ప్రధాన మంత్రి కార్యాలయం
బీహార్లోని కారాకాట్లో రూ.48,520 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
* పాకిస్థాన్లో కూర్చొని మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసిన వారి స్థావరాలను మన ఆర్మీ నాశనం చేసింది: పీఎం
* భారతీయ పుత్రికల సిందూర శక్తిని పాకిస్థాన్తోపాటు ప్రపంచమంతా చూసింది!: పీఎం
* మావోయిస్టుల హింస పూర్తిగా అంతమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు... ఎలాంటి అడ్డంకులు లేకుండా శాంతిభద్రతలు, విద్య, అభివృద్ధి ప్రతి గ్రామానికీ చేరుకుంటాయి: పీఎం
* పాట్నా విమానాశ్రయాన్ని ఆధునికీకరించాలని బీహార్ ప్రజలు దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరింది: పీఎం
* మా ప్రభుత్వం బీహార్లో మఖానా రైతులకు ప్రయోజనం కలిగేలా మఖానా బోర్డును ప్రకటించింది..
ఈ పంటకు జీఐ ట్యాగ్ ఇచ్చింది: పీఎం
Posted On:
30 MAY 2025 1:11PM by PIB Hyderabad
బీహార్లోని కారాకాట్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రూ. 48,520 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. బీహార్ అభివృద్ధిని వేగవంతం చేసే అవకాశం తనకు దక్కిందని, ఈ పవిత్ర భూమిపై రూ. 48,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, భూమిపూజ చేశామని పేర్కొన్నారు. తనను ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. బీహార్ పట్ల వారికున్న అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు. అన్ని సందర్భాల్లోనూ వారి మద్దతు తనకు లభించిందని అన్నారు. బీహార్లోని మాతృమూర్తులు, సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
సాసారాం ప్రాముఖ్యాన్ని వివరిస్తూ.. భగవాన్ రాముని వారసత్వాన్ని ఆ పేరు కొనసాగిస్తోందని తెలిపారు. ఒక్కసారి మాట ఇస్తే దానికి ఖచ్చితంగా నిలబెట్టుకోవాలన్న శ్రీరాముని మార్గదర్శక సూత్రమే. ప్రస్తుతం ఆధునిక భారత్ అనుసరిస్తున్న విధానంగా మారిందని పేర్కొన్నారు. ఇటీవలే పహల్గాంలో అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడిని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆ దాడి జరిగిన మరుసటి రోజే తాను బీహార్ను సందర్శించానని, ఈ ఉగ్రదాడికి కారకులైన వారిని న్యాయం ముందు నిలబెట్టి వారి ఊహకి కూడా అందని విధంగా శిక్ష విధిస్తామని చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి బీహార్ నేలపై నిలబడిన తాను ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నానని తెలిపారు. ‘‘పాకిస్థాన్లో కూర్చుని మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచేసిన వారి స్థావరాలను మన భద్రతా బలగాలు నేలమట్టం చేశాయి’’ అని శ్రీ మోదీ తెలిపారు. ‘‘భారతీయ పుత్రికల సిందూర శక్తిని పాకిస్థాన్తో పాటుగా, మొత్తం ప్రపంచం చూసింది’’ అన్నారు. ఒకే ఒక్క నిర్ణయాత్మక చర్యతో భారతీయ భద్రతా బలగాలు.. పాకిస్థానీ మిలటరీ రక్షణలో ఉన్న ఉగ్రవాదులను మోకరిల్లేలా చేశాయని తెలిపారు. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు, మిలటరీ వ్యవస్థలు నిమిషాల్లో ధ్వంసమయ్యాయన్న శ్రీ మోదీ ‘‘ఇదే సరికొత్త భారత్ - అపారమైన శక్తి, స్థిరత్వం నిండిన భారత్’’ అని ప్రకటించారు.
సాహస స్ఫూర్తికి పేరుగాంచిన వీర్ కున్వర్ సింగ్ నడిచిన నేల బీహార్ అని, ఈ రాష్ట్రం నుంచి వేల సంఖ్యలో యువత భారత భద్రతా బలగాలు, సరిహద్దు భద్రతా దళంలో పనిచేస్తూ.. దేశాన్ని రక్షిస్తున్నారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో బీఎస్ఎఫ్ అచంచలమైన ధైర్యాన్ని కనబరిచిందని, వారి అసమాన సాహసాన్ని ప్రపంచం చూసిందన్నారు. దేశ సరిహద్దుల వద్ద పహారా కాస్తున్న బీఎస్ఎఫ్ సిబ్బంది దేశానికి భద్రతా కవచంలాంటి వారని, భరత మాతను కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా వారు విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. మే 10న సరిహద్దుల వద్ద విధులు నిర్వర్తిస్తూ అమరుడైన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఇంతియాజ్కు నివాళులు అర్పించి, బీహార్ వీర పుత్రుని పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. భారత్ శక్తిని ప్రదర్శించిన ఆపరేషన్ సిందూర్ దేశం అమ్ముల పొదిలో నుంచి సంధించిన ఒక్క బాణం మాత్రమే అని బీహార్ నుంచి మరోసారి స్పష్టం చేశారు.
‘‘దేశ సరిహద్దుల లోపల, వెలుపల ఉన్న ప్రతి శత్రువుతోనూ భారత్ పోరాడుతోంది’’ అని శ్రీ మోదీ చెప్పారు. గత కొన్నేళ్లలో హింసాత్మక, విధ్వంసకర శక్తులు అంతమైపోవడాన్ని బీహార్ చూసిందన్నారు. సాసారం, కైమూర్, పరిసర జిల్లాల్లో గతంలో ఉన్న పరిస్థితులను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నక్సలిజం ప్రాబల్యం ఎక్కువగా ఎలా ఉండేదో, తుపాకీలు, ఆయుధాలు ధరించిన ముసుగు ఉగ్రవాదుల వల్ల ప్రజలకు నిరంతరం ముప్పు ఎలా పొంచి ఉండేదో వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు చేరుకొనేవి కావని ఆయన అన్నారు. ఈ ప్రాంతాల్లో ఆసుపత్రులు, మొబైల్ టవర్లు ఉండేవి కావని, పాఠశాలలను తగలబెట్టేవారని శ్రీ మోదీ తెలిపారు. రహదారి నిర్మాణ కార్మికులను తరచూ లక్ష్యంగా చేసుకొని చంపేసేవారని, ఇలాంటి శక్తులకు బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంపై ఎలాంటి విశ్వాసం లేదని పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ నితీశ్ కుమార్ అభివృద్ధిని సాధించే దిశగా కృషి చేశారని, 2014 నుంచి ఈ ప్రయత్నాలు వేగవంతమయ్యాయని తెలిపారు. మావోయిస్టులు పాల్పడిన చర్యలకు వారిని శిక్షించామని, యువతను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేపట్టామని శ్రీ మోదీ తెలిపారు. 11 ఏళ్ల పాటు దృఢ సంకల్పంతో సాగించిన ఈ ప్రయత్నాల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని తెలిపారు. 2014కి ముందు, భారత్లో 125 నక్సల్ ప్రభావిత జిల్లాలు ఉండేవి, ఇప్పుడు అవి 18కి తగ్గాయని వెల్లడించారు. ‘‘మా ప్రభుత్వం రోడ్లను మాత్రమే వేయడం లేదు.. ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. మావోయిస్టుల హింస పూర్తిగా అంతమై, గ్రామాల్లో శాంతి, భద్రత, విద్య, అభివృద్ధి అందే రోజు ఎంతో దూరంలో లేదు’’ అని శ్రీ మోదీ అన్నారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటం ఏనాడు ఆగదు లేదా మందగించదన్న ప్రధాని, ‘‘మరోసారి ఉగ్రవాదం తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తే.. ఎక్కడ దాగున్నా.. బయటకు తీసుకొచ్చి మరీ దాన్ని అణిచివేస్తాం’’ అని స్పష్టం చేశారు.
శాంతి భద్రతలే అభివృద్ధికి నూతన మార్గాలను ఏర్పాటు చేస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నితీష్ కుమార్ నాయకత్వంలోని ప్రభుత్వం బీహార్లో ‘జంగిల్ రాజ్’కు చరమగీతం పలికి, రాష్ట్రం సంక్షేమ మార్గంలో పురోగమించేలా చేస్తోందని పేర్కొన్నారు. అస్తవ్యస్తమైన జాతీయ రహదారులు, అధ్వాన్నమైన రైల్వేలు, పరిమిత విమానయాన సౌకర్యం లాంటివన్నీ పాత సంగతులని అన్నారు. గతంలో బీహార్కు ఒకే ఒక్క విమానాశ్రయంగా పాట్నా ఉండేదని, ఇప్పుడు దర్భంగా విమానాశ్రయంలో కూడా కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విమానాశ్రయానికి ఢిల్లీ, ముంబయి, బెంగళూరు లాంటి నగరాల నుంచి నేరుగా విమాన సౌకర్యం ఉందని చెప్పారు. పాట్నా విమానాశ్రయాన్ని ఆధునికీకరించాలని సుదీర్ఘ కాలంగా బీహార్ ప్రజలు చేస్తున్న డిమాండ్ను గుర్తించిన ప్రధాని ఇప్పుడు అది నెరవేరిందని తెలిపారు. నిన్న సాయంత్రమే పాట్నా విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించే అవకాశం తనకు దక్కిందని అన్నారు. ఇప్పుడు ఈ విమానాశ్రయానికి కోటి మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యం ఉందని వెల్లడించారు. అలాగే బిహ్తా విమానాశ్రయంలో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు వివరించారు.
బీహార్ వ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న నాలుగు లేన్లు, ఆరు లేన్ల రహదారుల గురించి శ్రీ మోదీ వివరించారు. పాట్నా నుంచి బక్సర్, గయ నుంచి దోభి, పాట్నా నుంచి బోధ్ గయ జాతీయ రహదారులతో సహా కీలకమైన మౌలికసదుపాయాల ప్రాజెక్టుల్లో సాధిస్తున్న వేగవంతమైన ప్రగతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే శరవేగంగా సాగుతున్న పాట్నా-ఆరా-సాసారాం గ్రీన్ఫీల్డ్ కారిడార్ పనుల గురించి కూడా తెలియజేశారు. గంగ, సోన్, గండక్, కోసీ నదులపై నిర్మిస్తున్న ప్రధాన బ్రిడ్జిల గురించి వివరిస్తూ.. బీహార్లో కొత్త అవకాశాలను పెంపొందించడంలో వాటి పాత్రను వివరించారు. వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులు వేలాది మంది యువతకు ఉపాధిని కల్పిస్తాయని, ఈ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
బీహార్ రైల్వే మౌలిక వసతుల్లో వచ్చిన గణనీయమైన మార్పుల గురించి వివరిస్తూ.. ప్రపంచ స్థాయి వందే భారత్ రైళ్లను బీహార్లో ప్రవేశపెట్టడంతో సహా కొనసాగుతున్న డబ్లింగ్, ట్రిప్లింగ్ రైల్వే లైన్ల పనుల గురించి ప్రస్తావించారు. ఛాప్రా, ముజఫర్పూర్, కతిహార్, తదితర ప్రాంతాలలో వేగంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సోన్ నగర్, అందల్ మధ్య మల్టీ ట్రాకింగ్ పనులు జరుగుతున్నాయని, ఇవి రైళ్ల రాకపోకలను మెరుగుపరుస్తాయని వెల్లడించారు. ఇప్పుడు సాసారంలో 100కి పైగా రైళ్లు ఆగుతాయని శ్రీ మోదీ ప్రకటించారు. ఇది ఈ ప్రాంతంలో పెరుగుతున్న రవాణా అనుసంధానతను తెలియజేస్తోందన్నారు. దీర్ఘకాలంగా ఉన్న సవాళ్లను పరిష్కరిస్తూనే, రైల్వే వ్యవస్థను ఆధునికీకరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఇంతకుముందే అమలు చేసి ఉండాల్సిందని, కానీ బీహార్ రైల్వే వ్యవస్థను ఆధునికీకరించడానికి బాధ్యులైన వారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం నియామక ప్రక్రియలను దుర్వినియోగం చేయడంతో, ప్రజలు తాము హక్కుగా పొందవలసిన అవకాశాలను కోల్పోయారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గతంలో ఆటవిక పాలన సాగించిన వారి మోసాలు, తప్పుడు హామీల పట్ల బీహార్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. విద్యుత్ లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేస్తూ, పారిశ్రామిక ప్రగతి, ప్రజల జీవన సౌలభ్యం నమ్మకమైన విద్యుత్ సరఫరాపైనే ఆధారపడి ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. బీహార్ గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ ఉత్పత్తి కి ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. దశాబ్దం క్రితంతో పోలిస్తే బీహార్ లో విద్యుత్ వినియోగం నాలుగు రెట్లు పెరిగిందన్నారు. నబీనగర్ లో రూ.30,000 కోట్ల పెట్టుబడితో ఎన్టీపీసీ భారీ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉందని, ఈ ప్రాజెక్టు బీహార్ కు 1,500 మెగావాట్ల విద్యుత్ ను అందిస్తుందని ప్రధాన మంత్రి తెలిపారు. బక్సర్, పీర్పాయింటిలో కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
బీహార్ ను హరిత ఇంధనం వైపు నడిపించడం ద్వారా భవిష్యత్తుపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెబుతూ, రాష్ట్ర పునరుత్పాదక ఇంధన కార్యక్రమాల్లో భాగంగా కజ్రాలో సోలార్ పార్కు నిర్మాణం గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా తెలిపారు.పీఎం-కుసుమ్ పథకం కింద రైతులకు సౌరశక్తి ద్వారా ఆదాయం ఆర్జించే అవకాశాలు కల్పిస్తున్నామని, వ్యవసాయ ఉత్పాదకతను మరింత మెరుగుపరిచేందుకు పునరుత్పాదక వ్యవసాయ ఫీడర్లు ద్వారా పొలాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రయత్నాల ఫలితంగా ప్రజల జీవితాలు మెరుగయ్యాయని, మహిళలు సురక్షిత భావనతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలు గ్రామాలు, పేదలు, రైతులు, చిన్న పరిశ్రమలకు గొప్ప ప్రయోజనాలను అందిస్తాయని, ఎందుకంటే అవి పెద్ద జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం కాగలవని శ్రీ మోదీ చెప్పారు. రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని, ఆర్థిక వృద్ధికి ఊతమిస్తాయని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం జరిగిన బీహార్ బిజినెస్ సమ్మిట్ ను గుర్తు చేస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద సంఖ్యలో కంపెనీలు ముందుకు వచ్చాయని, రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి కార్మికుల వలసల అవసరాన్ని తగ్గిస్తుందని, ప్రజలు ఇంటికి దగ్గరలోనే ఉపాధిని పొందడానికి వీలు కల్పిస్తుందని శ్రీ మోదీ అన్నారు. మెరుగైన రవాణా సౌకర్యాలు రైతులు తమ ఉత్పత్తులను ఎక్కువ దూరం లో కూడా విక్రయించడానికి వీలు కల్పిస్తాయని, ఇది వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
బీహార్ లో రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాలను వివరిస్తూ, బీహార్ లో 75 లక్షల మందికి పైగా రైతులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఆర్థిక సహాయం పొందుతున్నారని ప్రధానమంత్రి చెప్పారు. మఖానా బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు, బీహార్ లోని మఖానాకు జిఐ ట్యాగ్ లభించింది, ఇది మఖానా రైతులకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చింది. ఈ ఏడాది బడ్జెట్ లో బీహార్ లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ను కూడా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఖరీఫ్ సీజన్లో వరితో సహా 14 పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెంపునకు రెండు మూడు రోజుల క్రితమే కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఈ నిర్ణయం రైతుల ఉత్పత్తులకు మంచి ధరలను నిర్ధారిస్తుందని, అధిక ఆదాయానికి దారితీస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
బిహార్ ను ఎక్కువగా మోసం చేసిన వారే ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సామాజిక న్యాయంపై తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలను ప్రధాని విమర్శించారు. వారి పాలనలో బిహార్ లోని నిరుపేదలు, అట్టడుగు వర్గాలు మెరుగైన జీవితం కోసం రాష్ట్రం విడిచి వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. “దశాబ్దాలుగా బిహార్ లో దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజన వర్గాలకు కనీస పారిశుధ్య సౌకర్యాలు కూడా లేవని” ప్రధాని పేర్కొన్నారు. ఈ వర్గాలకు బ్యాంకింగ్ సదుపాయం కూడా లేకుండా పోయిందని, తరచూ బ్యాంకుల్లో ప్రవేశం నిరాకరించారని, ఎక్కువగా నిరాశ్రయులు గానే మిగిలిపోయారని, లక్షలాదిమంది సరైన ఆశ్రయం లేకుండా నివసిస్తున్నారని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో బీహార్ ప్రజలు అనుభవించిన బాధలు, కష్టాలు, అన్యాయాలు ప్రతిపక్షాలు వాగ్దానం చేసిన సామాజిక న్యాయమా - అని ఆయన ప్రశ్నించారు. ఇంతకంటే పెద్ద అన్యాయం మరొకటి ఉండదని ఆయన ఉద్ఘాటించారు. ఇంతకంటే పెద్ద అన్యాయం మరొకటి ఉండదని ఆయనఅన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాల పోరాటాలను ప్రతిపక్షాలు ఏనాడూ పట్టించుకోలేదని, బీహార్ అభివృద్ధి కోసం కృషి చేయకుండా దాని పేదరికాన్ని ప్రదర్శించడానికి విదేశీ ప్రతినిధులను కూడా రప్పించారని ప్రధాని విమర్శించారు. తమ తప్పుల కారణంగా దళితులు, అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాలు దూరమైపోవడంతో సామాజిక న్యాయాన్ని ప్రేరేపించడం ద్వారా ప్రతిపక్షాలు తమ అస్తిత్వాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తున్నాయని ప్రధాని విమర్శించారు.
తమ ప్రభుత్వ హయాంలో బిహార్ తో పాటు దేశం మొత్తం సామాజిక న్యాయం కొత్త ఉదయాన్ని చూశాయని ప్రధానమంత్రి అన్నారు. పేదలకు నిత్యావసర సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ ప్రయోజనాలను 100% అర్హులైన లబ్ధిదారులకు అందించడానికి కృషి చేస్తోందని ఆయన స్పష్టంగా తెలిపారు. నాలుగు కోట్ల కొత్త ఇళ్లు ఇచ్చామని, 'లఖ్పతి దీదీ' కార్యక్రమం ద్వారా మూడు కోట్ల మంది మహిళలకు సాధికారత కల్పిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 12 కోట్లకు పైగా గృహాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయని, ఇది దేశవ్యాప్తంగా జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు. 70 ఏళ్లు దాటిన ప్రతి వృద్ధుడికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందన్నారు. అవసరమైన వారిని ఆదుకునేందుకు ప్రతి నెలా ఉచిత రేషన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. "మా ప్రభుత్వం ప్రతి పేద, అణగారిన వ్యక్తికి అండగా ఉంటుంది, వారి శ్రేయస్సు, అభ్యున్నతికి భరోసా ఇస్తుంది" అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
ఏ గ్రామం లేదా అర్హత కలిగిన కుటుంబం సంక్షేమ కార్యక్రమాలకు దూరం కాకుండా చూడాలనే ప్రభుత్వ నిబద్ధతను ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఈ దార్శనికత తోనే డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ సమగ్ర సేవా అభియాన్ ను బీహార్ ప్రారంభించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. దళితులు, మహాదళితులు, వెనుకబడిన తరగతులు, పేదలకు నేరుగా లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏకకాలంలో 22 పథకాలతో గ్రామాలు, వర్గాలకు చేరుతోందన్నారు. ఇప్పటి వరకు 30,000కు పైగా శిబిరాలను నిర్వహించామని, లక్షలాది మంది ఈ ప్రచారానికి అనుసంధానమయ్యారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారుల వద్దకు ప్రభుత్వం నేరుగా చేరినప్పుడు వివక్షకు, అవినీతికి ఆస్కారం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇదే నిజమైన సామాజిక న్యాయానికి ప్రాతినిధ్యం వహించే విధానమని ఆయన అన్నారు.
బాబా సాహెబ్ అంబేద్కర్, కర్పూరి ఠాకూర్, బాబూ జగ్జీవన్ రామ్, జయప్రకాశ్ నారాయణ్ కలలుగన్న బీహార్ గా బీహార్ ను మార్చాలనే దార్శనికతను చెప్పిన శ్రీ మోదీ గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి దోహదపడే అభివృద్ధి చెందిన బీహార్ అంతిమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బీహార్ పురోగమించినప్పుడల్లా, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కొత్త శిఖరాలకు చేరుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అందరం కలిసి అభివృద్ధిని వేగవంతం చేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన ఈ అభివృద్ధి కార్యక్రమాలకు గాను ప్రజలకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీహార్ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, కేంద్ర మంత్రులు శ్రీ జితన్ రామ్ మాంజీ, శ్రీ గిరిరాజ్ సింగ్, శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, శ్రీ చిరాగ్ పాశ్వాన్, శ్రీ నిత్యానంద్ రాయ్, శ్రీ సతీష్ చంద్ర దూబే, డాక్టర్ రాజ్ భూషణ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
ఈ ప్రాంతంలో విద్యుత్ మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, బీహార్ కు, తూర్పు భారతదేశానికి ఇంధన భద్రత కల్పించే లక్ష్యంతో ఔరంగాబాద్ జిల్లాలో రూ.29,930 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించే నబీనగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, స్టేజ్-2 (3×800 మెగావాట్లు)కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. పారిశ్రామిక వృద్ధిని పెంచేందుకు, ఉద్యోగ అవకాశాలను కల్పనకు, ఈ ప్రాంతంలో చౌకైన విద్యుత్తును తక్కువ ధరకు అందించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. . ఈ ప్రాంతంలో రహదారి మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీకి పెద్ద ఊతమిచ్చే పలు రహదారి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో, పాట్నా–ఆరా–ససారం విభాగం (ఎన్ హెచ్ -119 ఎ ) ను నాలుగు లైన్లుగా విస్తరించడం, వారణాసి–రాంచీ–కొల్కతా హైవే (ఎన్ హెచ్ -319బి) రామనగర్–కచ్చి దర్గా మార్గం (ఎన్ హెచ్ -119డి ) ఆరు లైన్ల విస్తరణ, అలాగే బక్సర్, భరౌలీ మధ్య గంగా నదిపై కొత్త బ్రిడ్జి నిర్మాణం ఉన్నాయి.
ఈ ప్రాంతంలో రహదారి మౌలిక సదుపాయాలు కనెక్టివిటీకి కి ఊతమిచ్చేందుకు, ఎన్ హెచ్ -119 ఎ లోని పాట్నా-అర్రా-ససారాం సెక్షన్ ను నాలుగు లేన్లుగా మార్చడం, వారణాసి-రాంచీ-కోల్ కతా హైవే (ఎన్ హెచ్ -319బి), రామ్ నగర్ -కచ్చి దర్గా స్ట్రెచ్ (ఎన్ హెచ్ -119డి) ఆరు లేన్ల రహదారి నిర్మాణం, బక్సర్, భరౌలీల మధ్య కొత్త గంగా వంతెన నిర్మాణానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ ప్రాజెక్టులు వాణిజ్యం, ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడంతో పాటు రాష్ట్రంలో అంతరాయం లేని హైస్పీడ్ కారిడార్లను సృష్టిస్తాయి. సుమారు రూ.5,520 కోట్ల విలువైన పాట్నా - గయ - దోభీ సెక్షన్ ను, ఎన్ హెచ్ -27పై గోపాల్ గంజ్ టౌన్ వద్ద గ్రేడ్ ఇంప్రూవ్ మెంట్స్ ను కూడా ఆయన ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగు పరచాలన్న తన నిబద్ధతకు అనుగుణంగా, సోన్ నగర్ - మొహమ్మద్ గంజ్ ల మధ్య రూ.1330 కోట్లకు పైగా వ్యయంతో 3వ రైలు మార్గాన్ని ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు.
***
(Release ID: 2132935)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam