ప్రధాన మంత్రి కార్యాలయం
గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని నర్మద జిల్లాలో ఈ నెల 15న ప్రధానమంత్రి పర్యటన
· ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలకు హాజరు
· నర్మద జిల్లా దేడియాపడలో ₹9,700 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం…
శంకుస్థాపన
· గిరిజన సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యంతో మౌలిక సదుపాయాల కల్పన.. ఆరోగ్యం.. విద్య.. వారసత్వం అంశాలు ఈ ప్రాజెక్టుల లక్ష్యం
నాడు పోస్టు చేయడమైనది:
14 NOV 2025 11:41AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబరు 15న గుజరాత్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12:45 గంటల ప్రాంతంలో నర్మద జిల్లాలోని దేవ్మోగ్రా ఆలయంలో దైవదర్శనం, పూజలు చేస్తారు. ఆ తర్వాత 2:45 గంటలకు దేడియాపడను సందర్శించి, ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలలో పాల్గొంటారు. అలాగే, మౌలిక సదుపాయాల కల్పన సహా ₹9,700 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
దేడియాపడ కార్యక్రమాల్లో భాగంగా ఆయన, గిరిజన సముద్ధరణ సహా ఈ ప్రాంతంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాల మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఉద్దేశించిన అభివృద్ధి పనులను ప్రారంభించి, మరికొన్నిటికి శంకుస్థాపన చేస్తారు.
ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ (పీఎం-జన్మాన్), ధర్తీ ఆబా జన్జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డీఏ-జేఏజీయూఏ)ల కింద నిర్మించిన 1,00,000 ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలోనూ ప్రధానమంత్రి పాల్గొంటారు.
గిరిజన విద్యార్థుల కోసం సుమారు ₹1,900 కోట్లతో నిర్మించిన 42 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాల (ఈఎంఆర్ఎస్)లను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దీంతోపాటు సామాజిక నేతృత్వ కార్యకలాపాల కూడలిగా ఉపయోగపడే 228 బహుళార్ధ సాధక కేంద్రాలను, అస్సాంలోని దిబ్రూగఢ్లోగల వైద్య కళాశాలలోని ‘సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్’, మణిపూర్లోని ఇంఫాల్లో గిరిజన సంస్కృతి-వారసత్వ పరిరక్షణకు ఉద్దేశించిన ‘ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (టీఆర్ఐ) భవనం సహా గిరిజన ప్రాంతాల్లో అనుసంధానాన్ని మెరుగు పరిచేలా గుజరాత్లోని 14 గిరిజన జిల్లాలకు 250 బస్సులను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
గిరిజన ప్రాంతాల అనుసంధానాన్ని మెరుగు పరిచే లక్ష్యంగా 748 కిలోమీటర్ల కొత్త రహదారులతో పాటు ‘డీఏ-జేఏజీయూఏ’ కింద సామాజిక కూడళ్లుగా పనిచేసే 14 ట్రైబల్ మల్టీ-మార్కెటింగ్ సెంటర్ల (టీఎంఎంసీ) నిర్మాణానికీ ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. మరోవైపు గిరిజన బాలలకు నాణ్యమైన విద్యా ప్రదానంపై ప్రభుత్వ నిబద్ధతను కొనసాగిస్తూ ₹2,320 కోట్లకుపైగా విలువైన 50 కొత్త ‘ఈఎంఆర్ఎస్’లకూ ఆయన పునాదిరాయి వేస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2189966)
సందర్శకుల సూచీ సంఖ్య : : 183
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
हिन्दी
,
Marathi
,
Punjabi
,
English
,
Urdu
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam