్ధి: హోం మంత్రి
ఒకే ప్లాట్ఫామ్పై ఐస్గేట్, మోటార్ వాహనాల వ్యవస్థ, సీబీఐసీ, బీఎస్ఎఫ్, డీజీఎఫ్టీ, యూఐడీఏఐ, యూఎల్ఐపీ మధ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకోవటానికి వీలు కల్పిస్తున్న ఎల్పీఎంఎస్: హోం మంత్రి
దీనితో సరిహద్దు సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంతో పాటు సరిహద్దు నిర్వహణ సామర్థ్యాన్ని, భద్రతను, ప్రభావాన్ని మరింత మెరుగుపరచనున్న ఎల్పీఎంఎస్: హోం మంత్రి
प्रविष्टि तिथि:
09 JUN 2026 8:22PM by PIB Hyderabad
వినిమయ్ పేరుతో ఉన్న ల్యాండ్ పోర్ట్ల నిర్వహణ వ్యవస్థను (ఎల్పీఎంఎస్-ల్యాండ్ పోర్ట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్) కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్, కార్యదర్శి (సరిహద్దు నిర్వహణ)- ల్యాండ్ పోర్ట్ల ప్రాధికార సంస్థ (ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) చైర్మన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ... 2014 తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ల్యాండ్ పోర్ట్ల ప్రాధికార సంస్థకు సరికొత్త దిశానిర్దేశం లభించిందని అన్నారు. కేవలం భద్రతకే పరిమితం కాకుండా ల్యాండ్ పోర్ట్లను (ల్యాండ్ పోర్ట్లు) భద్రతకు తొలి రక్షణ శ్రేణిగా, అంతర్జాతీయ వ్యాపారానికి ఒక సాధనంగా, ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించే ఒక వారధిగా అభివృద్ధి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో, చట్టబద్ధమైన వ్యాపారాన్ని ప్రోత్సహించడంలో, సరిహద్దు గ్రామాలు- జిల్లాల నుంచి వలసలు వంటి సవాళ్లను పరిష్కరించడంలో ల్యాండ్ పోర్ట్లు అత్యంత కీలక పాత్ర పోషించాయని చెప్పారు. సరిహద్దుల గుండా ప్రజల రాకపోకలు సులభతరం కావడం వల్ల ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర నమ్మకం బలపడిందని, సాంస్కృతిక మార్పిడి పెరిగిందని ఆయన అన్నారు. భారత్ లాంటి సుదీర్ఘమైన భూ సరిహద్దులు కలిగిన దేశంలో సరిహద్దు నిర్వహణ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు.
'స్మార్ట్ సరిహద్దుల’ భావన కింద భారత సరిహద్దులను సురక్షితం చేయడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చతుర్ముఖ వ్యూహంపై పని చేస్తోందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ స్మార్ట్ సరిహద్దుల దార్శనికతను సాకారం చేయడంలో ల్యాండ్ పోర్ట్ల ప్రాధికార సంస్థ కీలక పాత్ర పోషించనుందని ఆయన పేర్కొన్నారు. భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూనే భాగస్వాములందరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ల్యాండ్ పోర్ట్ల నిర్వహణ వ్యవస్థను (ఎల్పీఎంఎస్) రూపొందించినట్లు ఆయన వివరించారు. స్మార్ట్ సరిహద్దుల కార్యక్రమంతో కలిపి ఈ వ్యవస్థ ఒక అభేద్యమైన, సురక్షితమైన సరిహద్దు నిర్వహణ వ్యవస్థను నిర్మించడంలో సహాయపడుతుందని చెప్పారు. స్మార్ట్ సరిహద్దుల కార్యక్రమం, ఎల్పీఎంఎస్లు సంయుక్తంగా మరింత సురక్షితమైన, ఆధునిక సరిహద్దు నిర్వహణ వ్యవస్థను సృష్టిస్తాయని ఆయన అన్నారు. ఇది అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి.. ఒక బలమైన, సురక్షితమైన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి తోడ్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

