ప్రధాన మంత్రి కార్యాలయం
సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు మిజోరాం, మణిపూర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన
* రూ. 71,850 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు
* బీహార్లో జాతీయ మఖానా బోర్డును ప్రారంభించనున్న ప్రధాని
* ప్రాంతీయంగా అనుసంధానతను మెరుగుపరిచేలా బీహార్లోని పూర్ణియా విమానాశ్రయంలో
కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్న పీఎం
* పూర్ణియాలో రూ.36,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు
శంకుస్థాపన, ప్రారంభోత్సవం
* మిజోరాంలోని ఐజ్వాల్ వద్ద రూ. 9,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు
భూమిపూజ, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాని
* మిజోరాంను మొదటిసారిగా భారతీయ రైల్వే వ్యవస్థతో
అనుసంధానించే బైరాబీ-సైరాంగ్ కొత్త రైల్వే లైనుకు పీఎం ప్రారంభోత్సవం
* మణిపూర్లో రూ. 8,500 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న పీఎం
* అస్సాంలోని గువాహటిలో భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న పీఎం
* అస్సాంలో రూ. 18,350 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన
* కోల్కతాలో 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025ను ప్రారంభించనున్న పీఎం
నాడు పోస్టు చేయడమైనది:
12 SEP 2025 2:12PM by PIB Hyderabad
మిజోరాం, మణిపూర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటిస్తారు.
సెప్టెంబర్ 13న ప్రధానమంత్రి మిజోరాంలో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు ఐజ్వాల్లో రూ.9000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఆ తర్వాత మణిపూర్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12.30 గం.లకు చురాచాంద్పూర్లో రూ.7,300 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. అనంతరం, మధ్యాహ్నం 2.30 గం.లకు ఇంఫాల్లో రూ.1,200 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించి, బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
అనంతరం ప్రధానమంత్రి అస్సాంలో పర్యటిస్తారు. సాయంత్రం 5 గంటలకు గువాహటిలో నిర్వహించే భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికా శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.
అస్సాంలో రూ. 18,530 కోట్లకు పైగా విలువైన ప్రధాన మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టులకు సెప్టెంబర్ 14న ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11 గంటల సమయంలో దరాంగ్లో పలు ప్రాజెక్టులకు భూమి పూజ చేసి, బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం, గోలాఘాట్లోని అస్సాం బయో-ఇథనాల్ కంపెనీకి చెందిన నుమాలిగఢ్ రిఫైనరీ ప్లాంట్ను మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభిస్తారు. అలాగే గోలాఘాట్లో పాలీప్రొపిలీన్ ప్లాంట్కు సైతం శంకుస్థాపన చేస్తారు.
సెప్టెంబర్ 15న పశ్చిమ బెంగాల్లో ప్రధానమంత్రి పర్యటిస్తారు. 16న కోల్కతాలో జరిగే కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025ను ఉదయం 9:30 గంటలకు ప్రారంభిస్తారు.
ఆ తర్వాత, బీహార్లో ప్రధానమంత్రి పర్యటిస్తారు. పూర్ణియా విమానాశ్రయంలోని కొత్త టెర్మినల్ భవనాన్ని మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రారంభిస్తారు. అలాగే పూర్ణియాలో సుమారుగా రూ.36,000 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేవిధంగా బీహార్లో జాతీయ మఖానా బోర్డును సైతం ఆయన ప్రారంభిస్తారు.
మిజోరాంలో పీఎం
ఐజ్వాల్లో రూ.9000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. రైల్వేలు, రహదారులు, ఇంధనం, క్రీడలు, తదితర రంగాలకు చెందిన ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి.
అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, చివరి వ్యక్తి వరకూ ప్రయోజనాలు చేరుకోవాలనే తన నిబద్ధతతకు అనుగుణంగా.. రూ.8,070 కోట్లతో నిర్మించిన బైరాబీ-సైరాంగ్ నూతన రైల్వే లైనును ప్రధాని ప్రారంభిస్తారు. ఇది మిజోరాం రాజధానిని తొలిసారిగా భారతీయ రైల్వేలతో అనుసంధానిస్తుంది. సవాళ్లతో నిండిన కొండ ప్రాంతాల్లో, సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల మధ్య నిర్మించిన ఈ రైల్వే లైనులో 45 సొరంగాలు ఉన్నాయి. వీటితో పాటుగా 55 పెద్ద వంతెనలు, 88 చిన్న వంతెనలు సైతం ఉన్నాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో మిజోరాంను అనుసంధానిస్తూ నిర్మించిన ఈ రైలు సదుపాయం ఈ ప్రాంత ప్రజలకు సురక్షితమైన, సమర్థమైన, చౌకయిన ప్రయాణ అవకాశాలను అందిస్తుంది. అలాగే ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర అవసరమైన వస్తువులను సకాలంలో, విశ్వసనీయంగా సరఫరా చేసేందుకు హామీ ఇస్తుంది. తద్వారా మొత్తం రవాణా సామర్థ్యాన్ని, ప్రాంతీయ అనుసంధానతను మెరుగుపరుస్తుంది.
అలాగే మూడు కొత్త రైళ్లు సైరాంగ్ (ఐజ్వాల్) - ఢిల్లీ (ఆనంద్ విహార్ టెర్మినల్) రాజధాని ఎక్స్ప్రెస్, సైరాంగ్ - గువాహటి ఎక్స్ప్రెస్, సైరాంగ్ - కోల్కతా ఎక్స్ప్రెస్లను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. రాజధాని ఎక్స్ప్రెస్ ద్వారా ఐజ్వాల్కు ఢిల్లీతో నేరుగా ప్రయాణ సదుపాయం ఏర్పడుతుంది. మిజోరాం, అస్సాం మధ్య ప్రయాణ సౌలభ్యాన్ని సైరాంగ్-గువాహటి ఎక్స్ప్రెస్ అందిస్తుంది. మిజోరాం నుంచి కోల్కతాకు నేరుగా రవాణా సదుపాయాన్ని సైరాంగ్-కోల్కతా ఎక్స్ప్రెస్ అందిస్తుంది. విస్తరించిన ఈ రవాణా సదుపాయాల కారణంగా ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, మార్కెట్లకు సులభంగా చేరుకోవచ్చు. ఫలితంగా.. ఈ ప్రాంతంలో విద్య, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు బలోపేతమవుతాయి. అలాగే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఈ ప్రాంతంలో పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుంది.
రహదారి మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా వివిధ రోడ్డు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి భూమి పూజ చేస్తారు. వీటిలో ఐజ్వాల్ బైపాస్ రోడ్డు, థైన్జోల్ - సియాల్సుక్ రోడ్డు, ఖంకౌన్ - రోంగురా రోడ్డు ఉన్నాయి.
ఐజ్వాల్ నగరంలో రద్దీని తగ్గించడం, లుంగ్లైయి, సియాహా, లాంగ్ట్లాయి, లెంగ్పుయ్ విమానాశ్రయం, సైరాంగ్ రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాలకు అనుసంధాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యక్రమం (పీఎం - డీఈవీఐఎన్ఈ) ద్వారా రూ. 500 కోట్లకు పైగా వ్యయంతో 45 కి.మీ.ల ఐజ్వాల్ బైపాస్ రోడ్డును నిర్మిస్తారు. ఇది దక్షిణ జిల్లాల నుంచి ఐజ్వాల్కు ప్రయాణ సమయాన్ని సుమారుగా 1.5 గంటల మేర తగ్గించి ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈశాన్య ప్రాంత ప్రత్యేక మౌలిక వసతుల అభివృద్ధి పథకం ఎన్ఈఎస్ఐడీఎస్ (రోడ్లు) పరిధిలో నిర్మిస్తున్న థైన్జోల్-సియాల్సుక్ రోడ్డు వల్ల ఉద్యాన రైతులు, డ్రాగన్ ఫ్రూట్ పెంపకందారులు, వరి సాగు చేసే రైతులు, అల్లం శుద్ధి చేసే వారికి లబ్ధి చేకూరుతుంది. అదే సమయంలో ఐజ్వాల్ - థైన్జోల్ - లుంగ్లైయి జాతీయ రహదారి అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది. సెర్చిప్ జిల్లాలో ఎన్ఈఎస్ఐడీఎస్ (రహదారులు) కింద నిర్మిస్తున్న ఖాన్కాన్ - రోంగురా రోడ్డు మార్కెట్లకు మెరుగైన రవాణా సదుపాయాన్ని అందిస్తుంది. అలాగే ఈ ప్రాంతంలోని ఉద్యాన రైతులు, ఇతర ప్రజలకు లబ్ధి చేకూరుస్తుంది. అల్లం శుద్ధి యూనిట్లకు మద్దతు ఇస్తుంది.
లాంగ్ట్లాయి - సియాహా రోడ్డులో ఛింటూయిపుయ్ నదిపై నిర్మించే వంతెనకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ రవాణా అనుసంధానాన్ని అందించి ప్రయాణ సమయాన్ని రెండు గంటలు తగ్గిస్తుంది. అలాగే కలాదన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ విధానం ప్రకారం సీమాంతర వాణిజ్యానికి సైతం ఈ బ్రిడ్జి తోడ్పాటు అందిస్తుంది.
అలాగే క్రీడాభివృద్ధి కోసం ఖేలో ఇండియా మల్టీ పర్పస్ ఇండోర్ హాల్ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. తుయికాల్ వద్ద ఉన్న ఈ హాలు మల్టీ పర్పస్ ఇండోర్ అరీనాతో సహా ఆధునిక క్రీడా సౌకర్యాలను కల్పిస్తుంది. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మిజోరాం యువతకు రాణించేలా ప్రోత్సహిస్తుంది.
ఈ ప్రాంతంలో ఇంధన మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా ఐజ్వాల్లోని మువాల్ఖాంగ్లో 30 టీఎంటీపీఏ (ఏడాదికి వెయ్యి మెట్రిక్ టన్నులు) సామర్థ్యమున్న ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇది మిజోరాం, దాని పొరుగు రాష్ట్రాల్లో ఎల్పీజీని స్థిరంగా, విశ్వసనీయంగా సరఫరా చేసి స్వచ్ఛ వంట ఇంధనాన్ని సులభంగా అందిస్తుంది. అలాగే స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుంది.
ప్రధానమంత్రి జనవికాస్ కార్యక్రమ్ (పీఎంజేవీకే) పథకంలో భాగంగా కౌర్తాలో ఆవాస పాఠశాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. మామిట్ ఆకాంక్షాత్మక జిల్లాలోని ఈ పాఠశాలలో ఆధునిక తరగతి గదులు, హాస్టళ్లు, కృత్రిమ ఫుట్బాల్ మైదానం సహా క్రీడా సదుపాయాలు ఉంటాయి. ఇది దీర్ఘకాలిక సామాజిక, విద్యా పురోగతికి పునాదులు వేస్తూ 10 వేలకుపైగా చిన్నారులు, యువతకు ప్రయోజనం చేకూరుస్తుంది.
అందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్న ప్రధానమంత్రి.. త్లాంగ్నువామ్లో ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలను కూడా ప్రారంభిస్తారు. ఇది పాఠశాలలో గిరిజన యువత నమోదును మెరుగుపరచడంతోపాటు డ్రాపవుట్లను తగ్గిస్తుంది. వారికి సమగ్ర విద్యావకాశాలను అందిస్తుంది.
మణిపూర్లో ప్రధానమంత్రి
మణిపూర్లో సమ్మిళిత, సుస్థిర, సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రధానమంత్రి.. చురచంద్పూర్లో రూ.7,300 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. రూ. 3,600 కోట్ల విలువైన మణిపూర్ పట్టణ రోడ్లు, డ్రైనేజీ, ఆస్తుల నిర్వహణ మెరుగుదల ప్రాజెక్టుతోపాటు 5 జాతీయ రహదారి ప్రాజెక్టులు, మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎంఐఎన్డీ), 9 ప్రాంతాల్లో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు, తదితర ప్రాజెక్టులు ఇందులో భాగంగా ఉన్నాయి.
ఇంఫాల్లో రూ. 1,200 కోట్లకు పైగా విలువ కలిగిన పలు అభివృద్ధి పథకాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. మంత్రిపుఖ్రీలో సివిల్ సెక్రటేరియట్, ఐటీ సెజ్ భవనం, మంత్రిపుఖ్రీలో కొత్త పోలీసు ప్రధాన కార్యాలయం, న్యూఢిల్లీ- కలకత్తాల్లో మణిపూర్ భవన్లు, నాలుగు జిల్లాల్లో ప్రత్యేక మహిళా మార్కెట్ అయిన ఇమా మార్కెట్లు ఇందులో భాగంగా ఉన్నాయి.
అస్సాంలో ప్రధానమంత్రి
సెప్టెంబర్ 13న గువాహటిలో జరిగే భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికా శత జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. అస్సామీ సంగీతం, సాహిత్యం, సంస్కృతి కోసం అసమాన కృషి చేసిన డాక్టర్ హజారికా సేవలను ఈ కార్యక్రమంలో స్మరించుకుంటారు.
సెప్టెంబర్ 14న అస్సాంలో రూ. 18,530 కోట్లకు పైగా విలువైన పలు ప్రధాన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
దరంగ్లో వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దరంగ్ వైద్య కళాశాల, ఆస్పత్రి- జీఎన్ఎం స్కూలు, బీఎస్సీ నర్సింగ్ కాలేజీ, ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. ఇవి ఈ ప్రాంతంలో వైద్య విద్య, ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తాయి. వీటితోపాటు ప్రారంభించనున్న గువాహటి రింగ్ రోడ్డు ప్రాజెక్టు పట్టణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరచి ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. రాజధాని నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించతలపెట్టిన కురువా-నారెంగి వంతెన అనుసంధానాన్ని పెంచడంతోపాటు ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
గోలాఘాట్లోని నుమాలీగఢ్లో నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్ (ఎన్ఆర్ఎల్)లో అస్సాం బయో ఇథనాల్ ప్లాంటును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పర్యావరణ హిత ఇంధనానికి ప్రోత్సాహాన్నివ్వడంతోపాటు శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడం దీని లక్ష్యం.
నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్ (ఎన్ఆర్ఎల్)లో పాలీప్రొపిలిన్ ప్లాంటుకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇది అస్సాం పెట్రోకెమికల్ రంగాన్ని మరింత లాభదాయకంగా మారుస్తుంది. ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు ఈ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.
పశ్చిమ బెంగాల్లో ప్రధానమంత్రి
బలమైన, సురక్షిత, స్వావలంబన కలిగిన భారత్ లక్ష్యానికి అనుగుణంగా.. సెప్టెంబర్ 15న కలకత్తాలో 16వ ‘కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025’ను ప్రధానమంత్రి ప్రారంభించి ప్రసంగిస్తారు. దేశంలోని ఉన్నత పౌర, సైనిక నాయకత్వాన్ని ఒకచోట చేర్చి.. చర్చలకు, భవిష్యత్ దృక్పథంతో దేశ సైనిక సంసిద్ధతకు పునాది వేసే సాయుధ దళాల అత్యున్నత స్థాయి మేధోమథన వేదిక ఇది.
రెండేళ్లకోసారి నిర్వహించే 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ సెప్టెంబరు 15 నుంచి 17 వరకు కలకత్తాలో జరగనుంది. ఈ ఏడాది సదస్సు ఇతివృత్తం- ‘ఈ యేడు సంస్కరణలదే - భవిష్యత్తు దిశగా పరివర్తన’.
బీహార్లో ప్రధానమంత్రి
బీహార్లో జాతీయ మఖానా బోర్డును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. మఖానా ఉత్పత్తి, కొత్త సాంకేతికతల అభివృద్ధిని ఈ బోర్డు ప్రోత్సహిస్తుంది. పంటకోత అనంతర నిర్వహణను బలోపేతం చేయచడంతోపాటు లాభదాయకతనూ ప్రాసెసింగునూ మెరుగుపరుస్తుంది. మఖానా మార్కెట్, ఎగుమతి, బ్రాండ్ విలువను పెంపొందించేందుకు అవకాశాలను కల్పిస్తుంది. తద్వారా బీహార్తోపాటు దేశంలోని మఖానా రైతులకు ప్రయోజనం కలుగుతుంది.
దేశంలోని మొత్తం మఖానా ఉత్పత్తిలో బీహార్ వాటా దాదాపు 90 శాతం. సానుకూల వాతావరణ పరిస్థితులు, సారవంతమైన నేలలు ఉన్న మధుబని, దర్భంగా, సీతామర్హి, సహర్సా, కతిహార్, పూర్నియా, సుపాల్, కిషన్గంజ్, అరరియా వంటి ముఖ్య జిల్లాలు అత్యుత్తమ నాణ్యత కలిగిన మఖానా ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు రాష్ట్రంలోనూ దేశంలోనూ మఖానా ఉత్పత్తిని భారీగా ప్రోత్సహించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో బీహార్ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుంది.
పూర్ణియా విమానాశ్రయంలో కొత్త సివిల్ ఎన్క్లేవ్లో తాత్కాలిక టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇది ఈ ప్రాంతంలో ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పూర్ణియాలో దాదాపు రూ. 36,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
భాగల్పూర్లోని పీర్పైంతిలో 3x800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇది బీహార్లో రూ. 25,000 కోట్ల విలువైన అతిపెద్ద ప్రైవేటు రంగ పెట్టుబడి అవుతుంది. అల్ట్రా సూపర్ క్రిటికల్, అల్ప ఉద్గార సాంకేతికతలతో దీన్ని రూపొందించారు. ప్రత్యేకంగా విద్యుదుత్పత్తి కోసం చేపడుతున్న ఈ ప్రాజెక్టు బీహార్ ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది.
రూ. 2680 కోట్లకు పైగా విలువ కలిగిన కోసి-మేచి అంతర్రాష్ట్ర నదీ అనుసంధాన ప్రాజెక్టు తొలిదశకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. పూడికతీత, దెబ్బతిన్న నిర్మాణాల పునరుద్ధరణ, సంబంధిత ఇతర పనులు సహా కాల్వలను అభివృద్ధి చేయడంపై ఇందులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఇది నీటిపారుదల సామర్థ్యాన్ని కూడా 15,000 క్యూసెక్కుల నుంచి 20,000 క్యూసెక్కులకు పెంచుతుంది. నీటిపారుదల విస్తరణ, వరద నియంత్రణ, వ్యవసాయ లాభదాయకతను పెంచడం ద్వారా ఈశాన్య బీహార్లోని పలు జిల్లాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
రైల్వే సదుపాయాలను మెరుగుపరచాలన్న లక్ష్యానికి అనుగుణంగా బీహార్లో రైలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతోపాటు.. పలు రైళ్లను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
గంగానదీ ప్రాంతమంతటా నేరుగా రైల్వే అనుసంధానాన్ని అందించే విక్రమశిల - కటారియా రైలు మార్గానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. రూ.2,170 కోట్ల విలువ కలిగిన ఈ ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజలకు విశేష ప్రయోజనం చేకూరుస్తుంది.
అరరియా - గల్గలియా (ఠాకుర్ గంజ్) మధ్య రూ. 4,410 కోట్లకు పైగా విలువైన కొత్త రైలు మార్గాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
అరరియా - కిషన్గంజ్ జిల్లాల మధ్య నేరుగా రైల్వే అనుసంధానాన్ని కల్పించే అరరియా - గల్గలియా (ఠాకూర్గంజ్) సెక్షనులో రైలును ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఇది ఈశాన్య బీహార్లో ప్రయాణ సదుపాయాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. జోగ్బని - దానాపుర్ మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును కూడా ఆయన ప్రారంభిస్తారు. ఇది అరరియా, పూర్నియా, మాధేపురా, సహర్సా, ఖగరియా, బెగుసరాయ్, సమస్తిపూర్, ముజఫర్పూర్, వైశాలి, పాట్నా వంటి జిల్లాలకు నేరుగా ప్రయోజనం కలిగిస్తుంది. సహర్సా - ఛెహర్తా (అమృత్సర్), జోగ్బనీ - ఈరోడ్ మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ రైళ్లు ఆధునిక ఇంటీరియర్లు, మెరుగైన సౌకర్యాలను అందించడంతోపాటు వేగవంతమైన ప్రయాణ సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. ఆయా ప్రాంతాల్లో ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక సమగ్రతను పెంపొందిస్తాయి.
పూర్ణియాలో పశువులకు సంబంధించిన లింగ నిర్ధారణ వీర్య కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇది రాష్ట్రీయ గోకుల్ మిషన్ పరిధిలోని అత్యాధునిక పశువీర్య కేంద్రం. ఏటా 5 లక్షల లింగ నిర్ధారిత వీర్య మోతాదులను ఉత్పత్తి చేయగలదు. తూర్పు, ఈశాన్య భారత్లలో ఈ తరహా మొదటి కేంద్రం ఇది. 2024 అక్టోబరులో ప్రారంభించిన ఈ కేంద్రంలో మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ లక్ష్యాలకు అనుగుణంగా దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతలను ఉపయోగిస్తారు. ఆడ దూడలు పుట్టే అవకాశాలను పెంచడం ద్వారా.. ఈ సాంకేతికత చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని కార్మికులు మరిన్ని ఆవులను పొందడంలో, ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంలో, పాడి ఉత్పాదకతను పెంచడం ద్వారా ఆదాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
పీఎంఏవై (గ్రామీణ) కింద 35,000 మంది గ్రామీణ లబ్ధిదారులు, పీఎంఏవై (పట్టణ) కింద 5,920 మంది పట్టణ లబ్ధిదారుల గృహ ప్రవేశ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి పాల్గొంటారు. పలువురు లబ్ధిదారులకు ఆయన తాళం చెవులను అప్పగిస్తారు.
బీహార్లో డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం కింద క్లస్టర్ స్థాయి సమాఖ్యలకు దాదాపు రూ. 500 కోట్ల సామాజిక పెట్టుబడి నిధులను పంపిణీ చేయడంతోపాటు పలువురు సీఎల్ఎఫ్ అధ్యక్షులకు ప్రధానమంత్రి చెక్కులను అందజేస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2254273)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam