ఉదయ్ పేరుతో ఆధార్ మస్కట్ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఇవాళ ప్రారంభించింది. ఆధార్ సేవలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించే స్వేహపూర్వక సమాచార చిహ్నంగా మస్కట్ను రూపొందించారు. ఆధార్ సంబంధిత సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు, సులభంగా అర్థమయ్యేలా చేయటానికి ఈ ఉదయ్ మస్కట్ ఉపయోగపడుతుంది. ఇది ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తుంది. నవీకరణ, ధ్రువీకరణ, ఆఫ్ లైన్ వెరిఫికేషన్, ప్రత్యేక సమాచార మార్పిడి, నూతన సాంకేతికతను అలవాటు చేసుకోవటం, బాధ్యతయుతమైన వినియోగాన్ని మస్కట్ వివరిస్తుంది.
ఈ విజన్ను సాకారం చేసేందుకు అందరినీ భాగస్వాములను చేయాలని యూఐడీఏఐ బహిరంగ మార్గాన్ని ఎంచుకుని, డిజైన్, పేరును ఎంపిక చేసేందుకు మైగవ్ వేదిక ద్వారా జాతీయస్థాయి పోటీని నిర్వహించింది. దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిపుణులు, డిజైనర్ల నుంచి మొత్తం 875 ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో ప్రతీదీ ఆధార్ను వినూత్న రీతిలో వివరించింది. ఈ ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను, కచ్చితత్వాన్ని పాటించటానికి వివిధ స్థాయిల్లో మూల్యాంకనం జరిగింది. ఈ ప్రక్రియ ద్వారా అద్భుతమైన సృష్టి ఆవిష్కృతమైంది. ప్రజల అంచనాలకు రూపమిస్తూ, సంస్థాగత ప్రాధాన్యతతో దీన్ని రూపుదిద్దారు.
మస్కట్ డిజైన్ పోటీలో కేరళలోని త్రిస్సూర్కు చెందిన గోకుల్ మొదటి బహుమతిని గెలుచుకున్నారు. మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఇద్రిస్ దవైవాలా, ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్కు చెందిన కృష్ణ శర్మ వరుసగా రెండవ, మూడవ బహుమతులను గెలుచుకున్నారు.
మస్కట్ పేరు ఎంపిక పోటీలో భోపాల్కు చెందిన రియా జైన్ ప్రథమ బహుమతి గెలుచుకోగా.. పూణెకు చెందిన ఇద్రిస్ దవైవాలా, హైదరాబాద్కు చెందిన మహరాజ్ శరణ్ చెల్లపిల్ల వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో యూఐడీఏఐ ఛైర్మన్ నీల్కాంత్ మిశ్రా ఆధార్ మస్కట్ను ఆవిష్కరించి, విజేతలను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశంలోని వంద కోట్లకు పైగా ప్రజలకు ఆధార్ సమాచారాన్ని సరళంగా, అందరికీ అర్థమయ్యేలా, స్వేహపూర్వకంగా చేరవేయటానికి యూఐడీఏఐ నిరంతరం చేస్తున్న కృషిలో భాగంగా మస్కట్ ఆవిష్కరణ కీలక ముందడుగని తెలిపారు.
బహిరంగ జాతీయ స్థాయి పోటీ ద్వారా మస్కట్ డిజైన్, పేరు పెట్టాలని ప్రజలను ఆహ్వానించటం ద్వారా 'ఆధార్ ముఖ్య సూత్రం: ప్రజల భాగస్వామ్యంతో విశ్వాసం, ఆమోదం లభిస్తాయి' అని యూఐడీఏఐ మరోసారి స్పష్టం చేసిందని, యూఐడీఏఐ సీఈఓ భువనేశ్ కుమార్ అన్నారు. ప్రజా ప్రయోజనకర వ్యవస్థగా ఆధార్ ను ప్రజలు ఎంతగా ఆదరిస్తున్నారో ఈ పోటీకి లభించిన అనూహ్య స్పందన ద్వారా తెలుస్తుందని చెప్పారు.
ఈ మస్కట్ ఒక మిత్రుడిగా, వ్యాఖ్యాతగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తోందని, ఆధార్ సంబంధిత సమాచారాన్ని ప్రజలు సులభంగా అర్థం చేసుకోవటానికి ఇది దోహదపడుతుందని యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వివేక్ సి వర్మ తెలిపారు.
***