మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
రేపు ఎనిమిదో పోషణ్ పఖ్వాడా- 2026 కార్యక్రమానికి శ్రీకారం
ఇతివృత్తం: జీవితంలో మొదటి ఆరేళ్ల వయస్సులో మేధో వికాసం
ఏప్రిల్ 9 -23 వరకూ పోషణ్ పఖ్వాడాను- 2026ను నిర్వహించనున్న మహిళా, శిశు అభివృద్ధి శాఖ
దేశవ్యాప్తంగా పోషణ ఫలితాలను మెరుగుపరచడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని పునరుద్ఘాటించే కార్యక్రమం
నాడు పోస్టు చేయడమైనది:
08 APR 2026 10:16AM by PIB Hyderabad
మహిళా, శిశు అభివృద్ధి శాఖ పోషణ్ పఖ్వాడా (పోషణ సంబంధిత పక్షోత్సవం)లో 8వ సంచికను 2026 ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 23 వరకూ నిర్వహించనుంది. దేశంలో పోషణ విషయంలో మెరుగైన ఫలితాలను సాధించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా పునరుద్ఘాటిస్తున్నారు.
పోషణ విజ్ఞానానికి ఉన్న ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరిస్తూ, ‘‘పండంటి ఆరోగ్యంతో ఉన్న పాపాయే బలమైన దేశానికి పునాది. పోషణ్ అభియాన్ కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు.. ప్రజలు నడిపే ఉద్యమం ఇది. ప్రతి తల్లికీ, ప్రతి బిడ్డకీ సంపూర్ణ పోషణ అందేటట్టు చూడడం ఈ ఉద్యమం లక్ష్యం’’ అని పేర్కొన్నారు.
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణ దేవి దార్శనిక నాయకత్వంలో పోషణ పఖ్వాడా- 2026 ప్రారంభ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో 2026 ఏప్రిల్ 9న సాయంత్రం 3 గంటల మొదలు 4 గంటల మధ్య న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్తో పాటు మహిళా, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ అనిల్ మాలిక్ కూడా పాల్గొంటారు.
పసితనంలో, మరీ ముఖ్యంగా మొదటి 1,000 రోజులు మేధో వికాసం, శారీరక ఎదుగుదలతో పాటు సమగ్ర ఆరోగ్యానికి కీలకమని గుర్తించి ‘జీవితంలో మొదటి ఆరేళ్లలో మేధోవికాసాన్ని పెంపొందించడం’ అంశాన్ని పోషణ పఖ్వాడా- 2026కు ఇతివృత్తంగా తీసుకున్నారు. శిశువుకు ఆరేళ్ల వయస్సు వచ్చే లోపల మేధస్సు 85 శాతాని కన్నా ఎక్కువ వికసిస్తుందని విజ్ఞానశాస్త్ర ప్రమాణాలు చాటిచెబుతున్నాయి. ఈ విషయం అనుకూల పోషణ, బాధ్యతతో కూడిన సంరక్షణ, ముందుముందుగా నేర్పించడం.. ఈ ప్రక్రియలకు ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తోంది.
ఈ సంవత్సరంలో తీసుకున్న ఇతివృత్తంలో భాగంగా ప్రత్యేకంగా శ్రద్ధ వహించే రంగాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
1. మాతా శిశు పోషణ: కడుపుతో ఉన్న కాలంలోనే నచ్చిన ఆహారాన్ని తీసుకొనేటట్లు ప్రోత్సహించడం, చనుబాలివ్వాల్సిందిగా బోధ చేయడం, వయస్సుకు తగ్గట్లు అనుబంధ ఆహారాన్ని ఇవ్వాలని సూచించడం.
2. మేధస్సు వికసించేటట్లు చూడటానికి ముందస్తు ప్రోత్సాహాన్ని ఇవ్వడం (0-3 ఏళ్ల మధ్య): బాధ్యతతో కూడిన సంరక్షణతో పాటు ప్రారంభ దశలోనే బిడ్డ విషయాలను నేర్చుకొనేటట్లుగా మాటామంతీని ప్రోత్సహించడం.
3. తొలి ఏళ్లలో (3ఏళ్లు-6 ఏళ్ల వయసులో) ఆటల రూపంలో బోధనకు మొగ్గు చూపాలని చెప్పడం: సమగ్ర వికాసంతో పాటు బడికి వెళ్లడానికి సన్నద్ధం కావడంలో తోడ్పాటును అందించడం.
4. స్క్రీన్ టైమును తగ్గించడంలో తల్లితండ్రులతో పాటు సమాజం పోషించాల్సిన పాత్రను వివరించడం: ఆరోగ్యదాయక అలవాట్లనీ, చురుకైన భాగస్వామ్యాన్నీ ప్రోత్సహించడం.
5. సామాజిక భాగస్వామ్యం ద్వారా అంగన్వాడీ కేంద్రాలను పటిష్ఠపరచడం: ప్రజల భాగస్వామ్యం, సీఎస్ఆర్ మార్గాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సేవల అందజేతను విస్తరించడం.
ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అత్యుత్తమ పద్ధతులను ప్రదర్శిస్తారు. కీలక కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బాల్య దశలో సంరక్షణ, పోషణ సంబంధిత సేవలను బలోపేతం చేయడంలో ముందువరుసలోని కార్యకర్తలు, ప్రత్యేకించి ఆంగన్వాడీ కార్యకర్తల తోడ్పాటును వెలుగులోకి తీసుకువస్తారు.
మొదటి రోజు, కార్యక్రమాన్ని ఎన్ఐసీ వెబ్కాస్ట్ వేదిక అయిన https://webcast.gov.in/mwcd లోనూ, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన యూట్యూబ్ చానల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
ఈ పక్షోత్సవంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లులు, సంరక్షణదారులు, కుటుంబాలు, సామాజిక సంస్థలు, స్థానిక సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. వీటిలో పోషణ్ పంచాయతీలు, చైతన్యాన్ని పెంపొందించే సమావేశాలు, ముందస్తు ప్రోత్సాహాన్ని అందించే కార్యకలాపాలు, ఆటలపై దృష్టి పెడుతూ శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, చిన్న పిల్లలకు ఆరోగ్యవంతమైన జీవన శైలిని గురించి చెప్పే, స్క్రీన్ టైమును తగ్గించే దిశగా ప్రచార ఉద్యమాలను చేపట్టడం వంటివి భాగంగా ఉంటాయి.
పోషణ్ పఖ్వాడా-2026ను నిర్వహించి ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీన్లో భాగంగా పోషణ, సంరక్షణ, ప్రారంభిక శిక్షణ, సామాజిక భాగస్వామ్యం.. ఇవన్నీ కలిసికట్టుగా ఒక ఆరోగ్యదాయకమైన, విద్యావంతమైన, శక్తిమంతమైన భారత్కు పునాదిగా మారతాయని పునరుద్ఘాటిస్తున్నారు.
పోషణ సంబంధిత ఫలితాల్లో మెరుగుదలను తీసుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఒక ప్రధాన కార్యక్రమమే పోషణ్ అభియాన్. ఇది ప్రస్తుతం దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మారింది. పోషకాహారం అందకపోవడమనే సమస్య నుంచి భారత్ను విముక్తం చేయాలనేదే ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి సామాజిక భాగస్వామ్యాన్నీ, జన్ భాగీదారీనీ ప్రోత్సహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో చైతన్యాన్నీ, ప్రవర్తనలో మార్పునీ, సామాజిక గతిశీలతనీ పోషణ్ పఖ్వాడా పెంపొందిస్తూ, ఈ ఉద్యమంలో ఒక కీలక పాత్రను పోషిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2250016)
సందర్శకుల సూచీ సంఖ్య : : 91
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Manipuri
,
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada