దీపావళి, ఛత్ పర్వదినాల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం 12,000పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని భారత రైల్వే నిర్ణయించింది.
రైల్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ వివరాలను వెల్లడించారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, ఎంపీ డాక్టర్ సంజయ్ జైస్వాల్, కేంద్రమంత్రి లలన్ సింగ్, ఎంపీ సంజయ్ కుమార్ ఝాతో చర్చించిన తర్వాత రాబోయే దీపావళి, ఛత్ పండగలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రయాణికులకు తిరుగు ప్రయాణంలో కూడా సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.
సీనియర్ ప్రజా ప్రతినిధులతో సంప్రదింపుల అనంతరం దీపావళి, ఛత్ పండుగల కోసం 12,000పైగా ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో ఇబ్బందులను ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
అక్టోబర్ 13 నుంచి 26 తేదీల్లో ప్రయాణించి, నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 వరకు రిజర్వు చేసుకునే తిరుగు ప్రయాణ టికెట్లపై 20% రాయితీని ప్రకటించారు. పండుగ సీజన్ లో అమలు చేసే రాయితీ వల్ల ప్రజలకు లబ్ధి చేకూరనుంది.
గయా నుంచి ఢిల్లీ, సహర్సా నుంచి అమృత్ సర్, ఛాప్రా నుంచి ఢిల్లీ, ముజఫర్ పూర్ నుంచి హైదరాబాద్ కు నాలుగు కొత్త అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. భగవాన్ బుద్ధకు సంబంధించిన ప్రత్యేక ప్రాంతాలను కలుపుతూ, మధ్యతరగతి కుటుంబాలకు అనుగుణంగా కొత్త సర్క్యూట్ రైలు ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ రైలు వైశాలి, హాజీపూర్, సోనేపూర్, పాట్నా, రాజ్ గిర్, గయా, కొడెర్మా ప్రాంతాల గుండా వెళ్తుంది.
మరిన్ని రైళ్లను నడిపేందుకు వీలుగా బక్సర్-లఖిసరై రైల్వే విభాగాన్ని విస్తరించనున్నారు. పాట్నా చుట్టూ రింగ్ రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. సుల్తాన్గంజ్- దేవఘర్ ప్రాంతాలను రైల్వే ద్వారా అనుసంధానించనున్నారు. పాట్నా-అయోధ్య మధ్య కొత్త రైలు సర్వీసును ప్రారంభించనున్నారు.
లౌకహా బజార్లో వాషింగ్ పిట్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. బీహార్లో ఇటీవల ఆమోదం పొందిన అనేక రహదారి వంతెన పనులను చేపట్టనున్నట్లు శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
బీహార్ లో ఎన్నో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు, అమృత్ భారత్, వందే భారత్ సహా పలు కొత్త రైళ్లను ప్రారంభానికి అనుమతించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్, ఎంపీ డాక్టర్ సంజయ్ జైస్వాల్, ఎంపీ సంజయ్ కుమార్ ఝా కృతజ్ఞతలు తెలిపారు.