ప్రధాన మంత్రి కార్యాలయం
సోమ్నాథ్ స్వాభిమాన్ పర్వ్ ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
11 JAN 2026 10:04PM by PIB Hyderabad
గుజరాత్లోని సోమ్నాథ్లో నిర్వహించిన సోమ్నాథ్ స్వాభిమాన్ పర్వ్ ముఖ్యాంశాల్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ అనేక సందేశాలను పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
సోమ్నాథ్ శాశ్వత దివ్యత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. దీని పవిత్ర ఉనికి తరాల తరబడి ప్రజలకు మార్గదర్శకత్వాన్ని అందిస్తోంది. నిన్నటి కార్యక్రమాల్లో కొన్ని ముఖ్యాంశాల్ని ఇక్కడ వివరిస్తున్నాను. వీటిలో ఓంకార మంత్ర జపంతో పాటు డ్రోన్ షో కూడా ఉంది.
#SomnathSwabhimanParv”
‘‘పావన, దివ్య సోమ్నాథ్ థామంలో దర్శనం, పూజ కార్యక్రమాల్లో పాలుపంచుకొనే సౌభాగ్యం దక్కింది. ఈ అనుభవం మనసుకు శాంతినీ, సకారాత్మక శక్తినీ అందించింది. భగవాన్ సోమ్నాథ్ కృప దేశవాసులందరికీ లభించాలని కోరుకుంటున్నాను.’’
‘‘సోమ్నాథ్లో, సాహసి వీర్ హమీర్జీ గోహిల్కు శ్రద్ధాంజలి ఘటించాను. బర్బరత్వం, హింస చెలరేగిన నేపథ్యంలో ధైర్య, సాహసాలకీ, దృఢసంకల్పానికీ సమున్నత ప్రతీకగా ఆయన నిలిచారు. ఆయన ధైర్యం, సాహసం మన నాగరికత జ్ఞాపకాల్లో
కల కాలం చెక్కుచెదరకుండా ఉంటుంది. పాశవిక శక్తితో మన నాగరికతను తొక్కేయవచ్చని నమ్మిన వారికి ఆయన తన పరాక్రమంతో తిరుగులేని విధంగా సమాధానాన్నిచ్చారు’’.
‘‘మహనీయుడు సర్దార్ పటేల్ చలవ లేకుంటే మనం ప్రస్తుతం చూస్తున్న సోమ్నాథ్ ఆలయం వెలిసేది కాదు. 1947లో దీపావళి వేళ ఇక్కడకు వచ్చిన పటేల్ గారు ఎంతగా చలించిపోయారంటే, ఇక్కడ ఒక వైభవోపేతమైన ఆలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పం చెప్పుకొన్నారు. 1951లో ఆలయం ప్రారంభమయ్యేటప్పటికి, సర్దార్ సాహిబ్ లేరు.. కానీ, ఆయన అజేయ ఇచ్ఛాశక్తి, దార్శనికత ఈ దివ్య ఆలయ పరిసరాల్లో కొలువై ఉన్నాయి’’.
‘‘వేగ్డాజీ భీల్ సాహసం సోమ్నాథ్ చరిత్రలో ఓ విడదీయలేని భాగంగా మారింది. అమానవీయ హింస బెదరింపులకు వెరవక, పవిత్ర ఆలయ రక్షణకు ఆయన కట్టుబడి దృఢంగా కదం తొక్కారు. భారత్ మాత అసంఖ్యాక బిడ్డల సంకల్పం నుంచే సోమనాథ్ ఒక శక్తిగా రూపుదాల్చిందనీ, వారు ఈ ప్రతిష్ఠాత్మక ఆలయాన్ని సదా రక్షిస్తూ వచ్చారనీ వేగ్డాజీ జీవితం మనకు చాటిచెబుతోంది’’.
‘‘సోమ్నాథ్ స్వాభిమాన్ పర్వ్ శౌర్య యాత్రలో భాగస్తుడినైనందుకు ఎంతో గౌరవాన్ని అందుకున్నట్లుగా భావిస్తున్నాను. ఆలయ రక్షణలో ప్రాణాలను అర్పించిన భారత మాత అసంఖ్యాక వీర పుత్రులకు శ్రద్ధాంజలి ఘటించే సౌభాగ్యం ఈ సందర్భంగా నాకు దక్కింది. వారి అజేయ సాహసం, పరాక్రమం దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిని అందిస్తూ ఉంటాయి’’.
‘‘సోమ్నాథ్లో వీర్ హమీర్జీ గోహిల్కు శ్రద్ధాంజలి సమర్పించాను. బర్వరత్వం, హింసలు చెలరేగిన కాలంలో సాహసం, దృఢ సంకల్పాలకు ప్రతీకగా ఆయన నిలిచారు. ఆయన వీరత్వం దేశ ప్రజల స్మృతిపథంలో యుగ యుగాల దాకా నిలిచి ఉంటుంది. భారతవర్ష సంస్కృతిని బల ప్రయోగంతో బలహీనపరచడం సాధ్యం కానేకాదని ఆయన సాహసం, ఆయన పరాక్రమం చాటిచెబుతున్నాయి’’.
‘‘సర్దార్ పటేల్ వంటి మహనీయుడు మన దేశంలో ఉండి ఉండకపోతే, సోమ్నాథ్ ఆలయాన్ని ఈ రోజు ఇలాంటి రూపంలో మనం చూడలేకపోయేవాళ్లం. 1947లో దీపావళి వేళ ఇక్కడికి వచ్చిన ఆయన ఎంతగా భావవివశుడు అయ్యారంటే ఇక్కడ ఒక భవ్య ఆలయాన్ని తిరిగి నిర్మించాలని సంకల్పించుకున్నారు. 1951 మే నెలలో ఆలయ ద్వారాలను భక్తుల కోసం తెరచినప్పుడు సర్దార్ సాహబ్ మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన అజేయ ఇచ్ఛాశక్తీ, ఆయన దూరదృష్టీ ఈ దివ్య ఆలయ పరిసరాల్లో చాలా స్పష్టంగా కనిపించడం మొదలుపెట్టాయి’’.
‘‘వేగ్డా జీ భీల్ గారి పరాక్రమం సోమ్నాథ్ చరిత్రలో విడదీయలేని భాగంగా మారింది. హింస తాలూకు బెదరింపులకు ఆయన వెరవక, ఈ పవిత్ర ఆలయ రక్షణకు దృఢంగా నిలబడ్డారు. సోమ్నాథ్ను రక్షించడానికి భారత మాత సంతానం చెప్పుకొన్న సంకల్పం ఎంతటి శక్తిమంతమైందీ ఆయన జీవితమే మనకు తెలియజెబుతోంది’’.
‘‘సోమ్నాథ్ పావన ధామంలో మన మాతృశక్తి ఏ విధంగా ప్రస్ఫుటమైందో చూస్తే, మన మనసు ఉద్వేగానికి లోనయితీరుతుంది. సోమనాథ్ భవ్యంగా, దివ్యంగా, అఖండంగా నిలబడడంలో వారు సదా గొప్పదైన భూమికను నిర్వహించారు.’’
‘‘విశ్వాసంతో పాటు ధీరోదాత్తతకు కూడా #SomnathSwabhimanParv అద్దం పడుతోంది. అసంఖ్యాక ప్రజల త్యాగాలకు గుర్తుగా సోమ్నాథ్ నిలిచింది.. ఇది మనకు ఎప్పటికీ స్ఫూర్తిని అందించేదే. అలాగే, ఇది దివ్యత్వానికీ, నాగరికతా ఔన్నత్యానికీ ప్రతీకగా ఉంది. ఈ రోజు ముఖ్య ఆకర్షణలు ఇవిగో..’’
#SomnathSwabhimanParv
‘‘సోమ్నాథ్ రక్షణనీ, ఆలయ పునర్నిర్మాణాన్నీ తమ జీవన ధ్యేయంగా మలచుకున్న వాళ్లందరికీ సోమ్నాథ్ స్వాభిమాన్ పర్వ్ వేళ నేను నమస్కరిస్తున్నాను. వారు ఈ లక్ష్యాల్ని నెరవేర్చడానికి తమ సర్వస్వాన్నీ మహాదేవునికి అర్పించారు’’.
#SomnathSwabhimanParv
‘‘భారత్ను అంతం చేయాలని విదేశీ ఆక్రమణదారులు వందల ఏళ్లుగా వరుస ప్రయత్నాలు చేశారు. కానీ సోమ్నాథ్కు కాదు కదా, భారత్కు కూడా ఎలాంటి నష్టమూ జరగలేదు’’.
#SomnathSwabhimanParv”
‘‘సోమ్నాథ్ స్వాభిమాన్ పర్వ్కు చరిత్రలో ఓ గౌరవ పర్వమంటూ ఉండనే ఉంది.. ఇది ఒక కాలాతీత ప్రస్థానాన్ని రాబోయే తరాల వారి కోసం చైతన్యవంతమైందిగా నిలిపి ఉంచే మాధ్యమం కూడా. ఈ సందర్భాన్ని మన అస్తిత్వాన్నీ, మన గుర్తింపునీ శక్తిమంతంగా తీర్చిదిద్దుకోవడానికి మనం వినియోగ పరుచుకోవాలి.
‘‘మనసులను ఎలా గెలుచుకోవచ్చో ప్రపంచానికి నేర్పించింది భారత్. సోమ్నాథ్ వేయి సంవత్సరాల గాథ ఈ పాఠాన్ని పూర్తి మానవ జాతికి బోధిస్తోంది’’.
(రిలీజ్ ఐడి: 2215037)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam