పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమ ఆసియా పరిణామాల నేపథ్యంలో కీలక రంగాలపై తాజా సమాచారం
వదంతులను నమ్మొద్దని, భయాందోళనతో ఇంధన విక్రయాలు చేయొద్దని ప్రజలు విజ్ఞప్తి
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఇంధన సరఫరా పరిస్థితిని సమీక్షించిన కార్యదర్శి (ఎంఓపీఎన్జీ)
తగినంత ఇంధన లభ్యత కోసం తీసుకున్న చర్యలను వెల్లడించిన కార్యదర్శి
ఎల్పీజీ పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని, అక్రమ నిల్వలు- తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు ఆదేశం
మార్చి 23 నుంచి 5 లక్షలు దాటిన 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల విక్రయాలు.. నిన్న ఒక్కరోజే 67,000 పైగా విక్రయం
పీఎన్జీ విస్తరణ సంస్కరణల కింద 10 రాష్ట్రాలకు అదనపు ఎల్పీజీ కేటాయింపు
ఊపందుకున్న పీఎన్జీ విస్తరణ.. 2026 మార్చి నుంచి 3.42 లక్షల కనెక్షన్లకు గ్యాస్ సరఫరా- 3.7 లక్షల కొత్త రిజిస్ట్రేషన్లు
సముద్రయాన కార్యకలాపాలు, నావికుల భద్రతపై నిరంతర నిఘాను కొనసాగిస్తున్న ప్రభుత్వం
యథావిధిగా కొనసాగుతున్న ఓడరేవుల కార్యకలాపాలు
ఇప్పటివరకు స్వదేశానికి వచ్చిన 1130 మందికి పైగా భారతీయ నావికుల.. గత 24 గంటల్లో 155 మంది రాక
గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ సమాజానికి 24 గంటలపాటు సహాయ సహకారాలు అందిస్తున్న దౌత్య కార్యాలయాలు
మెరుగుపడుతున్న విమాన ప్రయాణ పరిస్థితులు.. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు భారత్కు తిరిగి వచ్చిన 6,49,000 మంది ప్రయాణికులు
నాడు పోస్టు చేయడమైనది:
03 APR 2026 6:34PM by PIB Hyderabad
పశ్చిమాసియాలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సమన్వయంతో కూడిన ప్రతిస్పందన చర్యల ద్వారా కీలక రంగాలలో సంసిద్ధత, నిరంతరాయ సేవలను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోంది. ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయలకు మద్దతునిచ్చేందుకు తీసుకుంటున్న చర్యల తాజా సమాచారం ఇక్కడ ఉంది:
ఇంధన సరఫరా, లభ్యత
హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయంగా లభ్యమయ్యేలా చూసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం:
ప్రజా సూచనలు, పౌర అవగాహన
-
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తగినంతగా లభ్యమయ్యేలా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి ప్రజలు ఆందోళనతో పెట్రోల్, డీజిల్ను కొనుగోలు చేయొద్దని.. ఎల్పీజీ సిలిండర్లను అనవసరంగా బుక్ చేయొద్దని సూచించారు.
-
సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దు. సరైన సమాచారం కోసం కేవలం ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి.
-
ఎల్పీజీ సిలిండర్లను డిజిటల్ పద్ధతుల్లో బుక్ చేసుకోవాలని ప్రజలను కోరారు. అత్యవసరమైతే తప్ప గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లవద్దు.
-
వీలైన చోట పీఎన్జీ, ఇండక్షన్ స్టౌలు, ఎలక్ట్రిక్ కుక్టాప్ల వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.
-
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ తమ దైనందిన జీవితంలో ఇంధనాన్ని పొదుపుగా వాడుకునేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలని అభ్యర్థించారు.
ప్రభుత్వ సంసిద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
-
యుద్ధ వాతావరణంతో కూడా ప్రభుత్వం గృహావసరాల ఎల్పీజీ, పీఎన్జీ సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. వీటితో పాటు ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ఇంధన సరఫరాలో అధిక ప్రాధాన్యత లభిస్తోంది.
-
డిమాండ్, సరఫరాను సమతుల్యం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే పలు క్రమబద్ధీకరణ చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా చమురు శుద్ధి కేంద్రాల్లో ఇంధన ఉత్పత్తిని పెంచడం.. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పెంచడం.. అత్యవసర రంగాలకు సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వంటి వాటిని అమలు చేశారు.
-
ఎల్పీజీ డిమాండ్పై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చారు.
-
చిన్న, మధ్యతరహా, ఇతర వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు అధిక మొత్తంలో బొగ్గు కేటాయించాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ సంస్థలకు బొగ్గు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
-
గృహ, వాణిజ్య అవసరాల కోసం కొత్త పీఎన్జీ కనెక్షన్ల ప్రక్రియను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
-
ఇంధన సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎన్జీ) కార్యదర్శి .. అన్ని రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాల అదనపు ప్రధాన కార్యదర్శులు, పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. తగినంత ఇంధనం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. గృహావసరాలు, ఇతర అత్యవసర అవసరాలకు ఎల్పీజీ పంపిణీలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. అదే సమయంలో ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేయడం, దారి మళ్లించడం, తప్పుడు సమాచారంపై కఠినమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. వలస కార్మికులకు అందే 5 కిలోల ఎఫ్టీఎల్ ఎల్పీజీ సరఫరా విషయంలో నెలకొన్న ఆందోళనపై రాష్ట్రాలు స్పందించాయి. వలస కార్మికులకు అందే ఈ గ్యాస్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేవని, పంపిణీ స్థిరంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల లక్షిత పంపిణీ క్రమబద్ధీకరించే చర్యలను పరిగణనలోకి తీసుకోవాలని కార్యదర్శి సూచించారు.
రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు:
-
నిత్యావసరాల చట్టం- 1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం.. అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీతో సహా నిత్యావసరాల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడం, నియంత్రించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రాథమిక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వివిధ లేఖలు, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది.
-
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, ఏసీఎస్ లేదా ప్రధాన కార్యదర్శులు లేదా ఆహార- పౌర సరఫరాల కార్యదర్శులకు ఈ కింది చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
-
రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతిరోజూ మీడియా సమావేశాలను ఏర్పాటు చేయడం, క్రమం తప్పకుండా ప్రజలకు సూచనలు జారీ చేయడం.
-
ప్రత్యేక కంట్రోల్ రూంలు, హెల్ప్లైన్లను ఏర్పాటు చేయడం.
-
సామాజిక మాధ్యమాల్లో వచ్చే వచ్చే తప్పుడు వార్తలు, దుష్ప్రచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, అరికట్టడం.
-
జిల్లా యంత్రాంగం ద్వారా రోజువారీ ఎన్ఫోర్స్మెంట్ చర్యలను ఉద్ధృతం చేయటంతో పాటు ఓఎంసీల సమన్వయంతో తనిఖీలు, దాడులను కొనసాగించడం.
-
ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వాణిజ్య ఎల్పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
-
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన అదనపు కిరోసిన్ (ఎస్కేఓ) కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
-
ఆర్ఓడబ్ల్యూ లేదా ఆర్ఓయూ అనుమతులు, 24 గంటల పని అనుమతులు మొదలైన వాటిని వేగవంతం చేయటంతో పాటు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) విస్తరణను వేగవంతం చేయడం.
-
పీఎన్జీ వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
-
ఎంఓపీఎన్జీతో సమన్వయం కోసం సీనియర్ నోడల్ అధికారులను నియమించటం.
-
అప్రమత్తంగా ఉంటూ క్రమం తప్పకుండా ప్రజలతో సమాచారం పంచుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను 27.03.2026, 02.04.2026 నాటి లేఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం కోరింది. తప్పుడు సమాచారాన్ని సమర్థవంతంగా అరికట్టడానికి ఎల్పీజీ తగినంతగా అందుబాటులో ఉందని, పంపిణీ సజావుగా సాగుతోందని ప్రజలకు భరోసా ఇవ్వడానికి తగిన స్థాయిలోని సీనియర్ అధికారులు రోజువారీ మీడియా సమావేశాలు నిర్వహించాలని.. సామాజిక మాధ్యమాలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని సకాలంలో వ్యాప్తి చేయాలని అభ్యర్థించింది.
-
ప్రస్తుతం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మీడియా ప్రకటలను జారీ చేస్తున్నాయి లేదా మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు:
-
ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. నిన్న 4000 కంటే ఎక్కువ దాడులను నిర్వహించటంతో పాటు 1300 కంటే ఎక్కువ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
-
అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాల వంటి వాటిని నిరోధించడానికి ఆకస్మిక తనిఖీల వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థల (పీఎస్యూ ఓఎంసీ) అధికారులను ఆదేశించారు.
-
ఇప్పటి వరకు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్షిప్లకు 670 కంటే ఎక్కువ షోకాజ్ నోటీసులను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు జారీ చేశాయి.
గృహావసరాల ఎల్పీజీ సరఫరా స్థితిగతులు:
-
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరాపై ప్రభావం పడింది. అయినప్పటికీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్షిప్ల వద్ద నిల్వల పూర్తి కొరత ఉన్నట్లు ఎటువంటి నివేదికలు లేవు.
-
నిన్నటి పరిశ్రమ గణాంకాల ప్రకారం ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 94 శాతానికి పెరిగాయి.
-
డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో సిలిండర్ల మళ్లింపును నిరోధించడానికి డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత డెలివరీలను 2026 ఫిబ్రవరిలో ఉన్న 53 శాతం నుంచి నిన్నటికి 86 శాతానికి పెంచారు.
-
నిన్న సుమారు 55 లక్షల గృహావసరాల ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ అయ్యాయి.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపునకు సంబంధించిన చర్యలు:
-
కేంద్ర ప్రభుత్వం 01.04.2026 నాటి ఉత్తర్వు ద్వారా సీహెచ్టీ (సెంటర్ ఫర్ హై టెక్నాలజీ ) నిర్ణయించిన నిర్దిష్ట పరిమాణం, చమురు శుద్ధి ప్రమాణాల ఆధారంగా ఫార్మాస్యూటికల్స్ శాఖ, ఆహార- ప్రజా పంపిణీ శాఖ, రసాయనాలు- పెట్రో కెమికల్స్ శాఖ వంటి కీలక రంగాలకు కనీస పరిమాణంలో సీ3, సీ4 స్ట్రీమ్లను అందుబాటులో ఉంచేందుకు భారత్లోని పెట్రోకెమికల్ కాంప్లెక్స్లతో సహా చమురు శుద్ధి కంపెనీలకు అనుమతి ఇచ్చింది.
-
ప్రభుత్వం ఇప్పటికే వినియోగదారులకు పాక్షిక వాణిజ్య ఎల్పీజీ సరఫరాను (20 శాతం) పునరుద్ధరించింది. దీనికి అదనంగా పీఎన్జీ విస్తరణ కోసం సులభతర వ్యాపార నిర్వహణ సంస్కరణల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరో 10 శాతం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం 18.03.2026న లేఖను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం 21.03.2026 నాటి లేఖ ద్వారా మరో 20 శాతం కేటాయింపునకు అనుమతినిచ్చింది. దీనితో మొత్తం కేటాయింపు 50 శాతానికి (10 శాతం సంస్కరణల ఆధారిత కేటాయింపుతో కలిపి) చేరుకుంది. ఇందులో రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార శుద్ధి లేదా డైరీ కేంద్రాలు, రాయితీ క్యాంటీన్లు లేదా అవుట్లెట్లు, సామాజిక వంటశాలలు, వలస కార్మికుల కోసం 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లకు ప్రాధాన్యత లభిస్తోంది. తదనంతరం 27.03.2026 నాటి లేఖ ద్వారా అదనంగా మరో 20 శాతం కేటాయింపును అందించారు. దీనితో మొత్తం కేటాయింపు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో 70 శాతానికి (10 శాతం సంస్కరణల ఆధారిత కేటాయింపుతో కలిపి) పెరిగింది. ఇందులో సహజ వాయువుతో భర్తీ చేయలేని ప్రత్యేక హీటింగ్ ప్రక్రియల కోసం ఎల్పీజీ అవసరమయ్యే ఉక్కు, వాహనాలు, వస్త్రాలు, రంగులు, రసాయనాలు, ప్లాస్టిక్స్ వంటి పరిశ్రమలకు ముఖ్యంగా ప్రాసెస్ పరిశ్రమలకు ప్రాధాన్యత ఉంది.
-
నిన్న 67,000 కంటే ఎక్కువ 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
-
2026 మార్చి 23 నుంచి ఇప్పటివరకు సుమారు 5 లక్షల 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
-
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మెజారిటీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గృహేతర ఎల్పీజీ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. 2026 మార్చి 14 నుంచి ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వాణిజ్య సంస్థలు మొత్తం 66,693 ఎంటీ గ్యాస్ను పొందాయి.
సహజ వాయువు సరఫరా, పీఎన్జీ విస్తరణ కార్యక్రమాలు
డీ-పీఎన్జీ, సీఎన్జీ-రవాణాకు 100 శాతం సరఫరాతో వినియోగదారులకు ప్రాధాన్యమిస్తున్నారు.
గ్రిడ్కు అనుసంధానించిన పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు జరుగుతున్న సరఫరా వారి సగటు వినియోగంలో 80 శాతంగా ఉంది.
వాణిజ్య ఎల్పీజీ లభ్యతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి, తమ ప్రాంతాల్లో రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థల కోసం పీఎన్జీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలని భారత ప్రభుత్వం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) సంస్థలకు సూచించింది.
ఎరువుల కర్మాగారాలు సహా పారిశ్రామిక వినియోగదారులందరూ తమ అదనపు అవసరాన్ని అప్పటికప్పుడు అందించాలని సూచించారు. తద్వారా గ్యాస్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా దాని కోసం ఏర్పాటు చేయవచ్చు.
ఐజీఎల్, ఎమ్జీఎల్, గెయిల్ గ్యాస్, బీపీఎస్ఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్జీ కనెక్షన్లు తీసుకునే వారికి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
సీజీడీ నెట్వర్క్ విస్తరణకు అవసరమైన దరఖాస్తుల ఆమోదాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను, కేంద్ర మంత్రిత్వ శాఖలను భారత ప్రభుత్వం కోరింది.
ఎల్పీజీ నుంచి పీఎన్జీకి దీర్ఘకాలిక పరివర్తనలో సహాయపడే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీలో అదనంగా 10 శాతం కేటాయింపు అందిస్తామని భారత ప్రభుత్వం 18.03.2026 తేదీ నాటి లేఖ ద్వారా ప్రతిపాదించింది. పీఎన్జీ విస్తరణ సంస్కరణ చర్యల కింద 10 రాష్ట్రాలు అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును పొందుతున్నాయి. దీనికి అదనంగా, మరో రాష్ట్రం నుంచి వచ్చిన దరఖాస్తు పరిశీలనలో ఉంది.
సమీపంలో పైప్లైన్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న చోట, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, కమ్యూనిటీ వంటగదులు, అంగన్వాడీ వంటగదులు మొదలైన వాటిని 5 రోజుల్లోగా పీఎన్జీతో అనుసంధానించడానికి అన్ని సీజీడీ సంస్థలు పూర్థిస్తాయి ప్రయత్నాలు చేయాలని తేదీ 23.03.2026 నాటి తన ఉత్తర్వుల ద్వారా పీఎన్జీఆర్బీ ఆదేశించింది.
రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 24.03.2026 తేదీ నాటి లేఖ ద్వారా, సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రాసెస్ చేసేందుకు, "తగ్గించిన కాలపరిమితులతో సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన ఆమోద విధానం"ను 3 నెలల పాటు ప్రత్యేక చర్యగా అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
భారత ప్రభుత్వం 24.03.2026 తేదీ నాటి గెజిట్ ద్వారా, నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు, నిర్మాణం, నిర్వహణ, విస్తరించడం ద్వారా) ఉత్తర్వులు-2026 జారీ చేసింది. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పైప్లైన్లు వేయడానికి, విస్తరించడానికి ఒక క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధాన ప్రణాళికను అందిస్తుంది. ఇది అనుమతులు, భూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించడంతో పాటు నివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. ఇది పీఎన్జీ నెట్వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, మారుమూల ప్రాంతాలకు అనుసంధానతను మెరుగుపరుస్తుందని, స్వచ్ఛమైన ఇంధనాలకు మారడానికి మద్దతునిస్తుందని, ఇంధన భద్రతను బలోపేతం చేయడం ద్వారా భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.
అన్ని నివాస ప్రాంతాలు, యూనిట్ లైన్ల రక్షణలో పీఎన్జీ మౌలిక సదుపాయాల ఏర్పాటును వేగవంతం చేయడం కోసం 30 జూన్ 2026 వరకు అమలులో ఉండే ఒక స్వల్పకాలిక విధాన సవరణను రక్షణ మంత్రిత్వ శాఖ 27.03.2026 తేదీ నాటి లేఖ ద్వారా జారీ చేసింది.
సీజీడీ సంస్థలు డీ-పీఎన్జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని పీఎన్జీఆర్బీ ఆదేశించింది. పీఎన్జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి జాతీయ పీఎన్జీ డ్రైవ్ 2.0 (01.01.2026-31.03.2026)ను తాజాగా 30.06.2026 వరకు పొడిగించారు.
గత వారం రోజుల్లో 110 గ్యాస్లో 75,000లకు పైగా కనెక్షన్లకు గ్యాసిఫికేషన్ జరిగింది.
మార్చి 2026 నుంచి ఇప్పటివరకు 3.42 లక్షలకు పైగా పీఎన్జీ కనెక్షన్లకు గ్యాసిఫికేషన్ పూర్తయింది. 3.7 లక్షలకు పైగా వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు.
ముడి చమురు స్థితి, రిఫైనరీ కార్యకలాపాలు
తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉండటంతో, అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా ఉన్నాయి.
దేశీయ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల చర్యలు
దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ అవుట్లెట్లు యధావిధిగా పనిచేస్తున్నాయి.
మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. ఈ ప్రభావం నుంచి వినియోగదారులను కాపాడటం లక్ష్యంగా భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం ద్వారా ఈ భారాన్ని పాక్షికంగా భరించాలని నిర్ణయించింది.
దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం డీజిల్పై లీటరుకు రూ. 21.5, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్పై లీటరుకు రూ. 29.5 ఎగుమతి సుంకాన్ని విధించింది.
కొన్ని ప్రాంతాల్లో వదంతుల కారణంగా ప్రజలు భయాందోళనతో వస్తువులను కొనుగోలు చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు గుర్తించారు. ఫలితంగా రిటైల్ అవుట్లెట్ల వద్ద అమ్మకాలు అసాధారణంగా పెరిగి, భారీ రద్దీ ఏర్పడింది. దేశంలోని అన్ని పెట్రోల్ పంపుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ సాధారణ రిటైల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. రిటైల్ అవుట్లెట్లలో ధరల పెంపు లేదు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు పెట్రోలుపై లీటరుకు రూ. 24.40, డీజిలుపై లీటరుకు రూ. 104.99 వసూలు చేస్తున్నారు.
వదంతులను నమ్మవద్దని ప్రభుత్వం మరోసారి సూచనలు జారీ చేసింది. వదంతులను అరికట్టేందుకు, పత్రికా సమావేశాల ద్వారా సరైన సమాచారాన్ని ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపులకు అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్ను కేటాయించారు.
భారత ప్రభుత్వం 29.03.2026 తేదీ నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా, పీడీఎస్ ఎస్కేవో రహిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేవలం వంట, దీపాలు వెలిగించే ప్రయోజనం కోసం మాత్రమే పీడీఎస్ ఎస్కేవో పంపిణీని సులభతరం చేసింది.
ప్రతి జిల్లాకు గరిష్టంగా రెండు ప్రభుత్వ రంగ సంస్థల ఓఎమ్సీ సర్వీస్ స్టేషన్లు (ప్రాధాన్యంగా కంపెనీ యాజమాన్యంలోనివి లేదా కంపెనీ నిర్వహించేవి) 5,000 లీటర్ల వరకు పీడీఎస్ ఎస్కేవోను నిల్వ చేయడానికి అనుమతిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంత పరిపాలన విభాగం ఈ పీఎస్యూ ఓఎమ్సీ సర్వీస్ స్టేషన్లను ప్రతి జిల్లాలో నియమిస్తుంది.
17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. హిమాచల్ ప్రదేశ్, లదాఖ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్కేవో అవసరం లేదని తెలియజేశాయి.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
ఈ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ నౌకలు, నావికులను కాపాడటానికి నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ అవసరమైన చర్యలను చేపట్టింది. మంత్రిత్వ శాఖ ఈ సమాచారం తెలియజేసింది:
ఇది నౌకా వాణిజ్యం నిరంతరాయంగా కొనసాగేలా చూస్తూనే... నౌకా రవాణాను, నౌకాశ్రయ కార్యకలాపాలను, భారతీయ నావికుల భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.
ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి ఘటన నమోదు కాలేదు.
పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 485 మంది భారతీయ నావికులతో కూడిన మొత్తం 18 భారత జెండా గల నౌకలు ఉన్నాయి. నౌకా యజమానులు, ఆర్పీఎస్ఎల్ ఏజెన్సీలు, భారత మిషన్లతో సమన్వయం ద్వారా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24x7 పనిచేస్తూనే ఉంది. యాక్టివేషన్ అయినప్పటి నుంచి 4984 కాల్లు, 10296 ఈమెయిళ్లను ఇది నిర్వహించింది. గత 24 గంటల్లో 99 కాల్లు, 362 ఈమెయిళ్లు అందాయి.
డీజీ షిప్పింగ్ ఇప్పటివరకు 1130 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో సహాయపడింది. వీరిలో గత 24 గంటల్లో గల్ఫ్లోని విమానాశ్రయాలు, వివిధ ప్రాంతీయ ప్రదేశాల నుంచి 155 మందిని స్వదేశానికి తరలించింది.
దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళం, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్ర మారిటైమ్ బోర్డులు కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని ధ్రువీకరించాయి.
సముద్రయాన సిబ్బంది సంక్షేమం, నిరంతరాయ సముద్ర కార్యకలాపాలను నిర్ధారించడం లక్ష్యంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత మిషన్లు, నౌకా వాణిజ్య రంగ భాగస్వాములతో మంత్రిత్వ శాఖ నిరంతర సమన్వయం కొనసాగిస్తోంది.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
ఈ ప్రాంతమంతటా భారతీయ మిషన్లు, పోస్టులు భారతీయ పౌరులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. వారి భద్రత, శ్రేయస్సు కోసం సహాయాన్ని అందిస్తూ, అవసరమైన సూచనలను జారీ చేస్తున్నారు. మంత్రిత్వ శాఖ కింది సమాచారాన్ని తెలియజేసింది:
ఈ నెల 02న, భారత్-రష్యా అంతర్-ప్రభుత్వ కమిషన్ సహ-అధ్యక్షులు, రష్యా మొదటి ఉప ప్రధాని గౌరవనీయ డెనిస్ మాంతురోవ్... భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్యం, ఎరువులు, కనెక్టివిటీ, ప్రజల మధ్య సంబంధాల్లో పరస్పర ప్రయోజనకరమైన సహకారం గురించి ఇద్దరూ చర్చించారు. గత డిసెంబరులో ఆ దేశ అధ్యక్షులు గౌరవ పుతిన్ భారత పర్యటన సందర్భంగా జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశ ఫలితాల అమలులో పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు.
అదే రోజున, విదేశాంగ మంత్రి (ఈఏఎమ్) మొదటి ఉప ప్రధాని గౌరవ డెనిస్ మాంతురోవ్తో వాణిజ్యం, పరిశ్రమలు, ఇంధనం, ఎరువులు, కనెక్టివిటీ, రవాణా రంగాల్లో భారత్-రష్యా ద్వైపాక్షిక సహకారంపై లోతైన చర్చలు జరిపారు. పశ్చిమాసియాలోని సంఘర్షణలు సహా ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది. ఆ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయ పౌరుల భద్రత, రక్షణ, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. భారతీయ పౌరులకు, వారి కుటుంబాలకు మద్దతునివ్వడానికి ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లతో నిరంతర సమన్వయం కొనసాగుతోంది.
ఈ ప్రాంతంలోని మిషన్లు, పోస్టులు ఇరవై నాలుగు గంటలూ హెల్ప్లైన్లను నిర్వహిస్తూ... భారతీయ కమ్యూనిటీ సంఘాలు, సంస్థలు, కంపెనీలతో చురుగ్గా సంప్రదింపులు నిర్వహిస్తున్నాయి. పౌరులు, విద్యార్థులు, నావికులు, నివాసితులైన భారతీయుల కోసం ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నాయి. మిషన్లు స్థానిక ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయం కొనసాగిస్తూ... వీసాలు, కాన్సులర్ సేవలతో పాటుగా, గగనతల ఆంక్షలు ఉన్న చోట పొరుగు దేశాల మీదుగా రవాణానూ, అవసరమైన చోట ప్రయాణపరమైన సహాయాన్ని అందిస్తున్నాయి.
గల్ఫ్ దేశాల్లోని భారతీయ విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. విద్యా సంవత్సరంపై ఎటువంటి ప్రభావం లేకుండా చూసేందుకు మిషన్లు స్థానిక అధికారులు, భారతీయ పాఠశాలలు, సంబంధిత విద్యా బోర్డులు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (జేఈఈ, నీట్ పరీక్షల కోసం)తో సన్నిహిత సమన్వయం కొనసాగిస్తున్నాయి.
ఈ ప్రాంతంలోని నౌకల్లో గల భారతీయ సిబ్బంది సంక్షేమాన్ని నిర్ధారించడానికి, వారికి కాన్సులర్ సహాయం అందించడానికి, కుటుంబాలతో సంప్రదింపులను సులభతరం చేయడానికి, స్థానిక అధికారులతో సమన్వయం చేయడానికి, భారత్కి తిరిగి రావాలనుకునే వారికి సహాయం చేయడానికి మిషన్లు... వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.
ఈ ప్రాంతం నుంచి భారత్లోని వివిధ గమ్యస్థానాలకు అదనపు విమానాలు నడుస్తుండటంతో, మొత్తం విమానయాన పరిస్థితి మెరుగుపడుతూనే ఉంది. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతం నుంచి సుమారు 6,49,000 మంది ప్రయాణికులు భారత్కు ప్రయాణించారు.
యూఏఈ: కార్యాచరణ, భద్రతాపరమైన అంశాల ఆధారంగా విమానయాన సంస్థలు పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని విమాన సర్వీసులను కొనసాగిస్తున్నాయి. యూఏఈ నుంచి సుమారు 90 విమానాలు భారత్కు నడుస్తాయని అంచనా.
సౌదీ అరేబియా, ఒమన్: వివిధ విమానాశ్రయాల నుంచి భారత్లోని పలు గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి.
ఖతార్: గగనతలం పాక్షికంగా తిరిగి తెరవడంతో, ఖతార్ ఎయిర్వేస్ భారత్కు సుమారు 8–10 విమానాలను నడపనుంది.
కువైట్: గగనతలం మూసి ఉంది. జజీరా ఎయిర్వేస్ దమ్మమ్ (సౌదీ అరేబియా) నుంచి షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను భారత్కు నడుపుతోంది. కువైట్ ఎయిర్వేస్ ఇదేవిధమైన కార్యకలాపాలను ప్రకటించింది.
బహ్రెయిన్: గగనతలం మూసి ఉంది. గల్ఫ్ ఎయిర్ దమ్మమ్ (సౌదీ అరేబియా) నుంచి భారత్కు షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను నడుపుతోంది.
ఇరాన్: గగనతలం మూసివేత దృష్ట్యా, భారత పౌరుల ప్రయాణానికి అర్మేనియా, అజర్బైజాన్ల ద్వారా సౌకర్యం కల్పిస్తున్నారు. ఇప్పటివరకు మిషన్ మద్దతుతో 1,267 మంది భారతీయులు (860 మంది విద్యార్థులు సహా) ఇరాన్ నుంచి నిష్క్రమించారు.
ఇజ్రాయెల్: గగనతల ఆంక్షల కారణంగా భారత పౌరుల ప్రయాణానికి ఈజిప్ట్, జోర్డాన్ మీదుగా సౌకర్యం కల్పిస్తున్నారు.
ఇరాక్: గగనతలం మూసివేత దృష్ట్యా, భారత పౌరుల ప్రయాణానికి జోర్డాన్, సౌదీ అరేబియా ద్వారా సౌకర్యం కల్పిస్తున్నారు.
కువైట్, బహ్రెయిన్లలో గగనతలం మూసి ఉన్న దృష్ట్యా, భారత పౌరులు సౌదీ అరేబియా మీదుగా భారత్కు ప్రయాణించేందుకు సౌకర్యం కల్పిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2248951)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17