మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించే వికసిత్ భారత్ బిల్డథాన్-2025ను ప్రారంభించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ.. స్వయం-సమృద్ధ భారత్ సాకారం కోసం
యువ ఆవిష్కర్తలను శక్తిమంతం చేసేందుకే భారత్ బిల్డథాన్-2025
ఫలితాల ప్రకటన.. 1,000 మందికి పైగా విజేతల సత్కారాలతో
2026 జనవరిలో బిల్డథాన్ ముగింపు
నాడు పోస్టు చేయడమైనది:
23 SEP 2025 5:25PM by PIB Hyderabad
కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు వికసిత్ భారత్ బిల్డథాన్ 2025ను ప్రారంభించారు. ఇది దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించేలా రూపొందించిన ఒక సంచలనాత్మక ఆవిష్కరణ ఉద్యమం. పాఠశాల విద్య-అక్షరాస్యత విభాగం (డీవోఎస్ఈఎల్), అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్, ఏఐసీటీఈల సహకారంతో విద్యా మంత్రిత్వ శాఖ ‘వికసిత్ భారత్ బిల్డథాన్ 2025’ నిర్వహిస్తోంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో వికసిత్ భారత్ బిల్డథాన్ జింగిల్, లోగోను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు.
పాఠశాల విద్య-అక్షరాస్యత శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ ధీరేంద్ర ఓజా, ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ టీ జీ సీతారాం, వైస్ చైర్మన్ డాక్టర్ అభయ్ జెరె, నీతి ఆయోగ్ ఏఐఎమ్ మిషన్ డైరెక్టర్ శ్రీ దీపక్ బాగ్లా, పాఠశాల విద్య-అక్షరాస్యత శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ధీరజ్ సాహు, మంత్రిత్వ శాఖ, కేవీఎస్, ఎన్వీఎస్లకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అతిపెద్ద పాఠశాల హ్యాకథాన్ అయిన వికసిత్ భారత్ బిల్డథాన్.. విద్యార్థులు 'వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ, సమృద్ధి' అనే నాలుగు ఇతివృత్తాలపై ఆలోచనలను, ఉత్పత్తులను రూపొందించేలా ప్రోత్సహించడం ద్వారా కింది స్థాయి నుంచి ఆవిష్కరణల సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల ఆవిష్కరణలను గుర్తింపునివ్వడంతోపాటు దేశంలో ఆవిష్కరణల పునరుజ్జీవనాన్ని ప్రోత్సహిస్తుందని వ్యాఖ్యానించారు. సమృద్ధి, వికసిత్, ఆత్మనిర్భర్ భారత్కు యువతరం కీలక చోదక శక్తిగా మారేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
బిల్డథాన్ కోసం సన్నద్ధతను.. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ సమగ్ర వివరించారు.
దేశాభివృద్ధి కోసం సృజనాత్మక ఆలోచనలను, స్వయం-సమృద్ధిని, సుస్థిర వృద్ధిని ప్రోత్సహించడం, పాఠశాలలను సమకాలీన ఆవిష్కరణల్లో భాగస్వామ్యం చేయడం, సంభావ్య ప్రపంచ రికార్డు ద్వారా దేశాన్ని ప్రపంచ ఆవిష్కరణల రాజధానిగా ముందుకు నడపడం, జాతీయ-అంతర్జాతీయ వేదికలపై సమస్య పరిష్కార నైపుణ్యాలు గల యువతను గౌరవించడం బిల్డథాన్ లక్ష్యం. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పేటెంట్లు, అంకురసంస్థల వెంచర్లతో పాటు స్టూడెంట్ ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ (ఎస్ఐపీ), స్టూడెంట్ ఆంత్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ (ఎస్ఈపీ) వంటి కార్యక్రమాలకు దారితీసిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ 2024 విజయం ప్రాతిపదికన ఈ బిల్డథాన్ను రూపొందించారు.
వికసిత్ భారత్ బిల్డథాన్ ప్రయాణం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థులు వికసిత్ భారత్ బిల్డథాన్ పోర్టల్ (https://vbb.mic.gov.in/)లో నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 6 వరకు అవకాశం ఉంటుంది. దీని తర్వాత అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 13 వరకు పాఠశాలల సన్నాహక కాలం ఉంటుంది. ఈ సన్నాహకాల్లో భాగంగా పోర్టల్లో నమోదు చేసుకునే ప్రక్రియ గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేస్తారు. ఆ తర్వాత విద్యార్థులు తమ ఆలోచనలను, నమూనాలను పోర్టల్లో సమర్పిస్తారు. బిల్డథాన్లో ప్రధాన అంశమైన లైవ్ సింక్రొనైజ్డ్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని అక్టోబర్ 13న నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత విద్యార్థులు అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 31 వరకు తమ తుది ఎంట్రీలను సమర్పిస్తారు. ఈ సమర్పణలను నిపుణుల బృందం నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రెండు నెలల కాలంలో మూల్యాంకనం చేస్తుంది. 2026 జనవరిలో ఫలితాల ప్రకటన, టాప్ 1,000+ విజేతల సత్కారంతో ఈ బిల్డథాన్ ముగుస్తుంది.
వికసిత్ భారత్ బిల్డథాన్-2025 ఇతివృత్తాలు, లక్ష్యాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఒక వీడియోను ప్రదర్శించారు.
***
(రిలీజ్ ఐడి: 2170558)
సందర్శకుల సూచీ సంఖ్య : : 93