ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రధాని ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా సమీక్ష


· అహ్మదాబాద్-ధోలేరా ఎక్స్‌ ప్రెస్‌వే సత్వర పూర్తి లక్ష్యంగా నిశిత పరిశీలన

· అంతర్జాతీయ ప్రమాణాలుగల అత్యాధునిక పారిశ్రామిక నగరంగా ధోలేరాను రూపుదిద్దడంలో గుజరాత్ ప్రభుత్వ నిబద్ధతపై పునరుద్ఘాటన

· లోథాల్‌లోని జాతీయ సముద్ర వాణిజ్య వారసత్వ సముదాయం నిర్మాణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించిన డాక్టర్ మిశ్రా

Posted On: 16 JUN 2025 6:22PM by PIB Hyderabad

గుజరాత్‌లోని ధోలేరా, లోథాల్‌ నగరాల్లో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగమనంపై ప్రధాని కార్యాలయ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా ఈ రోజు సమీక్షించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పారిశ్రామిక-ఆర్థిక వృద్ధి దృక్కోణానికి అనుగుణంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్దిష్ట అంచనాల ప్రాతిపదికన ప్రత్యక్ష పరిశీలన సహా వాటి ప్రగతిపై డాక్టర్‌ మిశ్రా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు.

ఈ పరిశీలనలో భాగంగా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్మిస్తున్న అహ్మదాబాద్-ధోలేరా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ ప్రెస్‌వే పనులను డాక్టర్ మిశ్రా పరిశీలించారు. ఈ మార్గం నిర్మాణంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 45 నిమిషాలకు తగ్గుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తదనుగుణంగా అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో ఈ రహదారిని సకాలంలో పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.

అనతరం ధోలేరా ప్రత్యేక పెట్టుబడుల ప్రాంతం (డీఎస్‌ఐఆర్‌)లో కొనసాగుతున్న ధోలేరా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ  పురోగతి వేగాన్ని డాక్టర్ మిశ్రా స్వయంగా అంచనా వేశారు. ఇక్కడి నుంచి 2025 అక్టోబరుకల్లా సరకు రవాణా కార్యకలాపాలు ప్రారంభం కాగలవని అధికారులు ఆయనకు తెలిపారు. డాక్టర్‌ మిశ్రా స్పందిస్తూ- సమయపాలనకు కట్టుబడటమే కాకుండా ఎక్స్‌ ప్రెస్‌వేతో విమానాశ్రయ అనుసంధానం సజావుగా ఉండేవిధంగా పనులు పూర్తికావాలని ఆదేశించారు.

దేశీయ చిప్ తయారీలో ప్రధానమైన టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ (ఫ్యాబ్) ప్రాజెక్టును డాక్టర్ మిశ్రా పరిశీలించారు. మొబైల్ పరికరాల కోసం చిప్‌ల తయారీ,  వినియోగదారు ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ అప్లికేషన్లు సహా ఈ పరిశ్రమ ఉత్పత్తి విస్తృతిని ఆయన సమీక్షించారు. ధోలేరా ఇండస్ట్రియల్ సిటీ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (డీఐసీడీఎల్‌) నిర్మించిన పాఠశాలలు, ఆస్పత్రులు, నివాస సముదాయాల వంటి సామాజిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. వినియోగదారు అనుభవానికిగల ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఈ దిశగా భాగస్వాముల అభిప్రాయ సమీకరణ ప్రక్రియను సమగ్రంగా జోడించాలని సూచించారు.

అనంతరం “డీఐసీడీఎల్‌, డీఐఏసీఎల్‌, ఎన్‌హెచ్‌ఏఐ, ఏఏఐ”, భారతీయ రైల్వేలకు చెందిన సీనియర్ అధికారులతో డాక్టర్ మిశ్రా సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. అహ్మదాబాద్-ధోలేరా ఎక్స్‌ ప్రెస్‌వే, భీమ్‌నాథ్-ధోలేరా ఫ్రైట్ రైల్ లింక్, అహ్మదాబాద్-ధోలేరా సెమీ హై-స్పీడ్ రైల్వే లైన్, ధోలేరా అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టుల ప్రగతిని ఈ సందర్భంగా వారితో సమీక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలు గల అత్యాధునిక పారిశ్రామిక నగరంగా ధోలేరాను తీర్చిదిద్దడంపై గుజరాత్ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ మిశ్రా పునరుద్ఘాటించారు. దీనికి అనుగుణంగా సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు నిపుణ కార్మిక శక్తి లభ్యత, పటిష్ఠ ప్రణాళికల ప్రాధాన్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఓడరేవులు-నౌకా రవాణా-జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కీలక ప్రాజెక్టు జాతీయ సముద్ర వాణిజ్య వారసత్వ సముదాయం (ఎన్‌ఎంహెచ్‌సీ) పనులను డాక్టర్ మిశ్రా పరిశీలించారు. అటుపైన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ టి.రామచంద్రన్, ఇతర అధికారులతోపాటు గుజరాత్ మారిటైమ్ బోర్డు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్‌హెచ్‌ఏఐ, భారతీయ రైల్వేల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత సముద్ర వారసత్వ విజ్ఞాన ప్రదాతగా ‘ఎన్‌ఎంహెచ్‌సీ’ ఉపయోగపడాలని ఆయన సూచించారు. ఈ మేరకు లోతైన పరిశోధన, విద్యారంగ సహకారం, సందర్శక అనుభవానికి సంబంధించి సాలోచిత ప్రణాళిక వగైరాల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

స్థానిక జంతుజాల సంరక్షణ-పోషణ, జల నిర్వహణ వ్యవస్థలు సహా పర్యావరణ స్థిరత్వం దిశగా చేపట్టిన చర్యలను కూడా శ్రీ మిశ్రా సమీక్షించారు. హరప్పా నాగరికత కాలం నుంచి భారతీయ సముద్ర వారసత్వాన్ని వివరించే కళాఖండాలను జాగ్రత్తగా ఎంపిక చేసి, అమర్చాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘ఎన్‌ఎంహెచ్‌సీ’ అసాధారణ స్థాయిని, ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. ఆరు గ్యాలరీలు సహా ఫేజ్‌ 1-ఎ  నిర్మాణాన్ని కూడా పరిశీలించిన డాక్టర్ మిశ్రా- 2025 ఆగస్టుకల్లా దీన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.

డాక్టర్ మిశ్రాతో పాటు ప్రధానమంత్రి సలహాదారు శ్రీ తరుణ్ కపూర్, ప్రధాని కార్యాలయ ఉప కార్యదర్శి శ్రీ మంగేష్ గిల్దియాల్ తదితర అధికారులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

****


(Release ID: 2136918)