పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ
నిన్న పంపిణీ అయిన 50.5 లక్షలకు పైగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు.. సాధారణంగానే కొనసాగుతోన్న సరఫరా
2026 మార్చి నుంచి సుమారు 4.68 లక్షల పీఎన్జీ కనెక్షన్లకు ప్రారంభమైన గ్యాస్ సరఫరా.. కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్న 5.23 లక్షల మంది వినియోగదారులు
తనిఖీలను ముమ్మరం చేసిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.. నిన్నటి వరకు 255 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లపై జరిమానాలు, 65 ఎల్పీజీ డీలర్ షిప్పుల సస్పెన్షన్
గల్ఫ్ ప్రాంతం నుంచి గత 24 గంటల్లో తిరిగి వచ్చిన 30 మందితో కలిపి ఇప్పటి వరకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న 2,447 మందికి పైగా భారతీయ నావికులు
18 ఏప్రిల్ 2026న బయలుదేరనున్న మొదటి విడత భారతీయ హజ్ యాత్రికులు
ఈ ఏడాది హజ యాత్రను చేపట్టనున్న 1.75 లక్షల మందికి పైగా యాత్రికులు
యాత్రికుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తోన్న ప్రభుత్వం.. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
17 APR 2026 6:23PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ ప్రజలు అప్రమత్తం చేసే చర్యలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు ఇంధన లభ్యత, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందిస్తున్న సహాయం, మొత్తం స్థిరత్వాన్ని కాపాడటానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.
ఇంధన సరఫరా, లభ్యత
హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూడటానికి తీసుకుంటున్న చర్యలను పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ వివరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రజా సూచనలు, పౌర అవగాహన
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కాబట్టి ప్రజలు వీటిని కంగారుతో కొనుగోలు చేయొద్దని సూచించారు.
వదంతులను నమ్మొద్దు. సరైన సమాచారం కోసం అధికారిక ఖాతాలపై మాత్రమే ఆధారపడాలి.
ఎల్పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించాలని, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లడం నివారించాలని కోరారు.
పీఎన్జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్టాప్ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిందిగా అందరినీ ప్రోత్సహిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని ఆదా చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య గృహ వినియోగ ఎల్పీజీ, గృహావసరాల పీఎన్జీ, రవాణా సీఎన్జీ విషయంలో సరఫరా 100 శాతం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
వాణిజ్య ఎల్పీజీ విషయంలో ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు ఫార్మా, ఉక్కు, వాహనాలు, విత్తన - వ్యవసాయ రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. వలస కార్మికుల కోసం 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరా 2026 మార్చి 2, 3 తేదీల్లో ఉన్న సగటు రోజువారీ సరఫరాతో పోలిస్తే రెట్టింపు అయింది.
ప్రభుత్వం ఇప్పటికే సరఫరా, డిమాండ్ రెండింటినీ సమన్వయం చేసేలా పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. గ్యాస్ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పొడిగించడం.. ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను నిర్ధారించడం వంటివి ఉన్నాయి.
ఎల్పీజీ డిమాండ్పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చారు.
చిన్న, మధ్యతరహా వినియోగదారులకు పంపిణీ చేయడం కోసం రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్జీ కనెక్షన్లు పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
నిత్యావసరాల చట్టం- 1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను పర్యవేక్షించడానికి.. అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి నిత్యావసరాల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడం, నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాథమిక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరోసారి స్పష్టం చేసింది.
27.03.2026, 02.04.2026 నాటి లేఖల ద్వారా ఇంధనం తగినంతగా అందుబాటులో ఉందన్న భరోసాను ప్రజలకు ఇచ్చేందుకు ముందస్తు ప్రజా సమాచార మార్పిడి అవసరమని కేంద్రం ప్రభుత్వం ప్రధానంగా చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 02.04.2026న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి… 06.04.2026న సమాచార - ప్రసార, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శులతో కలిసి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రముఖంగా చెప్పారు:
ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజా సూచనలను జారీ చేయడం.
సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలు, అవాస్తవ సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.
జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిరోజూ తనిఖీలను ఉద్ధృతం చేయటం, ఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ దాడులు, తనిఖీలను కొనసాగించడం.
సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ (ఎస్కేఓ) కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
పీఎన్జీ వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
ఎల్పీజీ సరఫరాలో ముఖ్యంగా గృహ అవసరాల ఎల్పీజీ సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల లక్షిత పంపిణీ విధానాన్ని అనుసరించడం.
అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలు, జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశాయి.
ప్రస్తుతం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పత్రికా ప్రకటనలు కూడా జారీ చేస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
ఎల్పీజీ అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా చర్యలు కొనసాగుతున్నాయి. 16.04.2026 నాడు దేశవ్యాప్తంగా 2900 కంటే ఎక్కువ దాడులు నిర్వహించారు.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేశాయి. అవి నిన్నటివరకు 255 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లకు జరిమానాలు విధించటంతో పాటు 65 మంది డీలర్లను సస్పెండ్ చేశాయి.
ఎల్పీజీ సరఫరా
గృహాలకు ఎల్పీజీ సరఫరా స్థితి:
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
గృహాలకు ఎల్పీజీ సరఫరా కోసం ప్రాధాన్యత కొనసాగుతోంది.
ఎల్పీజీ పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు పూర్తిగా అయిపోయినట్లు ఎటువంటి నివేదికలూ అందలేదు.
నిన్న పరిశ్రమ వ్యాప్తంగా ఆన్లైన్ ఎల్పీజీ బుకింగ్లు సుమారు 98 శాతానికి పెరిగాయి.
దారి మళ్లింపును నివారించడానికి, డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత డెలివరీలు సుమారు 93 శాతానికి పెరిగాయి. వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు డీఏసీ అందుతోంది.
బుకింగ్ల ప్రకారం గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా యథావిధిగా కొనసాగుతోంది.
16.04.26న గృహాలకు 50.5 లక్షలకు పైగా ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేశారు.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు:
మొత్తం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపు సంక్షోభానికి పూర్వపు స్థాయిల్లో సుమారు 70 శాతానికి పెరిగింది. సంస్కరణలకు అనుసంధానించిన 10 శాతం కేటాయింపు ఇందులో భాగంగా ఉంది.
తేది 06.04.2026 నాటి లేఖ ద్వారా వలస కార్మికులకు పంపిణీ నిమిత్తం ప్రతి రాష్ట్రంలో అందుబాటులో ఉండే 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల రోజువారీ కేటాయింపు పరిమాణాన్ని రెట్టింపు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలియజేసింది. తేది 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితికి అదనంగా 2026 మార్చి 2, 3 తేదీల మధ్య వలస కార్మికులకు జరిగిన సగటు రోజువారీ సరఫరా (సిలిండర్ల సంఖ్య) ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. చమురు విపణి సంస్థల సహకారంతో ఈ 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే సరఫరా చేసేందుకు వీలుగా వాటిని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంచారు.
2026 ఏప్రిల్ 3 నుంచి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల కోసం 6,100కు పైగా అవగాహన శిబిరాలను నిర్వహించాయి. ఈ శిబిరాల ద్వారా 80,000లకు పైగా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లను విక్రయించారు. నిన్న ఒక్కరోజే, సుమారు 400 శిబిరాల ద్వారా 8,643 – 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లను విక్రయించారు.
ఇటీవల, 2026 ఏప్రిల్ 16న మహారాష్ట్రలోని వాషిలో ఐవోసీఎల్ నిర్వహించిన 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల అవగాహన శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో సుమారు 800 వరకు 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లను విక్రయించారు.
2026 మార్చి 23 నుంచి ఇప్పటివరకు 16.41 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లను విక్రయించారు.
ఐవోసీఎల్, హెచ్పీఎస్ఎల్, బీపీసీఎల్ సంస్థలకు చెందిన కార్యనిర్వాహక సంచాలకులతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ... రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్పీజీ పంపిణీని ప్రణాళిక చేయడానికి రాష్ట్ర అధికారులు, పరిశ్రమల సంఘాలతో సమన్వయం చేస్తోంది.
16.04.2026న, 8211 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్పీజీని (4.32 లక్షలకు పైగా 19 కిలోల సిలిండర్లకు సమానం) విక్రయించారు.
మార్చి 14, 2026 నుంచి మొత్తం 1,50,367 మెట్రిక్ టన్నుల (79.14 లక్షలకు పైగా 19 కిలోల ఎల్పీజీ సిలిండర్లకు సమానం) వాణిజ్య ఎల్పీజీని విక్రయించారు. 8,850 మెట్రిక్ టన్నులకు పైగా ఆటో ఎల్పీజీ ఇందులో భాగంగా ఉంది.
ఏప్రిల్-26 నెలలో (16.04.26 వరకు) ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల సగటు ఆటో ఎల్పీజీ విక్రయాలు రోజుకు సుమారు 296 మెట్రిక్ టన్నులుగా నమోదయ్యాయి. ఫిబ్రవరి-26లో ఈ సగటు రోజుకు 177 మెట్రిక్ టన్నులుగా ఉంది.
ఆటో ఎల్పీజీ విక్రయాలు ప్రైవేట్ సంస్థల నుంచి ప్రభుత్వ రంగ చమురు సంస్థల వైపు మళ్లినట్లు గమనించారు. పెరుగుతున్న డిమాండ్ను తీర్చడం కోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థల ద్వారా జరిగే ఆటో ఎల్పీజీ విక్రయాలు 67 శాతం మేర పెరిగాయి. ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ పెరుగుదల నమోదైంది.
సహజ వాయువు సరఫరా, పీఎన్జీ విస్తరణ కార్యక్రమాలు
డీ-పీఎన్జీ, సీఎన్జీ-రవాణాకు 100 శాతం సరఫరాలను కేటాయించడం ద్వారా వినియోగదారులకు ప్రాధాన్యమిస్తున్నారు.
ఎరువుల కర్మాగారాలకు కేటాయించే మొత్తం గ్యాస్ పరిమాణాన్ని, వాటి ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతానికి పెంచారు.
అదనంగా సీజీడీ నెట్వర్క్ల ద్వారా సరఫరాలు సహా... ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరా 80 శాతం వరకు పెంచారు.
వాణిజ్య ఎల్పీజీ లభ్యతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడం కోసం సీజీడీ సంస్థలు తమ అన్ని జీఏల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్జీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
ఐజీఎల్, ఎమ్జీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ సహా సీజీడీ కంపెనీలన్నీ గృహ, వాణిజ్య పీఎన్జీ కనెక్షన్ల కోసం ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
సీజీడీ నెట్వర్క్ల విస్తరణకు అవసరమైన అనుమతులను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.
18.03.2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం... ఎల్పీజీ నుంచి పీఎన్జీ మారే దీర్ఘకాలిక పరివర్తనలో సహకరించే అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును ప్రతిపాదించింది.
పీఎన్జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును పొందుతున్నాయి.
రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 24.03.26 తేదీ నాటి లేఖ ద్వారా... సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రాసెస్ చేయడానికి, 'తగ్గించిన కాలపరిమితులతో సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన ఆమోద విధాన ప్రణాళిక'ను 3 నెలల పాటు ప్రత్యేకంగా అమలు చేస్తోంది.
భారత ప్రభుత్వం 24.03.2026 తేదీ నాటి గెజిట్ ద్వారా... నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడం, నిర్మించడం, నిర్వహించడం, విస్తరించడం ద్వారా) ఉత్తర్వులు-2026ను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పైప్లైన్లను వేయడానికి, విస్తరించడానికి ఒక క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధాన ప్రణాళికను అందిస్తుంది. ఇది అనుమతులు, భూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించడం ద్వారా నివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. ఇది పీఎన్జీ నెట్వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, పరిశుద్ధ ఇంధనాల దిశగా పరివర్తనకు మద్దతునిస్తుందని, తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయడం సహా భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.
డీ-పీఎన్జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని పీఎన్జీఆర్బీ సీజీడీ సంస్థలను ఆదేశించింది. పీఎన్జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి నేషనల్ పీఎన్జీ డ్రైవ్ 2.0ను 30.06.2026 వరకు పొడిగించారు.
పరిశుభ్రమైన, మరింత సురక్షితమైన, స్వయం సమృద్ధిగల ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం రాష్ట్ర సీజీబీ విధానం కోసం నమూనా ముసాయిదాను అభివృద్ధి చేసింది. ఈ నమూనా విధానం సీజీబీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు తమ సొంత, పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలుకు అనువుగా ఉండే వ్యవస్థను సృష్టించుకోవడానికి వీలు కల్పించే ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శక విధానంగా పనిచేయడానికి ఉద్దేశించినది. దీనిని ఎంచుకున్న రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ అదనపు కేటాయింపులకు తదుపరి విడతలో ప్రాధాన్యమిస్తున్నారు.
ఎమ్వోఈఎఫ్సీసీ 07.04.2026 తేదీ నాటి ఉత్తర్వుల ద్వారా... సీజీడీ నెట్వర్క్, మౌలిక సదుపాయాల ఏర్పాటు లేదా నిర్వహణ కోసం 15 రోజుల్లోపు అనుమతి మంజూరు చేసేందుకు ఎస్పీసీబీ/పీసీసీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని సీపీసీబీని ఆదేశించింది.
సీపీసీబీ ఆదేశాల ప్రకారం కొన్ని చమురు, గ్యాస్ రవాణా పైప్లైన్లను "గ్రీన్" (ఆకుపచ్చ) వర్గం కింద వర్గీకరించారు.
ఎమ్వోఈఎఫ్సీసీ ఇప్పటికే “ఆటోమొబైల్ సర్వీసింగ్, మరమ్మత్తు, పెయింటింగ్ అవసరం లేని ఇంధన పంపిణీ యూనిట్లను” “వైట్” కేటగిరీగా వర్గీకరించింది. సంబంధిత చట్టాల ప్రకారం ఏర్పాటు, నిర్వహణ కోసం అనుమతి నుంచి వీటికి మినహాయింపునిచ్చింది.
మార్చి 2026 నుంచి ఇప్పటివరకు సుమారు 4.68 లక్షల పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభించారు. సుమారు 5.23 లక్షల మంది వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు.
16.04.2026 నాటికి, సుమారు 37,000 మంది పీఎన్జీ వినియోగదారులు MYPNGD.in వెబ్సైట్ ద్వారా తమ ఎల్పీజీ కనెక్షన్లను రద్దు చేసుకున్నారు.
ముడి చమురు నిల్వలు - రిఫైనరీల కార్యకలాపాలు
-
అన్ని రిఫైనరీలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలను కూడా సరిపడా అందుబాటులో ఉంచారు.
-
గృహ అవసరాల కోసం రిఫైనరీల నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు
-
దేశీయ మార్కెట్కు పెట్రోకెమికల్ ముడి సరుకు సరఫరా సజావుగా అందేలా చూసేందుకు వివిధ మంత్రిత్వ శాఖల సంయుక్త అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేశారు. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్టీ)నిర్ణయించిన కీలక రంగాలకు అవసరమైన కనీస పరిమాణంలో సీ3, సీ4 స్ట్రీమ్స్ను అందుబాటులో ఉంచేందుకు 01.04.2026 నాటి ఉత్తర్వుల ద్వారా భారత ప్రభుత్వం పెట్రోకెమికల్ కాంప్లెక్స్లతో సహా చమురు శుద్ధి సంస్థలకు అనుమతినిచ్చింది.
-
ఔషధవిభాగం, రసాయనాలు - పెట్రో రసాయనాల విభాగం (డీసీపీసీ), పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) నుంచి అందిన అభ్యర్థనల మేరకు, ఫార్మా - రసాయన రంగ కంపెనీల కోసం ఎల్పీజీ నిల్వల నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నుల కేటాయింపులు చేశారు.
-
2026 ఏప్రిల్ 9 నుంచి సుమారు 2550 మెట్రిక్ టన్నుల ప్రోపిలీన్ అమ్మకాలు జరిగాయి.
రిటైల్ ఇంధనం లభ్యత, ధరలు
-
దేశవ్యాప్తంగా రిటైల్ విక్రయ కేంద్రాలు (పెట్రోల్ బంకులు) యథావిధిగా పనిచేస్తున్నాయి.
-
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. అయినప్పటికీ, వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది.
-
భారత ప్రభుత్వం 11.04.2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిల్ ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.55.50కి, ఏటీఎఫ్ (పై రూ.42కి పెంచింది. దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తుల లభ్యతను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
-
పెట్రోల్, డీజిల్ సాధారణ రిటైల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ రంగ చమురు సంస్థల విక్రయ కేంద్రాల వద్ద ఎలాంటి ధరల పెంపూ లేదు.
కిరోసిన్ లభ్యత, పంపిణీ
*రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపులతో పాటు అదనంగా 48,000 లీటర్ల కిరోసిన్ అందించారు..
*18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్కేఓ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి, కాగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ఎటువంటి అవసరం లేదని తెలిపాయి.
సముద్ర భద్రత, షిప్పింగ్ కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్లో ప్రస్తుత సముద్ర స్థితిగతులు, అలాగే భారతీయ నౌకలు, సిబ్బందిని రక్షించడానికి తీసుకుంటున్న చర్యల గురించి కూడా వివరించారు. ఈ సందర్భంగా ఈ క్రింది అంశాలను పేర్కొన్నారు:
-
సముద్రయాన సిబ్బంది సంక్షేమం, అంతరాయం లేకుండా సముద్ర కార్యకలాపాలు సాగేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సముద్ర రంగానికి చెందిన భాగస్వాములతో మంత్రిత్వ శాఖ సమన్వయంతో వ్యవహరిస్తోంది.
-
ఈ ప్రాంతంలోని భారతీయ సముద్ర యానికులందరూ క్షేమంగా ఉన్నారు. గత 24 గంటలలో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదవ్వలేదు.
-
డిజి షిప్పింగ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 6,727 కాల్స్ ను, 13,987 పైగా కమ్యూనికేషన్లను స్వీకరించింది. గత 24 గంటల్లో 147 కాల్స్, 276 ఈమెయిల్స్ అందాయి.
-
డిజి షిప్పింగ్ ఇప్పటివరకు 2,447 పైగా భారతీయ సముద్ర యానికులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావడానికి సహకరించింది, వీరిలో గత 24 గంటల్లో గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30మంది కూడా ఉన్నారు.
-
భారతదేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఎక్కడా రద్దీ ఉన్నట్లు సమాచారం లేదు.
భారత పౌరుల భద్రత
గల్ఫ్, పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో మారుతున్న పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. అక్కడి భారతీయ సమాజం భద్రత, క్షేమం కోసం కింద పేర్కొన్న ప్రత్యేక చర్యలు చేపట్టింది.
-
సమాచార మార్పిడి, సమన్వయం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
-
భారత రాయబార కార్యాలయాలు, కేంద్రాలు రోజంతా హెల్ప్లైన్ల ద్వారా సేవలందిస్తూ భారతీయ పౌరులకు అండగా ఉంటున్నాయి. ఇవి స్థానిక ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.
-
స్థానిక ప్రభుత్వాల మార్గదర్శకాలు, విమాన ప్రయాణాల పరిస్థితి, కాన్సులర్ సేవలు, పౌరుల సహాయం కోసం మద్దతు కోసం తీసుకుంటున్న వివిధ సంక్షేమ చర్యల గురించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు.
-
భారతీయ రాయబార కార్యాలయాలు ఆ ప్రాంతంలోని భారతీయ సంఘాలు, వృత్తిపరమైన బృందాలు, భారతీయ కంపెనీలు,ఇతర భాగస్వాములతో వారి ఆందోళనలను పరిష్కరించడానికి నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.
-
ఆ ప్రాంతంలోని నౌకల్లో ఉన్న భారతీయ సిబ్బందికి మన రాయబార కార్యాలయాలు అన్ని విధాలా సహకారం అందిస్తున్నాయి. స్థానిక అధికారులు, సంస్థలతో సమన్వయం చేసుకోవడం, కాన్సులర్ సాయం అందించడం, భారతదేశంలోని వారి కుటుంబాలతో మాట్లాడించడం, స్వదేశానికి తిరిగి రావాలనుకునే వారి అభ్యర్థనలను నెరవేర్చడంలో తోడ్పడుతున్నాయి.
-
వైమానిక హద్దులు తెరిచి ఉన్న దేశాల నుంచి విమానాలు నడుస్తూనే ఉన్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటదాకా ఆ ప్రాంతం నుంచి భారతదేశానికి సుమారు 10,38,000 మంది ప్రయాణికులు వచ్చారు.
-
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో, నిర్వహణ, భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని యూఏఈ, భారత్ మధ్య పరిమిత సంఖ్యలో నాన్-షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలు నడుస్తున్నాయి; ఈరోజు దాదాపు 105 విమానాలు నడుస్తాయని అంచనా.
-
సౌదీ అరేబియా, ఒమన్లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారతదేశంలోని గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
-
ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉన్నందున, ఖతార్ ఎయిర్వేస్ ఈరోజు భారత్ కు దాదాపు 10 విమానాలను నడపవచ్చని భావిస్తున్నారు.
-
కువైట్ గగనతలం ఇంకా మూసివేసే ఉంది. జజీరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి భారతదేశానికి నాన్-షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి.
-
బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది. గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ నుంచి భారతదేశానికి పరిమిత విమాన సర్వీసులను ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి భారతదేశానికి నాన్-షెడ్యూల్డ్ విమానాలను నడుపుతోంది.
-
ఇరాక్ వైమానిక హద్దులు తెరిచి ఉన్నాయి. భారతదేశానికి వెళ్లే ప్రయాణికుల కోసం ఆ ప్రాంతంలోని ఇతర నగరాలకు పరిమితంగా విమానాలు నడుస్తున్నాయి.
-
టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటివరకు 2,358 మంది భారతీయ పౌరులను ఇరాన్ నుంచి అర్మేనియా, అజర్బైజాన్ మీదుగా భారత్ కు వెళ్లేలా ఏర్పాట్లు చేసింది. వీరిలో 1,041 మంది భారతీయ విద్యార్థులు, 657 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నారు.
-
ఇజ్రాయెల్ గగనతలం పరిమిత విమాన సర్వీసులతో పాక్షికంగా తెరిచి ఉంది. భారతీయ పౌరులు జోర్డాన్, ఈజిప్ట్ మీదుగా భారత్ కు చేరుకునేలా నిరంతరం సౌకర్యాలు కల్పిస్తున్నారు.
హజ్ యాత్ర 2026
-
ఈ ఏడాది హజ్ యాత్ర ప్రారంభంపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
-
2026 హజ్ యాత్రకు సంబంధించి తొలి బృందం ఏప్రిల్ 18న దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సౌదీ అరేబియాకు బయలుదేరనుంది.
-
మొత్తం 1,75,025 మంది యాత్రికులు ఈ పవిత్ర యాత్రను చేపట్టనున్నారు.
-
రియాద్లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ కలిసి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సౌదీ హజ్ - ఉమ్రా మంత్రిత్వ శాఖ వంటి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నాయి. యాత్రికులకు స్వాగతం పలికేందుకు ఇవి సిద్ధంగా ఉన్నాయి.
-
భారత ప్రభుత్వం హజ్ యాత్రికుల భద్రతకు, సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా, సౌకర్యవంతంగా జరిగేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
-
పవిత్రమైన ఈ హజ్ యాత్రను చేపడుతున్న యాత్రికులందరికీ మంత్రిత్వ శాఖ తన శుభాకాంక్షలను తెలియజేస్తోంది.
-
మరిన్ని వివరాల కోసం, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనను చూడవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2253189)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6