సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్- 2025ను నిర్వహించిన భారత్... సమాచార, ప్రసార శాఖ మార్గదర్శక కార్యక్రమంలో పాలుపంచుకున్న 90 కన్నా ఎక్కువ దేశాలు
వివిధ దేశాల సృజనకారులను కలిపిన క్రియేటోస్ఫియర్లో ‘క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజెస్’
ప్రసార మాధ్యమాలు, వినోద రంగంలో అంకుర సంస్థలకు
దన్నుగా నిలుస్తున్న ఒక కొత్త తరం వేదికగా వేవ్ఎక్స్ 2025
భారత సృజనాత్మక ప్రతిభావంతుల్నీ, ఉత్పాదనల్నీ ఏకతాటిమీదకు తెచ్చిన వేవ్స్ బజార్ పోర్టల్
సృజనాత్మక సాంకేతికతలలో అత్యాధునిక శిక్షణను
ఇవ్వడానికి నేషనల్ ఎక్స్లెన్స్ సెంటరును ఏర్పాటు చేసిన ఐఐసీటీ
प्रविष्टि तिथि:
31 DEC 2025 8:54AM by PIB Hyderabad
వేవ్స్...భారత ప్రసార మాధ్యమాలకీ, వినోద రంగానికీ అండగా నిలబడడానికి సమాచార, ప్రసార శాఖ 2025లో అనేక ముఖ్య కార్యక్రమాల్ని నిర్వహించింది. వాటిలో అత్యంత ప్రధానమైంది వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్)- 2025.
వేవ్స్ కేవలం ఒక కార్యక్రమం కాదనీ, సంస్కృతి, సృజనాత్మకత, సార్వజనీన సంధానాల తరంగమనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్ణించారు. ప్రపంచవ్యాప్త సృజనకారులను ‘‘పెద్ద పెద్ద కలలు కనాల్సిందిగానూ, వారి కథను పదుగురికీ చెప్పాల్సిందిగానూ’’ ఆయన ప్రోత్సహించారు. ‘‘భారత్లో రూపొందించండి, ప్రపంచ పౌరుల కోసం సృష్టించండి’’ అనేదే భారత్ దృష్టికోణమని కూడా ఆయన వివరించారు. ఇండియాలోని భారీ సృజనాత్మక అనుబంధ విస్తారిత వ్యవస్థతో అనుబంధాన్ని పెంపొందించుకోవాల్సిందిగా ప్రధానమంత్రి ప్రపంచ దేశాల్లోని పెట్టుబడిదారులనూ, యువతనూ ఆహ్వానించారు.
వేవ్స్- 2025లో 90 దేశాలకు పైగా పాల్గొన్నాయి. 10,000 మందికి పైగా ప్రతినిధులు, 1,000 మంది సృజనకారులు, 300కు పైగా కంపెనీలు, 350 కన్నా ఎక్కువ అంకుర సంస్థలు పాల్గొన్న ఈ శిఖరాగ్ర సదస్సుకు ప్రసారం, సమాచారం, వినోదం, ఏవీజీసీ-ఎక్స్ఆర్, చలనచిత్రాలతో పాటు డిజిటల్ మీడియా రంగాలు సహా వివిధ రంగాలకు చెందిన సుమారు 1 లక్ష మంది తరలివచ్చారు.
వేవ్స్ను మూడు ముఖ్య విభాగాలతో ఇక ముందూ నిర్వహిస్తారు. ఆయా విభాగాలు..:
1) క్రియేటోస్ఫియర్, క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజెస్ (సీఐసీ)
నకవల్పన తాలూకు ఒక కీలక కూడలే క్రియేటోస్ఫియర్. ఇది సృజనకారులకు ప్రాధాన్యాన్నిస్తుంది. ఇక్కడ వారు తమ ఆలోచనలకు చలనచిత్రం, వీఎఫ్ఎక్స్, వీఆర్, యానిమేషన్, గేమింగ్, కామిక్స్, సంగీతం, ప్రసారం, డిజిటల్ మీడియా.. వీటిలో ఏ రూపాన్ని అయినా ఇచ్చేందుకు అవకాశం లభిస్తుంది. దేశ విదేశాల ప్రతిభావంతులు ఇక్కడ ఒకరితో మరొకరు చర్చించవచ్చు, భాగస్వామ్యాలను ఏర్పరుచుకోవచ్చు, నవకల్పనను ప్రదర్శించవచ్చు, ప్రపంచ వ్యాప్త ప్రతిభావంతులు తమ ఆలోచనలను ఆవిష్కరించడానికి ఒక వేదికగా దీనిని ఉపయోగించుకోవచ్చు.
సీఐసీ ఒకటో సీజన్ భారతదేశంలో అతి భారీ స్థాయి సృజనకారుల ఉద్యమంగా పేరు తెచ్చుకుంది. ఇది ప్రపంచమంతటా ప్రసిద్ధి పొందింది. ఒకటో సీజన్లో 33 కేటగిరీలకు చోటు కల్పించారు. భారత్తో పాటు 60కి పైగా దేశాల నుంచి 1 లక్షకు పైగా ఎంట్రీలు ఈ సీజనుకు వచ్చాయి. ఎనిమిది క్రియేటివ్ జోన్లలో దాదాపుగా 750 మంది తుది పోటీకి నిలిచారు. దీంతో వేవ్స్ భారత్లో అతి పెద్ద సృజన ప్రధాన చాలెంజ్ ప్లాట్ఫారంగా విఖ్యాతిని అందుకొంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచ్చేయడం ఈ సీజన్లో ప్రత్యేక సన్నివేశం. ఆయన యువ సృజనకారునలతో ముఖాముఖి మాట్లాడారు. విజేతగా నిలిచిన నవకల్పనలను తిలకించారు. కంటెంట్ పరంగా ప్రపంచంలో ఒక కూడలిగా భారత్లో నెలకొన్న అవకాశాలను ఈ సీజన్ కల్పిస్తోందని చాటారు. ఈ సీజన్ ముగిసిన సందర్భంగా 150కి పైగా సృజనకారులను కేంద్ర సమాచార, ప్రసార మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ వేవ్స్ క్రియేటర్ అవార్డుల కార్యక్రమంలో సత్కరించారు. ఈ కార్యక్రమం భారత్లో సృజన ప్రధాన ఆర్థిక వ్యవస్థకు మద్దతివ్వడంలో ప్రభుత్వం తీసుకొంటున్న శ్రద్ధను ప్రతిబింబించింది.
సీఐసీలో విజేతలుగా నిలిచిన వారు ఇటీవల మెల్బోర్న్, ఒసాకా, టొరంటో, టోక్యోలతో పాటు మాడ్రిడ్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. ఆయా ప్రధాన అంతర్జాతీయ సాంస్కృతిక వేదికల్లో వారు ప్రదర్శనలిచ్చి, తమ ప్రతిభను చాటారు. సంగీత విభాగ విజేతలు మెల్బోర్న్లోనూ, టొరంటోలోని టీఐఎఫ్ఎఫ్లోనూ పాల్గొన్నారు. గేమింగ్, యానిమేషన్ విభాగాల్లో తుది పోటీకి చేరిన వారు టోక్యో గేమ్ షోలో ప్రదర్శనలిచ్చారు. ఫిల్మ్, వీఎఫ్ఎక్స్ విభాగాల సృజనకారులు మాడ్రిడ్లోని ఇబర్సిరీస్లో భారత్ తరఫున పాల్గొన్నారు. అనేక మంది ఇతర విజేతలు సహకారపూర్వక ప్రాజెక్టులను చేజిక్కించుకున్నారు. మరికొందరు తమ కళను ప్రధాన జాతీయ, అంతర్జాతీయ వేదికలలో ప్రదర్శించి, భారీ గుర్తింపు పొందగలిగారు.
