హోం మంత్రిత్వ శాఖ 
                
                
                
                
                
                    
                    
                        రాష్ట్రీయ ఏక్తా దివస్-2025 సందర్భంగా సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని బీహార్లోని పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగం
                    
                    
                        
స్వాతంత్ర్యోద్యమ సంస్థాగత వెన్నెముక సర్దార్ పటేల్ ఓ వ్యక్తి మాత్రమే కాదు, ఆయనొక స్ఫూర్తి
అక్టోబర్ 31న ఏక్తా నగర్లో నిర్వహించనున్న భారీ కవాతులో గౌరవ వందనం స్వీకరించనున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
ఈ జాతీయ కవాతులో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, పలు రాష్ట్రాల పోలీసు బలగాలు, 900 మందికి పైగా కళాకారుల నైపుణ్యం, క్రమశిక్షణ, పరాక్రమం, వారసత్వ ప్రదర్శన
‘ఏక్ భారత్, శ్రేష్ఠతా భారత్’ భావన ఉట్టిపడేలా కవాతు.. ఏటా అక్టోబరు 31న నిర్వహణ
సర్దార్ సాహెబ్, భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా నవంబరు 1 నుంచి 15 వరకు ఏక్తానగర్లో ‘భారత్ పర్వ్’
562 సంస్థానాలను విలీనం చేసే బృహత్తర కార్యాన్ని సర్దార్ పటేల్ సాధించారు.. ఆయన దార్శనికత, కృషి ఫలితమే నేడు మన ముందున్న భారత చిత్రపటం
భోపాల్, కతియావార్, ట్రావెన్కోర్, జోధ్పూర్ వంటి ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించిన సర్దార్ పటేల్.. కారిడార్ ఏర్పాటుకు పాకిస్తాన్ చేసిన కుతంత్రానికి అడ్డుకట్ట
మరణానంతరం సర్దార్ వారసత్వాన్ని చెరిపేయడానికి ఏ అవకాశాన్నీ వదలకుండా ప్రయత్నించిన నేటి ప్రతిపక్షం.. ఆ మహనీయుడికి భారతరత్న పురస్కారం ఇచ్చేందుకు 41 ఏళ్లు...
భారత ఇంజినీరింగ్ అద్భుతం.... ఐక్యతా మూర్తి (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ)
సందర్శకులు మెచ్చే గమ్యస్థానంగా.. ఐక్యతా విగ్రహం చుట్టూ 14 పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసిన ప్రధాని మోదీ
                    
                
                
                    Posted On:
                30 OCT 2025 3:05PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                రాష్ట్రీయ ఏక్తా దివస్-2025 సందర్భంగా సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను పురస్కరించుకుని బీహార్లోని పాట్నాలో కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
విలేకరుల సమావేశంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. స్వాతంత్య్రానంతరం దేశాన్ని ఏకం చేయడంలో, నేటి భారత్ నిర్మాణంలో, ఏకతా భారత నిర్మాణంలో సర్దార్ పటేల్ చేసిన కృషి అద్భుతమని చెప్పారు. 2014 నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏటా అక్టోబరు 31న కెవాడియాకు వస్తున్నారని, అక్కడ సర్దార్ పటేల్ విగ్రహం ఎదుట అద్భుతమైన కవాతు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ సంవత్సరం సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించామని, ఏటా అక్టోబరు 31న భారీ కవాతు నిర్వహించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
దేశ ఐక్యత, సమగ్రతaను పునరుద్ఘాటించేలా.. అన్ని కేంద్ర సాయుధ పోలీసు దళాలు, రాష్ట్రాల పోలీసు దళాల సత్తా చాటేలా ఈ కవాతును నిర్వహించనున్నట్టు శ్రీ అమిత్ షా చెప్పారు. భారతదేశ ఐక్యత, సమగ్రతకు ప్రతీక అయిన సర్దార్ పటేల్ విగ్రహం ఎదుట ఈ కవాతు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.
ఈ సంవత్సరం ‘ఐక్యతా పరుగు’ను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోం మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా పోలీస్ స్టేషన్లు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పరుగు అనంతరం.. దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటుపడతామని ప్రతి పౌరుడు ఐక్యతా ప్రతిజ్ఞ కూడా చేస్తారని ఆయన అన్నారు. సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నవంబరు 1 నుంచి ఏక్తా నగర్లో ‘భారత్ పర్వ్’ నిర్వహిస్తున్నామని, భగవాన్ బిర్సా ముండా జయంతి రోజయిన నవంబరు 15న ఈ కార్యక్రమం ముగుస్తుందని శ్రీ అమిత్ షా తెలిపారు. గిరిజన సంస్కృతిని ఘనంగా చాటేలా గొప్ప వేడుకతో నవంబరు 15న ‘భారత్ పర్వ్’ ముగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల సాంస్కృతిక వైవిధ్యం, ఆహారం, దుస్తులు, హస్త కళలు, జానపద కళలు, సంగీతాల అద్భుత సమ్మేళనంగా ఈ కార్యక్రమం నిలుస్తుంది.
సర్దార్ పటేల్ ఓ వ్యక్తి మాత్రమే కాదని, మన దేశానికి స్ఫూర్తి అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. సర్దార్ పటేల్ పూర్తి అంకితభావంతో దేశం కోసం పనిచేశారనీ.. స్వాతంత్ర్య పోరాటంలో ముందుండి నడవడమే కాకుండా, మహాత్మా గాంధీతో కలిసి పనిచేస్తూ ఉద్యమానికి సంస్థాగత వెన్నెముకగా నిలిచారని ఆయన అన్నారు. రైతులపై జరుగుతున్న దోపిడీని నిరసిస్తూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1928లో బార్డోలి సత్యాగ్రహం ప్రారంభమైందని, ఈ ఉద్యమ సమయంలోనే మహాత్మా గాంధీ స్వయంగా ఆయనకు ‘సర్దార్’ బిరుదును ఇచ్చారని చెప్పారు. దేశ స్వాతంత్ర్యానంతరం బ్రిటీష్ వారు దేశాన్ని 562 సంస్థానాలుగా విభజించి వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు శ్రీ అమిత్ షా అన్నారు. ఈ 562 సంస్థానాలను ఒకే దేశంగా ఏకం చేయడం ఎంతవరకూ సాధ్యమవుతుందని ఆ సమయంలో ప్రపంచమంతా ఆసక్తిగా చూసిందన్నారు. అయితే అనతి కాలంలోనే సర్దార్ పటేల్ 562 సంస్థానాలను ఏకీకృతం చేసే బృహత్కార్యాన్ని పూర్తి చేశారనీ, నేడు మనం చూస్తున్న ఆధునిక భారత చిత్రపటం ఆయన దార్శనికత, కృషి ఫలితమేననీ హోం మంత్రి పేర్కొన్నారు.
హైదరాబాదులో పోలీసు చర్య, జునాగఢ్ విలీనం సహా.. ఒకదాని తర్వాత ఒకటి సర్దార్ పటేల్ సవాళ్లను పరిష్కరించారని కేంద్ర హోం మంత్రి అన్నారు. భోపాల్, కథియావర్, ట్రావెన్కోర్, జోధ్పూర్... ఇలా ప్రాంతం ఏదయినా సర్దార్ పటేల్ ప్రతి సమస్యనూ దృఢ సంకల్పంతో పరిష్కరించారని ఆయన అన్నారు. భారత భూభాగం గుండా కారిడార్ ఏర్పాటుకు పాకిస్తాన్ పన్నాగాన్ని కూడా తిప్పికొట్టారని తెలిపారు.
ప్రచారం కోసమో లేదా వ్యక్తిగత కీర్తి కాంక్షతోనో కాకుండా.. దేశం కోసం జీవితాంతం పరితపించిన అసాధారణ వ్యక్తిత్వం సర్దార్ పటేల్ది అని శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు. 1947 ఆగస్టు 15న దేశం మొత్తం స్వాతంత్ర్య వేడుకల్లో మునిగిపోయి జాతీయ జెండాను ఎగురవేస్తున్న వేళ.. సర్దార్ పటేల్ నావికాదళ అధికారులతో కలిసి కమాండ్ రూమ్లో ఉన్నారని, లక్షద్వీప్ను భారత్లో భాగం చేసే ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్ దేశ దక్షిణ సరిహద్దులను బలోపేతం చేసిందని, సర్దార్ పటేల్ దూరదృష్టి, సమర్థ కార్యాచరణ వల్లే లక్షద్వీప్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడిందని ఆయన అన్నారు.
సర్దార్ పటేల్ మరణానంతరం ఆయన వారసత్వాన్ని చెరిపేయడానికి ఏ అవకాశమూ వదలకుండా నేడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రయత్నించిందని, అది దురదృష్టకరమని కేంద్ర హోం, సహకార మంత్రి అన్నారు. సర్దార్ పటేల్ వంటి గొప్ప వ్యక్తికి కూడా భారతరత్న పురస్కారం రావడానికి 41 సంవత్సరాలు పట్టిందని, నేడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సర్దార్ పటేల్ పట్ల గౌరవం లేకపోవడం వల్లే ఇంత జాప్యం జరిగిందని ఆయన అన్నారు. సర్దార్ పటేల్ వంటి మహోన్నత వ్యక్తి గౌరవార్థం దేశంలో ఎక్కడా ఒక స్మారక చిహ్నాన్నిగానీ, కట్టడాన్ని గానీ నిర్మించబడలేదని ఆయన అన్నారు. శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ‘ఐక్యతా మూర్తి (స్టాట్యూ ఆఫ్ యూనిటీ)’ని రూపొందించి, సర్దార్ పటేల్ గౌరవార్థం ఓ గొప్ప స్మారకాన్ని నిర్మించారని శ్రీ అమిత్ షా తెలిపారు. ఐక్యతా విగ్రహానికి 2013 అక్టోబరు 31న శంకుస్థాపన చేయగా.. 57 నెలల్లోనే ఈ 182 మీటర్ల పొడవైన విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేశారని పేర్కొన్నారు. సర్దార్ పటేల్ రైతుల కోసం జీవితాన్ని అంకితం చేశారని, ఈ విగ్రహ నిర్మాణం కోసం ఉపయోగించిన ఇనుమును దేశవ్యాప్తంగా రైతుల పనిముట్ల నుంచి సేకరించారని శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ పనిముట్లను సేకరించి, కరిగించి దాదాపు 25,000 టన్నుల ఇనుమును ఉత్పత్తి చేశారనీ, విగ్రహ నిర్మాణంలో దీనిని ఉపయోగించామనీ ఆయన చెప్పారు. 90,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు, 1,700 టన్నులకు పైగా కంచును ఉపయోగించి చిరస్మరణీయమైన ఈ స్మారకాన్ని నిర్మించామని, సర్దార్ పటేల్కు నివాళి అర్పించేందుకు ఇది సరైన ప్రదేశమని అన్నారు. రోజూ దాదాపు 15,000 మంది ఈ స్థలాన్ని సందర్శిస్తారని, ఇప్పటివరకు భారత్, విదేశాల నుంచి 2.5 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని శ్రీ అమిత్ షా తెలిపారు. నిజమైన భారతీయ ఇంజినీరింగ్ అద్భుతంగా ఐక్యతా విగ్రహం నిలిచిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఐక్యతా విగ్రహం చుట్టూ 14 అదనపు పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేశామని, అవి ఆ ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా నిలిపాయని ఆయన చెప్పారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఏక్తా నగర్ టౌన్షిప్, లేక్ సర్క్యూట్, లైట్ అండ్ సౌండ్ షో, పటేల్ గార్డెన్, ఏక్తా క్రూయిజ్, బటర్ఫ్లై గార్డెన్, జంగిల్ సఫారీ, ఏక్తా మాల్, గ్లో టార్చ్ వ్యూ పాయింట్ ఈ ప్రధాన పర్యాటక కేంద్రాలు.
అక్టోబర్ 31న ఉదయం ఏక్తా నగర్లో జరిగే భారీ కవాతులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవ వందనం స్వీకరిస్తారని శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ జాతీయ కవాతు సందర్భంగా.. కేంద్ర సాయుధ పోలీసు దళాలు, పలు రాష్ట్రాల పోలీసు దళాలు తమ నైపుణ్యాలు, క్రమశిక్షణ, సాహసాలను ప్రదర్శిస్తాయన్నారు. సీఆర్పీఎఫ్ నుంచి అయిదుగురు శౌర్య చక్ర అవార్డు గ్రహీతలు, బీఎస్ఎఫ్ నుంచి పదహారు మంది శౌర్య పతక విజేతలు కూడా ఈ ఏడాది కవాతులో ఉంటారని ఆయన చెప్పారు. ఈ కవాతుకు మహిళా పోలీసు అధికారులు నేతృత్వం వహిస్తారని, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర పోలీసు దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాల సిబ్బంది కూడా సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. బీఎస్ఎఫ్ ఒంటెల దళం, ఒంటెలపై ఎక్కి బ్యాండు ప్రదర్శన కవాతుకు వన్నె తెస్తాయన్నారు. గుజరాత్  ఆశ్విక దళం, అస్సాం పోలీసుల మోటార్ సైకిల్ డేర్ డెవిల్ షో ఆకట్టుకుంటాయన్నారు. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా కవాతులో పాల్గొంటారని తెలిపారు. అంతేకాకుండా ఎన్ఎస్జీ, ఎన్డీఆర్ఎఫ్, అండమాన్ నికోబార్ దీవుల పోలీసులు, పాండిచ్చెరి పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు తమ శకటాలను ప్రదర్శిస్తారని శ్రీ అమిత్ షా చెప్పారు. భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ బృందం అద్భుత వైమానిక ప్రదర్శన ఈ కవాతుకు తలమానికంగా ఉంటుంది. భారత సాంస్కృతిక వారసత్వాన్ని దేశం ఎదుట, ప్రపంచమంతటా చాటేలా.. 900 మందికి పైగా కళాకారులు ప్రదర్శన ఇస్తారని శ్రీ అమిత్ షా చెప్పారు. ఇది నిజంగా దేశ ఐక్యతా కవాతుగా నిలుస్తుందని, ‘ఏక్ భారత్, శ్రేష్ఠతా భారత్’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సర్దార్ పటేల్ 150వ జయంతి అనంతరం.. జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ కవాతు మాదిరిగానే ఏటా అక్టోబరు 31న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి తెలిపారు. దేశ యువతకు స్ఫూర్తినిచ్చేందుకు, సర్దార్ పటేల్ సిద్ధాంతాల పట్ల, దేశానికి ఆయన అపారమైన సేవల పట్ల వారికి అవగాహన కల్పించేందుకు ఈ కవాతు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. దేశంలో ఐక్యత, సమగ్రతతో కూడిన బలమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా ఈ కవాతు ద్వారా మనమంతా సమష్టిగా కృషి చేయాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు.
 
***
                
                
                
                
                
                (Release ID: 2184443)
                Visitor Counter : 4
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Malayalam 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Bengali-TR 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada