ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రెజిల్ అధ్యక్షునితో ప్రధానమంత్రి సమావేశం
Posted On:
09 JUL 2025 6:02AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రెజిలియాలో అధికారిక పర్యటన చేపడుతున్నారు. బ్రెజీలియాలోని అల్వరాడో ప్యాలెస్లో బ్రెజిల్ అధ్యక్షుడు గౌరవ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వాతో ఈ రోజు సమావేశమయ్యారు. అధ్యక్షుడు లూలా ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారు.
పరిమితమైన, ప్రతినిధి స్థాయి విధానాల్లో జరిగిన చర్చల్లో ప్రధానమంత్రి, అధ్యక్షుడు లూలా పాల్గొన్నారు. భారత్, బ్రెజిల్ మధ్య బహుముఖ వ్యూహాత్మక భాగస్వామానికి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న స్నేహపూర్వక సంబంధాలకు ఆధారమైన ఉమ్మడి విలువలను పునరుద్ఘాటించారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగం, భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, యూపీఐ, సంప్రదాయ వైద్యం, యోగా, క్రీడా సంబంధాలు, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాల్లో సహకారంపై ఇరువురు నాయకులు చర్చించారు. కీలకమైన ఖనిజాలు, నూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఏఐ, సూపర్ కంప్యూటర్లు, డిజిటల్ భాగస్వామ్యం, వాహన రంగం తదితర ఆధునిక రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాన్ని వారు అన్వేషించారు.
వాణిజ్యం, వ్యాపారాంశాల్లో చర్చలు నిర్వహించడానికి మంత్రిత్వ స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇద్దరూ స్వాగతించారు. భారత్-మెర్కోసుర్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం విస్తరణతో సహా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ అమెరికన్ డాలర్లకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇంధన రంగంలో కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించారు. అలాగే హైడ్రో కార్బన్, పునురుత్పాదక రంగాల్లో రెండు దేశాలకు అపారమైన సామర్థ్యం ఉన్న నేపథ్యంలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించేందుకు అంగీకరించారు.
2025, ఏప్రిల్ నెలలో పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన క్రూరమైన దాడి అనంతరం భారత్కు సంఘీభావం, మద్దతు అందించిన బ్రెజిల్కు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఎదుర్కోవాలనే రెండు దేశాల దృఢచిత్తాన్ని తెలియజేస్తోంది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిల్లోనూ ఉపేక్షించరాదని, ఇలాంటి అమానవీయ చర్యలను ప్రోత్సహించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఉగ్రవాదంతో పోరాటం చేయడానికి, దాన్ని అంతమొందించడానికి అంతర్జాతీయ సమాజంతో కలసి రెండు దేశాలు పని చేయడానికి అధ్యక్షుడు లూలా అంగీకరించారు.
ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ ఆలోచనలను నాయకులిద్దరూ పంచుకున్నారు. బహుపాక్షిక విధానం, ఐక్యరాజ్యసమితి భద్రతామండలితో సహా అంతర్జాతీయ పాలనా సంస్థలను సంస్కరించడం పట్ల తమ నిబద్ధతను తెలియజేశారు. వాతావారణ మార్పులను ఎదుర్కోవడంలో అంతర్జాతీయ చర్యలను బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని ఇద్దరు నాయకులు అంగీకరించారు. కాప్30 వాతావరణ మార్పుల సదస్సును నిర్వహించనున్న నేపథ్యంలో బ్రెజిల్కు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్లోబల్ సౌత్ ఆసక్తులను ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేసేందుకు అంగీకరించారు.
చర్చల అనంతరం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, భద్రతా సంబంధమైన సమాచార మార్పిడి, వ్యవసాయ పరిశోధన, పునరుత్పాదక ఇంధన, మేధోసంపత్తి హక్కులు, డిజిటల్ సహకారం (ఇండియా స్టాక్) రంగాల్లో ఆరు ఎంవోయూలు [వివరాలను ఇక్కడ చూడొచ్చు] ఖరారయ్యాయి. అధికారిక పర్యటనలో సంయుక్త ప్రకటన [లింక్] జారీ చేశారు.
ప్రధానమంత్రి గౌరవార్థం అధ్యక్షుడు లూలా విందును ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు లూలా ఆతిథ్యానికి ప్రధాని ధన్యవాదాలు తెలియజేశారు. భారత్ను సందర్శించాలని ఆహ్వానించారు.
***
(Release ID: 2143547)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam