ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్లోని బన్స్వారాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
25 SEP 2025 6:11PM by PIB Hyderabad
మాతా త్రిపుర సుందరి కీ జై, బెనేశ్వర్ ధామ్ కీ జై, మాంగడ్ ధామ్ కీ జై, గౌరవనీయ గవర్నర్ శ్రీ హరిభావ్ బగాడే గారు, ముఖ్యమంత్రి శ్రీ భజన్లాల్ శర్మ గారు, మాజీ ముఖ్యమంత్రి సోదరి వసుంధర రాజే గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు ప్రహ్లాద్ జోషి గారు, జోధ్పూర్ నుంచి మాతో చేరిన గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అశ్వినీ వైష్ణవ్ గారు, బికనేర్ నుంచి మాతో చేరిన శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, ఉప ముఖ్యమంత్రులు ప్రేమ్ చంద్ భైర్వా గారు, దియా కుమారి గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మదన్ రాథోడ్ గారు, రాజస్థాన్ ప్రభుత్వ మంత్రులు, ఇక్కడ ఉన్న ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా.. మీ అందరికీ జై గురు! రామ్-రామ్!
ఈ నవరాత్రి ఉత్సవాల నాల్గో రోజున మన త్రిపుర సుందరి మాత కొలువైన బన్స్వారాను సందర్శించే భాగ్యం నాకు లభించింది. కాంథల్, వాగడ్ల గంగామాతగా పరిగణించే మాతా మాహి 'దర్శనం' కూడా నాకు లభించింది. మాహి నది జలాలు మన గిరిజన సోదరీ సోదరుల పోరాటం, సమర్థతతను సూచిస్తాయి. మహనీయులు గోవింద్ గురు గారి స్ఫూర్తిదాయక నాయకత్వం కొత్త చైతన్యాన్ని నింపింది.. మాహి పవిత్ర జలాలు ఆ ఇతిహాస గాథకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మాతా త్రిపుర సుందరి దేవికి, మాతా మాహికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను.
మిత్రులారా,
భక్తి, శౌర్యాలకు నిలయమైన ఈ భూమికి చెందిన వీరులు మహారాణా ప్రతాప్, రాజా బన్సియా భిల్లకూ నేను గౌరవపూర్వక నివాళులు అర్పిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
మిత్రులారా,
నవరాత్రి ఉత్సవాల్లో మనం తొమ్మిది శక్తి రూపాలను పూజిస్తాం. ఇంధన శక్తికి అంటే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన గొప్ప కార్యక్రమం ఈ రోజు ఇక్కడ జరుగుతోంది. విద్యుత్ రంగంలో భారత్ సామర్థ్యాన్ని సూచించే నూతన అధ్యాయం రాజస్థాన్ నేల మీద ప్రారంభమవుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో 90,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన విద్యుత్ ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభమయ్యాయి. 90,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ఏకకాలంలో ప్రారంభించడం విద్యుత్ రంగంలో దేశం ముందుకు సాగుతున్న వేగాన్ని సూచిస్తుంది. దేశంలోని ప్రతి ప్రాంతం ఈ వేగంలో పాల్గొంటుందనీ ఇది చూపిస్తుంది. ప్రతి రాష్ట్రానికీ ప్రాధాన్యమిస్తున్నాం. ఇక్కడ రాజస్థాన్లో కూడా పరిశుద్ధ ఇంధన ప్రాజెక్టులు, విద్యుత్ ప్రసార లైన్లకు శంకుస్థాపన జరిగింది. బన్స్వారాలో రాజస్థాన్ అణు విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇక్కడ సౌరశక్తి ప్రాజెక్టు కూడా ప్రారంభమైంది. దీని అర్థం దేశం తన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సౌరశక్తి నుంచి అణుశక్తి దాకా సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తోంది.
మిత్రులారా,
నేటి సాంకేతిక, పరిశ్రమల యుగంలో అభివృద్ధి వాహనం విద్యుత్తుపై మాత్రమే నడుస్తుంది. విద్యుత్ ఉంటే కాంతి ఉంటుంది! విద్యుత్ ఉంటే వేగం ఉంటుంది! విద్యుత్ ఉంటే పురోగతి ఉంటుంది! విద్యుత్ ఉంటే దూరాలు తగ్గిపోతాయి! విద్యుత్ ఉంటే ప్రపంచం మనకు అందుబాటులో ఉంటుంది.
కానీ నా సోదరీ సోదరులారా,
మన దేశంలో చాలా ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ప్రాముఖ్యాన్ని ఎన్నడూ పట్టించుకోలేదు. మీరు నాకు దేశానికి సేవ చేసేందుకు అవకాశం ఇచ్చినప్పుడు.. 2014లో నేను బాధ్యతలు తీసుకున్న సమయానికి.. దేశంలో 2.5 కోట్ల గృహాలకు విద్యుత్ కనెక్షన్ లేదు. 70 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలోని 18,000 గ్రామాల్లో విద్యుత్ స్తంభం కూడా లేదు. పెద్ద నగరాల్లో గంటల తరబడి విద్యుత్ కోతలుండేవి. గ్రామాల్లో 4–5 గంటలు విద్యుత్ సరఫరా చేయడం పెద్ద విషయంగా భావించేవారు. ఆ సమయంలో కరెంటు పోతే వార్త కాదు.. కరెంటు వస్తేనే వార్త అని ప్రజలు పరిహాసం చేసేవారు. ఒక్క గంట పాటు కరెంటు పోకుండా ఉంటే ప్రజలు ఒకరినొకరు అభినందించుకునే పరిస్థితి. విద్యుత్ లేకుండా కర్మాగారాలు నడవలేవు.. కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయలేం.. కేవలం రాజస్థాన్లోనే కాదు.. దేశవ్యాప్తంగా పరిస్థితి అలాగే ఉండేది.
సోదరీ సోదరులారా,
2014లో మా ప్రభుత్వం ఈ పరిస్థితులను మార్చాలని సంకల్పించింది. దేశంలోని ప్రతి గ్రామానికీ విద్యుత్తును తీసుకువచ్చాం. 2.5 కోట్ల గృహాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లూ ఇచ్చాం. విద్యుత్ తీగలున్న ప్రతిచోటుకీ విద్యుత్తు చేరుకుంది.. జీవితాలు సులభతరం అయ్యాయి.. కొత్త పరిశ్రమలూ వచ్చాయి.
మిత్రులారా,
21వ శతాబ్దంలో వేగంగా అభివృద్ధి చెందాలనుకునే ఏ దేశమైనా దాని విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలి. ఈ విషయంలో అత్యంత విజయవంతమైనవి పరిశుద్ధ ఇంధన రంగంలో ముందున్న దేశాలు మాత్రమే. అందుకే మా ప్రభుత్వం పరిశుద్ధ ఇంధన ప్రచారాన్ని ప్రజా ఉద్యమంగా మార్చింది. మేం పీఎమ్ సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభించాం. ఈ పథకం కింద నగరాలు, గ్రామాల్లో పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తున్నాం. మన రైతులకు చౌకగా విద్యుత్ అందించే లక్ష్యంతో పీఎమ్-కుసుమ్ యోజన ద్వారా పొలాల్లో సౌర పంపులను ఏర్పాటు చేస్తున్నాం. ఈ దిశగా అనేక రాష్ట్రాల్లో సౌర ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులు లక్షలాది మంది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయి. అంటే ఇంట్లో ఉచిత విద్యుత్ కోసం పీఎమ్ సూర్య ఘర్ యోజన.. పొలాల్లో ఉచిత విద్యుత్ కోసం పీఎమ్-కుసుమ్ యోజన అందుబాటులో ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే నేను పీఎమ్-కుసుమ్ యోజన లబ్దిదారులైన అనేక మంది రైతులతో మాట్లాడాను. వారిలో మహారాష్ట్రకు చెందిన రైతులు ఉన్నారు. వారు నాతో పంచుకున్న అనుభవాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. సౌరశక్తి ద్వారా లభిస్తున్న ఉచిత విద్యుత్ వారికి ఒక గొప్ప వరంగా వారు భావిస్తున్నారు.
మిత్రులారా,
భారత్ నేడు అభివృద్ధి ప్రయాణంలో వేగంగా పురోగమిస్తోంది.. ఈ ప్రయాణంలో రాజస్థాన్ కీలక పాత్ర పోషిస్తోంది. రాజస్థాన్ ప్రజల కోసం ఈ రోజు 30,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం. నీరు, విద్యుత్, ఆరోగ్య రంగాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులు మీ అందరికీ సౌకర్యాలను మెరుగుపరుస్తాయి. వందే భారత్ సహా మూడు కొత్త రైళ్లనూ ప్రారంభించుకున్నాం. ఈ సమయంలో దేశవ్యాప్తంగా కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించే ప్రధాన ప్రచారం కూడా కొనసాగుతోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు రాజస్థాన్లోని 15,000 మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం నియామక పత్రాలను అందుకున్నారు. ఈ యువకులందరికీ వారి జీవితాల్లో ఈ కొత్త ప్రయాణం కోసం నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రాజస్థాన్ ప్రజలను కూడా నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా,
రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి నిజాయితీతో పనిచేస్తోంది. ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం. రాజస్థాన్ను దోచుకోవడం ద్వారా కాంగ్రెస్ కలిగించిన గాయాలను మా ప్రభుత్వం నయం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజస్థాన్ పేపర్ లీకేజీలకు కేంద్రంగా మారింది. కాంగ్రెస్ హయాంలో జల్ జీవన్ మిషన్ను కూడా అవినీతి బలిపీఠానికి బలి చేశారు.. మహిళలపై నేరాలు గరిష్ట స్థాయిలో ఉండేవి.. అత్యాచారాలకు పాల్పడిన వారికి రక్షణ లభించేది. కాంగ్రెస్ పాలనలో బన్స్వారా, దుంగార్పూర్, ప్రతాప్గఢ్ వంటి ప్రాంతాల్లో నేరాలు, అక్రమ మద్య వ్యాపారం జోరుగా సాగేవి. కానీ మీ ఆశీర్వాదంతో ఇక్కడ బీజేపీ అధికారలోకి రాగానే మేం శాంతిభద్రతలను బలోపేతం చేశాం.. పథకాలను వేగవంతం చేశాం.. ప్రధాన ప్రాజెక్టులను ప్రారంభించాం. ఈ రోజు రాజస్థాన్ అంతటా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు వస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం రాజస్థాన్ను.. ముఖ్యంగా దక్షిణ రాజస్థాన్ను వేగవంతమైన అభివృద్ధి మార్గంలోకి తీసుకువస్తోంది.
మిత్రులారా,
ఈ రోజు పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి. ఆయన మనకు అంత్యోదయ సూత్రాన్ని అందించారు. అంత్యోదయ అంటే సమాజంలోని అట్టడుగు వర్గాలను అబివృద్ధి చేయడం. ఆయన దార్శనికతను మా లక్ష్యంగా ఎంచుకున్నాం. పేదలు, దళితులు, వెనకబడిన తరగతులు, గిరిజనుల సంక్షేమం కోసం సేవా స్ఫూర్తితో పనిచేస్తున్నాం. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' మంత్ర మార్గనిర్దేశనంలో మేం ముందుకు సాగుతున్నాం.
మిత్రులారా,
కాంగ్రెస్ గిరిజన సమాజాన్ని పూర్తిగా విస్మరించింది.. వారి అవసరాలను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. బీజేపీ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చింది.. వారి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖనూ ఏర్పాటు చేసింది. అటల్ జీ ప్రభుత్వంలో మొదటిసారిగా గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది. అంతకుముందు దశాబ్దాలు గడిచాయి.. గొప్ప నాయకులు వచ్చి వెళ్లిపోయారు.. కానీ గిరిజన వర్గాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదు. అటల్ జీ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత మాత్రమే.. బీజేపీ హయాంలోనే ఇది సాధ్యమైంది. కాంగ్రెస్ కాలంలో గిరిజన ప్రాంతాల్లో ఇంత పెద్ద ప్రాజెక్టులను ఎవరూ ఊహించలేదు! కానీ బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇదంతా సాధ్యమైంది. ఇటీవలే మధ్యప్రదేశ్లోని ధార్లో ఒక భారీ పీఎమ్ మిత్ర పార్కును మేం ప్రారంభించాం. ఇది కూడా గిరిజన ప్రాంతమే. ఇది గిరిజన రైతులకు, ముఖ్యంగా పత్తి పండించే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.
మిత్రులారా,
భాజపా కృషి వలనే పేద గిరిజన కుటుంబంలోని ఆడపడుచు రాష్ట్రపతి అయ్యారు. గౌరవనీయులైన ద్రౌపది ముర్ము గారు దేశానికి రాష్ట్రపతి అయ్యారు. అత్యంత అణగారిన గిరిజన వర్గాల అంశాన్ని స్వయంగా రాష్ట్రపతే లేవనెత్తారు. ఆమె స్ఫూర్తితో ప్రధానమంత్రి జన్మన్ యోజనను మేం ప్రారంభించాం. ఈ పథకం కింద అత్యంత అణగారిన గిరిజన వర్గాలకు కూడా ప్రాధాన్యత లభిస్తోంది. నేడు ధర్తీ ఆబా జన్జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద గిరిజన గ్రామాలు ఆధునికీకరణ అవుతున్నాయి. భగవాన్ బిర్సా ముండాను ధర్తీ ఆబాగా ప్రజలు పరిగణిస్తారు. ఈ పథకం కింద 5 కోట్లకు పైగా గిరిజన ప్రజలకు ప్రయోజనం చేకూరుతోంది. దేశవ్యాప్తంగా వందలాది ఏకలవ్య మోడల్ ఆవాస పాఠశాలలు ఏర్పాటవుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో నివసించే వారితో పాటు షెడ్యూల్డ్ తెగల వారి అటవీ హక్కులను కూడా మేం గుర్తించాం.
మిత్రులారా,
మన గిరిజన సోదరీసోదరులు వేల సంవత్సరాలుగా అటవీ వనరులను ఉపయోగిస్తున్నారన్న విషయం మీకు కూడా తెలుసు. అటవీ వనరులు వాళ్ల పురోగతికి ఒక మార్గంగా మారేలా చూసుకునేందుకు మేం వన్ ధన్ యోజనను ప్రారంభించాం. అటవీ ఉత్పత్తులకు కనిష్ఠ మద్దతు ధరను పెంచాం. గిరిజన ఉత్పత్తులను మార్కెట్లతో అనుసంధానించాం. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా అటవీ ఉత్పత్తుల విషయంలో రికార్డు స్థాయి వృద్ధి కనిపిస్తోంది.
మిత్రులారా,
గిరిజన సమాజం గౌరవంగా జీవించే అవకాశాలను కల్పించాలన్న నిబద్ధతో మేం ఉన్నాం. వారి విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని కాపాడతామన్న హామీని మే ఇస్తున్నాం.
మిత్రులారా,
సామాన్యుల జీవితం సులభతరం అయినప్పుడు.. దేశాన్ని పురోగతి బాటను నడిపించటంలో వాళ్లే ముందుంటారు. 11 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ కాలంలో పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని మీకు గుర్తుండే ఉంటుంది. అది ఎందుకు దారుణంగా ఉంది? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజలను దోపిడీ చేయటంలో నిమగ్నమై ఉంది. ఆ సమయంలో పన్నులు, ద్రవ్యోల్బణం.. రెండూ ఆకాశాన్ని తాకాయి. మీరు మోదీని ఆశీర్వదించినప్పుడు మా ప్రభుత్వం కాంగ్రెస్ దోపిడీకి ముగింపు పలికింది.
మిత్రులారా,
ప్రస్తుతం వాళ్లు నాపై ఇంత కోపంతో ఉండటానికి కారణం కూడా ఇదే.
మిత్రులారా,
2017లో జీఎస్టీని అమలు చేయడం ద్వారా దేశాన్ని పన్నులు, సుంకాల చిక్కుముడి నుంచి విముక్తి చేశాం. ఈ నవరాత్రి మొదటి రోజు నుంచే జీఎస్టీలో మరో పెద్ద సంస్ఖరణ అమల్లోకి వచ్చింది. ఫలితంగా నేడు దేశం మొత్తం.. జీఎస్టీ పొదుపు పండుగను చేసుకుంటోంది. ఇళ్లలో ఉపయోగించే రోజువారీ వస్తువులు ధర చాలా తగ్గింది. ఇక్కడ చాలా మంది తల్లులు, సోదరీమణులు సమావేశమయ్యారు. నేను వాహనంలో ఇక్కడికి వస్తున్నప్పుడు తల్లులు, సోదరీమణులంతా ఆశీర్వాదాలను అందిస్తున్నారు. తల్లులు, సోదరీమణుల కుటుంబ ఖర్చులు తగ్గాయి.
మిత్రులారా,
2014 కి ముందు మీరు సబ్బు, షాంపూ, టూత్పేస్ట్, టూత్ పౌడర్ వంటి 100 రూపాయల విలువైన నిత్యావసరాలను కొనుగోలు చేస్తే.. మీరు వాస్తవానికి 131 రూపాయలు చెల్లించారు. ఆ వస్తువు ధర 100 రూపాయలే కానీ మీరు 131 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. 2014కు ముందు.. అంటే ప్రస్తుతం ఉన్న ‘ప్రకటన యోధులు’ అన్ని రకాల అబద్ధాలను వ్యాప్తి చేసిన కాలం గురించి నేను చెబుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రూపాయల కొనుగోలుపై 31 రూపాయల పన్ను వసూలు చేసేది. 2017లో మొదటిసారి జీఎస్టీ అమలు చేసినప్పుడు.. అదే 100 రూపాయల వస్తువు కేవలం 118 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చితే భాజపా ప్రభుత్వంలో ప్రజలు ప్రతి 100 రూపాయలపై 13 రూపాయలు ఆదా చేశారు. ఇప్పుడు సెప్టెంబర్ 22 నుంచి మేం అమలు చేసిన జీఎస్టీ సంస్కరణల తర్వాత.. గతంలో 131 రూపాయలు ఉన్న అదే 100 రూపాయల వస్తువు.. ఇప్పుడు 105 రూపాయలకు వచ్చింది. అంటే 5 రూపాయల పన్ను మాత్రమే ఉంది. 31 రూపాయల పన్ను కేవలం 5 రూపాయలకు వచ్చింది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ కాలంతో పోల్చితే ప్రస్తుతం మీరు ఖర్చు చేసే ప్రతి 100 రూపాయలపై 26 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. తల్లులు, సోదరీమణులు.. నెలవారీ బడ్జెట్ను జాగ్రత్తగా నిర్వహించుకుంటున్నారు. దీని ప్రకారం మీరు ఇప్పుడు ప్రతి నెలా వందల రూపాయలు ఆదా చేస్తున్నారు.
మిత్రులారా,
పాదరక్షలు అందరికీ అవసరమైనవే. కాంగ్రెస్ పాలనలో మీరు 500 రూపాయల విలువైన బూట్లు కొంటే.. మీకు 575 రూపాయల ఖర్చయ్యేది. అంటే 500 రూపాయల బూట్లపై కాంగ్రెస్ 75 రూపాయల పన్ను వసూలు చేసింది. మేం జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు పన్ను 15 రూపాయలు తగ్గింది. కొత్త జీఎస్టీ సంస్కరణల తర్వాత ఇప్పుడు మీరు అదే జత బూట్లపై మరో 50 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. గతంలో 500 రూపాయల కంటే ఎక్కువ విలువైన బూట్లపై మరింత ఎక్కువ పన్ను ఉండేది. ఆ 500 రూపాయల స్లాబ్ను మేం తొలగించాం. ఇప్పుడు 500 రూపాయల వరకు మాత్రమే పన్ను విధించే బదులుగా రూ. 2,500 వరకు విలువైన బూట్లపై పన్ను తగ్గించాం.
మిత్రులారా,
ఒక సాధారణ కుటుంబం స్కూటర్ లేదా మోటార్ సైకిల్ కలిగి ఉండాలని కలలు కన్నప్పటికీ.. కాంగ్రెస్ పాలనలో ఈ కళను సాధించటం వీలు కాకుండా ఉండేది. 60,000 రూపాయల బైక్పై కాంగ్రెస్ పార్టీ 19,000 రూపాయలకు పైగా పన్ను విధించింది. ఒకసారి అంచనా వేయండి!.. 60,000 రూపాయలపై 19,000 రూపాయలకు పైగా పన్ను ఉంండేది. 2017లో మేం జీఎస్టీని తీసుకొచ్చినప్పుడు పన్ను 2,000–2,500 రూపాయలు తగ్గింది. ఇప్పుడు సెప్టెంబర్ 22న అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ రేట్ల అనంతరం 60,000 రూపాయల బైక్పై పన్ను కేవలం రూ. 10,000 లకు వచ్చింది. 2014తో పోలిస్తే మొత్తంగా దాదాపు 9,000 రూపాయలు ఆదా అయ్యాయి.
మిత్రులారా,
కాంగ్రెస్ పాలనలో ఇల్లు కట్టుకోవడం కూడా చాలా ఖరీదైన వ్యవహారంగా ఉండేది. 300 రూపాయల సిమెంట్ బస్తాపై కాంగ్రెస్ ప్రభుత్వం 90 రూపాయల కంటే ఎక్కువ పన్ను వసూలు చేసేది. 2017లో జీఎస్టీ వచ్చిన తర్వాత ఇది దాదాపు 10 రూపాయలు తగ్గింది. ఇప్పుడు సెప్టెంబర్ 22న మేం అమలు చేసిన సంస్కరణలతో అదే సిమెంట్ బస్తాపై జీఎస్టీ కేవలం రూ. 50గా ఉంది. అంటే 2014తో పోలిస్తే నేడు ప్రతి సిమెంట్ బస్తాపై 40 రూపాయలు ఆదా అవుతోంది. కాంగ్రెస్ హయాంలో దోపిడీ మాత్రమే జరిగిన చోట నేడు భాజపా ప్రభుత్వ హయాంలో పొదుపులు మాత్రమే ఉన్నాయి. అందుకే దేశం మొత్తం జీఎస్టీ పొదుపు పండుగను చేసుకుంటోంది.
కానీ సోదరీసోదరులారా,
జీఎస్టీ పొదుపు పండుగ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో మనకు మరో లక్ష్యం కూడా ఉంది.. అదే 'ఆత్మనిర్భర్ భారత్' (స్వావలంబన భారతదేశం). మనం ఇతరులపై ఆధారపడకుండా ఉండటం ఇప్పుడు చాలా అవసరం. దీనికి మార్గం స్వదేశీ మంత్రంలో ఉంది. అందువల్ల మనం స్వదేశీ మంత్రాన్ని ఎప్పటికీ మరచిపోకూడదు. మీ అందరికీ, రాజస్థాన్- దేశ వ్యాప్తంగా నా ప్రసంగాన్ని వింటోన్న ప్రజలకు, ముఖ్యంగా నా దుకాణదారులు- వ్యాపార స్నేహితులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఏది విక్రయించినా.. అది స్వదేశీ అయి ఉండాలి. నా తోటి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.. మనం ఏది కొన్నా స్వదేశీ అయి ఉండాలి. “సోదరా.. ఇది స్వదేశీనేనా! కాదా!” అని మనం దుకాణదారుడిని అడగాలి. స్వదేశీకి నేను చెప్పే వివరణ చాలా సులభతరంగా ఉంది. కంపెనీ ఏ దేశానిదైనా కావొచ్చు, బ్రాండ్ ఏ దేశానిదైనా కావొచ్చు.. కానీ ఉత్పత్తి భారతదేశంలో కావాలి, మన యువత కృషితో కావాలి. అది మన ప్రజల చెమట సువాసనతో, మన మట్టి పరమళంతో నిండి ఉండాలి. నాకు అదే స్వదేశీ. అందుకే నేను వ్యాపారులంతదరిని కోరుతున్నాను.. మీ దుకాణాలలో గర్వంగా ‘ఇది స్వదేశీ’ అని రాసి ఉన్న బోర్డును పెట్టండి. మీరు స్వదేశీని కొనుగోలు చేసినప్పుడు ఆ డబ్బు మన సొంత దేశంలోని ఒక చేతివృత్తులవారికి, కార్మికుడికి, వ్యాపారికి వెళ్తుంది.. ఈ మొత్తం విదేశాలకు వెళ్లదు. ఇది దేశాభివృద్ధి కోసం ఇక్కడే ఉంటుంది. ఇది కొత్త రహదారులు, పాఠశాలలు, ఆసుపత్రులు, పేదల కోసం ఇళ్లను ఏర్పాటుచేస్తుంది. కాబట్టి మిత్రులారా.. మనం స్వదేశీని మన గౌరవంగా మార్చుకోవాలి. ఈ పండుగ సీజన్లో స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రతిజ్ఞ చేయాలని మీ అందరినీ నేను కోరుతున్నాను. ఈ ప్రతిజ్ఞతో పాటు మరోసారి మీకు అభివృద్ధి, ఉపాధికి సంబంధించిన అనేక ప్రాజెక్టుల విషయంలో నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు! పూర్తి సామర్థ్యంలో నాతో కలిసి ఇది అనండి..
భారత్ మాతా కీ జై! మీ చేతులు పైకెత్తి భారత్ మాతా కీ జై చెప్పండి.
భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! చాలా ధన్యవాదాలు.
****
(Release ID: 2171953)
Visitor Counter : 6