ప్రధాన మంత్రి కార్యాలయం
జోహాన్నెస్బర్గ్లో జరిగిన ఐబీఎస్ఏ నేతల సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి
Posted On:
23 NOV 2025 2:33PM by PIB Hyderabad
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో ఈ రోజు జరిగిన ఐబీఎస్ఏ నేతల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశానికి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు గౌరవనీయ సిరిల్ రామఫోసా ఆతిథ్యం ఇవ్వగా... బ్రెజిల్ అధ్యక్షుడు గౌరవనీయ లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా హాజరయ్యారు.
ఈ సమావేశం సరైన సమయంలో నిర్వహిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది ఆఫ్రికా గడ్డపై జరిగిన తొలి జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంలోనే జరగడం మంచి విషయమన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు వరుసగా నాలుగు జీ20 సమావేశాలకు అధ్యక్షత వహించడం దీనికి ఒక కారణమని ప్రధానమంత్రి తెలిపారు. వీటిలో చివరి మూడు జీ20 సమావేశాలను ఐబీఎస్ఏ సభ్య దేశాలే నిర్వహించాయని గుర్తుచేశారు. ఫలితంగా మానవ కేంద్రిత అభివృద్ధి, బహుపాక్షిక సంస్కరణలు, సుస్థిర వృద్ధిపై దృష్టి సారిస్తూ అనేక ముఖ్య కార్యక్రమాలు చేపట్టామని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
ఐబీఎస్ఏ కేవలం మూడు దేశాల సమూహం కాదనీ... మూడు ఖండాలు, మూడు ప్రధాన ప్రజాస్వామ్య దేశాలు, మూడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలను అనుసంధానించే ముఖ్యమైన వేదిక అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ప్రపంచ పాలనా సంస్థలు 21వ శతాబ్దపు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ పాలనా సంస్థల సంస్కరణలు... ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణను ఇప్పుడు ఒక ఎంపికగా కాకుండా అత్యవసరం అని బలంగా చాటాలని ఆయన ఐబీఎస్ఏ దేశాలకు పిలుపునిచ్చారు.
ఉగ్రవాదంపై పోరులో సన్నిహిత సమన్వయం అవసరాన్ని స్పష్టం చేసిన ప్రధానమంత్రి... ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదన్నారు. మానవ కేంద్రిత అభివృద్ధిని నిర్ధారించడంలో సాంకేతికత కీలక పాత్రను ప్రధానంగా ప్రస్తావిస్తూ... యూపీఐ వంటి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, కోవిన్ వంటి ఆరోగ్య వేదికలు, సైబర్ భద్రతా చట్రాలు, మహిళల నేతృత్వంలోని సాంకేతిక కార్యక్రమాలను మూడు దేశాలూ పంచుకోవడానికి వీలుగా 'ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్'ను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి ప్రతిపాదించారు.
సురక్షితమైన, విశ్వసనీయమైన, మానవ-కేంద్రితమైన ఏఐ నిబంధనల అభివృద్ధికి దోహదపడే ఐబీఎస్ఏ సామర్థ్యాన్ని ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. వచ్చే ఏడాది భారత్లో జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు ఐబీఎస్ఏ నేతలను ఆయన ఆహ్వానించారు.
ఐబీఎస్ఏ దేశాలు... ఒక దేశ అభివృద్ధి కోసం మిగతా దేశాలు పరస్పరం సహకరించుకోగలవనీ, సుస్థిర వృద్ధికి ఈ కూటమి ప్రత్యక్ష ఉదాహరణగా మారగలదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. చిరుధాన్యాలు, సేంద్రియ వ్యవసాయం, విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడం, హరిత ఇంధనాలు, సాంప్రదాయిక ఔషధాలు, ఆరోగ్య భద్రత వంటి రంగాల్లో సహకారం కోసం గల అవకాశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
నలభై దేశాల్లో విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, సౌరశక్తి వంటి రంగాలకు చెందిన ప్రాజెక్టులకు మద్దతునివ్వడంలో ఐబీఎస్ఏ నిధి కృషిని ప్రశంసించిన ప్రధానమంత్రి... ఈ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి వాతావరణ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే వ్యవసాయ విధానాల కోసం ఐబీఎస్ఏ నిధిని ప్రతిపాదించారు. ప్రధానమంత్రి పూర్తి ప్రసంగాన్ని [ఇక్కడ] చూడవచ్చు.
***
(Release ID: 2193223)
Visitor Counter : 3