హోం మంత్రిత్వ శాఖ
ఏఐతో మ్యూల్ ఖాతాల గుర్తింపు.. సైబర్ ఆర్థిక నేరాల నిరోధంపై ఐ4సీ, ఆర్బీఐహెచ్ మధ్య అవగాహన ఒప్పందం
సైబర్ భద్రత కలిగిన దేశంగా భారత్ను నిలిపేందుకు మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
సైబర్ నేరాలను అరికట్టడంలో పెద్ద అవరోధంగా మ్యూల్ ఖాతాలు
సైబర్ మోసాలను ఎదుర్కొనేందుకు కృత్రిమ మేధోశక్తి వినియోగానికి వీలు కల్పించేలా ఐ4సీ, ఆర్బీఐహెచ్ మధ్య అవగాహన ఒప్పందం
ఐ4సీ నుంచి ‘ఏఐ ఆధారిత మోసాల గుర్తింపు వ్యవస్థ’కు అనుమానాస్పద జాబితా.. సత్వరమే మ్యూల్ ఖాతాల గుర్తింపు, తొలగింపు
సైబర్ నేరాల బారిన పడకుండా తదుపరి రక్షణ కవచం
సైబర్ ఆధారిత ఆర్థిక మోసాల నిరోధం లక్ష్యంగా.. ప్రమాదాలకు అవకాశమున్న సమాచారాన్ని పంచుకోవడం, విశ్లేషణాత్మక సహకారం, కార్యాచరణ సమన్వయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా అవగాహన ఒప్పందం
నాడు పోస్టు చేయడమైనది:
12 MAY 2026 4:33PM by PIB Hyderabad
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన భారత సైబర్ నేర నిరోధక సమన్వయ కేంద్రం (I4సీ), రిజర్వ్ బ్యాంకు ఆవిష్కరణల హబ్ (ఆర్బీఐహెచ్) మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సైబర్ ఆధారిత ఆర్థిక మోసాలను అరికట్టేందుకు, మ్యూల్ ఖాతాల వినియోగాన్ని నియంత్రించేందుకు సహకారాన్ని బలోపేతం చేసుకోవడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. మోసాల ముప్పును గుర్తించే సమాచారాన్ని పంచుకోవడం, విశ్లేషణాత్మక సహకారం, కార్యాచరణ సమన్వయం ద్వారా.. మోసాలను గుర్తించి అడ్డుకునే క్రియాశీల యంత్రాంగాలను బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం తోడ్పడనుంది.
‘‘సైబర్ సురక్షిత భారత్ కోసం మోదీ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. సైబర్ నేరాలను అరికట్టడంలో మ్యూల్ ఖాతాలు పెద్ద అవరోధంగా ఉన్నాయి. హోం శాఖ పరిధిలోని ఐ4సీ, రిజర్వ్ బ్యాంకు ఆవిష్కరణల హబ్ (ఆర్బీఐహెచ్) మధ్య నేడు కుదిరిన ఒప్పందం.. సైబర్ మోసాలను ఎదుర్కోవడంలో కృత్రిమ మేధోశక్తిని తెలుపుతున్నది. ఐ4సీ వద్ద ఉన్న అనుమానాస్పద జాబితాలోని డేటాను ఏఐ ఆధారిత మోసాల గుర్తింపు వ్యవస్థతో అనుసంధానించడం ద్వారా.. రహస్య మ్యూల్ ఖాతాలను వేగంగా గుర్తించి, తొలగించే అవకాశం లభిస్తుంది. సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో తదుపరి తరం రక్షణ కవచంలా ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది’’ అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
ఐ4సీ ఐజీ (అడ్మిన్) శ్రీమతి ఎం. రూప, ఆర్బీఐహెచ్ సీఈవో శ్రీ సాహిల్ కిన్నీ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ శ్రీ రోహిత్ జైన్, కేంద్ర హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి (ఐఎస్) శ్రీ ఆనంద్ స్వరూప్, కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి (సీఐఎస్) శ్రీ రాకేశ్ రాథి, ఐ4సీ సీఈవో శ్రీ రాజేశ్ కుమార్, ఆర్బీఐ, ఆర్బీఐహెచ్, ఐ4సీకి చెందిన ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ అవగాహన ఒప్పందం ప్రకారం.. బ్యాంకుల్లో అమలులో ఉన్న మ్యూల్ హంటర్ వంటి ఏఐ ఆధారిత వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం ఐ4సీ, ఆర్బీఐహెచ్ కలిసి పనిచేస్తాయి. ఇందులో భాగంగా హోం శాఖకు చెందిన ఐ4సీ తన వద్ద ఉన్న అనుమానాస్పద జాబితా ద్వారా మ్యూల్ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని, అనుమానిత ఖాతాల వివరాలను అందిస్తుంది. మ్యూల్ హంటర్ సహా మోసాల ముప్పును అంచనా వేసే ఇతర ఏఐ ఆధారిత నమూనాలకు శిక్షణ కోసం, వాటిని మెరుగుపరచడం కోసం ఆర్బీఐహెచ్ ఈ సమాచారాన్ని వినియోగించుకుంటుంది.
జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టల్ (ఎన్సీఆర్పీ), అనుమానాస్పదుల జాబితా, ఇతర సమాచార మార్పిడి వ్యవస్థల ద్వారా దేశ సైబర్ నేర నియంత్రణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంలో ఐ4సీ క్రియాశీలంగా పనిచేస్తోంది. అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంకుకు చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన ఆర్బీఐహెచ్.. సాంకేతిక ఆవిష్కరణలను, ఏఐ ఆధారిత మోసాల గుర్తింపు వ్యవస్థలను ప్రోత్సహిస్తూ ఆర్థిక రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో భద్రతను, పటిష్టతను పెంచడం ద్వారా.. డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచడం ఈ సంస్థ లక్ష్యం.
***
(రిలీజ్ ఐడి: 2260522)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4