రేవుల కోసం ల్యాండ్ పోర్ట్ల ప్రాధికార సంస్థ అధునాతన, డిజిటల్, సమగ్ర, రియల్-టైమ్ నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేసిందని.. తద్వారా భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చిందని హోం మంత్రి తెలిపారు. ల్యాండ్ పోర్ట్ల నిర్వహణ వ్యవస్థ ద్వారా ల్యాండ్ పోర్ట్ల ఏర్పాటు వెనుక ఉన్న ప్రధాన ఆశయాన్ని ల్యాండ్ పోర్ట్ల ప్రాధికార సంస్థ నెరవేర్చిందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ల్యాండ్ పోర్ట్ల నిర్వహణ వ్యవస్థను దేశంలోని 'స్మార్ట్ భద్రతా వలయం'లో ఒక అంతర్భాగంగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా దేశ ఆర్థిక భద్రతతో పాటు భౌతిక భద్రతను కూడా సురక్షితం చేయనున్నట్లు పేర్కొన్నారు. ల్యాండ్ పోర్ట్ల ప్రాధికార సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం 'స్మార్ట్ సరిహద్దుల' దార్శనికతను పూర్తిగా సాకారం చేయడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. ఈ వ్యవస్థ సరుకు రవాణా, ప్రయాణికులు, వాహనాల నిర్వహణ కోసం ఒక సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ను అందిస్తుంది. ఇది వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తుంది.. సమాచార మార్పిడిని ఎంతో సులభతరం చేస్తుంది. దీనివల్ల దాదాపు 90 శాతం కాగితపు పనులు తొలగిపోతాయి. 'సింగిల్ ఎలక్ట్రానిక్ విండో', నంబర్ ప్లేట్ను స్వయంచాలితంగా గుర్తించే వ్యవస్థ (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్- ఏఎన్పీఆర్) ఆధారిత గేట్ నిర్వహణ వ్యవస్థ వల్ల సమయం భారీగా ఆదా అవుతుంది. ట్రక్కుల నిరీక్షణ సమయం సుమారు 40 శాతం నుంచి 60 శాతం వరకు తగ్గుతుందని, గేట్ ప్రాసెసింగ్ సమయం 22 శాతం నుంచి 35 శాతం వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇది కేవలం వ్యాపారాన్ని పెంపొందించడమే కాకుండా పర్యాటకాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఇది ఇరు దేశాల ప్రజల మధ్య మెరుగైన సమన్వయం, సంభాషణలు, సాంస్కృతిక మార్పిడికి దోహదపడుతుందని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు.
ఎల్పీఎంఎస్ ద్వారా ఒకే ఉమ్మడి వేదికపై ఐస్గేట్, మోటార్ వాహనాల వ్యవస్థ, సీబీఐసీ, బీఎస్ఎఫ్, డీజీఎఫ్టీ, యూఐడీఏఐ, యూఎల్ఐపీల మధ్య ఎప్పటికప్పుడు డేటా షేరింగ్ జరుగుతుందని.. ఇది సరిహద్దుల్లో పనిచేసే వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర హోం మంత్రి అన్నారు. ఈ భాగస్వాములందరి మధ్య సమన్వయాన్ని, సమాచార మార్పిడిని పెంపొందించే ఇటువంటి ప్లాట్ఫామ్ దేశానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని, అభివృద్ధికి సరికొత్త వేగాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో ల్యాండ్ పోర్ట్లు అద్భుతమైన మార్పునకు లోనయ్యాయని ఆయన చెప్పారు. 2014లో ల్యాండ్ పోర్ట్ల ద్వారా జరిగిన వాణిజ్యం కేవలం రూ. 5,000 కోట్లుగా ఉండగా ఇప్పుడు అది 16 రెట్ల వృద్ధితో రూ. 83,000 కోట్లకు పెరిగిందని అన్నారు. ప్రస్తుతం దేశంలో 15 ల్యాండ్ పోర్ట్లు పనిచేస్తున్నాయని.. రాబోయే రెండు నుంచి మూడు ఏళ్లలో మరో 11 అదనపు ల్యాండ్ పోర్ట్లు అందుబాటులోకి రానున్నాయని శ్రీ అమిత్ షా వెల్లడించారు.

ల్యాండ్ పోర్ట్ల విషయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన దార్శనికత నిర్ణీత కాలపరిమితిలోగా నెరవేరుతుందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ల్యాండ్ పోర్ట్ల ప్రాధికార సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 'స్మార్ట్ సరిహద్దు' అనే భావనతో అనుసంధానించినప్పుడు... ల్యాండ్ పోర్ట్ల ప్రాధికార సంస్థ భారతదేశ ఆర్థిక భద్రత, సరిహద్దు భద్రత రెండింటిలోనూ ఒక అత్యంత కీలకమైన భాగంగా మారుతుందని ఆయన అన్నారు.
2026 జూన్ 9వ తేదీ దేశ చరిత్రలో ఒక అత్యంత కీలకమైన రోజుగా నిలిచిపోతుందని కేంద్ర హోం మంత్రి అన్నారు. ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్విరామంగా 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భం ఇదని ఆయన పేర్కొన్నారు. కొంతమంది నాయకులు కేవలం అధికారంలో కొనసాగడానికే తమ సమయాన్ని వెచ్చిస్తుంటే శ్రీ నరేంద్ర మోదీ మాత్రం గత 12 ఏళ్ల పదవీ కాలాన్ని నిరంతర సేవకే అంకితం చేశారని, దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారని చెప్పారు. మోదీ దేశ సేవనే తన జీవిత పరమార్థంగా మార్చుకున్నారని, దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరం కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు. ఒక నిస్వార్థ కర్మయోగిలా మోదీ ఎన్నో మైలురాళ్లను అధిగమించారని.. ఆయన కృషి వల్లే నేడు భారత్ వివిధ రంగాలలో ప్రపంచవ్యాప్త ప్రమాణంగా, ప్రగతికి నిదర్శనంగా నిలిచిందని శ్రీ అమిత్ షా కొనియాడారు.
ఒక ఎన్నికైన ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ నేటితో పదవిలో 4,398 రోజులు పూర్తి చేసుకున్నారని.. రేపటితో మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించనున్నారని తెలిపారు. దీనితో భారత్లో అత్యంత సుదీర్ఘకాలం నిర్విరామంగా పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించిన ఘనత మోదీకి దక్కుతుందని ఆయన అన్నారు. తన పదవీ కాలంలో నరేంద్ర మోదీ ప్రజల సంక్షేమాన్నే సుపరిపాలనకు మూలసూత్రంగా మార్చారని ఆయన పేర్కొన్నారు.
భారత్లోని ప్రతి ఒక్కరికి సొంత పక్కా ఇల్లు ఉండాలనే సరికొత్త దార్శనికతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకువచ్చారని కేంద్ర హోం మంత్రి అన్నారు. నేడు ఇప్పటికే దాదాపు 4 కోట్ల పక్కా ఇళ్లను భారత ప్రజలకు అందించినట్లు తెలిపిన ఆయన.. మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో భారత్లో సొంత పక్కా ఇల్లు లేని కుటుంబం అంటూ ఒక్కటి కూడా ఉండబోదని ఆయన చెప్పారు. ఇళ్లతో పాటు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్లు, సురక్షితమైన తాగునీరు, రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా సౌకర్యం, ప్రతి నెలా ఒక్కొక్కరికి 5 నుంచి 7 కిలోల ఉచిత ఆహార ధాన్యాలను అందిస్తున్నట్లు శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఇటువంటి అవసరమైన సేవలను పొందడం కోసం తరతరాలుగా ఇబ్బందులు పడిన కుటుంబాలకు నరేంద్ర మోదీ తన 12 ఏళ్ల పదవీ కాలంలోనే ఈ ప్రాథమిక వసతులను కల్పించారని ఆయన అన్నారు. మోదీ అభివృద్ధి అనే పదానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చారని శ్రీ అమిత్ షా కొనియాడారు. భారత పరిపాలనా చరిత్రలో సుపరిపాలన, ప్రగతికి సంబంధించిన ప్రతి రంగాన్ని కలుపుకుంటూ 'సమగ్ర అభివృద్ధి’(360 డిగ్రీల అభివృద్ధి) అనే సరికొత్త భావనను ఆయన ప్రవేశపెట్టారని చెప్పారు. నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని అన్నారు. గత 12 ఏళ్లలో 25 కోట్ల ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని హోం మంత్రి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరమైన వాతావరణం ఉన్నప్పటికీ భారత్ స్థిరత్వం, పట్టుదలతో తన లక్ష్యాల వైపు నిలకడగా, వేగంగా దూసుకుపోతోందని ఆయన స్పష్టం చేశారు.
గత 12 ఏళ్లలో భారత ప్రజాస్వామ్యం ఒక ప్రాథమిక పరివర్తనకు లోనైందని శ్రీ అమిత్ షా అన్నారు. వారసత్వ రాజకీయాలు, సామాజిక వర్గాల ఆధారిత రాజకీయాలు, అవినీతి అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతలా వేరూనుకుపోయాయంటే ప్రజలు వాటితో కలిసి జీవించడానికి అలవాటు పడిపోయారని ఆయన గుర్తుచేశారు. అయితే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా కాలం నిలిచిపోయేలా ఒక మౌలిక మార్పును తీసుకువచ్చారు. కుటుంబ వారసత్వం, సామాజిక వర్గ సమీకరణాలు, అవినీతి ద్వారా కూడబెట్టిన సంపద ప్రభావంతో నడిచే పాత రాజకీయాల స్థానంలో పనితీరు, సుపరిపాలన కేంద్రంగా సాగే సరికొత్త రాజకీయాలను నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. దీని ఫలితంగానే అనేక రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు మళ్లీ మళ్లీ అధికారంలోకి రావడం చూశామని... ఇది మరింత స్థిరత్వానికి, దీర్ఘకాలిక విధానాల రూపకల్పనకు, ఆ విధానాల సమర్థవంతమైన అమలు- పర్యవేక్షణకు దారితీసిందని చెప్పారు. దేశ రాజకీయ చరిత్రలో 'పనితీరు ఆధారిత రాజకీయాలను' నెలకొల్పిన ఘనత ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే అది ముమ్మాటికీ శ్రీ నరేంద్ర మోదీకే దక్కుతుందని కేంద్ర హోం మంత్రి స్పష్టం చేశారు. శ్రీ నరేంద్ర మోదీ కేవలం మహిళా అభివృద్ధి గురించి మాట్లాడటమే కాకుండా 'మహిళల నేతృత్వంలోని అభివృద్ధి' అనే భావనను ముందుకు తీసుకెళ్లారని అన్నారు. ఒకప్పుడు సాయుధ దళాలు, పోలీసింగ్, శాస్త్ర విజ్ఞానం, పరిశోధన, పారిశ్రామికవేత్తలు, డ్రోన్లు, క్రీడలు, అంకురాలు, అంతరిక్షం వంటి రంగాల్లో మహిళలను నాయకత్వ పాత్రల్లోకి ప్రోత్సహించడానికి సమాజంలో కొంత సంకోచం ఉండేదని ఆయన గుర్తుచేశారు. అత్యంత సవాలుతో కూడిన సరికొద్దు ప్రాంతాల్లో కూడా సరిహద్దు భద్రతా దళంలో (బీఎస్ఎఫ్) సరిహద్దు రక్షకులుగా పురుషులతో సమానంగా మహిళలు సేవలు అందించడం చూడటం ఎంతో గర్వకారణంగా, సంతృప్తిగా ఉందని ఆయన అన్నారు. శ్రీ నరేంద్ర మోదీ ప్రజా భాగస్వామ్య భావనను కూడా పూర్తిగా మార్చివేశారని ఆయన పేర్కొన్నారు. ఆకాంక్షిత జిల్లాలు, ఆకాంక్షిత ప్రాంతాల (ఆస్పిరేషనల్ బ్లాక్స్) ఏర్పాటు ద్వారా ఆయన సమ్మిళిత అభివృద్ధి దార్శనికతను నిజం చేసి చూపించారని అన్నారు. అభివృద్ధి ప్రయాణంలో వెనుకబడిన జిల్లాలను దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాలతో సమానంగా తీసుకురావాలనే లక్ష్యంతో 30 కంటే ఎక్కువ పారామితులలో నిర్దిష్ట అభివృద్ధి లక్ష్యాలను, తగిన వనరులను కేటాయించినట్లు చెప్పారు. అనేక ఆకాంక్షిత జిల్లాలు ఇప్పుడు పలు పారామితులలో దేశంలోని మొదటి ఐదు జిల్లాలతో పోటీపడే స్థాయికి చేరుకున్నాయని ఆయన వెల్లడించారు. ఈ సమ్మిళిత అభివృద్ధి దార్శనికత ఇప్పుడు పరిపాలనాపరమైన ప్రేరణ, ప్రజల ఆకాంక్షల మేల్కొలుపు, సామూహిక ప్రయత్నంతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. అంతకుముందు కేవలం ప్రభావవంతమైన మంత్రులు లేదా పార్లమెంట్ సభ్యులు ప్రాతినిధ్యం వహించే జిల్లాలకే పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు అందుతాయనే నమ్మకం ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని ఆయన తెలిపారు.

గత 12 ఏళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. ప్రతి నెలా 81 కోట్ల మంది ప్రజలు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలను అందుకుంటున్నారు. 58 కోట్లకు పైగా కొత్త జన్-ధన్ బ్యాంక్ ఖాతాలు తెరిచారు. 44 కోట్లకు పైగా ప్రజలు ఆయుష్మాన్ భారత్ కార్డులను కలిగి ఉన్నారు. దీని ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా సౌకర్యం లభిస్తోంది. 16 కోట్ల గృహాలకు నల్లా నీటి సౌకర్యం అందింది. 13 కోట్ల మంది రైతులు పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఆర్థిక సహాయాన్ని పొందారు. 12.76 కోట్ల గృహాలకు మరుగుదొడ్ల వసతి కల్పించినట్లు తెలిపిన ఆయన.. 10.55 కోట్ల గృహాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు, 4 కోట్లకు పైగా ప్రజలకు సొంత పక్కా ఇళ్లు నిర్మించినట్లు వెల్లడించారు. 3 కోట్లకు పైగా గ్రామీణ పేద మహిళలు 'లఖ్పతీ దీదీలు'గా మారారని, దేశవ్యాప్తంగా 93 లక్షల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. నేడు డిజిటల్ లావాదేవీలలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో, మొబైల్ తయారీలో రెండో స్థానంలో, అంకుర వ్యవస్థలో మూడో స్థానంలో నిలిచిందని ఆయన అన్నారు. కోవిడ్-19 మహమ్మారి అయినా లేదా అంతర్జాతీయ సంఘర్షణల వల్ల ఉత్పన్నమైన ఆర్థిక సవాళ్లు అయినా భారత్ ఆయా సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా నిరంతరం ముందుకు దూసుకుపోతోందని ఆయన గుర్తుచేశారు. గత 12 ఏళ్లలోని జీడీపీ వృద్ధి గణాంకాలే ఇందుకు నిదర్శనమని... ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ దూరదృష్టి, బలమైన నాయకత్వంతో దేశం వాటిని అధిగమించిందని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి నిర్వహణను, పెద్ద ఎత్తున వచ్చే అంటువ్యాధులను ఎదుర్కోవడంలో భారత్ను ప్రపంచ చరిత్రలోనే ఒక రోల్ మోడల్గా అభివృద్ధి చెందిన దేశాలు సైతం అంగీకరించాయని ఆయన అన్నారు.
***
(रिलीज़ आईडी: 2270973)
आगंतुक पटल : 19