ప్రధాన మంత్రి కార్యాలయం
బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి తిరిగి వచ్చిన తరువాత ఢిల్లీలో ఓ సభలో ప్రధానమంత్రి ప్రసంగం.. తెలుగు అనువాదం
प्रविष्टि तिथि:
26 AUG 2023 3:30PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
ఈ ఉదయం నేను బెంగళూరులో ఉన్నాను. ఉదయం చాలా త్వరగా చేరుకున్నాను.. అంత గొప్ప విజయాల్ని దేశానికి అందించిన శాస్త్రవేత్తల్ని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే, తెల్లవారుతూ ఉండగానే అక్కడికి వెళ్లాను. ఏమైనా, ప్రజలు సూర్యోదయాని కన్నా ముందుగానే తిరంగాను ఎత్తిపట్టుకుని మరీ చంద్రయాన్ విజయాన్ని వేడుక చేసుకున్న తీరు.. ఎంతో స్ఫూర్తినిచ్చేదిగా ఉంది. ఇప్పుడు సూర్యుడు విపరీతమైన వేడిమితో ఉన్నాడు. ఈ ఎండ తీవ్రత చర్మాన్ని కాల్చేసేటంతగా ఉంది. భగభగమనే ఎండలో మీరంతా ఇక్కడికి రావడం, చంద్రయాన్ సాఫల్యాన్ని వేడుక చేసుకోవడం, మీ అందరితో పాటు నేను కూడా కలిసి దీనిలో పాల్గొనే అదృష్టం నాకూ కలగడం.. నా భాగ్యం. మీ అందరినీ నేను అభినందిస్తున్నాను.
ఇవాళ, ఉదయం ఇస్రోకు చేరుకున్నప్పుడు, చంద్రయాన్ తొలి సారిగా తీసిన చిత్రాల్ని విడుదల చేసే భాగ్యం నాకు దక్కింది. ఆ చిత్రాల్ని మీరు బహుశా ఇప్పటికి టీవీలో చూసే ఉంటారు. ఆ సుందర చిత్రాలు ఒక విజ్ఞానశాస్త్ర విజయానికి ప్రతీకలు. అలాంటి విజయవంతమైన మిషన్లలో భాగంగా ఉండే చోట్లకు పేర్లను పెట్టే సంప్రదాయమొకటి ప్రపంచమంతటా ఉంది. చాలా ఆలోచించిన మీదట, చంద్రయాన్-3 విజయవంతంగా దిగిన ప్రదేశానికి ఒక పేరు పెట్టాలని, అది ‘శివశక్తి’ అనే అయ్యుండాలని నాకనిపించింది. భగవాన్ శివుడిని గురించి మనం మాట్లాడుకుంటే, ఆ నామం శుభాన్ని స్ఫురింపచేస్తుంది. ఇక శక్తిని గురించి మనం మాట్లాడుకుంటే, అది నా దేశ మహిళా శక్తిని సూచిస్తుంది. మనం భగవాన్ శివుడిని గురించి మాట్లాడుకున్నామంటే హిమాలయాలూ, శక్తిని గురించి మాట్లాడుకున్నప్పుడు కన్యాకుమారి మనకు గుర్తుకు వస్తాయి. ఈ కారణంతో, ఆ చోటుకు ‘శివశక్తి’ అనే పేరును పెట్టాం. హిమాలయాల మొదలు కన్యాకుమారి వరకు ఈ భావనలోని సారాన్ని ఆ చోటు ప్రతిబింబించేటట్లు చేయాలనే ఉద్దేశంతోనే శివశక్తి అనే పేరును పెట్టాం. నిజానికి, 2019లో చంద్రయాన్-2 సందర్భంలో, ఈ పేరును పెట్టే విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. ఏమైనా, నా మనసు సిద్ధంగా లేదు. మనసు లోలోపల, మేం మా ప్రయాణంలో నిజంగా విజయవంతం అయిన తరువాతే చంద్రయాన్-2 పాయింటుకు ఒక పేరును పెడదామని నేను సంకల్పం చెప్పుకొన్నాను. చంద్రయాన్-3 సఫలం అయిన వేళ, చంద్రయాన్-2 పాయింటుకు కూడా దానిదైన పేరంటూ ఒకటి లభించింది. ఆ పాయింటుకు ‘తిరంగా’ అనే పేరును పెట్టాం (మువ్వన్నెల భారత జాతీయ పతాకం). త్రివర్ణం అన్ని సవాళ్లనీ అధిగమించే శక్తిని అందిస్తుంది. మూడు రంగులు ప్రతి కలనూ పండించుకొనేందుకు స్ఫూర్తిని ఇస్తాయి. ఇందువల్ల, చంద్రయాన్-2లో వైఫల్యం ఎదురవడం, చంద్రయాన్-3 సఫలతను సాధించడం.. ఈ రెండిటికీ తిరంగాయే స్ఫూర్తిగా మారింది. కాబట్టి, చంద్రయాన్-2 లోని పాయింటు ఇప్పుడు ‘తిరంగా’గా ప్రసిద్ధమవుతుంది. చెప్పదగిన మరో అంశం ఏమిటంటే, ఆగస్టు 23 భారత్ విజ్ఞానశాస్త్ర ప్రగతి యాత్రలో ఓ ముఖ్య ఘట్టం. ఈ మాటలు నేను ఈ రోజు ఉదయం చెప్పాను. ఏటా ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా భారతదేశం పాటిస్తుంది.
మిత్రులారా,
నేను గత కొన్ని రోజులుగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికాలో ఉన్నాను. ఈ సారి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సభ్యులతో పాటు, పూర్తి ఆఫ్రికానే అక్కడికి ఆహ్వానించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగినన్నాళ్లు, అక్కడ చంద్రయాన్ను గురించి ప్రస్తావించని వారంటూ గాని, తమ అభినందనలను తెలియజేయని వారంటూ గాని ప్రపంచంలో ఒక్కరూ లేరన్న సంగతిని నేను గమనించాను. అక్కడ నేనందుకున్న అభినందనలను వెనువెంటనే శాస్త్రవేత్తలందరితో పంచుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అభినందనలన్నింటినీ మీతో కూడా నేను పంచుకుంటున్నాను.
మిత్రులారా,
చంద్రయాన్ను గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నించారు. కాల ప్రభావాన్ని జయించే ఈ విజయానికి సంబంధించి నవ భారత్ తాలూకు కొత్త కలలు, కొత్త సంకల్పాలతో పాటు ఒకదాని తరువాత ఒకటిగా విజయాలు సిద్ధించడంతో.. ప్రపంచంలో ఒక నూతన ప్రభావం ప్రసరించింది. మన భారతీయ త్రివర్ణం సామర్థ్యం, మనం సాధించిన విజయాల ఆధారంగా ఇప్పటి ప్రపంచం ఈ ప్రభావాన్ని అనుభూతించడమే కాకుండా దీనిని గుర్తిస్తోంది.. గౌరవిస్తోంది.
మిత్రులారా,
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగిశాక, నేను గ్రీస్కు వెళ్లాను. గత 40 ఏళ్లుగా భారత ప్రధానమంత్రి ఎవరూ గ్రీస్కు వెళ్లలేదు. వదలివేసిన పనుల్లో అనేక పనులు నాతోనే పూర్తి కావాలని రాసిపెట్టి ఉండడం నా అదృష్టం. భారత్కు దాని సామర్థ్యాల రీత్యా గ్రీస్లో ఆదరణ లభించింది. భారత్, గ్రీస్ల మధ్య మైత్రి ఉంది కాబట్టి తాను ఒక రకంగా యూరోపునకు ప్రవేశ ద్వారంగా మారగలనని గ్రీస్ భావిస్తుంటుంది. భారత్, గ్రీస్ల మధ్య ఉన్న మైత్రి భారత్, యూరోపియన్ యూనియన్ల మధ్య సంబంధాల్ని బలోపేతం చేయడానికి చాలా ప్రధాన మాధ్యమంగా మారుతుంది.
మిత్రులారా,
రాబోయే కాలంలో మనం పూర్తి చేయాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. శాస్త్రవేత్తలు వారి వంతు పనిని పూర్తి చేశారు. అది ఉపగ్రహాలు కావచ్చు లేదా చంద్రయాన్ పయనం కావచ్చు.. సామాన్య ప్రజానీకం జీవితాల్లో ఇవి గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల, మనం నా దేశ యువతలో సైన్స్, టెక్నాలజీల పట్ల ఆసక్తి మరింత పెరిగేటట్లు మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మనం వేడుకలను జరుపుకోవడం, ఉత్సుకత, కొత్త శక్తి.. వీటికే పరిమితం అయ్యే వాళ్లం కాదు. మనం విజయాన్ని సాధించినప్పుడు, సరికొత్త కార్యసాధనల దిశగా మరింత బలంగా ముందడుగు వేయడానికి సన్నద్ధులమవుతాం. అందుకని, మనం అంతరిక్ష విజ్ఞాన శాస్త్రంతో ఏయే పనులు సాధించొచ్చు, ఉపగ్రహాల శక్తియుక్తులను ఏయే రకాలుగా ఉపయోగించుకోవచ్చు, సుపరిపాలనకూ, పథకాల ప్రయోజనాల్ని సమాజంలో అందరికీ అందించడానికీ, సామాన్య ప్రజల జీవనాన్ని మెరుగుపరచడానికీ ఈ ప్రయాణం ఎలా తోడ్పడుతుంది.. ఇలాంటివి మనం ఆలోచించి, ముందుకు దూసుకుపోవాలి. ప్రభుత్వంలో అన్ని విభాగాలు అంతరిక్ష శాస్త్ర సాంకేతికతల్ని జనసామాన్యంతో ముడిపడిన పనులలో, సేవల అందజేతలో, సత్వర స్పందనలో, పారదర్శకతతో ఎలా వినియోగించుకోవచ్చో ఆలచించాలని కోరుతున్నాను. రాబోయే కాలంలో దేశ యువతకు హ్యాకథాన్లను నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. ఇటీవలే, దేశ విద్యార్థులు వివిధ హ్యాకథాన్లలో విరామమన్నదే లేకుండా 30-40 గంటల సేపు పనిచేసి గొప్ప గొప్ప ఉపాయాలను అందించారు. దీంతో ఒక వినూత్న వాతావరణం ఏర్పడింది. అతి త్వరలోనే ఇలాంటి మరిన్ని హ్యాకథాన్లను నిర్వహించడం మొదలుపెట్టాలని నేను కోరుకుంటున్నాను. వాటి వల్ల దేశ యువ మేధావులూ, యువ ప్రతిభావంతులూ అంతరిక్ష విజ్ఞానశాస్త్రాన్నీ, ఉపగ్రహాల్నీ, సాంకేతిక విజ్ఞానాన్నీ ఉపయోగించి జన సామాన్యం కష్టాలకు పరిష్కారాల్ని కనుగొనడానికి వీలు కలుగుతుంది. ఈ దిశలో మేం పని చేస్తాం.
దీనితో పాటు, నవ తరం కూడా సైన్సు పట్ల ఆకర్షణను పెంచుకొనేటట్లు మనం చూడాల్సి ఉంది. 21వ శతాబ్దం సాంకేతికత ప్రధానమైన శతాబ్దం. సైన్స్లో, టెక్నాలజీలో సత్తాను నిరూపించుకొనే దేశమే ప్రపంచంలో ముందుకు దూసుకుపోతుంది. ఈ కారణంగా, 2047 కల్లా మనం అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే సైన్స్, టెక్నాలజీ మార్గంలో మరింత ప్రభావాన్ని కనబరుస్తూ పయనించాలి. కొత్త తరం వారిని బాల్యం నుంచే విజ్ఞానశాస్త్రమంటే మక్కువను కలిగి ఉండేటట్లు మనం తీర్చిదిద్దాలి. మనం సాధించిన ఇప్పటి విజయం మనలో ఉన్న ఆనందోత్సాహాల్ని శక్తిగా మార్చేలా చేసుకోవాలి. ఈ శక్తిని సొంతం చేసుకొనేందుకు ఒక క్విజ్ పోటీని సెప్టెంబరు 1 నుంచి మైగవ్ (MyGov)లో మొదలుపెట్టనున్నారు. దీని ద్వారా, మన యువత చిన్న చిన్న ప్రశ్నల్నీ-జవాబుల్నీ చూసి మెల్లమెల్లగా వాటిలో ఆసక్తిని పెంచుకోగలుగుతుంది. మన నూతన విద్యావిధానంలో సైన్సుకూ, టెక్నాలజీకీ పెద్దపీట వేశారు. సైన్స్, టెక్నాలజీలపై మన విద్యార్థులు మక్కువను పెంచుకోవడానికి ఈ క్విజ్ పోటీ తోడ్పడుతుంది. దీనిలో పాలుపంచుకోవాల్సిందిగా నా దేశ యువతకూ, నా దేశ విద్యార్థులకూ, ప్రతి ఒక్క స్కూలుకూ ఇవాళ నేను చెప్పదలుచుకున్నాను. ఇది చంద్రయాన్తో ముడి పెట్టిన క్విజ్ పోటీ. దేశానికి చెందిన కోట్లాది యువత దీనిలో పాలుపంచుకోవాలి. దీనిని మనం ముందుకు తీసుకుపోవాలి. ఇది చాలా పెద్ద ఫలితాల్ని ఇస్తుందని నేను నమ్ముతున్నాను.
ఈ రోజు, మరో విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. భారత్ పట్ల ప్రపంచంలో ఆసక్తి, ఆకర్షణ, నమ్మకం అంతకంతకూ పెరుగుతున్నాయి. అయినప్పటికీ, వీటన్నింటినీ కాసేపు పక్కన పెడదాం.. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే వాటి తాలూకు అనుభూతిని పొంది తీరాలి. తక్షణ అవకాశమొకటి మనందరికీ ఎదురవబోతోంది. మరీముఖ్యంగా ఢిల్లీ వాసులకు ఈ అవకాశం కలగనుంది. అదే జి-20 శిఖరాగ్ర సదస్సు. ఒక రకంగా, ప్రపంచంలో చాలా పెద్ద నిర్ణయాత్మక నాయకత్వమిది.. భారతదేశంలో, ఢిల్లీ గడ్డ మీద ఇది జరగనుంది. దీనికి యావద్భారత దేశం ఆతిథ్యాన్ని ఇస్తుంది. అతిథులు ఢిల్లీకి తరలిరానున్నారు.
జి-20కి ఆతిథ్యం ఇవ్వడం యావద్దేశ బాధ్యత. దీన్లో ఎక్కువ బాధ్యత ఢిల్లీలోని నా సోదరీ, సోదరులదీ.. ఢిల్లీలోని పౌరులదీనూ. ఈ కారణంగా దేశ పరువు ప్రతిష్ఠలకు రవ్వంతయినా లోటు రాకూడదు.. ఇది మన ఢిల్లీ నిరూపించుకోవాల్సిన తరుణం. దేశ పేరు ప్రతిష్ఠల జెండాను సమున్నతంగా ఎగురవేసే సౌభాగ్యం ఢిల్లీలోని మన సోదరీసోదరులకు కలిగింది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో భారీ సంఖ్యలో అతిథులు వస్తున్నప్పుడు అసౌకర్యం కలగవచ్చా అంటే కలగనూవచ్చు. మన ఇళ్లలో.. అయిదు మంది గాని లేదా ఏడుగురు గాని వస్తేనే ఇంట్లోని వాళ్లు ప్రధాన సోఫా మీద కూర్చోరు, పక్కనున్న చిన్న కుర్చీలో సర్దుకుంటారు. ఎందుకంటే అతిథికి చోటు చూపించాలి, కదా. మనకు అతిథి దేవుడితో సమానం. ఇది మన సంస్కారం. మన వైపు నుంచి వీలయినంత ఎక్కువ గౌరవ మర్యాదల్నీ, సాదర స్వాగతాన్నీ మనం ప్రపంచానికి ఇస్తే వాళ్లు మన కీర్తిప్రతిష్ఠల్ని అంతగానూ పెంచుతారు. ఈ కారణంగానే సెప్టెంబరులో 5 మొదలు 15 వరకు ఇక్కడ అనేక కార్యకలాపాలు చోటు చేసుకోనున్నాయి. ఢిల్లీవాసులకు రాబోయే రోజుల్లో ఎదురుకాగల అసౌకర్యానికి క్షమించాల్సిందిగా ఇప్పుడే నేను విన్నవించుకుంటున్నాను. అదే సమయంలో వచ్చే వారు మన అందరి అతిథులు అనే విషయాన్ని కూడా ఢిల్లీ వాసుల దృష్టికి నేను తీసుకువస్తున్నాను.. మనకు కొంచెం కష్టమైతే కలుగుతుంది. కొంత అసౌకర్యం కూడా ఎదురవుతుంది. ట్రాఫిక్ నియమాలన్నీ మారిపోతాయి. చాలా చోట్లకు వెళ్లకుండా మనల్ని ఆపుతారు. అయితే కొన్ని విషయాలు ముఖ్యం. మనకు తెలుసు.. కుటుంబంలో పెళ్లిని పెట్టుకున్నామంటే గోళ్లు కత్తిరించే వేళ కొద్దిగా రక్తం వచ్చిందనుకోండి, అప్పుడు ఇంట్లోని ప్రతి ఒక్కరూ ‘‘కాస్త జాగ్రత్తగా ఉండండి.. ఇది ప్రత్యేక సందర్బం.. ఎలాంటి చెడూ జరగకూడదు’’ అని అంటారు. అందుకని, ఇదొక పెద్ద సందర్భం.. ఓ కుటుంబంలో మాదిరిగానే వీరందరూ మన అతిథులు. మన ఉమ్మడి ప్రయత్నాలతో, మన జీ20 శిఖరాగ్ర సదస్సు అద్భుతంగా, చైతన్యవంతంగా కొనసాగుతుందని నేను నమ్ముతున్నాను. ఢిల్లీలో ప్రతిదీ రంగులతో కళకళలాడుతుంది. ఢిల్లీలో నా తోటి పౌరులు తమ కృషితో దీనిని శోభాయమానం చేస్తారని నేననుకుంటున్నాను.
ప్రియమైన నా సోదరీ సోదరులారా, నా కుటుంబ సభ్యులారా,
కొద్ది రోజుల్లో, రక్షా బంధన్ పండుగ వస్తోంది. అక్కచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కడతారు. మనమంతా ‘‘చంద మామ’’ అని అంటూ పెరిగాం. చంద మామను గురించి బాల్యం నుంచే మనకు నేర్పిస్తారు. భూమి మనకు తల్లి అని పసితనంలోనే మనకు బోధిస్తారు. ఈ నేల మన తల్లి, మరి చంద్రుడో.. ‘‘మామ’’. అంటే, మన భూ మాత చంద మామ సోదరి అన్నమాట. మన పృథ్వీ మాత ఈ సారి రక్షా బంధన్ పండుగను చందమామతో కలిసి జరుపుకోనుంది. మనం రక్షాబంధన్ పర్వదినాన్ని అద్భుతంగా జరుపుదాం.. సోదరభావాన్నీ, ఏకతనీ, ప్రేమాస్పద వాతావరణాన్నీ ఎంతలా వ్యక్తం చేద్దామంటే.. దాంతో జి-20 శిఖరాగ్ర సదస్సులో కూడా ఇదే సోదరభావం, ఏకత, ప్రేమ, మన సంస్కృతి, సంప్రదాయాలు.. ఇవన్నీ కలిసి ఈ పండుగ సారాంశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. రాబోయే పండుగలు వైభవోపేతంగా ఉంటాయనీ, సెప్టెంబర్లో మన విజయాలు భారత్ను మరో సారి ప్రపంచ రంగస్థలంపై అనేక విధాలుగా పరిచయం చేస్తాయనీ నేను నమ్ముతున్నాను. చంద్రయాన్ సాఫల్య సన్నివేశంలో మన శాస్త్రవేత్తలు మన జెండాను ఎగరేసిన విధంగానే, ఢిల్లీ పౌరులమైన మనం జి-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యాన్ని అద్భుతంగా ఇచ్చి మన జెండాకు కొత్త బలాన్ని ఇవ్వబోతున్నామనే విషయంలో నాకు పూర్తి విశ్వాసముంది. మన శాస్త్రవేత్తల విజయాలను కలిసికట్టుగా వేడుకలా జరుపుకోవడానికీ, త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించడానికీ, ఇంతటి ఎండలో ఇక్కడ గుమికూడిన మీ అందరికీ నేను నా హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. మీకు నా మన:పూర్వక అభినందనల్ని అందిస్తున్నాను. నాతో కలిసి మీరంతా చెప్పండి..
‘భారత్ మాతా కీ జై’
‘భారత్ మాతా కీ జై’
‘భారత్ మాతా కీ జై’.
అనేకానేక ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఇది.
***
(रिलीज़ आईडी: 2201317)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam