పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
భారత్లో ఇంధన సరఫరా భద్రమే: ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించిన ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
26 MAR 2026 2:15PM by PIB Hyderabad
భారతదేశంలో పెట్రోలియం, ఎల్పీజీ సరఫరా పూర్తి సురక్షితంగా, నియంత్రణలోనే ఉందని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని రీటెయిల్ ఇంధన అవుట్లెట్లలోనూ సరిపడినన్ని నిల్వలు ఉన్నాయి. దేశంలో ఎక్కడా పెట్రోలు, డీజిలు, ఎల్పీజీకి కొరత లేదు. తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వకంగా చేపడుతున్న దుష్ప్రచారాన్ని నమ్మి ఆందోళనకు గురి కావద్దని ప్రజలకు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
పెట్రోలు, డీజిలు: కొరత లేదు, పరిమితులు విధించలేదు
1. ఇంధన భద్రతలో భారత్ బలమైన స్థానంలోనే ఉంది. పెట్రోలియం ఉత్పత్తులను శుద్ధి చేసే దేశాల్లో నాలుగో స్థానంలోనూ, ఎగుమతుల్లో అయిదో స్థానంలోనూ భారత్ ఉంది. 150కి పైగా దేశాలకు శుద్ధి చేసిన ఇంధనాన్ని సరఫరా చేస్తోంది. ప్రపంచానికి భారత్ నికర ఎగుమతిదారుగా ఉన్నందు వల్ల దేశీయంగా పెట్రోలు, డీజిలు లభ్యతకు నిర్మాణాత్మక భరోసా ఉంది. దేశవ్యాప్తంగా లక్షకి పైగా ఉన్న రీటెయిల్ ఇంధన కేంద్రాలు తెరిచే ఉన్నాయి. వాటి ద్వారా ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా కొనసాగుతోంది. రేషన్ విధానంలో సరఫరా చేయాలని ఏ కేంద్రానికీ చెప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదల, రేషన్ విధానంలో పంపిణీ, సరి-బేసి వాహన నియంత్రణలు, స్టేషన్లను నిర్బంధంగా మూసివేయడం లాంటి సమస్యలను అనేక దేశాలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని దేశాలు ‘జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి’ని విధించాయి. ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం భారత్కు ఏ మాత్రమూ లేదు. ఇతర దేశాలు ఇంధన సరఫరాలో పరిమితులను విధించే పరిస్థితి ఉంటే.. భారత్లో మాత్రం ఇంధన కొరత లేదు. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలతో ఉద్దేశపూర్వకంగా అసత్యాలను ప్రచారం చేయడం వల్ల ఆందోళనతో కొన్ని పంపు స్టేషన్లలో కొనుగోళ్లు జరిగాయి. పంపుల వద్ద డిమాండ్ ఒక్కసారిగా పెరిగినప్పటికీ.. వినియోగదారులందరికీ ఇంధన పంపిణీ జరిగింది. సరఫరాను కొనసాగించడానికి ఇంధన సంస్థల డిపోలు రేయింబవళ్లూ పనిచేస్తున్నాయి. పంపు యజమానులకు ఎదురవుతున్న మూలధన ఇబ్బందుల కారణంగా వారికిచ్చే క్రెడిట్ గడువును చమురు సంస్థలు మూడు రోజులకు పెంచేలా చర్యలు చేపట్టాం. గతంలో దీనికి ఒక రోజు మాత్రమే గడువు ఉండేది.
ముడిచమురు సరఫరా: భర్తీ అయిన లోటు
2. హార్మూజ్ జలసంధి దగ్గర క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ, గతంలో ఈ మార్గం నుంచి దిగుమతి చేసుకున్న దాని కంటే ఎక్కువ చమురును ప్రస్తుతం భారతదేశం దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు 41కి పైగా దేశాల నుంచి ముడి చమురు దేశానికి చేరుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముఖ్యంగా పశ్చిమార్థ గోళంలో అధిక ముడి చమురు అందుబాటులో ఉంది. ఇది మనకు ఏర్పడిన లోటు కంటే అధికంగానే సరఫరా చేసింది. దేశంలో ఉన్న ప్రతి చమురు శుద్ధి కర్మాగారం 100 శాతం కంటే ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తోంది. వచ్చే 60 రోజులకు అవసరమైన ముడి చమురు కేటాయింపులకు సంబంధించిన ఒప్పందాలను భారతీయ చమురు సంస్థలు ఖరారు చేసుకున్నాయి. ఎక్కడా సరఫరా లోపం లేదు.
వ్యూహాత్మక నిల్వలు: సమగ్ర సమచారం
3. కొన్ని కథనాలు, సామాజిక మాధ్యమ వీడియోల ద్వారా దేశంలో కేవలం 6 రోజులకు మాత్రమే సరిపడ నిల్వలు ఉన్నాయని అసత్య సమాచారం ప్రచారమవుతోంది. భారత్ వద్ద మొత్తం 74 రోజులకు సరిపడా ఇంధన నిల్వ సామర్థ్యం ఉంది. మధ్యప్రాచ్యంలో సంక్షోభం ప్రారంభమై 27 రోజులు గడిచినప్పటికీ భారత్ వద్ద ప్రస్తుతం 60 రోజులకు సరిపడే నిల్వలు (ముడి చమురు నిల్వలు, ఉత్పత్తుల నిల్వలు, గనుల్లో ఉన్న వ్యూహాత్మక నిల్వలతో సహా) ఉన్నాయి. అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వచ్చే రెండు నెలల పాటు ప్రతి భారతీయునికి స్థిరమైన సరఫరా అందుబాటులో ఉంటుంది. వచ్చే రెండు నెలలకు అవసరమైన ముడిచమురు సైతం సమకూరింది. వచ్చే కొన్ని నెలల పాటు ఇంధన సరఫరా విషయంలో భారత్ పూర్తిగా సురక్షితమైన స్థానంలోనే ఉంది. సరఫరాలో అవాంతరాలు తలెత్తితే వ్యూహాత్మక గనుల నిల్వలు ద్వితీయ ప్రాధాన్యంగా మారతాయి. కాబట్టి భారత్లో నిల్వలు తరిగిపోయాయని, సరిపడినంత లేవని చెప్పే వార్తలేవైనా సరే వాటిని నిరాధారమైనవిగా పరిగణించాలి.
ఎల్పీజీ: పెరిగిన ఉత్పత్తి, తగ్గిన దిగుమతి అవసరం... కార్గోలు సురక్షితం
4. దేశంలో ఎల్పీజీకి కొరత లేదు. మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వులతో దేశీయ రిఫైనరీ ఉత్పత్తి 40 శాతం మేర పెరిగింది. మన రోజువారీ అవసరం 80 టీఎంటీలు కాగా, దేశంలో రోజువారీ ఎల్పీజీ ఉత్పత్తి 50 టీఎంటీలకు (మన అవసరాల్లో 60 శాతానికి పైగా) చేరుకుంది. దీంతో రోజువారీ నికర దిగుమతి అవసరాలు 30 టీఎంటీలకు తగ్గాయి. అంటే దిగుమతుల కంటే భారత్ ఎక్కువ ఉత్పత్తి చేస్తోందని అర్థం. దేశీయ ఉత్పత్తికి అదనంగా అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, ఇతర దేశాల నుంచి 800 టీఎంటీలకు భరోసానిచ్చేలా ఎల్పీజీ కార్గోలు భారత్లోని 22 ఎల్పీజీ దిగుమతి టెర్మినళ్లకు చేరుకుంటున్నాయి. 2014లో ఈ టెర్మినళ్ల సంఖ్య 11 గా ఉండేది. సుమారుగా ఒక నెలకు సరిపడేంత ఇంధనం సరఫరాకు సిద్ధంగా ఉంది. అదనపు నిల్వల సేకరణ ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి రోజూ 50 లక్షలకు పైగా సిలిండర్లను చమురు సంస్థలు పంపిణీ చేస్తున్నాయి. వినియోగదారులు ఆందోళనతో చేసిన ఆర్డర్ల కారణంగా ఈ డిమాండు 89 లక్షలకు చేరుకుంది. తిరిగి ఇది 50 లక్షల సిలిండర్లకు తగ్గింది. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ అమ్మకాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపుల అనంతరం వాణిజ్య సిలిండర్ కేటాయింపును 50 శాతానికి పెంచాం.
పీఎన్జీకి ప్రోత్సాహం: ఇది సంక్షోభానికి ప్రతిస్పందన కాదు.. ఇప్పటికే అమల్లో ఉన్న మార్పు
5. రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి సహకారంతో పైపుల ద్వారా సహజవాయువు సరఫరాను ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే ఇది చవకైనది, శుద్ధమైనది, భారతీయ గృహాలకు సురక్షితమైనది. భారతదేశానికి రోజువారీగా అవసరమయ్యే మొత్తం 191 ఎంఎంఎస్సీఎండీల సహజ వాయువులో ఇప్పటికే 92 ఎంఎంఎస్సీఎండీల సహజ వాయువును దేశీయంగా ఉత్పత్తి చేస్తోంది. దీనివల్ల ఎల్పీజీతో పోలిస్తే గ్యాసు దిగుమతులపై భారత్ తక్కువ ఆధారపడి ఉంది. 2014లో నగర గ్యాస్ పంపిణీ 57 భౌగోళిక ప్రాంతాలకు పరిమితమై ఉండగా ప్రస్తుతం అది 300 ప్రాంతాలకు విస్తరించింది. గృహావసరాల కోసం పీఎన్జీ కనెక్షన్లు 25 లక్షల నుంచి 1.5 కోట్లకు పైగా పెరిగాయి. ప్రస్తుత పరిస్థితులు తలెత్తడానికంటే ముందే ఈ మార్పు మొదలైంది. ఇది భారత్ అనుసరిస్తున్న దీర్ఘకాలిక ఇంధన వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది. ఎల్పీజీ కొరత వల్లే పీఎన్జీని ప్రోత్సహిస్తున్నామని ప్రచారమవుతున్న సమాచారం అబద్ధం. ఎల్పీజీ సరఫరాకి ఎలాంటి ఢోకా లేదు. భారతీయ గృహాలకు మెరుగైన, అందుబాటు ధరల్లో లభించే, సౌకర్యవంతమైన ఇంధనం పీఎన్జీ.
ప్రభుత్వ హెచ్చరిక: అసత్య సమాచారంపై చర్యలు
6. సామాజిక మాధ్యమాల్లో తప్పుదారి పట్టించే వీడియోలను పోస్టుల రూపంలో ప్రచారం చేయడాన్ని మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇంధన కొరత ఉందనే భావనను కలిగించేందుకు ఎంపిక చేసిన క్యూల చిత్రాలను, ఇతర దేశాల్లో రేషన్ ఇస్తున్న అంతర్జాతీయ వార్తల దృశ్యాలను వాడుతున్నారని గమనించింది. భారత్లో లాక్ డౌన్లు, ఇంధన నియంత్రణలను విధిస్తున్నారని పూర్తిగా బూటకపు వాదనలను ప్రచారం చేస్తున్నారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
7. సహజ వాయు నియంత్రణ, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వులతో సహా ప్రభుత్వ ఉత్తర్వులను సంక్షోభాన్ని సూచించే అత్యవసర ప్రకటనలుగా చిత్రీకరిస్తూ కొన్ని పోస్టులు దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి ఇవి ముందు జాగ్రత్తగా, సరఫరా ప్రాధాన్యాలను క్రమబద్ధీకరించేందుకు జారీ చేసిన సాధారణ పరిపాలనా ఉత్తర్వులు.
8. దుండగులు ప్రచారం చేస్తున్న ఈ అసత్య సమాచారం ప్రజల్లో అనవసరమైన ఆందోళనలకు కారణమవుతోంది. ఇంధనం, గ్యాస్ లభ్యతకు సంబందించిన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ సమాచార వ్యవస్థలపైనే ఆధారపడాలని పౌరులకు మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. నిత్యావసర వస్తువులకు సంబంధించిన బూటకపు సమాచారాన్ని ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. కావాలనే ఆందోళనలకు కారణమయ్యే వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఏ మాత్రం వెనకాడదు.
***
(రిలీజ్ ఐడి: 2245745)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6