ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సైప్రస్ దేశాధ్యక్షుడి అధికారిక పర్యటన సందర్భంగా ఇరుదేశాల ఉమ్మడి ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 22 MAY 2026 9:31PM by PIB Hyderabad

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు సైప్రస్ దేశాధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్ 2026 మే 20 నుంచి 23 వరకు భారతదేశంలో అధికారిక పర్యటన చేపట్టారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్‌కు సైప్రస్ అధ్యక్షత వహిస్తున్న తరుణంలో ఈ పర్యటన జరగడంతో ఇది మరింత ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. 

2025 జూన్‌లో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన సైప్రస్ పర్యటన చారిత్రాత్మక వేగంతో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాది వేయగా, ప్రస్తుత పర్యటన భారత్-సైప్రస్ సంబంధాలను ఫలితాల సాధన, కార్యాచరణ ఆధారిత దిశగా ఒక కొత్త దశకు నడిపిస్తుంది.

రాజకీయ చర్చల పురోగతి, వ్యాపార సంబంధాల విస్తరణ, రక్షణ రంగ సంబంధాల పటిష్టత, ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో సహకారానికి శ్రీకారం చుట్టడంతో పాటు 2025లో జారీ చేసిన 'ఉమ్మడి ప్రకటన' అమలులో సాధించిన గణనీయమైన ప్రగతిని ఇరు దేశాల అధినేతలు స్వాగతించారు. మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ పరిస్థితులు, భారత్-సైప్రస్ భాగస్వామ్యం మరింత దృఢంగా మారుతున్న తీరును గుర్తించిన ఇరువురు నేతలు.. నూతన వాస్తవ పరిస్థితులు, అవకాశాలకు ప్రతిబింబంగా ప్రస్తుత ద్వైపాక్షిక సమగ్ర భాగస్వామ్యాన్ని 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచేందుకు అంగీకరించారు.

సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్‌కు 2026 మే 22న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రాజ్‌ఘాట్ వద్ద భారత జాతి పిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. సైప్రస్ అధ్యక్షుడి గౌరవార్థం రాష్ట్రపతి అధికారిక విందు ఇచ్చారు.

ఈ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ, అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్ 2026 మే 22న ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు చేపట్టారు. ఇరు దేశాల మధ్య గల ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు నేతలు విస్తృతస్థాయిలో చర్చించారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యానికి లభించిన నూతన గమనం పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధమైన పాలన, పరస్పర గౌరవం ఆధారంగా ఏర్పడిన భారత్-సైప్రస్ నమ్మకమైన, సన్నిహిత భాగస్వామ్యాన్ని వారు పునరుద్ఘాటించారు. భారత్-ఈయూ సంబంధాలతో పాటు ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారు.

భారతదేశం-సైప్రస్ సమగ్ర భాగస్వామ్యం విషయంలో అత్యున్నత రాజకీయ స్థాయిలో నిరంతరం కొనసాగుతున్న సంప్రదింపులు ఒక ముఖ్యమైన అంశంగా ఉండటాన్ని ఇరు దేశాల నాయకులు స్వాగతించారు. 2025లో ప్రధాన మంత్రి మోదీ పర్యటన సందర్భంగా ప్రకటించిన 'భారత్-సైప్రస్ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక 2025-2029' అమలులో సాధించిన గణనీయమైన పురోగతి విషయంలో వారు అభినందనలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 65 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ ద్వారా ఈ 65వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

'ఏఐ ఇంపాక్ట్ సదస్సు- 2026'ను విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాన మంత్రి మోదీకి అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్ అభినందనలు తెలియజేశారు. ఈ సదస్సులో సైప్రస్‌కు ఆ దేశ పరిశోధన, ఆవిష్కరణలు, డిజిటల్ విధానాల డిప్యూటీ మంత్రి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా సదస్సుకు సంబంధించిన ఉమ్మడి ప్రకటనను ధ్రువీకరించారు. ఏఐని సురక్షితమైన, విశ్వసనీయమైన, సమ్మిళిత అభివృద్ధి కోసం ఉపయోగించే విషయంలో కలిసి పనిచేయడంపై ఇరువురు నేతలు తమ ఆలోచనలను పంచుకున్నారు.

ఉమ్మడి విలువలుబహుపాక్షిక సహకారం

శాంతి, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, సమర్థవంతమైన బహుపాక్షికత, సుస్థిరాభివృద్ధి పట్ల తమకున్న ఉమ్మడి నిబద్ధతను ఇరు దేశాల నాయకులు ప్రముఖంగా చెప్పారు. ఐక్యరాజ్యసమితి (యూఎన్) చార్టర్, అంతర్జాతీయ చట్టాలకు లోబడే నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థకు మద్దతునిస్తున్నట్లు వారు పునరుద్ఘాటించారు. ముఖ్యంగా నౌకాయాన స్వేచ్ఛ, విమాన ప్రయాణ స్వేచ్ఛ, నిరాటంకంగా సాగే వాణిజ్యం, సముద్రయానం విషయంలో సార్వభౌమ హక్కులకు సంబంధించి 'ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల కన్వెన్షన్' (యూఎన్‌సీఎల్ఓఎస్) నిబంధనలను ఖచ్చితంగా పాటించాలనే అంశాన్ని వారు ప్రత్యేకంగా చెప్పారు.

ప్రస్తుత ప్రపంచ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, భవిష్యత్తులో రాబోయే పరిణామాలకు ప్రపంచాన్ని సిద్ధం చేయడానికి సంస్కరించిన, క్రియాశీలక బహుపాక్షికత అవసరమని ఇరు నేతలు మరోసారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి (యూఎన్), కామన్వెల్త్‌తో సహా వివిధ అంతర్జాతీయ సంస్థలలో పరస్పర సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే సంకల్పాన్ని వారు వ్యక్తం చేశారు.

సమకాలీన అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ సవాళ్లకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని (యూఎన్ఎస్‌సీ) మరింత సమర్థవంతంగా, చురుగ్గా, ప్రాతినిధ్య సంస్థగా మార్చేందుకు వీలుగా దానిని సంస్కరించాల్సిన అత్యవసర అవసరం ఉందని ఇరు నేతలు ప్రధానంగా చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) వ్యవహారాలతో పాటు వివిధ బహుపాక్షిక వేదికలపై కలిసికట్టుగా పనిచేయడానికి, భద్రతా మండలి సంస్కరణలపై ప్రభుత్వాల మధ్య జరుగుతున్న చర్చలను (ఇంటర్-గవర్నమెంటల్ నెగోషియేషన్స్) ఒక ముగింపునకు తీసుకువచ్చే విషయంలో మద్దతును కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. సంస్కరించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించాలనే అంశానికి గట్టిగా మద్దతునిస్తున్నట్లు సైప్రస్ మరోసారి పునరుద్ఘాటించింది. దీనితో పాటు ఐక్యరాజ్యసమితి, ఇతర బహుపాక్షిక వేదికలపై ఒకరి అభ్యర్థిత్వాలకు ఒకరు మద్దతు ఇచ్చుకుంటూ సన్నిహితంగా సహకరించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

సార్వభౌమాధికారంశాంతికి మద్దతు...

ఐక్యరాజ్యసమితి నిబంధనలు, సంబంధిత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు లోబడి రాజకీయ సమానత్వంతో కూడిన రెండు జోన్ల, రెండు సమాజాల సమాఖ్య ఆధారంగా సైప్రస్ సమస్యకు సమగ్రమైన, న్యాయబద్ధమైన, శాశ్వతమైన పరిష్కారాన్ని సాధించేందుకు వీలుగా చర్చలను పునఃప్రారంభించడం పట్ల సైప్రస్, భారత్ గట్టి నిబద్ధతను వ్యక్తం చేశాయి. సైప్రస్‌లోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం (యూఎన్‌ఎఫ్ఐసీవైపీ) పోషిస్తున్న ముఖ్యమైన పాత్ర, దాని అధికార పరిధికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఇరు దేశాలు చెప్పాయి. యూఎన్ఎఫ్ఐసీవైపీ కోసం భారత్ అందిస్తున్న అమూల్యమైన సహకారాన్ని అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్ ఈ సందర్భంగా అభినందించారు.

సైప్రస్ దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత, ఐక్యతకు అందిస్తున్న స్థిరమైన, తిరుగులేని మద్దతును భారత్ మరోసారి స్పష్టం చేసింది. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నాలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండాలంటే సంబంధిత ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా గౌరవించాల్సిన అవసరం ఉందని ఇరుపక్షాలు ప్రముఖంగా పేర్కొన్నాయి. 

భద్రతరక్షణఉగ్రవాద నిరోధం

సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఇరు దేశాల అధినేతలు ఖచ్చితంగా, నిస్సందేహంగా ఖండించారు. సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి సంఘీభావం, తిరుగులేని మద్దతును సైప్రస్ ప్రకటించింది.

2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని, 2025 నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద ఘటనను ఇరు నేతలు తీవ్ర పదజాలంతో ఖండించారు. ఈ దాడులకు కారణమైన వాళ్లను ఖచ్చితంగా జవాబుదారీలుగా చేయాలని వారు చెప్పారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా, నిరంతరాయంగా అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సమాజం ఉమ్మడి, నిర్ణయాత్మకమైన ప్రయత్నాలు చేయాలని ఇరు నేతలు పిలుపునిచ్చారు.

సరిహద్దుల వెంబడి ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఒక సమగ్రమైన, సమన్వయంతో కూడిన నిరంతరాయమైన విధానం అవసరమన్న ఇరువురు నేతలు.. ద్వైపాక్షిక, బహుపాక్షిక వ్యవస్థలో పరస్పరం కలిసి పనిచేయటానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు బహుపాక్షిక ప్రయత్నాలను బలోపేతం చేయాలని, ఐక్యరాజ్యసమితి (యూఎన్) నిబంధనల పరిధిలో 'అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర కన్వెన్షన్'ను (సీసీఐటీ) వీలైనంత త్వరగా ఖరారు చేసి ఆమోదించాలని వారు పిలుపునిచ్చారు. 1267 ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) ఆంక్షల కమిటీ పరిధిలోకి వచ్చే సంస్థలతో పాటు యూఎన్, ఈయూ ద్వారా నిషేధానికి గురైన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు, వాటి అనుబంధ ప్రాక్సీ సమూహాలు, వాళ్లకు సహకరించే వాళ్లు, స్పాన్సర్లు, ఆర్థిక సహాయం అందించే వాళ్లు, వెన్నుముకగా నిలిచే వాళ్లపై కఠినమైన, ఉమ్మడి చర్యలు తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు.

తీవ్రవాద హింస, తీవ్రవాద భావజాల వ్యాప్తి, ఉగ్రవాదానికి నిధుల సరఫరా, మనీ లాండరింగ్‌లను అణచివేయడంతో పాటు ఉగ్రవాద అవసరాల కోసం అధునాతన, వర్ధమాన సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి, ఉగ్రవాద నియామకాలను అడ్డుకోవడానికి పరస్పర సహకారం అవసరమని వారు ప్రముఖంగా చెప్పారు. ఐక్యరాజ్యసమితి (యూఎన్), ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) వేదికల ద్వారా ఉగ్రవాద సురక్షిత స్థావరాలు- తీవ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మూలించాలని, ఉగ్రవాద నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయాలని, ఉగ్రవాదానికి అందుతున్న నిధులను నిలిపివేయాలని ఇరుపక్షాలు పిలుపునిచ్చాయి.

ఉగ్రవాదంపై తమకున్న 'ఎట్టి పరిస్థితుల్లో సహించని విధానం (జీరో-టాలరెన్స్)' విధానాన్ని ఇరువురు నేతలు మరోసారి స్పష్టం చేశారు. ద్వంద్వ ప్రమాణాలు, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఖండించిన రెండు దేశాల నాయకులు... ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి చర్యలను సమర్థించలేమని తేల్చి చెప్పారు. ఉగ్రవాద నిరోధంపై ఒక 'ఉమ్మడి కార్యాచరణ బృందాన్ని' (జేడబ్ల్యూజీ) ఏర్పాటు చేయడానికి అవగాహనా ఒప్పందం‌పై (ఎంఓయూ) సంతకాలు జరగటాన్ని ఇరు నేతలు స్వాగతించారు. సమాచారం, విజ్ఞాన మార్పిడి, సామర్థ్య పెంపు ద్వారా ఉగ్రవాద నిరోధక రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి ఈ బృందం ఒక స్పష్టమైన నిబంధనల చట్రాన్ని అందిస్తుంది. ఈ జేడబ్ల్యూజీకి సంబంధించిన మొదటి సమావేశాన్ని వీలైనంత త్వరగా నిర్వహించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

సైబర్ రంగంలో ఎదురవుతున్న సరికొత్త, వర్ధమాన ముప్పులను తిప్పికొట్టడానికి ఇరు దేశాల సంబంధిత సంస్థల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సన్నిహిత సహకారాన్ని ఇరు నేతలు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య 'సైబర్ సెక్యూరిటీ డైలాగ్' ఏర్పాటును వారు స్వాగతించారు. సైబర్ భద్రత, సరికొత్త సాంకేతికతలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తమ తమ రక్షణ రంగ పరిశ్రమల మధ్య భాగస్వామ్యంతో సహా రక్షణ, భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు వారు అంగీకరించారు. ఈ నేపథ్యంలో 'సైప్రస్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఇండస్ట్రీస్ క్లస్టర్' (సీవైడీఎస్ఐసీ), 'సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరర్స్'ల (ఎస్ఐడీఎం) మధ్య అవగాహనా ఒప్పందం‌పై (ఎంఓయూ) సంతకాలు జరగటం పట్ల ఇరు నేతలు అభినందనలు తెలియజేశారు.

2026 ఫిబ్రవరిలో కుదిరిన 'భారత్-సైప్రస్ ద్వైపాక్షిక రక్షణ సహకార కార్యక్రమాన్ని' స్వాగతించిన ఇరుదేశాల నేతలు... రక్షణ రంగంలో భారీస్థాయి సహకారానికి ఉన్న అవకాశాలను ప్రముఖంగా పేర్కొన్నారు. గాలింపు, రక్షణ చర్యల (ఎస్ఏఆర్) వ్యవహారాలపై అధికారిక సమన్వయం, సహకార ఏర్పాటుకు సంబంధించిన 'సాంకేతిక ఒప్పందం'పై సంతకాలు జరగటాన్ని వారు అభినందించారు. ఇవి రక్షణ పరిశ్రమల సహకారాన్ని, సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఒక వ్యవస్థాగత చట్రాన్ని అందిస్తాయి. 2026 జనవరి 27న కుదిరిన 'భారత్- ఈయూ రక్షణ, భద్రతా భాగస్వామ్యాన్ని' మరింత ముందుకు తీసుకెళ్లేలా ఈ ఒప్పందాలు ఉండటమే కాకుండా పరస్పర మార్పిడి కార్యక్రమాలు, శిక్షణ, సామర్థ్య పెంపును సులభతరం చేస్తాయి. ఇరు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య 2026-2031 కాలానికి సంబంధించిన 'ద్వైపాక్షిక రక్షణ సహకార రోడ్‌మ్యాప్' ఖరారు కావడాన్ని ఇరు దేశాల అధినేతలు స్వాగతించారు.

భారత్, సైప్రస్ రెండు దేశాలూ సుదీర్ఘమైన నౌకాదళ సంప్రదాయాలు కలిగిన సముద్రతీర దేశాలు కావడంతో సముద్రయానం విషయంలో పరస్పర సహకారాన్ని మరింత మెరుగుపరచటాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఇరు నేతలు తెలిపారు. ఇందులో భాగంగా భారత నావికాదళ నౌకలు తరచుగా సైప్రస్ ఓడరేవులను సందర్శించడం... సముద్రాల విషయంలో అవగాహన, ప్రాంతీయ భద్రతను పెంపొందించడానికి వీలుగా  ఉమ్మడి సముద్ర శిక్షణ, సైనిక విన్యాసాల అవకాశాలను గుర్తించాలని ఇరు దేశాల నేతలు పిలుపునిచ్చారు.

వాణిజ్యంపెట్టుబడులు,ఆవిష్కరణలు...

ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలను మరింత విస్తరించడానికి గణనీయమైన అవకాశాలు ఉన్నాయని ఇద్దరు నేతలు ఉద్ఘాటించారు. విశ్వసనీయమైన, నమ్మకమైన, సుస్థిరమైన సరఫరా వ్యవస్థల అభివృద్ధిలో సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు, తమ ఆర్థిక భద్రతను కాపాడుకోవాలని వారు నిర్ణయించారు. 

సైప్రస్ నుంచి భారతదేశంలోకి పెట్టుబడులు స్థిరంగా పెరుగుతుండటాన్ని ఇరు దేశాల నేతలు స్వాగతించారు. ఇది భారతదేశానికి పెట్టుబడులు అందించే ముఖ్యమైన వనరులలో ఒకటిగా సైప్రస్‌ను నిలిపింది. స్టార్టప్‌లు, డిజిటలైజేషన్, ఏఐ, ఆవిష్కరణల ఆధారిత పరిశ్రమల ద్వారా ఇంకా వెలికితీయని ఆర్థిక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. ఆర్థిక సేవలు, సముద్రయానం, అనుసంధానం, రవాణా, స్వచ్ఛ, హరిత ఇంధనం, వ్యర్థాల నిర్వహణ, అంతరిక్షం, సైన్స్ - టెక్నాలజీ,  పరిశోధన - ఆవిష్కరణలతో కూడిన ప్రాధాన్యతా రంగాల్లో వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను చురుగ్గా అన్వేషించాలని ఇరు దేశాల వ్యాపార వర్గాలకు వారు సూచించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఖరారైన చారిత్రాత్మక భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు ద్వారా లభించే అవకాశాలను కూడా నేతలుగుర్తించారు.

ఫిన్‌టెక్ అనుసంధానం వల్ల సరిహద్దులు దాటి జరిగే లావాదేవీలే కాకుండా, దేశాల మధ్య సంబంధాలు కూడా మరింత బలోపేతం అవుతాయి. 2025లో ఎన్ఐపీఎల్,   యూరోబ్యాంక్ సైప్రస్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందంతో సహా, ఆర్థిక కార్యకలాపాలు మరింత బలంగా మారడాన్ని ఇరు దేశాల నేతలు గుర్తించారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ)కి చెందిన  టార్గెట్ ఇన్‌స్టంట్ పేమెంట్ సెటిల్‌మెంట్ సిస్టమ్ ( టీఐపీఎస్)తో భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) పరస్పర అనుసంధానత కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడాన్ని కూడా వారు స్వాగతించారు. ఇది ఎటువంటి అడ్డంకులు లేని సరిహద్దు లావాదేవీలను సులభతరం చేస్తుంది. ఇందువల్ల ఇరు దేశాల పర్యాటకులు,  వ్యాపారాలు రెండూ ప్రయోజనం పొందుతాయి.

త్రైపాక్షిక, ద్వైపాక్షిక ఆర్థిక సహకారంలో  పెరుగుతున్న ఊపును కూడా ఇరు దేశాల నేతలు స్వాగతించారు. ఈ నేపథ్యంలో, వ్యాపారాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, పెట్టుబడులను మరింతగా ప్రోత్సహించడానికి, మూడు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఒక ముఖ్యమైన వేదికగా ఇండియా-గ్రీస్-సైప్రస్ (ఐజీసీ) బిజినెస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిల్ ఏర్పాటును వారు అభినందించారు.

2025 జూన్‌లో లిమాసోల్‌లో జరిగిన ఇండియా-సైప్రస్ ఇన్వెస్టర్స్ రౌండ్‌టేబుల్ సృష్టించిన ఉత్సాహాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, ఈ పర్యటన సందర్భంగా ముంబైలో ఇండియా-సైప్రస్ బిజినెస్ ఫోరమ్ ను నిర్వహించారు. ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, సరికొత్త సహకార అవకాశాలను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ముంబైలో జరిగిన ఈ బిజినెస్ ఫోరమ్ సందర్భంగా ఇరు దేశాల వ్యాపార సంస్థల మధ్య బీ2బీ అవగాహనా ఒప్పందాలు కుదరడాన్ని నేతలు స్వాగతించారు.

ఇరు దేశాల స్టార్టప్‌లు, యూనికార్న్‌లు, ఇన్నోవేషన్ వ్యవస్థలు, వెంచర్ క్యాపిటల్ వ్యవస్థల మధ్య కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని నేతలు స్వాగతించారు. ఈ నేపథ్యంలో, వారు ఇన్నోవేషన్,  టెక్నాలజీపై కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని స్వాగతించారు. ఇది ఇరు దేశాల స్టార్టప్‌లు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, ఇన్నోవేషన్ ఏజెన్సీల మధ్య పరస్పర మార్పిడికి పటిష్టమైన యంత్రాంగాన్ని అందిస్తుంది.

ఇరు దేశాల మధ్య వాణిజ్యం, అనుసంధానతను బలోపేతం చేయడంలోనూ, విశ్వసనీయమైన సముద్ర భాగస్వామ్యాల ద్వారా ఇండో-పసిఫిక్‌ను ఐరోపాతో అనుసంధానించడంలోనూ సముద్రయాన, నౌకాయాన సహకారం ప్రాధాన్యతను నేతలు గుర్తించారు.

ఐరోపాకు ఒక ప్రవేశ ద్వారంగా సరుకు రవాణా, నిల్వ, పంపిణీ, తరలింపు కోసం ఒక ప్రాంతీయ కేంద్రంగా సేవలందించేందుకు సైప్రస్‌కు ఉన్న సామర్థ్యాన్ని వారు అంగీకరించారు. పరస్పర ప్రయోజనం కోసం సైప్రస్, భారతదేశానికి చెందిన సముద్రయాన సేవా సంస్థల భాగస్వామ్యంతో ఉమ్మడి భాగస్వామ్య సంస్థల ద్వారా ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని వారు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, మర్చంట్ షిప్పింగ్‌పై ప్రస్తుత ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం సముద్రయాన సహకారంలో ఉన్న సానుకూల వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇరు దేశాల నేతలు అంగీకరించారు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సైప్రస్ సముద్ర సేవల వ్యవస్థ, వేగంగా విస్తరిస్తున్న భారతసముద్ర, ఓడరేవుల మౌలిక సదుపాయాల సామర్థ్యాల మధ్య ఉన్న సమాన సామర్ధ్యాలను దృష్టిలో ఉంచుకుని, సముద్ర రంగంలో సహకారాన్ని ద్వైపాక్షిక భాగస్వామ్యంలోని వ్యూహాత్మక ఆధారంగా మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాల నాయకులు అంగీకరించారు.

ఈ నేపథ్యంలో, భారతీయ నౌకాయాన రంగం ప్రయోజనాల కోసం ఒక యూరోపియన్ సముద్రయాన ప్రవేశ ద్వారంగా, కార్యకలాపాల నిర్వహణక  స్థావరంగా పనిచేయగల సైప్రస్ సామర్థ్యాన్ని వారు అంగీకరించారు. భారతీయ సముద్రయాన భాగస్వాములు, సైప్రస్ షిప్పింగ్,  షిప్ మేనేజ్‌మెంట్ వర్గాల మధ్య సన్నిహిత సంబంధాలను వారు స్వాగతించారు. సమీప కాలంలో ఆచరణాత్మక, పరస్పర ప్రయోజనకరమైన ఫలితాలను సాధించే లక్ష్యంతో సముద్రయాన సేవలు, పోర్ట్ కనెక్టివిటీ, రవాణా, సముద్రయాన శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, గ్రీన్ షిప్పింగ్, నిబంధనల పాటింపులో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న సవాళ్ల నేపథ్యంలో, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, మౌలిక సదుపాయాల రంగాలలో సహకారం ఇరు దేశాల మధ్య మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్న అంశమని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, 'కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' (సీడీఆర్ఐ)లో చేరడానికి సైప్రస్ చూపిన ఆసక్తిని ప్రధానమంత్రి శ్రీ మోదీ స్వాగతించారు. సాంకేతిక సహకారం, సామర్థ్య పెంపు, విజ్ఞానాన్ని పంచుకోవడంతో పాటు విపత్తులను తట్టుకోగల మౌలిక సదుపాయాల వ్యవస్థలలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఒక అంతర్జాతీయ వేదికగా సీడీఆర్ఐ పోషిస్తున్న పాత్రను ఇరు దేశాల నేతలు గుర్తించారు.

