ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్లోని ద్వారకలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
25 FEB 2024 4:42PM by PIB Hyderabad
ద్వారకాధీశ్ కీ – జై !
ద్వారకాధీశ్ కీ – జై !
ద్వారకాధీశ్ కీ – జై !
వేదికపై ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, పార్లమెంటులో నా సహచర సభ్యులు.. గుజరాత్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సీ.ఆర్. పాటిల్, ఇతర గౌరవనీయ ప్రముఖులు, నా గుజరాత్ సోదరీ సోదరులారా.
ముందుగా, నన్ను స్వాగతించిన నా అహిర్ ఆడపడుచులకు నా గౌరవపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొద్ది రోజుల కిందట ద్వారకలో దాదాపు 37,000 మంది అహిర్ ఆడపడుచులు గర్బా ప్రదర్శన ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది చూసిన కొంతమంది గర్వంగా నాతో.. “సర్, ద్వారకలో 37,000 మంది అహిర్ ఆడపడుచులు ఉన్నారు!” అని అంటున్నారు. “మీరు గర్బా మాత్రమే చూశారు... కానీ అందులో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ 37,000 మంది అహిర్ ఆడపడుచులు గర్బా ప్రదర్శన ఇస్తున్నప్పుడు వారి శరీరాలపై కనీసం 25,000 కిలోగ్రాముల బంగారం ధరించారు” అని నేను వారితో చెప్పాను. ఇది నేను అంచనాతో చెబుతున్నదే. వారు గర్బా సమయంలో తమ శరీరాలపై దాదాపు 25,000 కిలోగ్రాముల బంగారం ధరించారని తెలుసుకుని విన్న వారు ఆశ్చర్యపోయారు. నన్ను స్వాగతించినందుకు.. ఆశీర్వదించినందుకు మాతృమూర్తులందరికీ కృతజ్ఞతగా తల వంచి నమస్కరిస్తున్నాను. అహిర్ ఆడపడుచులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
శ్రీ కృష్ణుడి భూమి అయిన ద్వారకా ధామానికి నేను గౌరవంగా నమస్కరిస్తున్నాను. శ్రీకృష్ణుడిని దేవభూమి ద్వారకలో ద్వారకాధీశునిగా కొలుస్తారు. ఇక్కడ ఏమి జరిగినా ఆ ద్వారకాధీశుని సంకల్పం ప్రకారమే జరుగుతుంది. ఉదయం ఆ శ్రీకృష్ణుని ఆలయాన్ని సందర్శించి ఆయనను పూజించే అదృష్టం నాకు కలిగింది. ద్వారక చార్ ధామ్, సప్త పూరి రెండింటిలోనూ భాగమని చెబుతారు. ఆది శంకరాచార్య ఇక్కడ నాలుగు పీఠాల్లో ఒకటైన శారద పీఠాన్ని స్థాపించారు. ఇక్కడ నాగేశ్వర్ జ్యోతిర్లింగం, రుక్మిణీ దేవి ఆలయం, అనేక ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. ఇటీవలే నా 'దేశ బాధ్యతల' మధ్య.. దేశవ్యాప్తంగా గల పలు పవిత్ర స్థలాలను సందర్శించే 'దైవ కార్యం' చేపట్టే అదృష్టం నాకు కలిగింది. ఈ రోజు నేను ఇక్కడ ద్వారకా ధామ్లో ఆ దివ్య ప్రకాశాన్ని అనుభవిస్తున్నాను. ఈ ఉదయమే నాకు మరో అనుభవం కలిగింది.. అది జీవితాంతం నాతోనే ఉంటుంది.. సముద్రపు లోతుల్లోకి వెళ్లి అలనాటి ద్వారకను చూసే భాగ్యం నాకు లభించింది. పురావస్తు శాస్త్రవేత్తలు సముద్రంలో మునిగిన ద్వారక గురించి చాలా రాశారు. మన గ్రంథాల్లోనూ ద్వారక గురించి విస్తృత ప్రస్తావనలు ఉన్నాయి --
భవిష్యతి పురీ రమ్యా సుద్వారా ప్రగ్యా-తోరణా.
చయాట్టాలక్ కేయూరా పృథివ్యామ్ కకుదోపమా॥
అంటే అందమైన ద్వారాలు, ఎత్తయిన భవనాలు కలిగిన ఈ నగరం భూమిపై ఒక శిఖరం లాంటిది. విశ్వకర్మ స్వయంగా ఈ ద్వారక నగరాన్ని నిర్మించాడని చెబుతారు. ద్వారక నగరం దాని వ్యవస్థీకరణ, అభివృద్ధికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ రోజు నేను లోతైన సముద్రపు నీటిలో ద్వారకాధీశుడిని చూసి.. నాలో ఆ పురాతన వైభవాన్ని, ఆ దివ్య ప్రకాశాన్ని నేను అనుభవిస్తున్నాను. ద్వారకాధీశుడైన శ్రీ కృష్ణుడికి నమస్కరించాను. నేను నాతో పాటు ఒక నెమలి ఈకను కూడా తీసుకెళ్లాను. శ్రీ కృష్ణుడిని స్మరిస్తూ దానిని నేను అక్కడ సమర్పించాను. చాలా సంవత్సరాలుగా పురావస్తు శాస్త్రవేత్తల నుంచి తెలుసుకుంటున్న విషయాలతో నాకు చాలా ఉత్సుకత కలిగింది. ఏదో ఒక రోజు సముద్రం లోపలికి వెళ్లి ఆ ద్వారకా నగరంలో మిగిలి ఉన్న అద్భుతాలను దర్శించి భక్తితో నమస్కరించాలనే కోరిక నాలో ఉండేది. ఈ రోజు చాలా సంవత్సరాల తర్వాత నా కోరిక నెరవేరింది. నేను ఉప్పొంగిపోయాను.. నా మనస్సు భావోద్వేగాలతో నిండిపోయింది. దశాబ్దాలుగా ఆ కలను పోషించి.. చివరకు ఆ పవిత్ర భూమిని తాకిన తర్వాత నేను ఇప్పుడు ఎంత లోతైన ఆనందాన్ని అనుభవిస్తున్నానో ఊహించండి.
మిత్రులారా,
ఆ సమయంలో 21వ శతాబ్దపు భారత వైభవ దర్శనం కూడా నా కళ్ళలో తిరుగుతూ ఉంది.. నేను చాలా సేపు లోపలే ఉండిపోయాను. ఈ రోజు ఇక్కడకు ఆలస్యంగా రావడానికి కారణం.. నేను చాలా సేపు నీటి అడుగునే ఉండిపోయాను. సముద్ర ద్వారక దర్శనం ద్వారా నేను 'వికసిత్ భారత్' సంకల్పాన్ని మరింత బలోపేతం చేసుకున్నాను.
మిత్రులారా,
ఈ రోజు సుదర్శన సేతును ప్రారంభించే అదృష్టమూ నాకు కలిగింది. ఆరు సంవత్సరాల కిందట ఈ వంతెన శంకుస్థాపన కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఈ వంతెన ఓఖాను బేట్ ద్వారక ద్వీపంతో అనుసంధానిస్తుంది. ఇది ద్వారకాధీశుడిని సందర్శనను సులభతరం చేయడమే కాకుండా ఈ ప్రాంత దైవిక సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. నేను ఈ కలను ఊహించాను.. దానికి పునాది వేసాను.. ఈ రోజు దానిని సాకారం చేసుకున్నాను.. ఇది దైవాన్ని ఆరాధించే, ప్రజలకు సేవ చేసే మోదీ హామీ. సుదర్శన సేతు కేవలం సౌకర్యం మాత్రమే కాదు.. ఇంజనీరింగ్ అద్భుతం కూడా. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ సుదర్శన సేతును అధ్యయనం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది దేశంలో ఇప్పటివరకు ఉన్న అత్యంత పొడవైన కేబుల్-స్టేడ్ వంతెన. ఈ ఆధునిక, అద్భుత వంతెన కోసం దేశ పౌరులందరినీ నేను అభినందిస్తున్నాను.
ఇంత ముఖ్యమైన పని జరుగుతున్న సందర్భంలో నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తుకు వస్తుంది. రష్యాలో ఆస్ట్రాఖాన్ అనే రాష్ట్రం ఉంది. గుజరాత్కు ఆస్ట్రాఖాన్తో సోదర-రాష్ట్ర సంబంధం ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు నన్ను రష్యాలోని ఆస్ట్రాఖాన్ రాష్ట్ర సందర్శనకు ఆహ్వానించారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అత్యుత్తమ మార్కెట్, అతిపెద్ద మాల్కు ఓఖా పేరు పెట్టడం నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రతిదానికీ ఓఖా పేరు పెట్టారు. నేను అడిగాను.. “దీనికి ఓఖా అని ఎందుకు పేరు పెట్టారు?” అని. శతాబ్దాల క్రితం ప్రజలు వ్యాపారం కోసం ఇక్కడి నుంచి అక్కడకు వెళ్ళేవారు.. ఇక్కడి నుంచి పంపిన వస్తువులను అక్కడ అత్యంత నాణ్యమైనవిగా పరిగణించేవారు. అందుకే శతాబ్దాల తర్వాత కూడా దుకాణాలు, మాల్స్కు ఓఖా పేరు పెట్టినప్పుడు.. ప్రజలు అక్కడ అత్యంత నాణ్యమైన వస్తువులే లభిస్తాయని నమ్ముతారు. శతాబ్దాల కిందట ఓఖాకు ఉన్న గౌరవం సుదర్శన సేతు నిర్మాణం తర్వాత మరోసారి ప్రపంచ పటంలో ప్రకాశిస్తుంది.. ఓఖా పేరు మరింత బలపడుతుంది.
మిత్రులారా,
ఈ రోజు నేను సుదర్శన సేతును చూస్తున్నప్పుడు చాలా పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. గతంలో ద్వారక, బేట్ ద్వారక ప్రజలు ఫెర్రీ పడవలపైనే ఆధారపడేవారు. మొదట సముద్రం ద్వారా, తరువాత రోడ్డు ద్వారా వారు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ప్రయాణికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొనేవారు.. కొన్నిసార్లు సముద్రపు అలల తీవ్రత కారణంగా పడవ సేవలూ నిలిచిపోయేవి.. దీనివల్ల భక్తులకూ చాలా అసౌకర్యం కలిగింది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుంచి నన్ను కలవడానికి వచ్చే నా సహచరులు ఎల్లప్పుడూ ఈ వంతెన అవసరం గురించి మాట్లాడేవారు. మా శివ్-శివ్, మా బాబుబా.. ఈ పని నేనే చేయాలనే ఎజెండాతో ఉన్నారు. ఈ రోజు బాబుబా అత్యంత సంతోషంగా ఉన్నారు.
మిత్రులారా,
ఆ సమయంలో నేను ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందు పదే పదే ప్రస్తావించాను. వారు మాత్రం దానిపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. ఈ సుదర్శన సేతు నిర్మాణం కూడా శ్రీ కృష్ణ భగవానుడు నా విధిలో రాశారు. దేవుని ఆజ్ఞను పాటించడం ద్వారా నేను ఈ బాధ్యతను నెరవేర్చగలిగినందుకు సంతోషంగా ఉన్నాను. ఈ వంతెన నిర్మాణం ఇప్పుడు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు గొప్ప సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ వంతెన మరో ప్రత్యేకత.. దాని అద్భుతమైన లైటింగ్. ఇది వంతెనపైనే ఏర్పాటు చేసిన సౌర ఫలకాల ద్వారా విద్యుచ్ఛక్తిని పొందుతుంది. సుదర్శన సేతులో పన్నెండు పర్యాటక గ్యాలరీలు నిర్మించారు. ఈ రోజు నేను ఈ గ్యాలరీలను కూడా సందర్శించాను. వాటిని అద్భుతంగా, అత్యంత అందంగా రూపొందించారు. ఈ గ్యాలరీల ద్వారా ప్రజలు అనంతమైన నీలి సముద్రాన్ని చూడవచ్చు.
మిత్రులారా,
ఈ శుభ సందర్భంలో పవిత్ర ద్వారక భూమి ప్రజలను కూడా నేను అభినందిస్తున్నాను. వారు ఇక్కడ ప్రారంభించిన పరిశుభ్రత మిషన్లు, ద్వారకలో జరుగుతున్న అద్భుతమైన పరిశుభ్రత పనుల గురించి ప్రజలు సోషల్ మీడియాలో నాకు పంపిన వీడియోలు అద్భుతంగా ఉన్నాయి. మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు ప్రతిదీ చాలా శుభ్రంగా కనిపిస్తున్న కారణంగా మీరంతా పరిశుభ్రత ప్రయత్నాలతో సంతృప్తి చెందారా? కానీ ఇప్పుడు మీ బాధ్యత ఏమిటి? నేను మళ్ళీ శుభ్రం చేయడానికి తిరిగి రావాలా? మీరందరూ దానిని శుభ్రంగా ఉంచుతారా? మీ చేతులు పైకెత్తి, “ఇప్పుడు మేం ద్వారకను మురికి కానివ్వం” అని చెప్పండి. చూడండీ.. దేశవిదేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారు. చాలా మంది భక్తులు వస్తారు. వారు పరిశుభ్రతను చూసినప్పుడు వారి హృదయాల్లో సగం స్థానం మీరు గెలుచుకుంటారు.
మిత్రులారా,
నేను పౌరులకు నవభారత అభివృద్ధి గురించి హామీ ఇచ్చినప్పుడు.. ప్రతిరోజూ నాపై విమర్శలు చేయడానికి ఇష్టపడే ఈ ప్రతిపక్ష సభ్యులు దానిని ఎగతాళి చేసేవారు. ప్రజలు తమ కళ్ళతోనే నవభారత ఆవిర్భావాన్ని ప్రస్తుతం చూస్తున్నారు. దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన వారికి సంకల్ప శక్తి లేదు. సామాన్య ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనే వారి ఉద్దేశం.. దాని పట్ల వారి అంకితభావం లోపభూయిష్టంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మొత్తం బలం ఒక కుటుంబాన్ని ప్రోత్సహించడంపై కేంద్రీకృతమై ఉంది. ప్రతిదీ ఒకే కుటుంబం కోసం చేయాల్సి ఉన్నప్పుడు దేశాన్ని నిర్మించాలనే ఆలోచన ఎలా గుర్తుకు వస్తుంది? వారి మొత్తం శక్తినీ 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఎలా నడపాలి.. కుంభకోణాలను ఎలా అణిచివేయాలి అనే దానిపై పెట్టుబడి పెట్టారు. అందుకే 2014కి ముందు 10 సంవత్సరాలపాటు భారత్ 11వ ఆర్థిక వ్యవస్థగా మాత్రమే ఉంది. ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు ఇంత విశాలమైన దేశం గొప్ప కలలను నెరవేర్చే సామర్థ్యం పొందలేదు. మౌలిక సదుపాయాల కోసం ఎంత తక్కువ బడ్జెట్ కేటాయించినా వారు అవినీతికి పాల్పడేవారు. దేశంలో టెలికాం మౌలిక సదుపాయాలను పెంచే సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ 2జీ కుంభకోణానికి పాల్పడింది. దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలను ఆధునికీకరించే అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ కామన్వెల్త్ కుంభకోణానికి పాల్పడింది. దేశంలో రక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ హెలికాప్టర్, జలాంతర్గాముల కుంభకోణాలకు పాల్పడింది. దేశానికి అవసరమైన ప్రతిదానితో కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేయగలదు.
