ప్రధాన మంత్రి కార్యాలయం
మెరుగైన సంబంధాల ద్వారా సుస్థిరత, ఆర్థిక వృద్ధి, భద్రత కోసం భారత్ – సీషెల్స్ ఉమ్మడి దార్శనికత
మెరుగైన సంబంధాల ద్వారా సుస్థిరత, ఆర్థిక వృద్ధి, భద్రత కోసం భారత్ – సీషెల్స్ ఉమ్మడి దార్శనికత
నాడు పోస్టు చేయడమైనది:
09 FEB 2026 3:28PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు 2026 ఫిబ్రవరి 5 నుంచి 10 వరకు సీషెల్స్ దేశాధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మిని భారతదేశంలో పర్యటిస్తున్నారు.
అధ్యక్షుడు హెర్మిని పదవీ బాధ్యతలు చేపట్టిన సుమారు 100 రోజుల తర్వాత జరుగుతున్న ఈ అధికారిక పర్యటన.. భారత్, సీషెల్స్ మధ్య ఉన్న సుదీర్ఘకాల, బహుముఖ ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటం, విస్తరించటం, మరింత దృఢంగా మార్చే విషయంలో ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను తెలియజేస్తోంది. సీషెల్స్ స్వాతంత్య్రం పొంది 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ.. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో ఈ పర్యటన జరగడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.
2026 ఫిబ్రవరి 9న జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు హెర్మిని ద్వైపాక్షిక సంబంధాలలోని అన్ని అంశాలపై సమగ్రంగా ఫలప్రదమైన చర్చలు జరిపారు. 2025 అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ పాట్రిక్ హెర్మినిని ప్రధానమంత్రి మోదీ అభినందించారు. సన్నిహిత సముద్ర పొరుగు దేశాలుగా ఉన్న భారత్, సీషెల్స్.. చరిత్ర, బంధుత్వంతో ముడిపడి ఉన్న ఒక ప్రత్యేకమైన, కాలానుగుణ పరీక్షలు ఎదుర్కొన్న భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని ఇరువురు నాయకులు అన్నారు. ఇది ప్రజాస్వామ్యం, బహుళత్వ విలువల ద్వారా సామర్థ్యాన్ని పొందుతోందని పునరుద్ఘాటించారు. సీషెల్స్ - భారత్ సంబంధాలు ప్రజా-కేంద్రీకృతమైనవని… పశ్చిమ హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని బలపరుస్తాయని నాయకులు అన్నారు. భారతదేశపు 'మహాసాగర్' (అన్ని ప్రాంతాల్లో భద్రత, వృద్ధి కోసం పరస్పర, సమగ్ర పురోగతి) దార్శనికతలో సీషెల్స్కు ఒక కీలక పాత్ర ఉందని ఇద్దరు నాయకులు పునరుద్ఘాటించారు.
భారత్, సీషెల్స్ మధ్య ఉన్న సుసంపన్నమైన, చారిత్రక ప్రజల మధ్య సంబంధాలను గుర్తు చేసిన ఇరువురు నాయకులు.. సీషెల్స్, భారత ప్రజల భద్రత, శ్రేయస్సు, సంక్షేమాన్ని పెంపొందించడానికి జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలపై మరింత సన్నిహితంగా కలిసి పనిచేయవలసిన అవసరాన్ని ప్రధానంగా చెప్పారు.
సీషెల్స్తో పాటు ఈ ప్రాంతానికి భారతదేశం ఒక నమ్మకమైన భాగస్వామి అని అధ్యక్షుడు హెర్మిని స్పష్టం చేశారు. సీషెల్స్ అభివృద్ధి లక్ష్యాలను సాధించటంలో భారత్ సుదీర్ఘకాలంగా అందిస్తున్న సహాయ సహకారాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
రెండు దేశాల బలాబలాలతో పాటు ఈ భాగస్వామ్యానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తున్నట్లు తెలిపిన ఇరువురు నాయకులు.. మెరుగైన సంబంధాల ద్వారా సుస్థిరత, ఆర్థిక వృద్ధి, భద్రత కోసం ఒక ఉమ్మడి దార్శనికతను ప్రకటించారు.
రాజకీయ సంబంధాలు
సీషెల్స్, భారత్ మధ్య క్రమబద్ధమైన ఉన్నత స్థాయి రాజకీయ సమావేశాలు, పర్యటనలు, సంప్రదింపుల ప్రాధాన్యతను ఇద్దరు నాయకులు గుర్తించారు. నాయకత్వ, మంత్రిత్వ, ఉన్నతాధికారుల స్థాయిలో రాజకీయ, సామాజిక-ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయటానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
పార్లమెంటరీ కార్యకలాపాలపై అత్యుత్తమ పద్ధతులను పంచుకోవడం, సామర్థ్య పెంపుతో సహా రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత దృఢంగా మార్చేందుకు, పార్లమెంటరీ సంబంధాలను పెంపొందించేందుకు ఇరువురు నాయకులు అంగీకరించారు.
అభివృద్ధి భాగస్వామ్యం
రుణాలు (లైన్స్ ఆఫ్ క్రెడిట్), గ్రాంట్లు, సామర్థ్య పెంపు, అధిక-ప్రభావ సామాజిక అభివృద్ధి ప్రాజెక్టుల (హెచ్ఐసీడీపీ) ద్వారా సీషెల్స్ అభివృద్ధి, భద్రతా అవసరాలు, ఆకాంక్షలకు భారతదేశం అందిస్తున్న తిరుగులేని మద్దతును అధ్యక్షుడు హెర్మిని గుర్తించారు. సుస్థిరత, రక్షణ, సముద్ర భద్రత, సామర్థ్య పెంపు, దృఢత్వం, సమగ్ర వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. సీషెల్స్ జాతీయ అభివృద్ధి ప్రణాళికలో కీలకమైన, నమ్మకమైన భాగస్వామిగా కొనసాగడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి మోదీ పునరుద్ఘాటించారు.
రెండు దేశాల మధ్య ప్రజా-కేంద్రీకృత అభివృద్ధి భాగస్వామ్యాన్ని పెంచే విషయంలో నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ.. 175 మిలియన్ డాలర్ల 'ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ'ని భారతదేశం ప్రకటించింది. ఇందులో అభివృద్ధి సహకార ప్రాజెక్టులు, పౌర - రక్షణ అధికారులకు సామర్థ్య పెంపు, సముద్ర భద్రత మొదలైన వాటి కోసం రూపాయి ఆధారిత రుణం (లైన్ ఆఫ్ క్రెడిట్) రూపంలో 125 మిలియన్ డాలర్లు, గ్రాంట్ సహాయం రూపంలో 50 మిలియన్ డాలర్ల మిశ్రమ ఆర్థిక సహాయం ఉంటుంది.
భారత్లో వేగంగా జరుగుతోన్న డిజిటలైజేషన్కు గ్లోబల్ సౌత్ దేశాలకు మేలు చేసే సామర్థ్యం ఉందని గుర్తిస్తూ డిజిటల్ పరివర్తన రంగంలో సన్నిహితంగా కలిసి పనిచేయడానికి ఇరువురు నాయకులు అంగీకరించారు. సీషెల్స్ పౌరుల ప్రయోజనం కోసం పరిపాలనను డిజిటలైజ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ.. సీషెల్స్ అవసరాలు, నిబంధనలకు అనుగుణంగా డిజిటల్ చెల్లింపులతో సహా డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాలు (డీపీఐ) నిర్మాణానికి సమగ్రమైన కృషి చేసేందుకు భారత్ అంగీకరించింది.
ఆరోగ్య, నిత్యావసర వస్తువుల రంగాలలో సహకారం
10 అంబులెన్స్లను (ప్రాథమిక లైఫ్ సపోర్ట్, అధునాతన లైఫ్ సపోర్ట్) విరాళంగా అందించినందుకు అధ్యక్షుడు హెర్మిని ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ అంబులెన్స్లు సీషెల్స్లో అత్యవసర ఆరోగ్య సేవలకు తోడ్పాటునందిస్తాయి. ఈ చర్య భారత్-సీషెల్స్ భాగస్వామ్యానికి ఉన్న ప్రజా-కేంద్రీకృత దృక్పథాన్ని ప్రధానంగా తెలియజేస్తోంది.
సీషెల్స్ 'ఇండియన్ ఫార్మాకోపియా'ను (ఐపీ) గుర్తించడం ద్వారా నాణ్యమైన అత్యవసర ఔషధాల సేకరణ సులభతరం అవుతుందని.. భారతదేశపు 'జన్ ఔషధి' కార్యక్రమం కింద సహకారం ద్వారా తక్కువ ధరకే మందులు అందుబాటులోకి వస్తాయని ఇరువురు నాయకులు అంగీకరించారు.
ఇరువురు నాయకులు ఈ కింది అంశాలకు అంగీకరించారు:
· సంస్థాగత అనుసంధానాల ద్వారా మానసిక ఆరోగ్య రంగంలో శిక్షణ కార్యక్రమాలు, పరస్పర సందర్శనలను చేపట్టడం.
· సీషెల్స్ అవసరాలను తీర్చడానికి భారతదేశం నుంచి వైద్యారోగ్య నిపుణులు, నర్సులు, పారామెడిక్స్, సాంకేతిక నిపుణుల నియామకం.. డిప్యుటేషన్కు మద్దతు ఇవ్వడం.
· ఒకరి దేశాన్ని మరొకరు సందర్శించటం, సంస్థాగత అనుసంధానాల ద్వారా ప్రజారోగ్యంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం.
· సీషెల్స్లో కొత్త ఆసుపత్రి నిర్మాణానికి మద్దతుగా కలిసి పనిచేయడం.
జీవన వ్యయం ఎక్కువగా ఉండటం అనేది సీషెల్స్ ప్రభుత్వానికి ప్రధాన ఆందోళనగా ఉందని గుర్తిస్తూ ఇరువురు నాయకులు ఈ కింది అంశాలకు అంగీకరించారు:
· ఔషధాలు- వైద్య పరికరాల ధరలను తగ్గించడం, వాటి లభ్యతను మెరుగుపరచడం వంటి చర్యలతో సహా సీషెల్స్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల దీర్ఘకాలిక వృద్ధికి సహకరించుకోవడం.
· భారత్ నుంచి నాణ్యమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఆహారం, నిత్యావసర వస్తువులను సేకరించేందుకు ఒక యంత్రాంగాన్ని వ్యవస్థీకృతం చేసేందుకు కలిసి పనిచేయడం.
· సీషెల్స్కు 1000 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను విరాళంగా అందించినందుకు అధ్యక్షుడు హెర్మిని ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆహార విరాళం సీషెల్స్లో ఆహార భద్రతను బలోపేతం చేయటంతో పాటు ప్రజలకు ఆహార ఖర్చును తగ్గిస్తుంది.
సామర్థ్య పెంపు, మానవ వనరుల అభివృద్ధి, సంస్థాగత అనుసంధానాలు
సీషెల్స్ సంస్థాగత, పరిపాలనా సామర్థ్యాలను మెరుగుపరచడంలో భారతదేశం అందిస్తున్న నిరంతర మద్దతును అధ్యక్షుడు హెర్మిని ప్రశంసించారు. 'ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్' (ఐటీఈసీ) కార్యక్రమం.. అధికారులు, రక్షణ సిబ్బంది, ఆరోగ్య నిపుణుల కోసం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలతో సహా సామర్థ్య పెంపులో ఉన్న బలమైన సహకారాన్ని ఇరుపక్షాలు ప్రముఖంగా పేర్కొన్నాయి. సీషెల్స్ అవసరాలకు అనుగుణంగా పోలీసింగ్, ఫైనాన్స్, వ్యవసాయం, వాతావరణ మార్పులు, సముద్ర సంరక్షణ, ఇతర రంగాలలో మరిన్ని శిక్షణా కార్యక్రమాలు, సంస్థాగత అనుసంధానాలకు ఉన్న అవకాశాలను అన్వేషించడానికి నాయకులు అంగీకరించారు.
విద్య- వృత్తి విద్యా శిక్షణ విషయంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విద్యా సంస్థల మధ్య పరస్పర చర్చలు, డిజిటల్ విద్యా వేదికలను విస్తరించాలని ఇరువురు నాయకులు పిలుపునిచ్చారు.
ఇద్దరు నాయకులు ఈ కింది అంశాలకు అంగీకరించారు:
· నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్సీజీజీ) ద్వారా భారతదేశంలో సీషెల్స్ సివిల్ అధికారుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేయడం.
· సైబర్ భద్రత, ఆర్థిక నిఘా రంగాల్లో సామర్థ్య పెంపు, సహకారం, మార్పిడిలను బలోపేతం చేయడం.
· భారతదేశం నుంచి సీషెల్స్కు నిపుణుల డిప్యుటేషన్ను సులభతరం చేయడం… సాంకేతికత, ఆరోగ్యం, విద్య, పునరుత్పాదక ఇంధనం, చట్టం, ఆడిటింగ్, సముద్ర భద్రత, ఫైనాన్స్, భూమి- మౌలిక సదుపాయాల అభివృద్ధి, పన్నుల యంత్రాంగం, మహిళా సాధికారత, మత్స్య సంపద, ఇతర పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో సామర్థ్య పెంపును చేపట్టడం.
· ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ద్వారా సముద్ర శాస్త్రం, సంరక్షణ రంగంలో భారత్-సీషెల్స్ మధ్య సామర్థ్య పెంపు, సంస్థాగత అనుసంధానాలను మెరుగుపరచడం.
· సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) అభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకోవడం.
· సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ సహకారంతో సీషెల్స్ అవసరాలకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలను రూపొందించడం.
పునరుత్పాదక ఇంధనాలు, వాతావరణ చర్యలు, సుస్థిరత
వినూత్న పరిశుద్ధ ఇంధన పరిష్కారాలు సహా పునరుత్పాదక ఇంధనాలు, వాతావరణ విపత్తులను ఎదుర్కోగల సామర్థ్యం విషయంలో పరస్పర సహకారాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడం పట్ల ఇరుపక్షాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను సాధించడంలో సీషెల్స్కు భారత్ అందిస్తున్న నిరంతర మద్దతును అధ్యక్షుడు హెర్మినీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత ప్రభుత్వ మద్దతుతో అంతర్జాతీయ సౌర కూటమి ఆధ్వర్యంలో అమలు చేసిన సౌర విద్యుత్ ప్రాజెక్టులు... ముఖ్యంగా సీషెల్స్ వ్యవసాయ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో స్పష్టమైన, సమాజ స్థాయి ప్రయోజనాలను అందించాయని ఆయన వివరించారు.
· వాతావరణ మార్పుల ప్రభావాల సన్నద్ధత, ఉపశమన చర్యలకు సంబంధించి సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడం కోసం సీషెల్స్లో బహుళ-ప్రమాద ముందస్తు హెచ్చరిక వ్యవస్థల అమలుకు మద్దతునివ్వడానికి ఇరు దేశాల నేతలు అంగీకరించారు.
విద్యుత్ గ్రిడ్ నిర్వహణలో సీషెల్స్కు సాంకేతిక సహాయం అందించడానికి భారత్ అంగీకరించింది. ఇది ఆ దేశం పర్యావరణ అనుకూల ప్రజా రవాణా వ్యవస్థకు మారడానికి మద్దతునిస్తుంది. సీషెల్స్ అవసరాలను తీర్చడం లక్ష్యంగా ఇంధన పరిరక్షణ, సుస్థిరత, పునరుత్పాదక ఇంధనాలు, గ్రీన్ మొబిలిటీ రంగాల్లో సహకారం కోసం కొత్త మార్గాలు, ప్రాజెక్టులను అన్వేషించడానికీ ఇరుపక్షాలు అంగీకరించాయి.
సీషెల్స్ వంటి ఎస్ఐడీఎస్ కోసం ఆర్థిక సహాయం లభించడం ఇప్పటికీ కీలక సవాలుగా ఉందని ఇరువురు నేతలు అంగీకరించారు. బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి భాగస్వాములతో సంబంధిత కార్యకలాపాల్లో సమానత్వం, ఉమ్మడి కానీ విభిన్న బాధ్యతలు-సంబంధిత సామర్థ్యాలు (సీబీడీఆర్-ఆర్సీ), జాతీయంగా నిర్దేశించిన అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ... బహుమితీయ ప్రమాద సూచీ (ఎమ్వీఐ) సహా దేశానికి గల ప్రమాద సంభావ్యత స్థాయిని ఒక పరిపూర్ణమైన, ముఖ్యమైన విశ్లేషణాత్మక సాధనంగా పరిగణించడానికి మద్దతుగా అంతర్జాతీయ వేదికలపై బలమైన, నిర్మాణాత్మకమైన భారత్ స్వరంపై ఆధారపడడాన్ని సీషెల్స్ కొనసాగించగలదని అధ్యక్షుడు హెర్మినీ ఆశాభావం వ్యక్తం చేశారు.
విపత్తులను తట్టుకోగల మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ)లో సీషెల్స్ చేరికను ఇరువురు నేతలు అంగీకరించారు.
వాణిజ్యం, పెట్టుబడి, అనుసంధానం, పర్యాటకం
భారత కంపెనీలు, వ్యాపారాలు సీషెల్స్ను ప్రధాన పెట్టుబడి కేంద్రంగా పరిగణించాల్సిన అవసరాన్ని... సీషెల్స్ అందించే సరసమైన గృహనిర్మాణ, డిజిటల్ సాంకేతికతలు, ఏఐ, ఆర్థిక సేవలు, బ్లూ ఎకానమీ, పర్యాటకం, మత్స్య రంగాల్లో వాణిజ్య వ్యాపార అవకాశాల నుంచి ప్రయోజనం పొందాల్సిన అవసరాన్నీ అధ్యక్షుడు హెర్మినీ స్పష్టం చేశారు.
నేరుగా నడుపుతున్న విమానాల ద్వారా సీషెల్స్ను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఇరువురు నేతలు అంగీకరించారు. భారత్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడం వల్ల సీషెల్స్లో పర్యాటక రంగం మరింత బలపడిందని వారు స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య విమాన కనెక్టివిటీని మరింతగా మెరుగుపరచడం కోసం కలిసి పనిచేయడానికి ఇరు పక్షాలూ అంగీకరించాయి.
సీషెల్స్-భారత్ ఆర్థిక వృద్ధి, శ్రేయస్సుల ఉమ్మడి లక్ష్యం కోసం ద్వైపాక్షిక వాణిజ్య పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
హైడ్రోగ్రఫీలో సహకారం
మరిన్ని ఉమ్మడి హైడ్రోగ్రాఫిక్ సర్వేలను నిర్వహించడం ద్వారా బ్లూ ఎకానమీ వృద్ధిని వేగవంతం చేయడానికి సీషెల్స్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా, హైడ్రోగ్రఫీ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇరు దేశాల నేతలు అంగీకరించారు. సీషెల్స్ ఈ విషయంలో భారత్ సహాయంతో సీషెల్స్ హైడ్రోగ్రాఫిక్ యూనిట్ (ఎస్హెచ్యూ)ను ఏర్పాటు చేస్తుంది. ద్వైపాక్షిక సహకారంలో ఈ రంగానికి దిశానిర్దేశం చేసి, ఊపునివ్వడం కోసం హైడ్రోగ్రఫీపై 3వ సమష్టి సహకార సమావేశం (జేసీఎమ్)-2026ను సీషెల్స్లో నిర్వహించాలని నిర్ణయించారు.
రక్షణ రంగ సహకారం, నౌకా వాణిజ్య భద్రత
· ద్వైపాక్షిక భాగస్వామ్యంలో నౌకా వాణిజ్య భద్రత, రక్షణ రంగాలు కీలకంగా ఉన్నాయని ప్రధానమంత్రి శ్రీ మోదీ, సీషెల్స్ అధ్యక్షుడు హెర్మినీలు స్పష్టం చేశారు. భారత మహాసాగర్ (అన్ని ప్రాంతాల భద్రత, వృద్ధి కోసం పరస్పర, సమగ్ర పురోగతి) దార్శనికతలో సీషెల్స్ కీలక నౌకా వాణిజ్య భాగస్వామిగా ఉందని ప్రధానమంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు. సీషెల్స్ నౌకా వాణిజ్య భద్రత, రక్షణ రంగ అవసరాలను తీర్చడంలో భారత్ నిరంతర మద్దతు, సహాయం కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.
నౌకా వాణిజ్య భద్రత, రక్షణ రంగంలో బలమైన సీషెల్స్-భారత్ భాగస్వామ్యం ప్రాంతీయ స్థిరత్వాన్ని, భద్రతనూ బలోపేతం చేస్తుందని... ఇరుదేశాల ప్రజల శ్రేయస్సును మరింత ముందుకు తీసుకెళ్లగలదని ఇరువురు నేతలు అంగీకరించారు.
అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, నావిగేషన్ స్వేచ్ఛ, నియమాల ఆధారిత నౌకా వాణిజ్య క్రమం ఆధారంగా హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని స్వేచ్ఛగా, అందుబాటులో, సురక్షితంగా, భద్రంగా ఉంచడానికి సీషెల్స్-భారత్ కట్టుబడి ఉన్నాయని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. పైరసీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణాతో పాటు చట్టవిరుద్ధంగా, నియంత్రణ లేకుండా, అక్రమంగా చేపలు పట్టడం, వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయంతో సంబంధం ఉన్న ఇతర అంతర్జాతీయ నేరాల వంటి నౌకా వాణిజ్య సవాళ్లను ఎదుర్కోవడానికి... మెరుగైన నౌకా వాణిజ్య రంగ అవగాహన, సమాచార భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణం, సమన్వయ కార్యాచరణ నిర్వహణ ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని బలోపేతం చేయడం పట్ల వారు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.
సీషెల్స్ రక్షణ దళాల (ఎస్డీఎఫ్) కోసం సమష్టి నౌకా వాణిజ్య నిఘా, హైడ్రోగ్రఫీ సర్వేలు, ద్వైపాక్షిక ప్రక్రియలు, సమాచార భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణాల విషయంలో సీషెల్స్కు నిరంతర మద్దతును అందిస్తున్నందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సీషెల్స్ అధ్యక్షుడు హెర్మినీ కృతజ్ఞతలు తెలిపారు. అనుకూలీకరించిన శిక్షణ, నావికా దళం-వైమానిక దళ ఆస్తులు, రవాణా వాహనాల విషయంలో సహకారం ద్వారా నౌకా వాణిజ్య భద్రత, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికీ ఇరువురు నేతలు అంగీకరించారు.
మెరుగైన సమర్థత, సమన్వయం, ఉన్నత స్థాయి భాగస్వామ్యాలను నిర్ధారించడం కోసం సంస్థాగత సహకారాన్ని ఉన్నత స్థాయికి మెరుగుపరిచే ప్రక్రియను ప్రారంభించేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు.
భారత సాయుధ దళాల ద్వారా సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకల్లో భారత్ పాల్గొనడాన్ని అధ్యక్షుడు హెర్మినీ అభినందించారు. 50వ జాతీయ దినోత్సవ వేడుకలకూ ఈ సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
గ్రాంట్ సహాయం ద్వారా పీఎస్ జొరాస్టర్ నౌక పునరుద్ధరణకు నిరంతర మద్దతు అందిస్తున్నందుకు అధ్యక్షుడు హెర్మినీ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల సీషెల్స్కు అందించిన 10 యుటిలిటీ వాహనాలు, 5 సెట్ల లేజర్ రేడియల్ బోట్ల విరాళాన్నీ ఆయన ప్రస్తావించారు. ఇవి సీషెల్స్ రక్షణ దళాల సరుకు రవాణా అవసరాలను తీరుస్తాయి.
ప్రాంతీయ, బహుపాక్షిక సహకారం
హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడంలో, నౌకా వాణిజ్య భద్రతను మరింతగా పెంచడంలో ప్రాంతీయ యంత్రాంగాల పాత్రను అంగీకరిస్తూ... పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా కలిసి పనిచేయడానికి ఇరువురు నేతలు అంగీకరించారు.
కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ (సీఎస్సీ)లో పూర్తిస్థాయి సభ్యదేశంగా చేరాలన్న సీషెల్స్ నిర్ణయాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ స్వాగతించారు. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థల్లో నామినేషన్ల విషయంలో భారతదేశానికి సీషెల్స్ అందించిన మద్దతుకు ఆ దేశ అధ్యక్షుడు హెర్మినీకి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం కోసం సీషెల్స్ మద్దతు ఉంటుందని అధ్యక్షుడు హెర్మినీ పునరుద్ఘాటించారు.
ప్రజా సంబంధాలు, సాంస్కృతిక ఒప్పందాలు
భారత్-సీషెల్స్ మధ్య లోతైన చారిత్రక సంబంధాలను గుర్తించిన ప్రధానమంత్రి శ్రీ మోదీ, అధ్యక్షుడు హెర్మినీలు... సీషెల్స్ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నిర్మాణంలో సీషెల్స్లోని ప్రవాస భారతీయుల సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. సీషెల్స్ ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాల కోసం భారతీయ నిపుణులు అందించిన సహకారాన్నీ ఇరువురు నాయకులు గుర్తించారు. సంస్కృతి, పర్యాటకం, విద్య, యువత భాగస్వామ్యం వంటి రంగాల్లో సహకారాన్ని సంస్థాగతీకరించడానికి ఇరు దేశాల నేతలూ అంగీకరించారు.
ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలను ప్రస్తావించిన సమగ్ర చర్చల పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. సీషెల్స్-భారత్ భాగస్వామ్యం హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుస్థిరత, అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుందనే ఉమ్మడి ప్రకటనతో వారు సమావేశాన్ని ముగించారు. ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మెరుగుపరుస్తాయి. మరింత బలోపేతం చేస్తాయి. ఇరు దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత పర్యటన సందర్భంగా లభించిన ఆత్మీయ ఆతిథ్యానికి అధ్యక్షుడు హెర్మినీ... భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పరస్పరం అనువైన సమయంలో సీషెల్స్ను సందర్శించాల్సిందిగా ఆయన ప్రధానమంత్రి శ్రీ మోదీని ఆహ్వానించారు.
(రిలీజ్ ఐడి: 2225533)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10