శాస్త్రసాంకేతిక రంగం 

కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల విప్లవాత్మక సామర్థ్యాన్ని గుర్తిస్తూ, ఆవిష్కరణ, సాంకేతిక పరిజ్ఞానంపై కుదిరిన అవగాహనా ఒప్పందం పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్‌లు, విద్యా సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందిస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు. నైతిక,  బాధ్యతాయుతమైన కృత్రిమ మేధతో సహా, అభివృద్ధి చెందుతున్న, సుస్థిరమైన సాంకేతికతలలో ఉమ్మడి పరిశోధన, ఆవిష్కరణల ప్రాజెక్టులకు ఇది తోడ్పడుతుందని వారు పేర్కొన్నారు.

ప్రపంచ ఆర్థిక పురోగతి, భద్రత, ఆవిష్కరణలు,  సాంకేతిక పురోగతికి ఒక కీలకమైన మౌలిక సదుపాయంగా అంతరిక్ష రంగం ప్రాధాన్యతను గుర్తిస్తూ, ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి ఇరుపక్షాలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. భారత అంతరిక్ష విధానం, 2023 అంతరిక్ష రంగంలో ప్రభుత్వేతర సంస్థలు సమగ్రమైన కార్యకలాపాలను చేపట్టడానికి అనుకూలమైన, విలక్షణమైన యంత్రాంగాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలియజేశారు. పరస్పర ప్రయోజనం కోసం సహకారాన్ని పెంపొందించడానికి జరుగుతున్న నిరంతర ప్రయత్నాలను ఇరుపక్షాలు స్వాగతించాయి. ఈ సందర్భంగా ఎరటోస్తనీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఈసీఓఈ),  ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్)  మధ్య కొనసాగుతున్న చర్చలు,సంబంధాలను నేతలు స్వాగతించారు.

విద్యచలనశీలతనైపుణ్యాభివృద్ధి

విద్యార్థులు, పరిశోధకులతో సహా విద్యా స్థాయిలో పెరుగుతున్న పరస్పర మార్పిడిని ఇరు దేశాల నేతలు స్వాగతించారు. ఈ నేపథ్యంలో, ఉన్నత విద్య,  పరిశోధన రంగంలో కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని వారు స్వాగతించారు. ఇది ఇరు దేశాల ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, పరస్పర మార్పిడిని పెంపొందించడానికి, ఉమ్మడి పరిశోధనా కార్యక్రమాలు, అధ్యాపకులు, విద్యార్థుల పరస్పర పర్యటనలు, సంస్థాగత భాగస్వామ్యాల ద్వారా పరస్పర సహకార అవకాశాలను అన్వేషించడానికి ఒక బలమైన పునాదిని అందిస్తుందని వారు పేర్కొన్నారు.

దౌత్యవేత్తల శిక్షణలో పరస్పర సహకారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు సుష్మా స్వరాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ (ఎస్ఎస్ఐఎఫ్ఎస్), సైప్రస్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన డిప్లొమాటిక్ అకాడమీల మధ్య దౌత్య శిక్షణపై అవగాహనా ఒప్పందం కుదరడాన్ని ఇరు దేశాల నేతలు స్వాగతించారు.

సురక్షితమైన, క్రమబద్ధమైన, చట్టబద్ధమైన వలసలపై సహకారాన్ని సులభతరం చేయడానికి, అధిక నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్థులు, పరిశోధకులతో కూడిన సుస్థిర మానవ వనరుల చలనశీలతకు మద్దతుగా వలస, చలనశీల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే లక్ష్యంతో చర్చలను కొనసాగించడానికి నేతలు నిబద్ధతను వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా సామాజిక భద్రతా ఒప్పందం కోసం చర్చలను ప్రారంభించడానికి కూడా ఇరు దేశాల నేతలు అంగీకరించారు.

ఈ నేపథ్యంలో, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ.సీఏఐ),  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ ఆఫ్ సైప్రస్ (ఐసీపీఏసీ) మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని కూడా నేతలు స్వాగతించారు. యువ అకౌంటెంట్లు వృత్తిపరమైన నియంత్రణ ప్రమాణాల  అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడానికీ, అకౌంటింగ్, ఆడిటింగ్‌లో ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికీ, ఆర్థిక, వ్యాపార సేవల రంగాలలో పరస్పర గుర్తింపు,  ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవడానికీ ఇది మంచి అవకాశాన్ని అందిస్తుంది.

సాంస్కృతిక సహకారంప్రజల మధ్య సంబంధాలు 

భారత్, సైప్రస్ మధ్య సాంస్కృతిక మార్పిడిని విస్తరించాల్సిన అవసరాన్ని ఇరు దేశాల నేతలు గుర్తించారు. దృశ్య కళలు, ప్రదర్శన కళలు, కళల కు సంబంధించిన విద్యా కార్యక్రమాలు, వారసత్వ సంరక్షణ, సృజనాత్మక పరిశ్రమల రంగాలలో పరస్పర మార్పిడిని సులభతరం చేసే సాంస్కృతిక సహకార అవగాహనా ఒప్పందం కుదరడాన్ని వారు స్వాగతించారు. ఉమ్మడి కార్యక్రమాలు, ప్రదర్శనలు, సామర్థ్య పెంపు ప్రయత్నాలను ప్రోత్సహించడానికి మ్యూజియంలు, విద్యా సంస్థలు, సాంస్కృతిక సంస్థల మధ్య మరింత సన్నిహిత సహకారాన్ని నేతలు ఆకాంక్షించారు. సైప్రస్‌లో యోగా, ఆయుర్వేదం, భారతీయ సంస్కృతి పట్ల పెరుగుతున్న ఆసక్తిని వారు అభినందించారు.

ఇరు దేశాల ప్రజల మధ్య మరింత అవగాహనను పెంచడానికి దోహదపడే ద్వైపాక్షిక పర్యాటకం మరింత వృద్ధి చెందడానికి ఉన్న అవకాశాలను నేతలు గుర్తించారు. పర్యాటక రంగ భాగస్వాముల మధ్య సహకారం ద్వారా రెండు వైపులా పర్యాటకుల రాకపోకలను విస్తరించడానికి ఇరుపక్షాలు కృషి చేయాలని అంగీకరించారు. 

పెరుగుతున్న ప్రజల రాకపోకలు, ప్రజల మధ్య విస్తరిస్తున్న సంబంధాల దృష్ట్యా, కాన్సులర్ స్థాయిసహకారం  ఇరు దేశాలకు నిరంతర ఆసక్తి ఉన్న అంశమని నేతలు గుర్తించారు.ఈ నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య కాన్సులర్ చర్చలు ప్రారంభం కావడాన్ని వారు స్వాగతించారు. కాన్సులర్ సమస్యల పరిష్కారానికి, సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక నిర్మాణాత్మకమైన యంత్రాంగాన్ని ఇది అందిస్తుందని అభిప్రాయపడ్డారు. 

భారత్-ఈయూ సంబంధాలు

2026 జనవరి 27న జరిగిన భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు కావడాన్ని ఇరు దేశాల నేతలు స్వాగతించారు. ఇరు భాగస్వామ్య దేశాలకు, ప్రపంచానికి పరస్పర ప్రయోజనకరమైన, ఆచరణాత్మకమైన, విప్లవాత్మకమైన ఫలితాలను అందించడం కోసం భారత్-ఈయూ సహకారాన్ని మరింత విస్తృతంగా, బలంగా, మెరుగైన సమన్వయం ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న భారత్-యూరోపియన్ యూనియన్ ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక - 2030 కి ఇరుపక్షాలు ఆమోద ముద్ర వేశాయి.

భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణిస్తూ, కీలకమైన విలువ శ్రేణులను విస్తరించడం, కొత్త మార్కెట్లను తెరవడం ద్వారా వాణిజ్యం, పెట్టుబడుల సహకారంలో అసలైన సామర్థ్యాన్ని సాధించడానికి, ఈ ఒప్పందంపై వీలైనంత త్వరగా సంతకాలు చేయడం, సకాలంలో అమలు చేయడం అవసరమని నేతలు పిలుపునిచ్చారు.

కీలకమైన వాణిజ్య, సాంకేతిక, ఆర్థిక భద్రతా సమస్యల పరిష్కారం కోసం భారత్ - ఈయూ వాణిజ్య, సాంకేతిక మండలి (టీటీసీ) పనితీరును మరింత మెరుగుపరచుకోవడానికి నేతలు అంగీకరించారు. అలాగే జూలైలో జరిగే టీటీసీ మంత్రుల స్థాయి సమావేశం  ఫలితాల కోసం తాము ఎదురుచూస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

భారత్, ఈయూ భద్రతా  రక్షణ భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా సముద్ర భద్రత, రక్షణ పరిశ్రమ, సాంకేతికత, సైబర్,  హైబ్రిడ్ ముప్పులు, అంతరిక్షం, ఉగ్రవాద నిరోధం వంటి పరస్పర ప్రయోజనాల రంగాల్లో సహకారం మరింత బలోపేతం అవుతుంది. ఈ సందర్భంగా భారత్-ఈయూ సమాచార భద్రత ఒప్పందాన్ని కూడా త్వరగా ఖరారు చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

చలనశీలతకు సంబంధించి సమగ్ర సహకార ప్రణాళికపై అవగాహనా ఒప్పందాన్ని, భారతదేశంలో  పైలట్ యూరోపియన్ యూనియన్ లీగల్ గేట్‌వే ఆఫీస్ ప్రారంభించడాన్ని నేతలు స్వాగతించారు. నిపుణులు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి,  విద్యార్థుల రాకపోకల కోసం చట్టబద్ధమైన మార్గాలను ప్రోత్సహించడంలోనూ, భారత్ ఈయూల మధ్య ప్రజల సంబంధాలను బలోపేతం చేయడంలోనూ ఇది పోషించే పాత్రను వారు గుర్తించారు.

ఇండో - పసిఫిక్అనుసంధానప్రాంతీయ,  అంతర్జాతీయ అంశాలు

సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ (యూఎన్సీఎల్ఓఎస్) సహా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుతమైన, బహిరంగమైన, శాంతియుతమైన, సంపన్నమైన,  నిబంధనలకు కట్టుబడే ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని ప్రోత్సహించడానికి గల తమ ఉమ్మడి నిబద్ధతను ఇరు దేశాల నేతలు పునరుద్ఘాటించారు. ఇండో - పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ (ఐపీఓఐ) లో చేరినందుకు సైప్రస్‌ను ప్రధానమంత్రి శ్రీ మోదీ అభినందించారు. సముద్ర భద్రతతో పాటు సముద్ర వనరుల సుస్థిర వినియోగంలో సహకారాన్ని మరింత పెంపొందించడంలో ఈ చొరవకు ఉన్న సామర్థ్యాన్ని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. 

ప్రపంచ వాణిజ్యం, అనుసంధానం, అభివృద్ధిని పునర్నిర్మించడంలోనూ, పెంపొందించడంలోనూ 'భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్' (ఐఎంఈఈసీ)  విప్లవాత్మక సామర్థ్యాన్ని ఇరు దేశాల నేతలు గుర్తించారు.

తూర్పు మధ్యధరా, విస్తృత మధ్యప్రాచ్య ప్రాంతంలో సుస్థిరత్వాన్ని పెంపొందించడానికి ఉమ్మడి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. భారతదేశం నుంచి విస్తృత మధ్యప్రాచ్యం మీదుగా యూరప్ వరకు లోతైన భాగస్వామ్యాన్ని, పరస్పర అనుసంధాన కారిడార్లను ప్రోత్సహించాల్సిన ప్రాధాన్యతను వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అనుసంధానంపై ఇరు దేశాల మధ్య  ద్వైపాక్షిక చర్చల నిర్వహణపై కూడా వారు చర్చించారు.

ఉక్రెయిన్‌లో అంతర్జాతీయ చట్టాలు,  ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు అనుగుణంగా సమగ్రమైన, న్యాయమైన శాశ్వతమైన శాంతిని సాధించడం కోసం సంభాషణలు, దౌత్యం, కీలక భాగస్వాముల మధ్య నిర్మాణాత్మక చర్చల ద్వారా ఆ దేశంలో నెలకొన్న ఘర్షణను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ఇరు దేశాల నేతలు తమ మద్దతును ప్రకటించారు. 

పశ్చిమ ఆసియాలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, అక్కడ నెలకొన్న ప్రాథమిక సమస్యలను శాంతియుత మార్గంలో పరిష్కరించడానికి చర్చలు, దౌత్య విధానాల అవసరాన్ని ప్రాధాన్యతను ఇద్దరు నేతలు ప్రముఖంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా సముద్ర రవాణా/నౌకాయానం సురక్షితంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగడం అత్యంత కీలకమని వారు స్పష్టం చేశారు.

న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో భారత్ చేరడం వల్ల కలిగే విలువను గుర్తిస్తూ, ప్రపంచ అణ్వాయుధ వ్యాప్తి నిరోధక వ్యవస్థను  పరిరక్షించాల్సిన ప్రాధాన్యత గురించి ఇరు దేశాల నేతలు చర్చించారు.

ముగింపు

భారత్,  సైప్రస్ సంబంధాలు మరింతగా బలపడటం పట్ల ఇరు దేశాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్,  సైప్రస్ వ్యూహాత్మక భాగస్వామ్యం కింద సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ - సైప్రస్ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక 2025-2029 ను సకాలంలో అమలు చేయడానికి కృషి చేయాలని నిర్ణయించారు. పరస్పర గౌరవం, ఉమ్మడి సహకార స్ఫూర్తితో నిరంతర పరస్పర చర్చలను  కొనసాగించడానికి నేతలు అంగీకరించారు.

భారత ప్రభుత్వం, ప్రజలు తన అధికారిక పర్యటన సందర్భంగా చేసిన అద్భుతమైన ఏర్పాట్లకు గాను సైప్రస్ అధ్యక్షుడు  ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.

శాంతి, స్థిరత్వం, అనుసంధానం, అభివృద్ధిని పెంపొందించడానికి కట్టుబడి ఉన్న యూరప్, మధ్యధరా, ఇండో - పసిఫిక్ ప్రాంతాల మధ్య కీలకమైన అనుసంధానకర్తలుగా,  వ్యూహాత్మక భాగస్వాములుగా భారత్,  సైప్రస్‌లు కలిగి ఉన్న ఉమ్మడి దార్శనికతను ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు.

భారత్, సైప్రస్ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక 2025-2029 కింద ఆచరణాత్మక ఫలితాలను సాధించడానికి, అలాగే విస్తృతమైన భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక క్రియాశీలక మూలస్తంభంగా భారత్,  సైప్రస్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి.

చారిత్రాత్మకంగా పటిష్టంగా ఉన్న ఇరు దేశాల సంబంధాలను ఒక కొత్త దశకు తీసుకెళ్లడంలో ఈ ప్రస్తుత పర్యటన ఒక నిర్ణయాత్మక అడుగు అని,  ఈ భాగస్వామ్యాన్ని మరింత ప్రతిష్టాత్మకమైన, ఆధునికమైన, వ్యూహాత్మకమైన, భవిష్యత్తు ఆధారిత సహకార వ్యవస్థగా మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి ఇది దోహద పడుతుందని వారు పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2264485) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , हिन्दी , Assamese , Manipuri , Bengali , Odia , Tamil , Kannada