2) వేవ్ఎక్స్
సృజన, అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థను పటిష్ఠపరచాలని తాను చేపట్టే కార్యక్రమంలో భాగంగా 200కు పైగా స్టార్టప్లకు అండదండలను అందించాలని వేవ్ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది మైక్రోసాఫ్ట్, అమెజాన్, లుమికాయి వంటి ప్రపంచ పారిశ్రామిక దిగ్గజ సంస్థల సహకారాన్ని సంపాదించే అవకాశాలను 30కి పైగా అంకుర సంస్థలకు కల్పించింది. సుమారు 100 అంకుర సంస్థలు తమ ఆలోచనలను ఎగ్జిబిషన్ బూత్లలో ప్రదర్శించాయి. వైవీజీఆర్ న్యూస్, వీఐవీఏ టెక్నాలజీస్ లు షార్క్ ట్యాంక్ ఇండియా తో ఒప్పందానికి ఎంపిక కావడం ముఖ్య ప్రగతి ప్రస్థానం అని చెప్పాలి. ఈ రెండింటికీ వేవ్ఎక్స్ ఊతాన్ని అందించింది. దీంతో ఈ సంస్థలు జాతీయ గుర్తింపునూ, విశ్వసనీయతనూ పొందగలిగాయి.
సాంకేతిక విజ్ఞానం, సంస్కృతి, భాషాపరమైన భిన్నత్వం విభాగాల్లో కళాసేతు, భాషాసేతు పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేసి, అమలుచేయడంలో వేవ్ఎక్స్ సఫలమైంది. టెక్ట్స్-టు-వీడియో జనరేషన్ సేవలను విస్తృత స్థాయిలో అందించడంపై కళాసేతు దృష్టిని సారించగా, అప్పటికప్పుడు భాష పరమైన అనువాద సాధనాల సృజనకు భాషాసేతు ఉత్తేజాన్నిచ్చింది. ఈ కార్యక్రమాల్లో దేశమంతటి నుంచీ 100కు పైగా అంకుర సంస్థలు పాల్గొన్నాయి. వాటిలో 10 స్టార్టప్లు ఎంపికయ్యాయి. ఈ సంస్థలకు భారత ప్రభుత్వ మీడియా యూనిట్లతో ఒప్పందాలను కుదుర్చుకొనే అవకాశం లభించింది.
ఇండియా జాయ్, ఐజీడీసీ, ఇన్ఫోకామ్, ఐఎఫ్ఎఫ్ఐ/ వేవ్స్ ఫిల్మ్ బజార్ (గోవా), బిగ్ పిక్చర్ సమ్మిట్ల వంటి ప్రధాన వేదికల్లో పాలుపంచుకొనేందుకు వేవ్ఎక్స్ మార్గాన్ని సుగమం చేసింది. పెట్టుబడిదారు సంస్థలు ఆసక్తిని కనబరుస్తూ, భాగస్వామ్యాలు, ప్రచురణ, వాణిజ్య కార్యకలాపాలపై మలి దశ చర్చలు జరిపేందుకు ముందడుగు వేశాయి. ఎఫ్టీఐఐ- పుణే, ఎస్ఆర్ఎఫ్టీఐ- కోల్కతా, ఐఐసీటీ- ముంబయిల వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లోనూ, ఐఐఎంసీకి చెందిన అనేక క్యాంపసులలోనూ 9 ఇన్క్యూబేషన్ సెంటర్ల స్థాపనకు ఇది బాట వేయడంతో, అఖిల భారత వ్యాప్తికి వీలు ఏర్పడింది. ఇప్పటికే 34 అంకుర సంస్థలు ఇన్క్యూబేషన్ దశకు చేరుకున్నాయి. మరో 100 దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయి. టి-హబ్తో అవగాహన ఒప్పందం వంటి భాగస్వామ్యాల దన్ను కూడా లభించడం విశేషం.
3) వేవ్స్ బజార్
వేవ్స్ బజార్ చలనచిత్రాలు, గేమ్ రూపకర్తలు, యానిమేషన్, వీఎఫ్ఎక్స్ సేవలు, ఎక్స్ఆర్, వీఆర్, ఏఆర్ సేవలు, రేడియో, పాడ్కాస్ట్, కామిక్స్, ఈ-బుక్స్, వెబ్-సిరీస్, సంగీతం.. వీటన్నింటికీ సంబంధించిన గ్లోబల్ ఎలక్ట్రానిక్ బజారు. దీనిని ‘‘కళ నుంచి వాణిజ్యం వరకు’’ అనే కార్యక్రమంగా తీర్చిదిద్దారు. ఇది భారతీయ సృజనకారులనూ, సృజన ప్రధాన సంస్థలనూ దేశ, విదేశీ మార్కెట్లతో కలుపుతుంది. దీనికోసం ప్రత్యేకించిన ఉత్సవాలు, కార్యక్రమాల నిర్వహణ, బీ2బీ సమావేశాలు, సహ నిర్మాణాలు, పెట్టుబడులు, సహకార ప్రధాన ప్రాజెక్టులు, పరిశ్రమ ఆసక్తిదారు సంస్థలతో సమన్వయాన్ని ఏర్పరడం వంటి పనులు చేపడుతుంది.
గ్లోబల్, డొమెస్టిక్ అవుట్రీచ్ (2025 ఆగస్టు-డిసెంబరు)
వేవ్స్ బజార్ 2025 ఆగస్టు, నవంబరుల మధ్య ఒక విస్తృత స్థాయి అవుట్రీచ్ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా నాలుగు ఖండాలలో 12 ప్రధాన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలతో పాటు భారత్లో 4 కీలక పరిశ్రమ ప్రధాన కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాలు ఇదివరకు ఎన్నడూ లేనన్ని ఫలితాలను అందించాయి:
• దాదాపుగా రూ.4,334 కోట్ల మేరకు వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చలు సాగాయి.
• పది ఎంఓయూలు, ఎల్ఓఐలపై సంతకాలయ్యాయి. 3 ఎంఓయూలు, ఎల్ఓఐలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
• తుది ఫలితాలు రావడానికి వీలుగా 9,000 బిజినెస్ టు బిజినెస్ సమావేశాలకు రంగాన్ని
సిద్ధం చేశారు.
• ఇండో-జపాన్ క్రియేటివ్ కారిడార్, ఇండియా-కొరియా ఏవీజీసీ సహకార ఫ్రేంవర్క్లతో పాటు ఇండో-ఆస్ట్రేలియా సృజనాత్మక సహకార ప్రాజెక్టులను ప్రారంభించారు.
దేశీయంగా చేపట్టిన ముఖ్య కార్యక్రమాలలో ఐఎఫ్ఎఫ్ఐ/వేవ్స్ ఫిలిం బజార్ (గోవా), ఇండియా జాయ్ (హైదరాబాద్), ఐజీడీసీ (చెన్నై), సీఐఐ- బిగ్ పిక్చర్లు ఉన్నాయి.
ఇండియన్ క్రియేటివ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (ఐఐసీటీ)
ప్రభుత్వం యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్), గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్)ల కోసం ఒక జాతీయ శ్రేష్ఠత్వ కేంద్రాన్ని (ఎన్సీఓఈ)ని 2024 సెప్టెంబరు 19న ముంబయిలో ఏర్పాటు చేసింది. దీనికోసం బడ్జెటులో రూ.391.15 కోట్లను కేటాయించారు. ఈ సంస్థే తరువాత ‘ఇండియన్ క్రియేటివ్ టెక్నాలజీస్ ఇనిస్టిట్యూట్’ (ఐఐసీటీ)గా ప్రసిద్ధి చెందింది. ఈ సంస్థ పబ్లిక్-ప్రయివేట్ భాగస్వామ్య నమూనాను అనుసరించి పనిచేస్తుంది. దీనిలో ఎఫ్ఐసీసీఐ, సీఐఐ లు పరిశ్రమ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ సంస్థ కార్యకలాపాలను ముంబయిలోని ఎన్ఎఫ్డీసీ క్యాంపసులో కొనసాగిస్తున్నారు.
మొదటి దశ కార్యకలాపాలను ఐఐసీటీ- ఎన్ఎఫ్డీసీ ముంబయి క్యాంపస్లో 2025 జులై 18న ప్రారంభించారు. దీనికి 4వ అంతస్తు మొదలు 7వ అంతస్తు వరకూ నాలుగు అంతస్తులను కేటాయించారు. దీనిలో నాలుగు అత్యాధునిక తరగతి గదులు, ఎనిమిది నవకల్పన ప్రధాన అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి గాను ఒక ప్రత్యేక స్టార్టప్ ఇన్క్యూబేషన్ సెంటరు ఉన్నాయి. ప్రొఫెషనల్ గ్రేడ్ స్క్రీనింగ్, సౌండ్ డిజైన్, నిర్మాణానంతర పనుల కోసం ఒక అత్యాధునిక వసతులతో కూడిన థియేటరును కూడా సమకూర్చారు. దీనికి ప్రపంచ పరిశ్రమ ప్రమాణాలను అందించారు. ముందు ముందు గోరేగావ్లోని ఫిల్మ్ సిటీలో 10 ఎకరాల క్యాంపసును కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ అత్యాధునిక ఏఆర్/వీఆర్/ఎక్స్ఆర్ శిక్షణ కోసం ఒక అత్యంత ఆధునాతన ఇమ్మర్సివ్ స్టూడియోను నెలకొల్పుతారు. ఇది దేశంలోని వినోద పరిశ్రమ కేంద్ర స్థానంతో విద్యార్థులకు ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరుస్తుంది.
ముఖ్య ఘటనలు ఈ కింది విధంగా ఉన్నాయి:
• గూగుల్, మెటా, ఎన్వీడియా, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఎడోబ్, డబ్ల్యూపీపీ వంటి అగ్రగామి ప్రపంచ సాంకేతిక, మీడియా కంపెనీలతో అనేక ఎంఓయూలను కుదుర్చుకొని వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరుచుకోవడమైంది.
• ఇనిస్టిట్యూట్ వెబ్సైట్ (https://www.iict.org)లో మొత్తం 18 పాఠ్యక్రమాలను పొందుపరిచారు. వివిధ కార్యక్రమాలలో 100కు పైగా విద్యార్థులు చేరారు. ప్రస్తుతం ఐఐసీటీలో మొత్తం 8 అంకుర సంస్థలను తీర్చిదిద్దే పనులు సాగుతున్నాయి.
భారత్లో లైవ్ ఈవెంట్ పరిశ్రమ
కచేరీ కార్యక్రమాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థను దేశాభివృద్ధి చోదక శక్తిగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టికోణానికి అనుగుణంగా, సమాచార ప్రసార శాఖ ఒక లైవ్ ఈవెంట్స్ డెవలప్మెంట్ సెల్ (ఎల్ఈడీసీ)ని ఏర్పాటు చేసింది. దీనిలో సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ సంఘాలతో పాటు కీలక ఆసక్తిదారు సంస్థల ప్రతినిధులు ఉంటారు. ఈ రంగం సమన్వయ పూర్వక, సువ్యవస్థిత అభివృద్ధి దిశగా పయనించేటట్లు చూడడమే ఈ సెల్ లక్ష్యం.
ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న రంగాలు
• అన్ని అనుమతులనూ ఒకే చోట మంజూరు చేసే పద్ధతి.. అగ్ని, రాకపోకలు, నగరపాలక తదితర వివిధ రకాలైన అనుమతులను మంజూరు చేయడం కోసం ఒక సింగిల్- విండో క్లియరెన్స్ సిస్టమ్ను ఇండియా సినీ హబ్ (ఐసీహెచ్)లో రూపొందిస్తున్నారు. దీంతో త్వరితగతిన ఆమోదాలు, పెట్టుబడిదారు సంస్థలకు అనుకూలంగా ఉండే ప్రక్రియలకు మార్గాన్ని సుగమం చేస్తారు.
• రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ఒక ఎస్ఓపీస్ మాడల్; అనవసర అనుమతులకు స్వస్తి
డిజిటల్ పైరసీని అడ్డుకొనే దిశగా ప్రభుత్వ చర్యలు
చలనచిత్రాలు, వినోద పరిశ్రమ సహా సృజన ప్రధాన ఆర్థిక వ్యవస్థపై పైరసీ ప్రసరిస్తున్న వ్యతిరేక ప్రభావాన్ని గురించిన అవగాహన ప్రభుత్వానికి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. చట్టాన్ని తీసుకు రావడం, పక్కాగా అమలు చేయడం, అవగాహనను ఏర్పరిచే దిశగా చర్యలు చేపట్టడం వంటివి దీనిలో భాగంగా ఉన్నాయి.
పైరసీకి వ్యతిరేకంగా వ్యూహాల్ని బలోపేతం చేయడానికీ, సమన్వయంతో కార్యాచరణను చేపట్టడానికీ కీలక మంత్రిత్వ శాఖల సభ్యులతో ఒక అంతర్ మంత్రిత్వ సంఘాన్ని (ఐఎంసీ) ఏర్పాటు చేశారు. హోం శాఖ, ఎంఈఐటీవై, డీపీఐఐటీ, డీఓటీల కు చెందిన సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు.
దూరదర్శన్, సామాజిక రేడియోలు సాధించిన విజయాలు
ఈసీఐ మీడియా అవార్డు (టీవీ)ని 2024 సంవత్సర లోక్సభ ఎన్నికల కాలంలో ఓటర్లలో అవగాహనను కలిగించి, వారికి పలు విషయాలను నేర్పించినందుకు దూరదర్శన్కు ప్రదానం చేశారు. 2025 జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి అందజేశారు.
స్థానిక సమాచారం, విద్య, అభివృద్ధి.. వీటికి తోడ్పడుతున్న ఒక ముఖ్య సాధనంగా సామాజిక రేడియో 2025 సంవత్సరంలో తన ప్రభావాన్ని ఇదివరకటి కన్నా మరింత విస్తరించుకొంది. కొత్తగా 22 స్టేషన్లు పనిచేయడం మొదలుపెట్టాయి. దీంతో, దేశవ్యాప్తంగా స్టేషన్ల సంఖ్య 551కి పెరిగింది. ముంబయిలో వేవ్స్ శిఖరాగ్ర సదస్సును నిర్వహించినప్పుడే, జాతీయ సామాజిక రేడియో సమ్మేళనాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు 5 అవగాహన కార్యశాలల్నీ, ఒక ప్రాంతీయ సమ్మేళనాన్నీ నిర్వహించారు. సామాజిక రేడియో ఇంకా చేరుకోని ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో పాటు స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడంపై కూడా శ్రద్ధ తీసుకున్నారు.
ఐఎఫ్ఎఫ్ఐ 2025 (56వ సంచిక)తో పాటు వేవ్స్ / ఫిల్మ్ బజార్ నిర్వహణ
గోవాలో నిర్వహించిన 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ- 2025) లో 81 దేశాలకు చెందిన 240 కన్నా ఎక్కువ చలనచిత్రాలను ప్రదర్శించారు. వాటిలో అనేక ప్రపంచ, అంతర్జాతీయ, ఆసియా ప్రీమియర్లు కూడా ఉన్నాయి. ఇది ఒక ప్రధాన అంతర్జాతీయ ఉత్సవంగా దీని ప్రతిష్ఠను తెలియజెబుతోంది. ఐఎఫ్ఎఫ్ఐ- 2025లో నవకల్పనకీ, సమ్మిళితత్వానికీ ప్రాధాన్యాన్నిచ్చారు. భారత ప్రథమ ఏఐ చలనచిత్రోత్సవంతో పాటు వీఎఫ్ఎక్స్, సీజీఐ, డిజిటల్ ప్రొడక్షన్ అంశాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమాలు దీనిలో భాగమయ్యాయి. ఇవి ఈ చలనచిత్రోత్సవాన్ని సరికొత్తగా ఉనికిలోకి వస్తున్న సాంకేతికతలతో పాటు రాబోయే కాలానికి అవసరమైన నైపుణ్యాలకు కూడా తుల తూగేదిగా నిలిపాయి.
పణజీలో నిర్వహించిన ఒక చరిత్రాత్మక వైభవోపేత పరేడ్ ఐఎఫ్ఎఫ్ఐని క్షేత్ర స్థాయి సార్వజనిక ఉత్సవంగా మలిచింది. దీంతో ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేసే జాతీయ సాంస్కృతిక ఉత్సవంగా దీని గుర్తింపు మరింత పెరిగింది. ఈ ఉత్సవం గోవాను ఒక సృజనాత్మక కూడలిగా నిలబెట్టడంలో తోడ్పడింది.
ఐఎఫ్ఎఫ్ఐ- 2025తో పాటే నిర్వహించిన వేవ్స్ ఫిల్మ్ బజార్లో ముందెన్నడూ కని విని ఎరుగనంత స్థాయిలో ప్రపంచ దేశాలు భాగస్వాములయ్యాయి. 40కి పైగా దేశాలకు చెందిన 2,500 కన్నా ఎక్కువ మంది ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు. దీంతో దక్షిణ ఆసియా చలనచిత్రాల మార్కెట్టులో నిర్వహించే అతి పెద్ద అంతర్జాతీయ సమ్మేళనాల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. ఈ కార్యక్రమ నిర్వహణలో 15కు పైగా దేశాలకు చెందిన 320 ప్రాజెక్టులను ప్రదర్శించారు. భారత్లోని కంటెంట్ అనుబంధ విస్తారంత వ్యవస్థపై ప్రపంచదేశాల ఆసక్తి అంతకంతకు పెరుగుతండడాన్నీ, బలపడుతుండడాన్నీ ఇది చాటిచెబుతోంది.
స్త్రీ‑పురుష సమాన ప్రాతినిధ్య సహిత, డిజిటల్, బహుభాషా ధ్రువీకరణ పద్దతిని ప్రోత్సహిస్తున్న సీబీఎఫ్సీ
ఇ‑సినీప్రమాణ్ పోర్టల్లో ఆన్లైన్ ధ్రువీకరణ ప్రక్రియను సీబీఎఫ్సీ సరళతరం చేసింది. దీంతో ప్రాసెసింగ్ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా పూర్తయి, డిజిటల్ సంతకంతో కూడి ఉండే ధ్రువీకరణ పత్రాలను జారీ చేయడానికీ, వాటిని దరఖాస్తుదారులు సురక్షిత పద్ధతిన డౌన్లోడ్ చేసుకోవడానికీ మార్గం సుగమమైంది.
ఇ‑సినీప్రమాణ్లో ఒక కొత్త బహుభాషా ధ్రువీకరణ మాడ్యూల్ను ప్రారంభించారు. దీంతో చలనచిత్రం తాలూకు అనేక భాషల వెర్షన్ల కోసం ఒకే దరఖాస్తు పెట్టుకొనే వీలు కలుగుతోంది. ఫలితంగా, ఆమోదం పొందిన భాషలకూ వర్తించే ఒకే ఏకీకృత బహుభాషా సర్టిఫికెటును పొందేందుకూ అవకాశం ఏర్పడింది.
ప్రతి ఎగ్జామినింగ్, రివైజింగ్ కమిటీలో 50 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉండేటట్లు సీబీఎఫ్సీ శ్రద్ధ తీసుకుంది. ఇది ధ్రువీకరణ ప్రక్రియలో పురుషులు, మహిళల పరంగా సమాన ప్రాతినిధ్య వ్యవస్థను బలోపేతం చేసినట్లయింది.
***
(रिलीज़ आईडी: 2210281)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam