హోం మంత్రిత్వ శాఖ
నక్సల్ రహిత భారత్ పై న్యూఢిల్లీలో జరిగిన భారత్ మంథన్ - 2025 సదస్సు ముగింపు సభలో హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగం
1960 దశకం నుంచి వామపక్ష హింసకు బలైన వారికి నివాళి, ఆత్మీయులను కోల్పోయిన వారికి, శారీరకంగా, మానసికంగా క్షోభకు గురైన వారికి సంతాపం తెలిపిన హోంమంత్రి
అభివృద్ధి లేకపోవడం వల్లే వామపక్ష తీవ్రవాదం వ్యాప్తిచెందిందని
కొందరు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు...
చేతిలో తుపాకులు పట్టుకున్న వారికి గిరిజనుల పట్ల శ్రద్ధ లేదు…
ప్రపంచం తిరస్కరించిన వామపక్ష భావజాలాన్ని బ్రతికించుకోవడమే వారి లక్ష్యం
తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి లేకపోవడానికి ఏకైక కారణం తీవ్రవాదమే
తీవ్రవాదానికి సైద్ధాంతిక పోషణ, చట్టపరమైన మద్దతు, ఆర్థిక సహాయం అందిస్తున్న వారిని
బహిర్గతం చేసే వరకు తీవ్రవాద ముప్పు….
పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు రెడ్ కారిడార్ నినాదం ఒకప్పుడు ఆందోళన కలిగించేది…
కానీ ఈరోజు దాని గురించి ప్రస్తావిస్తే ప్రజలు నవ్వుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో వామపక్ష పార్టీలు అధికారంలోకి వచ్చే వరకు తీవ్రవాదం వర్ధిల్లింది...
కానీ వారు అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ నుంచి నక్సలిజం అదృశ్యం
ఆయుధాలు వదిలిపెట్టే వారికి సాదర స్వాగతం…
అమాయక గిరిజనులను నక్సల్ హింస నుంచి కాపాడటం ప్రభుత్వ బాధ్యత
పెరుగుతున్న లొంగుబాట్ల సంఖ్య, నక్సలైట్లకు కాలం చెల్లిందని సూచిస్తోంది:
ప్రభుత్వానికి సలహాలిస్తూ సుదీర్ఘ వ్యాసాలు రాసే మేధావులు బాధితులైన గిరిజనుల గురించి ఎందుకు రాయరు? వారికి పక్షపాతం ఎందుకు?
మోదీ ప్రభుత్వం లొంగుబాటు విధానాన్ని ప్రోత్సహిస్తుంది…
కానీ తూటాకు తూటాతోనే సమాధానం
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను నిలిపివేయాలని వామపక్ష రాజకీయ పార్టీలు లేఖలు రాయడం
వారి నిజ స్వరూపాన్ని బయటపెట్టింది
ఛత్తీస్గఢ్లో ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆపరేషన్లలో సహకారం పరిమితంగా ఉండేది...
కానీ 2024లో మా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 290 మంది నక్సలైట్ల హతం
Posted On:
28 SEP 2025 9:15PM by PIB Hyderabad
నక్సల్ రహిత భారత్ - మోదీ నాయకత్వంలో ఉగ్రవాద నిర్మూలన పై ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన భారత్ మంథన్ - 2025 సదస్సు ముగింపు సభలో హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారు.
2026 మార్చి 31 నాటికి భారతదేశం తీవ్రవాదం (నక్సలిజం) నుంచి విముక్తి పొందుతుందని శ్రీ అమిత్ షా ఈ సందర్భంగా అన్నారు. నక్సలిజానికి సైద్ధాంతిక, చట్టపరమైన, ఆర్థిక సహాయం అందించే వారిని భారతీయ సమాజం అర్థం చేసుకునే వరకు నక్సలిజంపై పోరాటాన్ని ఆపేదిలేదని ఆయన అన్నారు. అంతర్గత భద్రత, దేశ సరిహద్దుల రక్షణ ఎల్లప్పుడూ తమ ప్రభుత్వ సిద్ధాంతానికి మూలభాగంగా ఉన్నాయని ఆయన తెలిపారు. అంతేకాక మూడు మూల సూత్రాలు- దేశంలోపల, వెలుపల భద్రత, సాంస్కృతిక జాతీయవాదం, భారతీయ సంస్కృతిలోని అన్ని అంశాల పునరుజ్జీవనం తమ పార్టీ లక్ష్యానికి కేంద్ర బిందువుగా ఉన్నాయని ఆయన చెప్పారు.1960 దశకు నుంచి వామపక్ష తీవ్రవాద హింస కారణంగా ప్రాణత్యాగం చేసిన వారికి ఆయన నివాళులర్పించారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి, శారీరక, మానసిక ఇబ్బందులను భరించిన వారందరికీ హోంమంత్రి సంతాపం తెలిపారు. వామపక్ష పార్టీలు అధికారంలోకి వచ్చే వరకు పశ్చిమ బెంగాల్లో నక్సలిజం వర్ధిల్లిందని, అవి అధికారంలోకి రాగానే నక్సలిజం అక్కడి నుంచి కనుమరుగైందని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పుడు, జమ్మూకాశ్మీర్, ఈశాన్య, వామపక్ష కారిడార్ అనే మూడు ప్రధాన ప్రాంతాలు దేశ అంతర్గత భద్రతను తీవ్రంగా దెబ్బతీశాయని శ్రీ అమిత్ షా అన్నారు. దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా ఈ మూడు ప్రాంతాల్లో తలెత్తి వ్యాపించిన అశాంతి కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, గణనీయమైన ఆస్తి నష్టం జరిగిందని, పేదల సంక్షేమాన్ని పక్కనపెట్టి దేశ బడ్జెట్లో ఎక్కువ భాగాన్ని ఈ ప్రాంతాల నిర్వహణకు మళ్లించారని, భద్రతా దళాలు కూడా అపారమైన ప్రాణనష్టాన్ని చవిచూశాయని ఆయన అన్నారు. ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ మూడు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, స్పష్టమైన, దీర్ఘకాలిక వ్యూహం ఆధారంగా పనిచేశారని ఆయన పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వ 10 సంవత్సరాల హయాంలో గణనీయమైన మార్పు వచ్చిందని హోంమంత్రి అన్నారు. నక్సలిజం, సాయుధ తిరుగుబాటు 1970 దశకంలో ప్రారంభమయ్యాయని ఆయన పేర్కొన్నారు. 1971లో స్వతంత్ర భారతంలో 3,620 హింసాత్మక ఘటనలు జరిగాయి. తదనంతరం, 1980 దశకంలో పీపుల్స్ వార్ గ్రూప్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, కేరళకు విస్తరించింది. 1980 దశకం తరువాత, వామపక్ష తీవ్రవాద గ్రూపులు ఒకదానితో ఒకటి విలీనం కావడం ప్రారంభించాయని, 2004 లో, ప్రధాన సిపిఐ (మావోయిస్ట్) గ్రూప్ ఏర్పాటుతో నక్సల్ హింస తీవ్రమైన రూపాన్ని సంతరించుకుందని ఆయన తెలిపారు. . పశుపతి నాథ్ నుంచి తిరుపతి వరకు కారిడార్ ను రెడ్ కారిడార్ అని పిలిచేవారని గుర్తుచేశారు.
దేశంలోని 17 శాతం భూభాగం రెడ్ కారిడార్ గుప్పెట్లో ఉండేదని, ఇది 120 మిలియన్ల జనాభాను ప్రభావితం చేసిందని శ్రీ అమిత్ షా అన్నారు. అప్పట్లో 10 శాతం జనాభా తీవ్రవాద మూప్పుతో జీవించారని పేర్కొన్నారు. దీనితో పోలిస్తే, దేశ భూభాగంలో 1 శాతం ఉగ్రవాద ప్రభావిత ప్రాంతమైన కాశ్మీర్, 3.3 శాతం అశాంతితో సతమతమవుతున్న ఈశాన్య రాష్ట్రాలు తక్కువ తీవ్ర ప్రాంతాలని శ్రీ షా పేర్కొన్నారు. 2014లో శ్రీ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక చర్చలు, భద్రత, సమన్వయం అనే మూడు అంశాలపై ప్రభుత్వం పనిచేయడం ప్రారంభించిందని, ఫలితంగా 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి సాయుధ నక్సలిజం అంతం కాగలదని ఆయన అన్నారు.
గతంలో పనులు తాత్కాలికంగా జరిగేవని, ప్రతిస్పందనలు సంఘటనల ఆధారంగా ఉండేవని, శాశ్వత విధానం అంటూ ఏదీ ఉండేది కాదని హోంమంత్రి అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే, ప్రభుత్వ ప్రతిస్పందన పగ్గాలు నక్సలైట్ల చేతుల్లో ఉండేవని శ్రీ షా అన్నారు. 2014 తర్వాత ప్రభుత్వ ప్రచారాలు, కార్యక్రమాల పగ్గాలు భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ చేతుల్లోకి వచ్చాయని, ఇది చాలా ముఖ్యమైన విధాన మార్పు అని ఆయన పేర్కొన్నారు.
తాత్కాలిక విధానానికి బదులుగా, మోదీ ప్రభుత్వం ఒకే విధమైన, కఠినమైన విధానాన్ని అవలంబించిందని శ్రీ అమిత్ షా అన్నారు. ఆయుధాలు వీడి లొంగిపోవాలనుకునే వారికి సాదరస్వాగతం పలకడం ప్రభుత్వ విధానమని, అయితే అమాయక గిరిజనులను చంపడానికి ఎవరైనా ఆయుధాలు చేపడితే, ఆ అమాయక గిరిజనులను రక్షించడం, సాయుధ నక్సలైట్లను ఎదుర్కోవడం ప్రభుత్వ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.
మొదటిసారిగా, భారత ప్రభుత్వం ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టమైన విధానాన్ని అవలంబించిందని శ్రీ అమిత్ షా అన్నారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలకు స్వేచ్ఛనిచ్చామని, నిఘా, సమాచార మార్పిడి, ఆపరేషన్లలో సమన్వయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆచరణాత్మక సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. నక్సలైట్లకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరాపై కఠిన నియంత్రణ విధించినట్లు ఆయన తెలిపారు. 2019 తర్వాత, ఆయుధ సరఫరాను 90 శాతానికి పైగా నిరోధించడంలో విజయం సాధించామని తెలిపారు. . నక్సలైట్లకు ఆర్థిక సహాయం చేసే వారిపై ఎన్ఐఏ, ఈడీ ఉచ్చు బిగించాయని, పట్టణ నక్సల్స్ కు మద్దతు, వారి న్యాయ సహాయ వ్యవస్థ, వారికి అనుకూలంగా మీడియా కథనాల సృష్టికి వ్యతిరేకంగా కూడా పోరాడామని ఆయన తెలిపారు. సెంట్రల్ కమిటీ సభ్యులను లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకున్నామని, ఆగస్టు 19 నుంచి ఇప్పటి వరకు 18 మందికి పైగా సెంట్రల్ కమిటీ సభ్యులు హతమయ్యారని ఆయన చెప్పారు.
భద్రతా లోటును కూడా భర్తీ చేశామని హోంమంత్రి చెప్పారు. ఆపరేషన్ ఆక్టోపస్, ఆపరేషన్ డబుల్ బుల్ వంటి నిర్దేశిత ఆపరేషన్లు జరిగాయని తెలిపారు. డిఆర్జి, ఎస్టిఎఫ్, సిఆర్పిఎఫ్, కోబ్రా యూనిట్లకు ఉమ్మడి శిక్షణ కూడా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ నాలుగు బలగాలు ఇప్పుడు కలసి ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయని, వారి కమాండ్ శ్రేణి స్పష్టమైందని ఆయన వెల్లడించారు. సమగ్ర శిక్షణ తమ విజయానికి ఎంతగానో దోహదపడిందని ఆయన అన్నారు. దీనితో పాటు, ఫోరెన్సిక్ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది, మొబైల్ ఫోన్ కార్యకలాపాలను రాష్ట్ర పోలీసులతో పంచుకున్నట్లు, శాస్త్రీయ కాల్ లాగ్ విశ్లేషణ సాఫ్ట్వేర్ రూపొందించినట్లు, సోషల్ మీడియా విశ్లేషణ ద్వారా అజ్ఞాత మద్దతుదారులను బయటపెట్టినట్లు వివరించారు. ఈ చర్యలు నక్సల్ వ్యతిరేక చర్యలను వేగవంతం చేయడమే కాకుండా మరింత ఫలితాలు ఇచ్చేలా మార్చాయని ఆయన అన్నారు.
2019 తర్వాత, రాష్ట్రాల సామర్థ్య పెంపునకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఎస్ఆర్ఈ, ఎస్ఐఎస్ పథకాల కింద సుమారు రూ. 3,331 కోట్లు విడుదలయ్యాయి, ఇది 55 శాతం పెరుగుదలను సూచిస్తుంది. దీని ద్వారా, పటిష్టమైన పోలీస్ స్టేషన్లను విస్తరించారు, వాటిపై సుమారు రూ. 1,741 కోట్లు ఖర్చు చేశారు. గత ఆరేళ్లలో భద్రతా లోటును పరిష్కరించడానికి మోదీ ప్రభుత్వం 336 కొత్త సీఏపిఎఫ్ శిబిరాలను ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా, 2004-14 మధ్య కాలంతో పోలిస్తే, 2014-24 మధ్య కాలంలో భద్రతా సిబ్బంది మరణాలు 73 శాతం, పౌరుల మరణాలు 74 శాతం తగ్గాయి. గతంలో ఛత్తీస్గఢ్లో ప్రతిపక్ష ప్రభుత్వం ఉండటం వల్ల అక్కడ విజయం అంతంత మాత్రంగానే ఉండేదని శ్రీ షా అన్నారు. అయితే, 2024లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒకే ఏడాదిలో అత్యధికంగా 290 మంది నక్సలైట్లను భద్రతా దళాలు హతమార్చాయని తెలిపారు.
ప్రభుత్వం ఎవరినీ చంపాలనుకోవడం లేదని హోంమంత్రి అన్నారు. 290 మంది నక్సలైట్లు హతమైనప్పటికీ, 1,090 మందిని అరెస్టు చేశామని, 881 మంది లొంగిపోయారని తెలిపారు. ఇది ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. నక్సలైట్లకు లొంగిపోయేందుకు లేదా అరెస్టు అయ్యేందుకు ప్రతి అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. అయితే, నక్సలైట్లు ఆయుధాలు పట్టి అమాయక భారత పౌరులను చంపాలని చూస్తే, భద్రతా దళాలకు బలవంతంగా ప్రతిస్పందించడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు. 2025లో ఇప్పటివరకు 270 మంది నక్సలైట్లు హతం కాగా, 680 మందిని అరెస్టు చేశామని, 1,225 మంది లొంగిపోయారని శ్రీ షా తెలిపారు. ఈ రెండు సంవత్సరాలలో, హతమైన వారి సంఖ్య కంటే లొంగిపోయిన, అరెస్టయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. లొంగిపోయిన వారి సంఖ్య అధికంగా ఉండడం నక్సలైట్లకు మిగిలి ఉన్న సమయం ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నట్టు సూచిస్తుందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట కొండల్లో నక్సలైట్లు ఒక పెద్ద శిబిరాన్ని ఏర్పాటు చేశారని, అందులో భారీగా ఆయుధాలు, రెండు సంవత్సరాల సరిపడా రేషన్, ఐఈడీలను తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయని, అక్కడికి చేరుకోవడం అత్యంత కష్టమని శ్రీ అమిత్ షా చెప్పారు. మే 23, 2025 న ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లో ఈ ఈ శిబిరాన్ని ధ్వంసం చేశారని, 27 మంది కరడుగట్టిన నక్సలైట్లు మరణించారని ఆయన వివరించారు. . బీజాపూర్ లో 24 మంది నక్సలైట్లు హతమయ్యారని. ఈ ఆపరేషన్ తో ఛత్తీస్ ఘడ్ లో మిగిలిన నక్సలైట్ల వెన్నెముక విరిగిందని హోంమంత్రి తెలిపారు. 2024లో మరణించిన నక్సలైట్లలో ఒక జోనల్ కమిటీ సభ్యుడు, ఐదుగురు సబ్-జోనల్ కమిటీ సభ్యులు, ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు, 31 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 59 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారని శ్రీ షా పేర్కొన్నారు.
1960 నుంచి 2014 వరకు మొత్తం 66 పటిష్టమైన పోలీస్ స్టేషన్లు ఉండగా, మోదీ ప్రభుత్వ 10 ఏళ్లలో 576 కొత్త పటిష్టమైన పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామని హోంమంత్రి, తెలిపారు. 2014లో నక్సల్ ప్రభావిత జిల్లాలు 126 ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 18కి తగ్గింది.
అత్యంత ప్రభావిత జిల్లాల సంఖ్య 36 నుంచి ఆరుకి తగ్గింది. పోలీస్ స్టేషన్ల సంఖ్య సుమారు 330 నుంచి 151కి తగ్గింది, అందులో 41 కొత్తగా ఏర్పాటు అయ్యాయి. గత ఆరేళ్లలో 336 భద్రతా శిబిరాలు ఏర్పాటు చేశారు. రాత్రిపూట ల్యాండింగ్ కోసం 68 హెలిప్యాడ్లను నిర్మించామని శ్రీ షా తెలిపారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది కోసం 76 రాత్రిపూట ల్యాండింగ్ హెలిప్యాడ్లను నిర్మించారు. నక్సలైట్లకు ఆర్థిక సహాయం చేరకుండా అరికట్టేందుకు ఎన్ఐఏ, ఈడీ, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం కోసం ముఖ్యమంత్రులతో 12 సమావేశాలు నిర్వహించామని, ముఖ్యంగా ఛత్తీస్ ఘడ్ తో 8 సమావేశాలు జరిగాయని హోంమంత్రి చెప్పారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం లొంగిపోయే నక్సలైట్ల కోసం ఆకర్షణీయమైన ప్యాకేజీని ప్రవేశపెట్టిందని, వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వామపక్ష భావజాలం పాతుకుపోయినా, దానికి హింసతో విడదీయరాని సంబంధం ఉంటుందని, అదే నక్సలిజానికి మూలమని హోంమంత్రి వ్యాఖ్యానించారు.
వామపక్ష తీవ్రవాదానికి మూలకారణం అభివృద్ధి లేకపోవడమే అని ప్రచారం చేసేవారు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నవారుగా పరిగణించాలని శ్రీ అమిత్ షా అన్నారు. 60 కోట్ల మంది పేదల కోసం ప్రధానమంత్రి మోదీ ఎన్నో పథకాలను ప్రారంభించారని, అయితే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆ పథకాలు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. సుక్మా లేదా బిజాపూర్కు పాఠశాలలు ఎందుకు రాలేదని, ఎవరు బాధ్యులని కూడా ప్రశ్నించారు. వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో రోడ్లు ఎందుకు నిర్మించలేదు? ఎందుకంటే ఆ కాంట్రాక్టర్లను నక్సలైట్లే చంపేశారు అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ పెద్ద పెద్ద వ్యాసాలు రాసే మేధావులు బాధితులైన గిరిజనుల గురించి ఎందుకు రాయరని, వారి సానుభూతి ఎందుకు పక్షపాతంతో ఉంటుంది? అని శ్రీ షా ప్రశ్నించారు. నక్సలైట్ల మద్దతుదారులు గిరిజనుల అభివృద్ధిని కోరుకోవడం లేదని, వారిపై నిజమైన శ్రద్ధ చూపడం లేదని ఆయన అన్నారు. దానికి బదులుగా, వారు ప్రపంచవ్యాప్తంగా తిరస్కరణకు గురైన తమ భావజాలాన్ని సజీవంగా ఉంచడం గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతాలకు అభివృద్ధి చేరకపోవడానికి ఏకైక కారణం వామపక్ష భావజాలమేనని శ్రీ షా పేర్కొన్నారు.
నక్సలైట్లు మొదటగా రాజ్యాంగాన్ని, ఆ తర్వాత న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారని హోంమంత్రి అన్నారు. వారు రాజ్యాంగ శూన్యతను సృష్టించి ఆ తర్వాత ప్రభుత్వ ఉనికినే సవాల్ చేసి ప్రభుత్వ స్వరూపంలోనే లోటును సృష్టించారని అన్నారు. తమతో చేరని వారిని ప్రభుత్వ ఇన్ఫార్మర్గా ముద్రించి తమవిగా పిలుచుకునే ప్రజాకోర్టులలో మరణశిక్ష విధించారని ఆయన పేర్కొన్నారు. వారు సమాంతర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారని అన్నారు. ఒకరి భావజాలానికి లోబడితే దేశ సంక్షేమం సాధ్యం కాదని, శ్రీ షా స్పష్టం చేశారు. ఈ పరిపాలన శూన్యత కారణంగానే ఆ ప్రాంతాలకు అభివృద్ధి, అక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు చేరలేదని ఆయన అన్నారు.
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ సమయంలో, వామపక్ష రాజకీయ పార్టీలు దానిని ఆపాలని అభ్యర్థిస్తూ లేఖలు రాశాయని, అవి వారి నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశాయని హోంమంత్రి అన్నారు. నక్సలైట్లతో కాల్పుల విరమణ ఉండదని, వారు లొంగిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. వారు తమ ఆయుధాలను వదిలివేయాలని, పోలీసులు ఒక్క తూటా కూడా కాల్చరని, వారిని సాధారణ స్రవంతి లోకి చేర్చుకుంటారని శ్రీ అమిత్ షా తెలిపారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ప్రారంభమైన వెంటనే, నక్సలైట్ల మద్దతుదారుల రహస్య సానుభూతి అంతా బట్టబయలైందని ఆయన అన్నారు.
2014 - 2024 మధ్య, వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలలో 12,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగిందని, 17,500 రోడ్లకు బడ్జెట్లు ఆమోదం పొందాయని, రూ. 6,300 కోట్ల వ్యయంతో 5,000 మొబైల్ టవర్లు ఏర్పాటు అయ్యాయని హోంమంత్రి తెలిపారు. 1,060 బ్యాంకు శాఖలు తెరిచారని, 937 ఏటీఎంలు ఏర్పాటు చేశారని, 37,850 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు నియమితులయ్యారని, 5,899 పోస్టాఫీసులు తెరిచారని, 850 పాఠశాలలు, అన్ని సౌకర్యాలతో 186 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారని శ్రీ షా వివరించారు. నియద్నెల్లనార్ పథకం కింద ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డుల ఆమోదం, పాఠశాలలు, రేషన్ దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై పనిచేస్తోందని తెలిపారు.
ఈశాన్యంలో తిరుగుబాటును ప్రస్తావిస్తూ, 2004-2014తో పోలిస్తే, 2014-2024 మధ్య కాలంలో భద్రతా సిబ్బంది మరణాలలో 70 శాతం తగ్గుదల కనిపించిందని హోంమంత్రి అన్నారు. అదేవిధంగా, 2004-2014తో పోలిస్తే 2014-2024లో పౌరుల మరణాలు 85 శాతం తగ్గాయి. మోదీ ప్రభుత్వం 12 ముఖ్యమైన శాంతి ఒప్పందాలను సులభతరం చేసింది. 10,500 మంది సాయుధ యువకులను లొంగిపోయేలా చేయడం ద్వారా వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చింది. ఒకప్పుడు మొత్తం ఈశాన్య ప్రాంతం దేశంలోని మిగిలిన భాగంతో వేరుపడిన పరిస్థితి. ఉండేదని, కానీ, నేడు రైళ్లు, రోడ్లు, విమాన మార్గాల ద్వారా అనుసంధానమైందని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం భౌతిక దూరాన్ని మాత్రమే కాకుండా, రాజధాని ఢిల్లీకి, ఈశాన్య ప్రాంతాల మధ్య ఉన్న భావోద్వేగ దూరాన్ని కూడా తగ్గించిందని అన్నారు. నేడు ఈశాన్య ప్రాంతం శాంతి, అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.
జమ్మూకాశ్మీర్లో ప్రధాని మోదీ నాయకత్వంలో 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు హోంమంత్రి తెలిపారు. ఆ తరువాత, ప్రభుత్వం అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన కార్యక్రమాల ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొందని చెప్పారు. కాశ్మీర్ లో పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన విధానంలో వ్యవహరించిందని ఆయన అన్నారు. 2004-2014లో 7,300 హింసాత్మక సంఘటనలు జరగగా, 2014-2024లో 1,800 హింసాత్మక సంఘటనలు జరిగాయని శ్రీ షా పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది మరణాలు 65 శాతం, పౌరుల మరణాలు 77 శాతం తగ్గాయి. దేశం లోని ప్రతి ఒక్క చట్టాన్ని ప్రస్తుతం అక్కడ కూడా అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా జమ్మూకాశ్మీర్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇందులో 99.8 శాతం పోలింగ్ నమోదైంది. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాద సమస్యను పరిష్కరించే మార్గంలో ముందుకు సాగుతున్నామని శ్రీ షా తెలిపారు.
***
(Release ID: 2172613)
Visitor Counter : 28