రాష్ట్రపతి సచివాలయం
'ప్రాణాలను రక్షిద్దాం, ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం' పేరుతో జాతీయ స్థాయిలో పీడీ హిందుజా ఆస్పత్రి చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన భారత రాష్ట్రపతి
పౌరుల ఆరోగ్యం సామూహిక బాధ్యత.. నిరుపేదలకు సకాలంలో, సరైన వైద్యం అందేలా చూసేందుకు భాగస్వాములంతా కలిసి పనిచేయాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నాడు పోస్టు చేయడమైనది:
24 FEB 2026 6:33PM by PIB Hyderabad
ముంబైలోని లోక్భవన్లో నేడు (ఫిబ్రవరి 24, 2026) పీడీ హిందుజా ఆస్పత్రి చేపట్టిన 'ప్రాణాలను రక్షిద్దాం, ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం' అనే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. పౌరులు ఆరోగ్యంగా ఉండేందుకు, నాణ్యమైన వైద్య సేవలను పొందేందుకు దశాబ్ద కాలంగా భారత ప్రభుత్వం ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టిందన్నారు. దేశవ్యాప్తంగా 1,80,000కి పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఆరోగ్య సేవలను అందిస్తున్నాయని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా దాదాపు 12 కోట్ల కుటుంబాలకు.. ఆస్పతిలో వైద్య ఖర్చుల నిమిత్తం ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా లభిస్తుందని చెప్పారు. మిషన్ ఇంద్రధనుష్, క్షయ రహిత భారత్ ప్రచారం, సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ వంటి జాతీయ కార్యక్రమాలు పౌరులను వ్యాధుల నుంచి రక్షించటంలో దోహదపడుతున్నాయని వెల్లడించారు. ప్రతిభావంతులైన వైద్యులు, పారామెడికల్ నిపుణుల లభ్యతను పెంచటానికి భారత ప్రభుత్వం ఎంబీబీఎస్, పోస్టు గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్యను పెంచింది. అందరికీ నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పలు రాష్ట్రాల్లో కొత్తగా ఎయిమ్స్, మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణంలో ప్రభుత్వంతో పాటు భాగస్వామలందరి పాత్ర కీలకమైనదన్నారు. ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్య సేవలందేలా అందరూ కలిసి పనిచేయాలని, ఇందులో భాగంగా సాగుతున్న ప్రయత్నమే 'ప్రాణాలను రక్షిద్దాం, ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం' అనే ప్రచార కార్యక్రమమని తెలిపారు.

ప్రాణాన్ని కాపాడటమే అన్నిటికన్నా గొప్ప దానమని రాష్ట్రపతి అన్నారు. అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండటం, ప్రాణాలను రక్షించటంలో అత్యంత కీలకమని తెలిపారు. ప్రమాదం జరిగిన మొదటి గంట సమయంలోనే సరైన వైద్యం అందిస్తే ఎన్నో ప్రాణాలను నిలబెట్టవచ్చని భావిస్తారు. తక్షణ వైద్య సాయం అందక ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో ప్రమాద బాధితులకు పీఎం రిలీఫ్ పథకం ద్వారా రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్సను అందిస్తున్నట్లు వెల్లడించారు. తీవ్రమైన ప్రమాదాలు, అత్యవసర వైద్యం అందించాల్సిన సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు అంబులెన్సులు, ట్రామా సెంటర్లతో పాటు ప్రజలు కూడా అవగాహనతో ఉండటం ముఖ్యమని అన్నారు.

ఆరోగ్యవంతులైన పౌరులే దేశానికి బలమైన పునాది అని రాష్ట్రపతి అన్నారు. ప్రజలను వ్యాధుల నుంచి రక్షించటం, సరైన సమయంలో సరైన వైద్య సదుపాయాలను అందించటం వారిని ఆరోగ్యంగా ఉంచటంలో అత్యంత కీలకమని తెలిపారు. దేశ నిర్మాణంలో ఆరోగ్య రంగం అంతర్భాగం.. పౌరుల ఆరోగ్యం అందరి ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. పేదరికంలో ఉన్న అట్టడుగు వ్యక్తికి కూడా సకాలంలో సరైన వైద్యం అందేలా భాగస్వాములంతా కలిసి పని చేయాలన్నారు. 'అందరికీ అందుబాటులో ఉండే ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలు' ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని తెలిపారు.

ఇతర రంగాల్లోలానే ఆరోగ్య సంరక్షణలోనూ సాంకేతికత, ఏఐ కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి తెలిపారు. భవిష్యత్తులో వీటి పాత్ర మరింత పెరగనున్న నేపథ్యంలో మనం సిద్ధంగా ఉండాలని చెప్పారు. నూతన ఆవిష్కరణలకు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా అమలు చేయటానికి అనువైన వ్యవస్థను భారత ప్రభుత్వం నిర్మిస్తుందని వెల్లడించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఏఐ ఆధారిత ఆవిష్కరణలకు ఇండియాఏఐ మిషన్ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఔషధ తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్ ఉందని రాష్ట్రపతి తెలిపారు. మనదేశంలో తయారైన మందులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయన్నారు. అయినా అనేక వైద్య పరికరాలు, కీలకమైన ఔషధాల కోసం మనం ఇప్పటికీ దిగుమతులపైనే ఆధారపడుతున్నామని అన్నారు. ఈ దిగుమతి చేసుకున్న పరికరాలు, మందులు సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని చెప్పారు. మన పౌరులకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాలంటే దేశీయంగా మందులు, పరికరాల తయారీ అత్యంత కీలకమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, పీఎల్ఐ వంటి కార్యక్రమాలు ఈ దిశగా దోహదపడుతున్నాయని చెప్పారు. ఈ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, అంకుర సంస్థలను ప్రోత్సహించటం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వైద్య రంగ నిపుణులను, వ్యాపార వర్గాలను ఆమె కోరారు.

2047 సంవత్సరం నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నామని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రాథమికంగా ఆరోగ్యవంతమైన పౌరులు అవసరమన్నారు. పౌరులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందినప్పుడే వారు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. మన సమష్టి కృషితో పౌరులందరికీ అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ అందుతుందని, తద్వారా ప్రపంచ ఆరోగ్య కేంద్రంగా భారత్కు మరింత గుర్తింపు లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2232463)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6