సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సేవా పర్వ్ వేడుకల్లో భాగంగా డీడీ నేషనల్, డీడీ న్యూస్ ఛానళ్లలో ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్
జాతి నిర్మాణానికీ, కర్మయోగి స్ఫూర్తికీ జీవితం మొత్తాన్నీ అంకితం చేసిన
ప్రధాని శ్రీ మోదీ అంకిత భావానికి అద్దంపట్టనున్న డాక్యుమెంటరీలు: అశ్వినీ వైష్ణవ్
డాక్యుమెంటరీలతోపాటు...
భారతదేశ గ్రామీణ ప్రాంతాల సరికొత్త రూపుపై 'మేరా గావ్ ఆజ్' సిరీస్ ఆవిష్కరణ
Posted On:
17 SEP 2025 4:52PM by PIB Hyderabad
సేవా పర్వ్ వేడుకల్లో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు ఢిల్లీలో డీడీ నేషనల్, డీడీ న్యూస్ ఛానళ్లలో ప్రత్యేక కార్యక్రమాలను ఆవిష్కరించారు. డాక్యుమెంటరీలకు చెందిన ప్రోమోలను కూడా ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దూరదర్శన్, ప్రసార భారతి విడుదల చేసిన డాక్యుమెంటరీలు ప్రధానమంత్రి మోదీ స్ఫూర్తినీ, జీవితకాలంలో చూపిన అంకితభావాన్ని తెలియజేస్తాయని అన్నారు. ప్రధానమంత్రి మొదటి నుంచి దేశానికీ, సమాజానికీ సేవ చేసేందుకు పూర్తిగా అంకితమయ్యారని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి జాతి నిర్మాణమనే లక్ష్యం కోసం మోదీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించిన మంత్రి.. ఈ నిబద్ధత దేశానికి గొప్ప వరం అని అన్నారు. నేడు దేశవ్యాప్తంగా కనిపిస్తున్న కీలక మార్పులను ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు.

గత 11 సంవత్సరాల్లో దేశంలోని మారుమూల గ్రామాలు కూడా స్పష్టమైన పురోగతిని సాధించాయని మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణన్ అన్నారు. గతంలో అనేక దశాబ్దాలు పట్టిన ఈ అభివృద్ధి ఇప్పుడు కేవలం ఒక దశాబ్దంలోనే సాధించినట్లు తెలిపారు. సాంకేతికత, సృజనాత్మకత, సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి వంటి రంగాల్లో భారత్ ప్రపంచవ్యాప్తంగా నూతన గుర్తింపును పొందుతోందన్నారు. సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని ప్రోత్సహించే సేవా పర్వ్ సందర్భంగా.. సేవా స్ఫూర్తిని వేడుకగా జరుపుకోవాలని సూచించారు. రక్తదానంతో ఈ రోజును ప్రారంభించినట్లు ఆయన తెలియజేశారు.

ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వంలో దేశంలో కొనసాగుతోన్న పరివర్తన ప్రయాణాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు ప్రస్తావించారు. మోదీ పాలనలో ప్రజాసేవ, సుపరిపాలన అనేవి మార్గదర్శక సూత్రాలుగా ఉన్నాయన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల పురోగతినీ, అభివృద్ధిని తెలిపే కథనాలు వెలువడుతున్నాయన్న ఆయన.. 2047 నాటికి అభివృద్ధి చెందే దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఈ కార్యక్రమం తెలియజేస్తోందని చెప్పారు.
సేవా పర్వ్ సందర్భంగా నిర్వహిస్తోన్న ప్రత్యేక కార్యక్రమాలు సేవా స్ఫూర్తిని తెలియజేస్తాయి. విభిన్న కార్యక్రమాల ద్వారా జాతి నిర్మాణం కోసం కృషి చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిబద్ధతను ఇవి ప్రముఖంగా తెరపై ప్రదర్శిస్తాయి. దూరదర్శన్లో వచ్చే ప్రత్యేక కార్యక్రమాలు ప్రజా సేవ, అభివృద్ధి, సామూహిక బాధ్యతకు సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కథనాలను అందిస్తాయి. డీడీ న్యూస్ జాతీయ స్థాయిలో మూడు డాక్యుమెంటరీలతో పాటు.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో గ్రామాలు సాధించిన అభివృద్ధి, పరివర్తన కథనాలను తెలియజేసే ‘మేరా గావ్ ఆజ్’ అనే సిరీస్ను ప్రసారం చేయనుంది. డీడీ నేషనల్ ‘స్వ సే సమగ్ర తక్’ అనే డాక్యుమెంటరీని ప్రసారం చేస్తుంది. డీడీ న్యూస్ ప్రాంతీయ ఛానళ్లలో ఆయా భాషలలో కూడా ఈ డాక్యుమెంటరీలు ప్రసారం కానున్నాయి.
పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ ధీరేంద్ర ఓజా, ప్రసార భారతి చైర్మన్ శ్రీ నవనీత్ కుమార్ సెహగల్, ప్రసార భారతి సీఈఓ శ్రీ గౌరవ్ ద్వివేది, ప్రఖ్యాత చిత్రనిర్మాత - కథన రచయిన డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది, సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా విభాగాల సీనియర్ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆవిష్కరించిన డాక్యుమెంటరీలు, సిరీస్లు:
1. సంకల్ప్ కి శక్తి, సుశాసన్ కా సామర్థ్య: గత 11 సంవత్సరాలలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారత్ గణనీయమైన పురోగతిని సాధించింది. ఆయన పరిపాలన ప్రజలకు సాధికారత కల్పించి, వారిని అభివృద్ధికి కేంద్ర బిందువుగా చేసింది. ప్రజల సమగ్రాభివృద్ధికి.. ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళలు, యువత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం "సంస్కరణ, పనితీరు, పరివర్తన" అనే సూత్రాన్ని అనుసరిస్తోంది. సామాజిక న్యాయాన్ని అందించటం కోసం విద్య, ఆరోగ్యంతో సహా అనేక అంశాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా అర్హులైన వారందరికి లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో సమగ్ర విధానాన్ని పాటిస్తోంది. ఈ సమగ్ర విధానాన్ని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తయారవ్వాలన్న భారత్ ఆకాంక్షను ఈ డాక్యుమెంటరీ అద్దం పడుతుంది.
2. విశ్వ పాటల్ పర్ నేత్రిత్వ కా శంఖ్నాద్: గత 11 సంవత్సరాలుగా ప్రధాన మంత్రి మోదీ ప్రపంచ నాయకుడిగా ఎదిగారు. ఆయన గ్లోబల్ సౌత్కు మద్దతునివ్వటంతో పాటు వాతావరణ మార్పు గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ శాంతి కోసం నిరంతరం తన వాదనను వినిపిస్తున్నారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమితో సహా అనేక ప్రపంచ స్థాయి కార్యక్రమాలను భారత్ ప్రారంభించింది. జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించుకోవడం ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వాన్ని మరింత ప్రముఖంగా తెలియజేస్తోంది. ఆయన దార్శనికత ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన తీరును ఈ డాక్యుమెంటరీ తెలియజేస్తుంది.
3. కర్మయోగ్ - ఏక్ అంతీన్ యాత్ర: భారతదేశ పరివర్తన ప్రయాణంలో భాగమైన ప్రధానమంత్రి మోదీ నిరంతర కృషి, నిబద్ధత, చిత్తశుద్ధిని తెలియజేసే డాక్యుమెంటరీ ఇది. గత 11 సంవత్సరాలుగా అంతరిక్షం, అంకురాలు, సౌరశక్తి, మహిళా సాధికారత, సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆధ్యాత్మికత, మరెన్నో రంగాల్లో సాధించిన విజయాలను ఇది తెలియజేస్తుంది. భారతదేశ వృద్ధి పట్ల ప్రధాని దార్శనికతను ప్రముఖంగా తెలియజేసేందుకు.. ఆయన ఇంటర్వ్యూలలో చేసిన వ్యాఖ్యలను ఇందులో పొందుపరిచారు. జాతీయాభివృద్ధి పట్ల ఆయన చేస్తోన్న అవిశ్రాంత కృషిని ఇవి తెలియజేస్తాయి.
4. స్వా సే సమగ్ర తక్: కంగనా రనౌత్ సమర్పణలో డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ రెండు భాగాల ప్రత్యేక సిరీస్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక జీవిత ప్రయాణాన్ని తెలియజేస్తుంది. వాద్నగర్ సందుల నుంచి చారిత్రాత్మక ఎర్రకోట వరకు ఎదిగిన మోదీ కథను ఇది తెరపై ప్రదర్శించనుంది. ప్రగతిశీల నాయకత్వం ద్వారా దేశ నిర్మాణం కోసం స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని చేపట్టిన ఒక దార్శనిక నాయకుడి కథ ఇది.
5. ప్రాంతీయ స్థాయి డాక్యుమెంటరీలు: గత 11 సంవత్సరాల్లో ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో రాష్ట్ర స్థాయిలో సాధించిన ఆర్థిక, సామాజిక పురోగతిని తెలియజేసే అనేక ప్రాంతీయ డాక్యుమెంటరీలు డీడీ న్యూస్కు చెందిన సంబంధిత ప్రాంతీయ ఛానళ్లలో ప్రసారంకానున్నాయి.
6. మేరా గావ్ ఆజ్: గత 11 సంవత్సరాలుగా దేశంలోని గ్రామాల్లో వచ్చిన మార్పులను ఇది తెలియజేస్తుంది. 75 గ్రామాలకు సంబంధించిన క్షేత్రస్థాయి నివేదిక ఈ సిరీస్లో ఉంది. ఆయా సర్పంచ్లు, గ్రామాధికారులు, మార్పునకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న స్థానికులు పురోగతిని వివరిస్తారు. అనుసంధానత, అవకాశాలు, అభివృద్ధిని కళ్ల ముందుంచటం ద్వారా దేశంలోని గ్రామాలు గతంలో కంటే వేగంగా ఎలా మార్పు చెందుతున్నాయన్నది ఇది తెలియజేస్తుంది.
***
(Release ID: 2167818)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam