ప్రధాన మంత్రి కార్యాలయం
ఆగస్టు 17న ఢిల్లీలో రూ.11,000 కోట్ల జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ద్వారకా ఎక్స్ప్రెస్ వేలోని ఢిల్లీ విభాగాన్ని ప్రారంభించనున్న ప్రధాని
ఎన్సీఆర్లో అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-II ప్రాజెక్టును ప్రారంభించనున్న మోదీ
ఢిల్లీలో మల్టీ-మోడల్ అనుసంధానతను అందిస్తూ రద్దీని తగ్గించనున్న ప్రాజెక్టులు
Posted On:
16 AUG 2025 11:15AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 17న మధ్యాహ్నం 12:30 గంటలకు దాదాపు రూ. 11,000 కోట్ల వ్యయంతో చేపట్టిన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ఢిల్లీలోని రోహిణిలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు.
ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో అనుసంధానతను బాగా మెరుగుపరచడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రభుత్వం రూపొందించిన సమగ్ర ప్రణాళిక కింద ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-II ప్రాజెక్టులను చేపట్టారు. జీవన సౌలభ్యాన్ని పెంచటం, ఆటంకం లేని ప్రయాణం అందించే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించాలనే ప్రధానమంత్రి మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులు ఉన్నాయి.
ద్వారకా ఎక్స్ప్రెస్ వేలోని 10.1 కి.మీ. ఢిల్లీ విభాగాన్ని దాదాపు రూ. 5,360 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ విభాగం యశోభూమి, డీఎంఆర్సీ నీలి రంగు మార్గం, నారింజ రంగు మార్గం.. రాబోతున్న బిజ్వాసన్ రైల్వే స్టేషన్, ద్వారకా క్లస్టర్ బస్ డిపోలకు మల్టీ-మోడల్ అనుసంధానతను అందిస్తుంది. ఈ విభాగంలో ఇవి ఉన్నాయి:
* ప్యాకేజీ I: శివ మూర్తి కూడలి నుంచి ద్వారకా సెక్టార్-21 వద్ద రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) వరకు 5.9 కి.మీ. రహదారి.
* ప్యాకేజీ II: ద్వారకా సెక్టార్-21 ఆర్యూబీ నుంచి ఢిల్లీ-హర్యానా సరిహద్దు వరకు ఉన్న ఈ 4.2 కి.మీ. రహదారి అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-IIకి ప్రత్యక్ష అనుసంధానతను ఇస్తుంది.
ద్వారకా ఎక్స్ప్రెస్ వేలోని 19 కి.మీ పొడవైన హర్యానా విభాగాన్ని ప్రధానమంత్రి మార్చి 2024లో ప్రారంభించారు.
అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-IIలోని (యూఈఆర్-II) అలీపూర్ నుంచి డిచాన్ కలాన్ వరకు ఉన్న రహదారిని కూడా ప్రారంభిస్తారు. అలాగే బహదూర్గఢ్, సోనిపట్లకు నిర్మించిన కొత్త లింక్ రోడ్లను కూడా ప్రారంభిస్తారు. వీటిని దాదాపు రూ. 5,580 కోట్లతో నిర్మించారు. ఇది ఢిల్లీ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు.. ముకర్బా చౌక్, ధౌలా కువాన్, ఎన్హెచ్-09 వంటి రద్దీ ప్రదేశాలలో ట్రాఫిక్ రద్దీని తగ్గించనుంది. ఇవి బహదూర్గఢ్, సోనిపట్లకు ప్రత్యక్ష అనుసంధానను అందిస్తాయి. దీనితో పాటు పారిశ్రామిక ప్రాంతాల మధ్య అనుసంధానను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా నగర ట్రాఫిక్ను తగ్గిస్తూ రాజధాని ప్రాంతంలో రవాణాను వేగవంతం చేస్తాయి.
(Release ID: 2157130)
Read this release in:
Bengali
,
Odia
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam