సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026 సందర్భంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వేదికపై ఏఐ కేంద్రీకృత బృంద చర్చలు, సదస్సులు
ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో- 2026 సందర్భంగా.. వేవ్స్ క్రియేటర్స్ కార్నర్లో ఏఐ ఆవిష్కరణలను ప్రదర్శించనున్న 51 అంకుర సంస్థలు
ఏఐ ఆధారిత సృజన రంగంలో భారత్ సత్తా చాటేలా.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, అడోబ్ భాగస్వామ్యం
మంత్రిత్వ శాఖ పెవిలియన్ వద్ద మేడిన్ ఇండియా లఘుచిత్రాలు, అధునాతన కంటెంట్ సృజన ప్రక్రియల ప్రదర్శన
నాడు పోస్టు చేయడమైనది:
16 FEB 2026 3:40PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన పెవిలియన్ వేదికగా.. మీడియా, వినోద రంగాలపై కృత్రిమ మేధ చూపబోయే విప్లవాత్మక ప్రభావంపై ప్రత్యేక చర్చలు, మాస్టర్క్లాసులు, సాంకేతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఏఐ ఆధారంగా ప్రొడక్షన్ ప్రక్రియను వేగవంతం చేయడం, బహుభాషా స్వర సాంకేతికతలు, గేమింగ్ ఆవిష్కరణలు, బాధ్యతాయుత ఏఐ ఫ్రేమ్వర్క్ వంటి అంశాలు ఇందులో ఉంటాయి. మౌఖిక కృత్రిమ మేధ ఆధారిత మైక్రో డ్రామా కథనం, అడోబ్ భాగస్వామ్యంతో రూపొందించిన కథావతార్ (ఏఐతో రూపుదిద్దిన లఘుచిత్రాలు), చిత్ర నిర్మాణంలో పరిణామాలూ - సాంస్కృతిక ప్రామాణికత వంటి అంశాలను స్పృశిస్తూ.. ఏఐ సాయంతో కథన ప్రక్రియపై శేఖర్ కపూర్ మాస్టర్క్లాస్... ఈ కార్యక్రమంలో ముఖ్య విశేషాలు. ఎల్టీఎం బ్లూవర్స్, ఏడబ్ల్యూఎస్, ఎవర్జెంట్ భాగస్వామ్యంతో గూగుల్, సోనీ రీసెర్చ్ ఇండియా, పర్పుల్ టాక్, డాష్ వర్స్, పాకెట్ ఎఫ్ఎం, కుకు ఎఫ్ఎం, లుమికై వంటి సంస్థల సరికొత్త ఆవిష్కరణలను ఈ సదస్సుల్లో ప్రదర్శించనున్నారు. ఇవి పరస్పర వైజ్ఞానిక భాగస్వామ్యాన్నీ, విధానపరమైన చర్చలనూ ప్రోత్సహించడంతోపాటు.. బాధ్యతాయుత ఏఐ సృజనాత్మక సేవల్లో భారత్ అగ్రగణ్యతను చాటుతాయి.
ఏఐ ఆవిష్కరణలను ప్రదర్శించనున్న 51 అంకుర సంస్థలు
ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో- 2026లో భారత ఏవీసీజీ-ఎక్స్ఆర్, మీడియా సాంకేతిక రంగానికి చెందిన 51 అంకుర సంస్థలు వేవ్స్ క్రియేట్స్ కార్నర్లో ఏఐ ఆధారిత ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి. లీనం చేసే కథనం, గేమింగ్, వర్చువల్ ప్రొడక్షన్, నవతరం కంటెంట్ సాంకేతికతలు ఈ వేదికపై ఉంటాయి. మానవ ప్రమేయం లేకుండా వార్తా విభాగం, వివిధ భాషల్లో డబ్బింగ్ - ఏఐ సంకేత భాషా అవతార్లతో కూడిన భాషా వాల్, అలాగే సంవాద్ సేతు, ది డైరెక్టర్స్ చైర్ వంటి మౌఖిక కార్యక్రమాలు, ఏఐ పాడ్కాస్ట్ స్టూడియో, సంభాషించగల మానవ రూప రోబోలు, వాయిస్ క్లోనింగ్ ఇందులోని ముఖ్యమైన అంశాలు. భాషాసేతు, కళాసేతు పోటీల విజేతలు కూడా తమ ఏఐ ఆధారిత సాధనాలను ప్రదర్శిస్తారు. ఇవి మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంతోపాటు.. భాషా పరమైన అవరోధాలను తొలగించి సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తాయి. తద్వారా సృజనాత్మక సాంకేతిక రంగంలో దేశ శక్తిని చాటుతాయి.
సృజన రంగంలో భారత్ సత్తా చాటేలా.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, అడోబ్ భాగస్వామ్యం
భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026 సందర్భంగా.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పెవిలియన్లోని వేవ్స్ క్రియేటర్స్ కార్నర్లో మంత్రిత్వ శాఖతో కలిసి అడోబ్ సంస్థ వరుసగా కృత్రిమ మేధ ఆధారిత సృజనాత్మక కార్యక్రమాలను ప్రదర్శించబోతోంది.
ఇందులో భాగంగా భారతీయ జానపద కథల స్ఫూర్తితో రూపొందించిన అయిదు ఏఐ లఘు చిత్రాల సమాహారం కథావతార్ను అడోబ్ ప్రదర్శించనుంది. లాంగ్వేజ్ ఆఫ్ బర్డ్స్, మిగోయ్, ఉత్తరాయణ, ది బార్బర్స్ సీక్రెట్, యప్పాసారస్ చిత్రాలను ఈ సదస్సు సమయంలో వేవ్స్ క్రియేటర్స్ కార్నర్లోని ఏఐ థియేటర్లో ప్రదర్శిస్తారు. కథనంలోనూ, సినిమా నిర్మాణంలోనూ కృత్రిమ మేధతో ప్రయోగాలు చేస్తున్న నవతరం భారతీయ దర్శకుల ప్రతిభను ఈ ప్రదర్శన చాటుతుంది.
‘సినిమా భవిత: ఏఐ, సృజనాత్మకత, నైపుణ్యం’ శీర్షికన ఓ ప్రత్యేక సదస్సును కూడా అడోబ్ సంస్థ నిర్వహించనుంది. ఏఐ చిత్ర నిర్మాణ పద్ధతుల్లో అధునాతన ధోరణులు, సృజనాత్మక ప్రక్రియల్లో పరిణామాలపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
అంతేకాకుండా అడోబ్ సహకారంతో నడిచే కంటెంట్ క్రియేషన్ హబ్.. ఆధునిక కంటెంట్ సృజనకారుల కోసం రూపొందించిన ఏఐ-ఆధారిత వీడియో నిర్మాణ పద్ధతులను ప్రదర్శించనుంది. వేగవంతమైన ప్రొడక్షన్, మెరుగైన సృజన, భారీ స్థాయిలో కంటెంట్ రూపకల్పనను సులభతరం చేసే సరికొత్త సాధనాలపై ఇది అవగాహన కల్పిస్తుంది.
ఈ కార్యక్రమాల ద్వారా ఏఐ ఆధారిత సృజనలో పెరుగుతున్న దేశ అగ్రగణ్యతను చాటడంతోపాటు.. మీడియా, వినోద రంగాల్లో ఆవిష్కరణలను బలోపేతం చేయడం అడోబ్, సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ ప్రధాన లక్ష్యం.
***
(రిలీజ్ ఐడి: 2228857)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Tamil
,
Kannada