మిత్రులారా,
2014లో మీ అందరి ఆశీస్సులతో నన్ను మీరు ఢిల్లీకి పంపినప్పుడు.. దేశాన్ని దోచుకోనివ్వనని నేను హామీ ఇచ్చాను. కాంగ్రెస్ హయాంలో జరిగిన వేల కోట్ల కుంభకోణాలు ఇప్పుడు ఆగిపోయాయి. గత 10 సంవత్సరాల్లో మేం దేశాన్ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాం. దీని ఫలితంగా మీరు దేశవ్యాప్తంగా అద్భుతమైన, గొప్ప, దైవిక నిర్మాణ పనులను చూస్తున్నారు. ఒక వైపు మన దైవిక తీర్థయాత్ర స్థలాలు ఆధునికతను సంతరించుకుంటున్నాయి. మరోవైపు మెగా ప్రాజెక్టుల ద్వారా సరికొత్త భారత్ ఆవిష్కారమవుతోంది. ఈ రోజు మీరు గుజరాత్లో అతి పొడవైన కేబుల్-స్టేడ్ వంతెనను చూస్తున్నారు. కొద్ది రోజుల కిందటే ముంబయిలో.. దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన పూర్తయింది. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన అద్భుతమైన వంతెన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమైంది. దేశంలోనే మొట్టమొదటి నిలువు లిఫ్ట్ వంతెన అయిన తమిళనాడులోని న్యూ పంబన్ వంతెన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అస్సాంలోని.. భారత్లోనే అత్యంత పొడవైన నదిపైనా వంతెన నిర్మాణం పూర్తయింది. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ ఆధునిక అనుసంధానం సమర్థమైన, బలమైన దేశాన్ని నిర్మించే మార్గం.
మిత్రులారా,
కనెక్టివిటీ మెరుగుపడినప్పుడు దాని ప్రత్యక్ష ప్రభావం దేశ పర్యాటక రంగంపై కనిపిస్తుంది. గుజరాత్లో పెరుగుతున్న కనెక్టివిటీ ఈ రాష్ట్రాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా మారుస్తోంది. గుజరాత్లో ప్రస్తుతం 22 అభయారణ్యాలు, 4 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. వేల సంవత్సరాల పురాతనమైన లోథల్ ఓడరేవు నగరం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అహ్మదాబాద్ నగరం, రాణి కీ వావ్, చంపానేర్, ధోలావీరాలు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా మారాయి. ద్వారకలోని శివరాజ్పూర్ బీచ్కు నీలి జెండా గుర్తింపు ఉంది. అహ్మదాబాద్ ప్రపంచ వారసత్వ నగరం. ఆసియాలో అతి పొడవైన రోప్వే మన గిర్నార్ పర్వతంపై ఉంది. ఆసియా సింహాలు మన గిర్ అడవుల్లో కనిపిస్తాయి. ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహంగా సర్దార్ సాహెబ్ ఐక్యతా మూర్తి గుజరాత్లోని ఏక్తా నగర్లో ఉంది. రాన్ ఉత్సవ్ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకుల సందడి కనిపిస్తుంది. కచ్లోని ధోర్డో గ్రామం ప్రపంచంలోని అత్యుత్తమ పర్యాటక గ్రామాల్లో ఒకటిగా ఉంది. నాడా బెట్ దేశభక్తికీ, పర్యాటకానికీ ముఖ్య కేంద్రంగా మారుతోంది. గుజరాత్లో అభివృద్ధి, వారసత్వం మంత్రాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక స్థలాలను కూడా అందంగా తీర్చిదిద్దుతున్నారు. ద్వారక, సోమనాథ్, పావగఢ్, మోథేరా, అంబాజీ వంటి అన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో సౌకర్యాలు మెరుగయ్యాయి. 52 శక్తి పీఠాల దర్శనం ఒకే చోట చేసుకునేలా అంబాజీలో ఏర్పాట్లు చేశారు.
భారత్కు వచ్చే విదేశీ పర్యాటకులకు గుజరాత్ ప్రధాన ఎంపికగా మారుతోంది. 2022లో 85 లక్షలకు పైగా పర్యాటకులు భారత్ను సందర్శించగా.. వారిలో ప్రతి అయిదో పర్యాటకుడు గుజరాత్కు వచ్చారు. గత సంవత్సరం ఆగస్టు నాటికి దాదాపు 1.5 మిలియన్ల మంది పర్యాటకులు గుజరాత్కు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ పర్యాటకులకు ఇచ్చిన ఇ-వీసా సౌకర్యంతో గుజరాత్ కూడా ప్రయోజనం పొందింది. పర్యాటకుల సంఖ్య పెరుగుదల గుజరాత్లో ఉపాధి, స్వయం ఉపాధికి కొత్త అవకాశాలనూ సృష్టిస్తోంది.
మిత్రులారా,
నేను సౌరాష్ట్రకు వచ్చినప్పుడల్లా ఇక్కడి నుంచి కొత్త శక్తితో తిరిగి వెళ్తాను. సౌరాష్ట్ర భూమి ‘సంకల్పం’ నుంచి ‘విజయం’ వరకు గొప్ప స్ఫూర్తినిస్తుంది. ప్రస్తుత సౌరాష్ట్ర అభివృద్ధిని చూసినప్పుడు ఇక్కడ జీవితం ఎంత కష్టతరంగా ఉండేదో ఎవరూ గ్రహించలేరు. సౌరాష్ట్రలోని ప్రతి కుటుంబం, ప్రతి రైతు, ప్రతి నీటి చుక్క కోసం ఆరాటపడే రోజులను మనం చూశాం. ఇక్కడి నుంచి ప్రజలు చాలా దూరం నడిచి వలస వెళ్లేవారు. ఏడాది పొడవునా ప్రవహించే నదుల నీటిని అక్కడి నుంచి సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలకు తీసుకువస్తామని నేను చెప్పినప్పుడు.. కాంగ్రెస్ వారు నన్ను ఎగతాళి చేసేవారు. కానీ ఇప్పుడు సౌని పథకం సౌరాష్ట్ర విధిని మార్చింది. ఈ పథకం కింద 1300 కిలోమీటర్లకు పైగా పైప్లైన్లు వేశారు. ఈ పైప్లైన్లు కూడా చిన్నవి కావు.. పైపు లోపల మారుతి కారు నడపగలిగేంత పెద్దవిగా ఉంటాయి. ఫలితంగా సౌరాష్ట్రలోని వందలాది గ్రామాలకు సాగునీరు, తాగునీటి అవసరాల కోసం నీరు చేరుకుంది. ఇప్పుడు సౌరాష్ట్రలోని రైతులు, పశువుల పెంపకందారులు, మత్స్యకారులు సంపన్నులు అవుతున్నారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో సౌరాష్ట్ర, గుజరాత్ కలిసి విజయంలో కొత్త శిఖరాలకు చేరుకుంటాయని నేను నమ్ముతున్నాను. ద్వారకాధీశుడి ఆశీస్సులు మనతో ఉన్నాయి. మనం కలిసికట్టుగా సౌరాష్ట్రను, గుజరాత్నూ అభివృద్ధి చేసుకుందాం. గుజరాత్ అభివృద్ధి చెందినప్పుడు భారత్ కూడా అభివృద్ధి చెందుతుంది.
మరోసారి ఈ అద్భుతమైన వంతెన కోసం మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను నా ద్వారకా వాసులను ఒక్కటే కోరుతున్నాను.. ప్రపంచం నలుమూలల నుంచి ఎక్కువ మంది పర్యాటకులను ఎలా ఆకర్షించాలో ఇప్పుడే నిర్ణయించుకోండి. వారు వచ్చిన తర్వాత ఇక వారు ఇక్కడే ఉండాలని భావిస్తారు. మీ భావాలను నేను గౌరవిస్తాను. నాతో కలిసి మీరంతా ఇలా చెప్పండి:
ద్వారకాధీశ్ కీ – జై!
ద్వారకాధీశ్ కీ – జై!
ద్వారకాధీశ్ కీ – జై!
భారత్ మాతా కీ – జై!
భారత్ మాతా కీ – జై!
భారత్ మాతా కీ – జై!
చాలా ధన్యవాదాలు.
గమనిక – ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి అనువాదం
***
(रिलीज़ आईडी: 2168974)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam