ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 9వ సంచికను అక్టోబరు 8న ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఆసియాలో టెలికాం, టెక్నాలజీ రంగ సంబంధిత అతి పెద్ద కార్యక్రమమే ‘ఐఎంసీ 2025’..
అక్టోబరు 8 నుంచి 11వ తేదీ వరకూ…
ఇతివృత్తం: మార్పు దిశగా ఆవిష్కరణలు
డిజిటల్ మార్పును ఆవిష్కరించడంలో భారత్ నాయకత్వ ప్రదర్శన
అంశాలు: 6జీ, క్వాంటమ్ కమ్యూనికేషన్లు, సెమీకండక్టర్లు, ఆప్టికల్ నెట్వర్కులతో పాటు సైబర్ దగా నివారణ
ఐఎంసీ 2025లో పాల్గొంటున్న 150 దేశాలు.. 400 వాణిజ్య సంస్థలు
సుమారు 7,000 మంది ప్రతినిధుల రాక, 1.5 లక్షల మంది సందర్శకులు హాజరవుతారని అంచనా
Posted On:
07 OCT 2025 10:27AM by PIB Hyderabad
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 పరంపరలో 9వ సంచికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 8న ఉదయం సుమారు 9:45 గంటలకు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభిస్తారు. ఇది ఆసియాలో టెలికం, మీడియా, టెక్నాలజీ రంగాలకు సంబంధించిన భారీ కార్యక్రమం.
‘ఐఎంసీ 2025’ని టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ)తో పాటు భారతీయ సెల్యులర్ ఆపరేటర్ల సంఘం (సీఓఏఐ) సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కార్యక్రమ ఇతివృత్తం.. మార్పు దిశగా ఆవిష్కరణలు. డిజిటల్ మార్పుతో పాటు సామాజిక పురోగతిని సాధించడానికి నవకల్పనను వినియోగించుకొనేందుకు భారత్ కట్టుబడి ఉందని ఈ కార్యక్రమం చాటిచెబుతుంది.
టెలికం రంగంలో అత్యాధునిక మార్పులతో పాటు సరికొత్త సాంకేతికతలను కూడా ఐఎంసీ 2025లో ప్రదర్శిస్తారు. ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు, విధాన రూపకర్తలు, పరిశ్రమ నిపుణులతో పాటు ఆవిష్కర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఆప్టికల్ కమ్యూనికేషన్లు, టెలికం రంగంలో సెమీకండక్టర్లు, క్వాంటమ్ కమ్యూనికేషన్లు, 6జీ, ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ల వంటి ముఖ్య అంశాలపై దృష్టి సారిస్తుంది. తదుపరి తరం సంధానం- డిజిటల్ సార్వభౌమాధికారం, సైబర్ మోసాల నివారణలతో పాటు గ్లోబల్ టెక్నాలజీ లీడర్షిప్.. వీటికి భారత్ వ్యూహాత్మకంగా ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఐఎంసీ 2025 చాటబోతోంది.
ఈ కార్యక్రమంలో 150కి పైగా దేశాలకు చెందిన 1.5 లక్షల కన్నా ఎక్కువ మంది సందర్శకులు, 7,000 కన్నా ఎక్కువ మంది ప్రతినిధులు, 400 కన్నా ఎక్కువ వాణిజ్య సంస్థలు పాల్గొంటాయని భావిస్తున్నారు. 100కు పైగా సదస్సులలో 800 కన్నా ఎక్కువ వక్తలు పాలుపంచుకొనే ఈ కార్యక్రమంలో.. 5జీ, 6జీ, ఏఐ, స్మార్ట్ మొబిలిటీ, సైబర్ భద్రత, క్వాంటమ్ కంప్యూటింగ్, హరిత ప్రధాన సాంకేతికత తదితర రంగాల్లో 1,600 కన్నా ఎక్కువ సరికొత్తగా ఉపయోగంలోకి తీసుకువచ్చిన పరికరాలను పరిచయం చేస్తారు.
అంతర్జాతీయ సహకారంపైన కూడా ఐఎంసీ 2025లో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ కార్యక్రమంలో జపాన్, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, రష్యా, ఐర్లండ్లతో పాటు ఆస్ట్రియా ప్రతినిధి వర్గాలు పాల్గొంటాయి.
***
(Release ID: 2175841)
Visitor Counter : 16
Read this release in:
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam