పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో అంతర-మంత్రిత్వశాఖల నుంచి తాజా సమాచారం
· ఈ ఏడాది (2026) ఖరీఫ్ సాగుకు విత్తన లభ్యతపై భరోసా
· వ్యవసాయ ఉత్పాదకాలు.. రసాయనాలకు ఏ దశలోనూ కొరత ఉండదు.. లభ్యత మెరుగుకు ప్రభుత్వం సకల చర్యలు చేపడుతోంది
· వ్యవసాయ ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండటంతోపాటు నిశిత పర్యవేక్షణ కొనసాగుతోంది
· ప్రపంచవ్యాప్త ఏటీఎఫ్ ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించిన ప్రభుత్వం.. విమానయాన వ్యయం తగ్గింపు దిశగా దేశీయ విమాన సంస్థలకు ధరల పెంపుపై పరిమితి విధింపు
· పెట్రోల్... డీజిల్ సాధారణ చిల్లర ధరల్లో ఎలాంటి మార్పూ లేదు
· దేశీయ వంటగ్యాస్ వినియోగదారులపై ధరల పెంపు భారం లేదు
· ఈ నెల 23 నుంచి ఇప్పటిదాకా 3.9 లక్షలకుపైగా 5 కిలోల ‘ఎఫ్టీఎల్’ సిలిండర్ల విక్రయం
· పెట్రోల్.. డీజిల్.. వంటగ్యాస్ లభ్యతకు భరోసా దిశగా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టింది... భయాందోళనలతో కొనుగోళ్లు వద్దని పౌరులకు సూచన
· పశ్చిమాసియాలో పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.. ఆ ప్రాంత భారతీయ నావికులందరూ సురక్షితం
· గల్ఫ్ ప్రాంత భారత విద్యార్థుల విద్యా సంవత్సరం ప్రభావితం కాకుండా వారి సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2026 5:53PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా దేశ పౌరులకు కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా తాజా సమాచారం ఇస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జాతీయ మీడియా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఇందులో పెట్రోలియం-సహజ వాయువు, ఓడరేవులు-నౌకా రవాణా-జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు తమతమ శాఖల సంబంధిత వివరాలను వెల్లడించారు. ఈ మేరకు ఇంధన లభ్యత, సముద్ర కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారత పౌరులకు చేయూత, మొత్తంగా స్థిరత్వానికి భరోసాపై చేపట్టిన చర్యల గురించి వివరించారు. వారితోపాటు కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ, పౌర విమానయాన శాఖల సీనియర్ అధికారులు కూడా తమ పరిధిలో తీసుకున్న చర్యలను వెల్లడించారు.
వ్యవసాయ రంగ తాజా సమాచారం
దేశ వ్యవసాయ రంగంపై పశ్చిమాసియాలో పరిణామాల ప్రభావం, వివిధ అంతరాయాల నివారణకు చేపట్టిన చర్యల గురించి వ్యవసాయ-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కింది తాజా సమాచారం వెల్లడించింది:
విత్తన రంగం
· ఈ ఏడాది (2026) ఖరీఫ్ సాగుకు 166.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా, 185.74 లక్షల క్వింటాళ్ల నిల్వలున్నాయి... అంటే- విత్తన రంగం 19.29 లక్షల క్వింటాళ్ల మిగులుతో ఉంది.
· ఈ విత్తనాల్లో వరి 80.9 లక్షల క్వింటాళ్లు, సోయాబీన్ 35.7 లక్షల క్వింటాళ్లు, వేరుశనగ 21.1 లక్షల క్వింటాళ్లు, మొక్కజొన్న 11.9 లక్షల క్వింటాళ్లు, పప్పుధాన్యాలు (కంది, పెసర, మినుము) సహా ప్రధాన పంటలన్నింటిలోనూ మిగులు ఉంది.
· మొక్కజొన్న విత్తనాలను ఆరబెట్టేందుకు ఎల్పీజీ/పీఎన్జీలకు ప్రాధాన్య కేటాయింపు సహా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర ఇంధన సరఫరాకు భరోసా ఉంటుంది.
· ఖరీఫ్ సాగుకు మాత్రమే కాకుండా రబీ (2026) పంటల సాగుకూ అవసరమైన విత్తన నిల్వలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
ఎరువులు
· రాష్ట్రాలతో సంప్రదించిన మీదట ఖరీఫ్ ఎరువుల అవసరాన్ని 390.54 లక్షల టన్నులుగా అంచనా వేశారు. ఇందులో ప్రారంభ నిల్వ కింద 180 లక్షల టన్నులు (46 శాతం) సిద్ధంగా ఉన్నాయి. సాధారణంగా ఈ సీజన్కు ముందుండే సుమారు 33 శాతం కన్నా గణనీయంగా అధికం. మరోవైపు లభ్యతను మరింత పెంచేందుకు చర్యల ద్వారా వ్యవసాయ ఉత్పాదకాలు, రసాయనాలు, ఎరువులకు ఏ దశలోనూ కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
· ఎరువుల వివేచనాత్మక వినియోగం, చివరి అంచెలో సత్వర, సకాల సరఫరా దిశగా 30.03.2026న వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ, ఎరువుల శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు.
· ఎరువుల అక్రమ నిల్వ, నల్ల బజారు. సరిహద్దుల గుండా అక్రమ రవాణా లేదా వ్యవసాయేతర అవసరాలకు మళ్లింపు వగైరాల నిరోధానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.
· దేశవ్యాప్తంగా నిరుడు పంచాయతీ, సబ్-డివిజన్, ల్లా స్థాయులలో ‘ధర్తీ మాతా బచావో ఆందోళన్ సమితుల’ ఏర్పాటు కార్యక్రమం ప్రారంభించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వ్యవసాయ ఉత్పాదకాలపై పర్యవేక్షణతో పాటు సమాన పంపిణీ దిశగా ఈ స్థానిక కమిటీలను ఏర్పరచాలని రాష్ట్రాలకు కేంద్రం మరోసారి సూచించింది.
· మరోవైపు మధ్యప్రదేశ్, హర్యానా, తెలంగాణ వంటి రాష్ట్రాలు చేపట్టిన వినూత్న పద్ధతులను కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పంచుకుంటూ ఎరువుల పంపిణీ సౌలభ్యానికి మార్గం సుగమం చేసింది.
వ్యవసాయ రసాయనాలు
· వ్యవసాయ రసాయనాలలో మూడు రకాలు- కీటక నాశినులు, కలుపుమందులు, శిలీంధ్రనాశకాలు వంటి వ్యవసాయ రసాయనాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలలో భారత్ కూడా ఒకటి. కాబట్టి, ఈ నిల్వలన్నీ రైతులకు అవసరమైన పరిమాణంలో ఉన్నాయి.
· ఈ ఏడాది (2025-26) ఫిబ్రవరి వరకూ వ్యవసాయ రసాయనాల మొత్తం ఉత్పత్తి 2,61,099 టన్నులు కాగా, అంచనా డిమాండ్ 74,266 టన్నులు. ఇందులో సుమారు 42,000 టన్నుల మేర ఖరీఫ్ (2026) సాగుకు అవసరమవుతాయి.
· ప్రతి వారంతపు పర్యవేక్షణ సహా పరిశ్రమలు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతర సంప్రదింపులు కొనసాగుతున్నాయి.
· బహుళ భాగస్వామ్య సమన్వయ విధానం ద్వారా నకిలీ, కల్తీ పురుగుమందులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
· రాష్ట్రాల సహకారంతో సమీకృత తెగుళ్ల నిర్వహణ (ఐపీఎం)పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
· రైతులలో అవగాహన, నిఘా, తెగుళ్ల పర్యవేక్షణ సహా కచ్చితమైన సలహాల సౌలభ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా బయో పెస్టిసైడ్స్ వాడకం, సుస్థిర విధానాలను ప్రోత్సహిస్తున్నారు.
వ్యవసాయోత్పత్తుల ధరల పరిస్థితి
· వ్యవసాయోత్పత్తుల ధరలు చాలావరకూ స్థిరంగా ఉండటంతోపాటు వాటిపై నిశిత పర్యవేక్షణ కొనసాగుతోంది.
· టమాటా, ఉల్లి, బంగాళాదుంప పంటల ధరలు సాధారణ పరిధిలోనే ఉండటమే కాకుండా స్వల్ప మెరుగుదల కూడా కనిపిస్తోంది.
విద్యుత్ సరఫరా... ఇంధన లభ్యత
పశ్చిమాసియాలో పరిస్థితుల దృష్ట్యా, పెట్రోలియం ఉత్పత్తులు, వంటగ్యాస్ నిరంతరాయ సరఫరా దిశగా చేపట్టిన చర్యలను వివరిస్తూ- ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై అధికారులు వెల్లడించిన తాజా సమాచారం కిందివిధంగా ఉంది:
ముడిచమురు... శుద్ధి కర్మాగారాలు
· తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉండటంతో, అన్ని శుద్ధి కర్మాగారాలు అదనపు సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీంతోపాటు పెట్రోల్, డీజిల్ నిల్వలను దేశం తగుమేర నిర్వహిస్తోంది.
· దేశీయ వినియోగానికి కొరత రాకుండా శుద్ధి కర్మాగారాల్లో దేశీయ వంటగ్యాస్ ఉత్పత్తిని కూడా పెంచారు.
చిల్లర విక్రయ కేంద్రాలు
· దేశవ్యాప్తంగా అన్ని చిల్లర విక్రయ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తున్నాయి.
· పెట్రోల్, డీజిల్ సాధారణ చిల్లర ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
· మధ్యప్రాచ్య సంక్షోభం వల్ల ముడిచమురు ధర అసాధారణంగా పెరిగింది. దీంతో వినియోగదారులను ఆదుకోవడానికి, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించింది.
· దేశీయ లభ్యతకు భరోసా ఇస్తూ డీజిల్పై లీటరుకు రూ. 21.50, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్పై లీటరుకు రూ.29.50 వంతున ఎగుమతి సుంకం విధించింది.
· ఇంధన లభ్యతపై వదంతుల వల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనలతో కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో చిల్లర విక్రయ కేంద్రాల వద్ద అమ్మకాలు అసాధారణంగా పెరిగి, రద్దీ ఏర్పడింది. కానీ, దేశంలోని అన్ని పెట్రోల్ పంపులలో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగుమేర ఉన్నాయి.
· ఈ వాస్తవాల నేపథ్యంలో వదంతులను నమ్మవద్దని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. అలాగే, పత్రికా సమావేశాల ద్వారా వాస్తవ సమాచారాన్ని ప్రజలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది.
సహజ వాయువు
· గృహ వినియోగ పీఎన్జీ, సీఎన్జీ రవాణాకు 100 శాతం సరఫరాతో వినియోగదారులకు ప్రాధాన్యం.
· గ్రిడ్ అనుసంధానిత పారిశ్రామిక-వాణిజ్య వినియోగదారులకు సరఫరా వారి సగటు వినియోగంలో 80 శాతం.
· పీఎన్జీ కనెక్షన్లలో రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీజీడీ సంస్థలకు ప్రభుత్వం సూచించింది.
· ప్రస్తుతం ఉత్పత్తిలోగల యూరియా ప్లాంట్లకు వారి గత 6 నెలల సగటు వినియోగంలో సరఫరా సుమారు 70–75 శాతం వద్ద స్థిరంగా ఉంది. ఈ పరిస్థితిని కొనసాగించడానికి ప్రభుత్వం అదనంగా ‘ఎల్ఎన్జీ’, ‘ఆర్ఎల్ఎన్జీ’ కొనుగోళ్లు చేపట్టింది.
· ఎరువుల ప్లాంట్లు సహా పారిశ్రామిక వినియోగదారులకు, అదనపు అవసరాల గురించి తక్షణం తెలియజేయాలని సూచించింది.
· ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ-వాణిజ్య పీఎన్జీ కనెక్షన్లకు ప్రోత్సాహకాలు అందజేశాయి.
· సీజీడీ విస్తరణకు ఆమోదాలను వేగిరపరచాలని ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖలను ప్రభుత్వం కోరింది.
· పీఎన్జీ విస్తరణ సంస్కరణలతో ముడిపడిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీ అదనంగా 10 శాతం కేటాయించే ప్రతిపాదన చేసింది. తదనుగుణంగా కేటాయింపులకు సిఫారసు చేసింది.
· వీలైనంత వరకూ పాఠశాలలు, హాస్టళ్లు, సామాజిక వంటశాలల వంటి సంస్థలకు పీఎన్జీ కనెక్షన్లలో 5 రోజుల్లోగా ప్రాధాన్యమివ్వాలని ‘సీజీడీ’ సంస్థలను ‘పీఎన్జీఆర్బీ’ ఆదేశించింది.
· రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖ సీజీడీ మౌలిక సదుపాయాల కోసం 3 నెలలపాటు సత్వర ఆమోద చట్రాన్ని అమలు చేస్తోంది.
· పైప్లైన్ విస్తరణ క్రమబద్ధీకరణ సహా చివరి అంచె అనుసంధానం మెరుగుదలకు ప్రభుత్వం సహజ వాయువు-పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ ఉత్తర్వు-2026ను జారీచేసింది.
· రక్షణ నివాస ప్రాంతాల్లో ‘పీఎన్జీ’ మౌలిక సదుపాయాలను వేగిరపరచేందుకు రక్షణ మంత్రిత్వశాఖ ఒక స్వల్పకాలిక విధాన సవరణ జారీ చేసింది.
· ‘డీ-పీఎన్జీ’ కనెక్షన్లను వేగిరపరచాలని ‘పీఎన్జీఆర్బీ’ ఆదేశించింది. అలాగే, నేషనల్ పీఎన్జీ కార్యక్రమం 2.0ను 30.06.2026 వరకు పొడిగించింది.
· మార్చి నెలలో, 3.25 లక్షలకుపైగా కనెక్షన్ల గ్యాసిఫికేషన్ పూర్తికాగా, 2.85 లక్షలకు పైగా కొత్త కనెక్షన్లు ఇచ్చారు. ఈ కనెక్షన్ల కోసం 3.5 లక్షల మంది కొత్త వినియోగదారులు నమోదయ్యారు.
వంటగ్యాస్ (ఎల్పీజీ)
· ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల వల్ల వంటగ్యాస్ సరఫరాకు అంతరాయం కొనసాగుతోంది.
· గృహ వినియోగదారులకు ఎల్పీజీ ధరలో ఎలాంటి పెరుగుదల లేదు.
· వంటగ్యాస్ పంపిణీ కేంద్రాలలో నిల్వలు లేవనే సమాచారం ఏదీ లేదు.
· ఆన్లైన్ వంటగ్యాస్ బుకింగ్ 92 శాతానికి పెరిగింది.
· సరఫరా నిర్ధారణ కోడ్ (డీఏసీ) ఆధారిత డెలివరీ 53 నుంచి 81 శాతానికి పెరిగింది.
· నిన్న 60 లక్షలకు పైగా గృహ వంటగ్యాస్ సిలిండర్లు పంపిణీ అయ్యాయి.
· వాణిజ్య వంటగ్యాస్ సరఫరాను సంక్షోభానికి ముందు స్థాయిలో 70 శాతం మేర పెంచారు. రెస్టారెంట్లు, హోటళ్లు, పరిశ్రమలు, సామాజిక వంటశాలలకు అదనపు కేటాయింపులలో ప్రాధాన్యం ఇస్తున్నారు.
· ఈ నెల 23 నుంచి 3.9 లక్షలకు పైగా 5 కిలోల ‘ఎఫ్టీఎల్’ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
· నిన్న ఒక్క రోజునే 65,000కు పైగా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లను విక్రయించారు.
· ఈ నెల 14 నుంచి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుమారు 55,622 టన్నుల వంటగ్యాస్ సరఫరా అయింది.
కిరోసిన్
· అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్ను కేటాయించింది.
· పీడీఎస్ ఎస్కేఓ లేని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్దేశిత పీఎస్యూ ఓఎంసీ విక్రయ కేంద్రాల ద్వారా పంపిణీకి వెసులుబాటు కల్పించింది.
· దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్కేఓ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయగా, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్లలో దీని అవసరం లేదని ప్రభుత్వం సూచించింది.
రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతాల పాత్ర
నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వులు-2000 ప్రకారం అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉంది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఇలా అభ్యర్థించారు:
రోజువారీ పత్రికా సమావేశాలు నిర్వహిస్తూ, ప్రజలకు అవసరమైన సూచనలు జారీ చేయాలి
కంట్రోల్ రూమ్లు, హెల్ప్లైన్లను ఏర్పాటు చేయాలి
తప్పుడు సమాచారంపై నిఘా ఉంచి, దానిని ఎదుర్కోవాలి
ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లు, తనిఖీలను ఉధృతం చేయాలి
ఎల్పీజీ, ఎస్కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాలి
సీజీడీ విస్తరణను వేగవంతం చేయాలి
పీఎన్జీ, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించాలి
సమన్వయం కోసం నోడల్ అధికారులను నియమించాలి
ప్రస్తుతం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
ఎన్ఫోర్స్మెంట్ చర్యలు
అక్రమంగా నిల్వ చేయడాన్ని, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడం లక్ష్యంగా 2,800లకు పైగా సోదాలు నిర్వహించి, సుమారు 500 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు, రిటైల్ అవుట్లెట్లు, ఎల్పీజీ పంపిణీ కేంద్రాల్లో 1100లకు పైగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఎల్పీజీ పంపిణీ కేంద్రాలకు 560కి పైగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ప్రభుత్వం చేపడుతున్న చర్యలు
ఈ యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం గృహావసర ఎల్పీజీ, పీఎన్జీ సరఫరాకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూనే... ఆసుపత్రులు, విద్యా సంస్థలకూ ప్రాధాన్యం కొనసాగిస్తోంది.
సరఫరా, డిమాండ్ రెండు వైపులా ప్రభుత్వం ఇప్పటికే అనేక హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. వీటిలో రిఫైనరీ ఉత్పత్తిని పెంచడం, పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు... గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పెంచడం, సరఫరా విషయంలో నిర్దిష్ట రంగాలకు ప్రాధాన్యమివ్వడం వంటి చర్యలు ఉన్నాయి.
ఎల్పీజీ డిమాండ్పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు అందుబాటులో ఉంచుతున్నారు.
చిన్న, మధ్య తరహా, ఇతర వినియోగదారులకు బొగ్గును పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు అధిక పరిమాణంలో బొగ్గును కేటాయించాలని కోల్ ఇండియాతో పాటు సింగరేణి బొగ్గు గనులకూ బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
గృహ, వాణిజ్య వినియోగదారులకూ కొత్త పీఎన్జీ కనెక్షన్లను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
ప్రజలకు సూచనలు
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ బుకింగ్ల విషయంలో ఆందోళనతో కూడిన కొనుగోళ్లకు దూరంగా ఉండాలి.
వదంతుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, సరైన సమాచారం కోసం అధికారిక వనరులపైనే ఆధారపడాలి.
ఎల్పీజీ కోసం పౌరులను ఈ విధంగా అభ్యర్థిస్తున్నారు -
బుకింగ్ల కోసం డిజిటల్ విధానాన్ని ఉపయోగించాలి
ఎల్పీజీ పంపిణీదారులను సందర్శించడం మానుకోవాలి
పీఎన్జీ, ఇండక్షన్-విద్యుత్ కుక్టాప్ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాలని పౌరులను అభ్యర్థిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పౌరులంతా తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయడానికి అవసరమైన కృషి చేయాలని కోరడమైనది.
విమాన టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్) ధరల నిర్ణయం
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏటీఎఫ్ ధరలకు సంబంధించి తాజా సమాచారాన్ని పంచుకుంది. కింది విషయాలను తెలియజేసింది:
దేశీయ మార్గాల్లో నడిచే షెడ్యూల్డ్ విమానాల కోసం విమానయాన సంస్థలకు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్) ధరల్లో పరిమిత 25 శాతం పెంపును అమలు చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయాన్ని భారతీయ విమానయాన పరిశ్రమ స్వాగతించింది.
పశ్చిమాసియాలోని అనిశ్చితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో ఈ చర్య కీలక ఉపశమనాన్ని అందిస్తుంది.
భారతీయ విమానయాన సంస్థల దేశీయ నిర్వహణ వ్యయాలు అదుపులోనే ఉండేలా ఈ చర్య నిర్ధారిస్తుంది.
భారతీయ విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో ఇంధనం వాటా సాధారణంగా దాదాపు 40 శాతం ఉంటుంది. ఈ క్రమబద్ధమైన పెంపు... పరిశ్రమ వ్యాప్తంగా సంభవించే అవకాశమున్న ఇబ్బందులను నివారించడంలో సహాయపడుతుంది.
ఏటీఎఫ్ ధరపై 25 శాతం పరిమిత పెంపు... విమానయాన సంస్థలు దేశీయ ప్రయాణికులకు సరసమైన ధరలను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా మార్కెట్-అనుసంధాన ధరల విధానంలో అవసరమయ్యే అదనపు ఇంధన సర్ఛార్జీల అవసరాన్నీ నివారిస్తుంది.
సవాలుతో కూడిన ప్రపంచ వాతావరణంలో సుస్థిర కార్యాచరణ, ఆర్థిక సుస్థిరతను కాపాడుకోవడానికి, ప్రయాణికుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, విమానయాన రంగ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఇటువంటి క్రమబద్ధమైన చర్యలు అత్యవసరమని భారతీయ విమానయాన సంస్థలు తెలియజేశాయి.
ప్రతిరోజూ 4.5 లక్షల మందికి పైగా ప్రయాణికులు దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణం చేస్తుంటారు. ఈ ఉదయం చేసిన ప్రకటన ఈ ప్రయాణికులందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది.
విమాన ప్రయాణం అందుబాటులో ఉండేలా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యత. సరుకు రవాణా సజావుగా సాగేలా చూడటం ద్వారా... వాణిజ్యం, లాజిస్టిక్స్ కోసం కీలకమైన విమాన అనుసంధానాన్ని కొనసాగించడం ద్వారా... ఈ చర్య ఆర్థిక వ్యవస్థ పురోగతికీ తోడ్పడుతుంది.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్లో ప్రస్తుత నౌకా వాణిజ్య పరిస్థితులకు సంబంధించిన తాజా సమాచారం పంచుకున్నారు. ఈ ప్రాంతంలో భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతను, రక్షణను నిర్ధారించేందుకు తీసుకుంటున్న చర్యలను ఇందులో వివరించారు. ఈ సందర్భంగా కింది విషయాలను తెలియజేశారు:
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, నౌకా వాణిజ్య రంగ భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ... పశ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది.
ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా కలిగిన నౌకలకు సంబంధించి ఎటువంటి ఘటనలూ నమోదు కాలేదు. ఇటీవలి కాలంలో ఎటువంటి ఘటనలూ చేటుచేసుకోనందున పరిస్థితి స్థిరంగా కొనసాగుతోంది.
మొత్తం 485 మంది భారతీయ నావికులతో కూడిన, భారత జెండా కలిగిన 18 నౌకలు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే కొనసాగుతున్నాయి. నౌకల యజమానులు, ఆర్పీఎస్ఎల్ ఏజెన్సీలు, భారతీయ దౌత్య కార్యాలయాలతో షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24 గంటలూ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4769 ఫోన్ కాల్లు, 9599కి పైగా ఈమెయిళ్లను స్వీకరించి, పరిష్కరించింది. గత 24 గంటల్లో వచ్చిన 70 కాల్లు, 245 ఈమెయిళ్లు... గత 48 గంటల్లో వచ్చిన 214 కాల్లు, 535 ఈమెయిళ్లూ ఇందులో భాగంగా ఉన్నాయి.
ఇప్పటివరకు ఈ ప్రాంతం నుంచి 964 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించడాన్ని డీజీ షిప్పింగ్ సులభతరం చేసింది. గత 24 గంటల్లో తరలించిన ఐదుగురు వీరిలో ఉన్నారు.
గత 24 గంటల్లో ఎటువంటి రద్దీ నమోదు కాకపోవడంతో దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగా, స్థిరంగా కొనసాగుతున్నాయి. కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళం, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్ర మారిటైమ్ బోర్డులు ధ్రువీకరించాయి.
సముద్రయాన సిబ్బంది భద్రత, సంక్షేమం, నిరంతరాయ నౌకా వాణిజ్య కార్యకలాపాలను నిర్ధారించడం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత మిషన్లు, నౌకా వాణిజ్య సంబంధిత భాగస్వాములతో మంత్రిత్వ శాఖ సన్నిహిత సమన్వయాన్ని కొనసాగిస్తోంది.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
ఈ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, భారతీయ దౌత్య కార్యాలయాల ద్వారా కొనసాగుతున్న సహాయక చర్యలకు సంబంధించిన వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా కింది విషయాలను తెలియజేసింది:
పోర్చుగల్ విదేశాంగ మంత్రి గౌరవ పౌలో రాంగెల్తో భారత విదేశాంగ మంత్రి మాట్లాడారు. ఇరువురూ పశ్చిమాసియా వివాదంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపైనా వారు చర్చించారు.
టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం 818 మంది విద్యార్థులు సహా మొత్తం 1,171 మంది భారతీయ పౌరులు ఇరాన్ నుంచి భూ సరిహద్దుల ద్వారా అర్మేనియా, అజర్బైజాన్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. వీరిలో 977 మంది అర్మేనియాలోకి, 194 మంది అజర్బైజాన్లోకి ప్రవేశించారు. ఇరాన్ నుంచి భారతీయ పౌరుల సురక్షిత ప్రయాణానికి సహకరించినందుకు అర్మేనియా, అజర్బైజాన్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసింది.
గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను విదేశాంగ మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది. భారతీయ పౌరుల భద్రత, రక్షణ, సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం కొనసాగుతోంది.
భారతీయ పౌరులకు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ నిరంతరం పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో నిరంతర సమన్వయం కొనసాగుతోంది.
ఈ ప్రాంతంలోని భారతీయ మిషన్లు, పోస్టులు 24 గంటల హెల్ప్లైన్లతో నిరంతరం పనిచేస్తూ... ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తూ... భారతీయ కమ్యూనిటీ సంఘాలు, సంస్థలు, భారతీయ కంపెనీలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ... స్థానిక ప్రభుత్వాలతోనూ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయి.
వీసా సౌకర్యం, కాన్సులర్ సేవలు, గగనతల ఆంక్షల మధ్య పొరుగు దేశాల గుండా రవాణాను సులభతరం చేయడం, అవసరమైన చోట లాజిస్టికల్ మద్దతును అందించడం సహా... భారత పౌరుల సమస్యలు, ఆందోళనలను పరిష్కరించుటను మిషన్లు చురుగ్గా కొనసాగిస్తున్నాయి.
గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. వారి విద్యా సంవత్సరంపై ఎటువంటి ప్రభావం పడకుండా ఉండేందుకు కృషి చేస్తోంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, కేరళం బోర్డులు నిర్వహించే పరీక్షలతో పాటు జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. స్థానిక అధికారులు, భారతీయ పాఠశాలలు, సంబంధిత బోర్డులు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సమన్వయం చేసుకుంటూ మన రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి.
ఈ ప్రాంతం నుంచి భారత్లోని పలు గమ్యస్థానాలకు అదనపు విమానాలు నడుస్తుండటంతో, మొత్తం విమాన ప్రయాణ పరిస్థితి మెరుగుపడుతూనే ఉంది. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతం నుంచి సుమారు 5,98,000 మంది ప్రయాణికులు భారత్కు తిరిగి వచ్చారు.
యూఏఈలో విమానయాన సంస్థలు కార్యాచరణ, భద్రతాపరమైన అంశాల ఆధారంగా పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని విమాన సర్వీసులను కొనసాగిస్తున్నాయి. వీటిలో భాగంగా సుమారు 90 విమానాలు భారత్కు నడుస్తాయని అంచనా.
సౌదీ అరేబియా, ఒమన్లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్లోని పలు గమ్యస్థానాలకు విమానాలు నడుస్తున్నాయి.
ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో, ఖతార్ ఎయిర్వేస్ ఈ రోజు సుమారు 8 నుంచి 10 విమానాలను భారత్కు నడుపుతుందని భావిస్తున్నారు.
కువైట్, బహ్రెయిన్ గగనతలాలు మూసి ఉన్నాయి. కువైట్కు చెందిన జజీరా ఎయిర్వేస్, బహ్రెయిన్కు చెందిన గల్ఫ్ ఎయిర్, సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి భారత్లోని పలు గమ్యస్థానాలకు షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి.
విమాన ప్రయాణ ఆంక్షలు, గగనతలాల మూసివేత కారణంగా... భారత పౌరులు కింది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించేందుకు సౌకర్యం కల్పిస్తున్నారు:
ఇరాన్ నుంచి అర్మేనియా, అజర్బైజాన్ మీదుగా భారత్కు.
ఇజ్రాయెల్ నుంచి ఈజిప్ట్, జోర్డాన్ మీదుగా భారత్కు.
ఇరాక్ నుంచి జోర్డాన్, సౌదీ అరేబియా మీదుగా భారత్కు.
కువైట్, బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియా మీదుగా భారత్కు.
దుబాయ్లో జరిగిన దాడుల్లో ముగ్గురు భారత జాతీయులు స్వల్పంగా గాయపడ్డారు. వారు స్థానిక ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందుతుండగా, ఒకరిని డిశ్చార్జ్ చేశారు. గాయపడిన వ్యక్తులతో, వారి కుటుంబాలతో కాన్సులేట్ నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, వారికి అన్ని విధాలా సహాయం అందిస్తోంది.
మార్చి 11న ఇరాక్ తీరానికి దూరంగా, 'ఎమ్టీ సేఫ్సీ విష్ణు' నౌకపై దాడి జరిగిన దుర్ఘటనలో ఒక భారతీయ పౌరుడు మరణించారు. మార్చి 29న కువైట్లో జరిగిన మరొక దాడిలో దురదృష్టవశాత్తూ ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన ఈ ఇద్దరు భారతీయ పౌరుల భౌతిక కాయాలు ఈ రోజు ఉదయమే భారత్ చేరుకున్నాయి. మంత్రిత్వ శాఖ వారి కుటుంబాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఈ విషాద సమయంలో వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
***
(రిలీజ్ ఐడి: 2248101)
సందర్శకుల సూచీ సంఖ్య : : 29
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam