ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిబ్రవరి 28న రాజస్థాన్లో పర్యటించనున్న ప్రధానమంత్రి
గర్భాశయ ముఖద్వార కేన్సర్ నివారణకు ఉద్దేశించిన హెచ్పీవీ టీకామందును దేశవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు ఇప్పించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని
రూ.16,680 కోట్లకు పైగా ఖర్చుతో అమలు చేసే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు అజ్మేర్లో శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధానమంత్రి
ఈ ప్రాజెక్టులు పట్టణాభివృద్ధి, తాగునీటి సరఫరా, రోడ్లు, సాగునీరు, ఇంధనం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు సహా కీలక రంగాలకు చెందినవి
రాజస్థాన్లో ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో కొత్తగా నియామకం జరిగిన 21,800 మందికి పైగా యువతీయువకులకు నియామక పత్రాలను పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
27 FEB 2026 3:35PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 28న రాజస్థాన్ లోని అజ్మేర్లో పర్యటిస్తారు. రూ.16,680 కోట్లకు పైగా ఖర్చుతో అమలు చేసే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఉదయం సుమారు 11:30 గంటల వేళలో ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా ఒక జనసభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులు పట్టణాభివృద్ధి, తాగునీటి సరఫరా, రోడ్లు, సాగునీరు, ఇంధనం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు సహా కీలక రంగాలకు చెందినవి.
నివారణపై ప్రధానంగా దృష్టి సారించే, ఆరోగ్య సంరక్షణను పటిష్ఠపరిచే, మహిళల సంక్షేమాన్ని ప్రోత్సహించే లక్ష్యాలతో 14 ఏళ్ల వయస్సు బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) టీకా మందును ఇప్పించడానికి ఉద్దేశించిన జాతీయ ప్రచార ఉద్యమాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గర్భాశయ ద్వార కేన్సరును అడ్డుకోవడం ఈ కార్యక్రమం ధ్యేయం. ఇది మహిళల్లో కేన్సర్ సంబంధిత రుగ్మత తలెత్తడానికి ప్రధాన కారణాల్లో గర్భాశయ ద్వార కేన్సరు ఒకటిగా ఉంది. దేశవ్యాప్తంగా బాలికలు, మహిళల ఆరోగ్యాన్ని దీర్ఘకాల ప్రాతిపదికన పరిరక్షించడంలో ఈ టీకాను ఇప్పించే కార్యక్రమం ఒక మేలుమలుపును సూచిస్తుంది.
రోడ్డు సంధానానికి భారీ ఊతాన్ని అందిస్తూ, అనేక జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. వాటిలో బాందీకుయీ నుంచి జైపూర్ వరకు 4 దోవల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే, అమృత్సర్-జాంనగర్ ఎకనామిక్ కారిడార్, ఢిల్లీ-వడోదరా ఏక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేకు చెందిన ప్యాకేజ్ 14 సెక్షన్లోని 8 దోవల క్యారేజ్వేతో పాటు ఇతర ప్రాజెక్టులు కలిసి ఉన్నాయి. జోధ్పూర్ సిటీలో 4 లైన్ల ఎలివేటెడ్ రోడ్డుతో పాటు బారాన్ జిల్లాలో మాలబ్మోరీ-మంగరోల్-బారాన్ స్టేట్ హైవే తదితర ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
అందరికీ సురక్షిత, స్వచ్ఛ తాగునీటిని అందించాలన్న ప్రభుత్వ నిబద్దతకు అనుగుణంగా, నోనెరా ప్రధాన తాగునీటి ప్రాజెక్టుకు చెందిన నాలుగు ప్యాకేజీలతో పాటు పర్వాన్ అకావాద్ ప్రధాన తాగునీటి ప్రాజెక్టుకు చెందిన అయిదు ప్యాకేజీలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధానమంత్రి రాజస్థాన్లోని పునరుత్పాదక ఇంధన మండలాల (ఆర్ఈజడ్) నుంచి విద్యుత్తు తరలింపునకు సంబంధించిన ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ను ప్రారంభిస్తారు. ఇవి రాజస్థాన్లో పునరుత్పాదక ఇంధన సంబంధిత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికీ, ఉత్పాదన కేంద్రాల నుంచి నిరంతరాయ సరఫరాకు మార్గాన్ని సుగమం చేయడానికీ తోడ్పడతాయి. 220 కేవీ సామర్థ్యాన్ని కలిగివుండే అయిదు గ్రిడ్ సబ్స్టేషన్లతో పాటు 400 కేవీ సామర్థ్యం కలిగివుండే రెండు గ్రిడ్ సబ్స్టేషన్లు సహా సంబంధిత ట్రాన్స్మిషన్ లైన్లకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు.
ఉపాధి అవకాశాల కల్పన, యువత సాధికారిత కల్పన పట్ల ప్రధానమంత్రి తన నిబద్ధతను మరింత ముందుకు తీసుకుపోతూ, రాజస్థాన్లో వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కొత్తగా నియామక ప్రక్రియ పూర్తి అయిన 21,800 కన్నా ఎక్కువ మంది యువతీ యువకులకు నియామక పత్రాలను అందజేయనున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2233759)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3