ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన ఫ్లాట్ల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
Posted On:
11 AUG 2025 11:44AM by PIB Hyderabad
శ్రీ ఓం బిర్లా గారూ, మనోహర్ లాల్ గారూ, కిరణ్ రిజిజు గారూ, మహేశ్ శర్మ గారూ, గౌరవ పార్లమెంటు సభ్యులూ, లోక్సభ ప్రధాన కార్యదర్శి గారూ, సోదరీ సోదరులారా!
కొన్ని రోజుల కిందటే కర్తవ్య పథ్లో ఉమ్మడి కేంద్ర సచివాలయం కర్తవ్య భవన్ను నేను ప్రారంభించాను. నేడు నా పార్లమెంటు సహచరుల కోసం ఈ నివాస సముదాయాన్ని ప్రారంభించే అవకాశం కూడా నాకు దక్కింది. ఇక్కడి నాలుగు టవర్లకు కృష్ణ, గోదావరి, కోసి, హుగ్లీ అని అందమైన పేర్లు కూడా పెట్టారు. దేశంలో లక్షలాది ప్రజలకు జీవనాధారమైన నాలుగు గొప్ప నదులవి. ఆ స్ఫూర్తితో మన ప్రజాప్రతినిధుల జీవితాల్లోనూ ఇప్పుడు ఆనందం చోటుచేసుకుంటుంది. కొంతమందికి అభ్యంతరాలు కూడా ఉండొచ్చు.. ఉదాహరణకు, ఇక్కడ కోసీ నది పేరుంటే వారికి ఆ నది బదులు బీహార్ ఎన్నికలే కనిపించవచ్చు. అలాంటి సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తులకు నేనిప్పుడూ అదే చెబుతున్నాను.. నదుల పేర్లు పెట్టే సంప్రదాయం మనల్ని దేశ ఐక్యత సూత్రంతో అనుసంధానిస్తుంది. ఇది ఢిల్లీలో మన ఎంపీలకు జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక్కడ ఎంపీలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ గృహాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎంపీలందరికీ శుభాకాంక్షలు. ఈ ఫ్లాట్ల నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లు, కార్మికులకు అభినందనలు. వారంతా ఎంతో శ్రమకోర్చి అంకితభావంతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
మిత్రులారా,
మన సహచర ఎంపీలు త్వరలో మారబోయే నమూనా ఫ్లాట్ను చూసే అవకాశం నాకు ఈ రోజు వచ్చింది. పాత ఎంపీ నివాసాలను కూడా గతంలో నేను చూశాను. పాత నివాసాలు శిథిలావస్థకు చేరాయి. ఎంపీలు తరచూ సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఈ కొత్త నివాసాల్లోకి అడుగుపెడితే వారికి సమస్యలు తొలగిపోతాయి. ఇలాంటి వ్యక్తిగత ఇబ్బందుల నుంచి మన ఎంపీలు బయటపడితేనే, ప్రజాసమస్యల పరిష్కారం కోసం తమ సమయాన్ని, శక్తిని మరింత సమర్థంగా వినియోగిస్తారు.
మిత్రులారా,
కొత్తగా ఎన్నికైన ఎంపీలకు ఢిల్లీలో ఇల్లు కేటాయించడం ఎంత కష్టంగా ఉండేదో మీ అందరికీ తెలిసిందే. ఈ కొత్త భవనాలతో ఆ సమస్య కూడా తొలగిపోతుంది. ఈ బహుళ అంతస్తుల భవనాల్లో 180 మందికి పైగా ఎంపీలు ఉండేందుకు అవకాశముంది. అంతేకాకుండా.. ఈ కొత్త నివాసాలకు గణనీయమైన ఆర్థిక కోణం కూడా ఉంది. అనేక మంత్రిత్వ శాఖలు అద్దె భవనాల నుంచే పని చేస్తున్నాయని, వాటి అద్దెలకే ఏటా దాదాపు రూ. 1,500 కోట్లు వెచ్చించాల్సి వస్తోందని ఇటీవల కర్తవ్య భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను చెప్పాను. ఇది ప్రజాధనాన్ని ప్రత్యక్షంగా వృథాచేయడమే. అలాగే, ఎంపీ నివాసాలు తగినన్ని లేకపోవడంతో ప్రభుత్వ వ్యయం కూడా పెరుగుతూ ఉండేది. మీరే ఊహించండి - ఎంపీలకు ఇళ్ల కొరత ఉన్నప్పటికీ, 2004 నుంచి 2014 వరకు లోక్సభ ఎంపీల కోసం ఒక్క కొత్త నివాసాన్ని కూడా నిర్మించలేదు. అందుకే 2014 అనంతరం మేమీ కార్యక్రమాన్ని ఓ లక్ష్యంగా భావించాం. 2014 నుంచి ఇప్పటి వరకు ఈ ఫ్లాట్లు సహా 350 ఎంపీ నివాసాలను నిర్మించాం. అంటే, ఈ నివాసాలు పూర్తయితే ప్రజాధనం కూడా ఆదా అవుతుంది.
మిత్రులారా,
21వ శతాబ్దపు భారత్ లక్ష్యాన్ని సాధించడం అత్యావశ్యకం. కీలకం కూడా. నేడు భారత్ కర్తవ్య పథ్, కర్తవ్య భవన్లను నిర్మిస్తోంది. అలాగే, లక్షలాది ప్రజలకు పైపుల ద్వారా నీటినందించే బాధ్యతనూ నిర్వర్తిస్తుంది. నేడు దేశం ఎంపీల కొత్త ఇళ్ల నిరీక్షణను నెరవేర్చడంతోపాటే.. పీఎం ఆవాస్ యోజన కింద 4 కోట్ల పేద కుటుంబాలకు గృహ సదుపాయాన్నీ కల్పిస్తుంది. కొత్త పార్లమెంటు భవనంతోపాటు వందలాది కొత్త వైద్య కళాశాలలను కూడా నేడు భారత్ నిర్మిస్తుంది. ఈ చర్యలన్నీ సమాజంలో ప్రతి వర్గానికీ ప్రయోజనం కలిగిస్తున్నాయి.
మిత్రులారా,
ఈ కొత్త ఎంపీ నివాసాల్లో పర్యావరణ హిత అభివృద్ధి విధానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం సంతోషాన్నిస్తోంది. ఇది కూడా దేశ పర్యావరణ అనుకూల, సురక్షిత భవిష్యత్ కార్యక్రమాల్లో భాగం. సోలార్ ఆధారిత మౌలిక సదుపాయాల నుంచి సౌర శక్తిలో కొత్త రికార్డులు నెలకొల్పడం వరకు.. సుస్థిరాభివృద్ధి లక్ష్యం దిశగా దేశం నిరంతరం పురోగమిస్తోంది.
మిత్రులారా,
నాది మరో అభ్యర్థన. ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన ఎంపీలు కలిసి ఉంటారు. ఇది ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’కు ప్రతీక. వివిధ రాష్ట్రాలకు చెందిన పండుగలు, వేడుకలను ఎప్పటికప్పుడు ఇక్కడే కలసికట్టుగా జరుపుకోవడం ఈ సముదాయానికి శోభనిస్తుంది. ఆయా కార్యక్రమాలకు మీ నియోజకవర్గ ప్రజలను కూడా ఆహ్వానించవచ్చు. మీమీ ప్రాంతీయ భాషల్లోని పదబంధాలను తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది. పర్యావరణం, స్వచ్ఛతపరంగా కూడా ఈ సముదాయానికి గుర్తింపు తేవచ్చు. ఇది మనందరి కర్తవ్యం. కేవలం ఎంపీ నివాసాలే కాకుండా, సముదాయం మొత్తం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. అది ఎంత అద్భుతమో కదా!
మిత్రులారా,
మనమంతా ఒకే జట్టుగా కలసి పనిచేయాలని ఆశిస్తున్నాను. అప్పుడు మన ప్రయత్నం దేశానికి ఆదర్శమవుతుంది. ఎంపీ నివాస సముదాయాల్లో ఏడాదికి రెండుమూడుసార్లు పరిసరాల పరిశుభ్రతపై పోటీలు నిర్వహించే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రిత్వ శాఖను, మీ హౌసింగ్ కమిటీని కోరుతాను. ఏ బ్లాకు శుభ్రంగా ఉన్నదీ ప్రకటిస్తారు. ఏడాది తర్వాత అత్యంత పరిశుభ్రంగా ఉన్న బ్లాకునూ, అత్యంత చెత్తగా ఉన్న బ్లాకునూ గుర్తించేందుకు కూడా వీలవుతుంది.
మిత్రులారా,
కొత్తగా కట్టిన ఈ ఫ్లాట్లను చూడడానికి వెళ్లిన సమయంలో.. లోపలికి వెళ్ళగానే నేనడిగిన మొదటి ప్రశ్న- ‘‘ఇదంతానా?’’ అని. “లేదు సర్, ఇది ప్రవేశం మాత్రమే. లోపలికి రండి” అని నాతో వాళ్లన్నారు. నాకు ఆశ్చర్యమేసింది. అన్ని గదులనూ మీరు నింపనుకూడా లేరని అనుకుంటున్నా. అంత విశాలంగా ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుంటారని, ఈ కొత్త నివాసాలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితాలను శోభాయమానం చేస్తాయని ఆశిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ధన్యవాదాలు.
***
(Release ID: 2155106)