సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కొత్త రికార్డును సృష్టించిన కేవీఐసీ (ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్)
స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా రూ.లక్షా 70 వేల కోట్లు దాటిన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఆదాయం
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక గణాంకాలను విడుదల చేసిన కేవీఐసీ చైర్మన్ మనోజ్ కుమార్
గత 11 ఏళ్లలో 347% వృద్ధితో ఉత్పత్తి నాలుగు రెట్లు.. 447% వృద్ధితో అమ్మకాలు అయిదు రెట్లు పెరుగుదల
11 ఏళ్లలో ఉపాధి కల్పనలో 49.23 శాతం పెరుగుదలతో చరిత్రాత్మక రికార్డు..
1.94 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోన్న కేవీఐసీ
తొలిసారిగా రికార్డు స్థాయిలో రూ. 110.01 కోట్లకు చేరుకున్న ఢిల్లీ ఖాదీ గ్రామోద్యోగ్ భవన్ ఆదాయం
"ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో కేవీఐసీకి సంబంధించిన పథకాలు, సాధించిన విజయాలు వికసిత్ భారత్కు బలమైన పునాదిని ఏర్పాటు చేశాయి: మనోజ్ కుమార్,చైర్మన్, కేవీఐసీ
Posted On:
21 APR 2025 3:35PM by PIB Hyderabad
దేశంలో స్వావలంబన స్ఫూర్తిని పెంపొందించే ఖాదీ, గ్రామీణ పరిశ్రమల రంగం గత 11 సంవత్సరాలలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఈ) మార్గదర్శకత్వంలో కొత్త శిఖరాలను తాకడమే కాకుండా కోట్లాది మంది గ్రామీణుల జీవితాల్లో కొత్త వెలుగులను తీసుకొచ్చింది. పూజ్య బాపూజీ ఘన వారసత్వమైన ఖాదీ ఇప్పుడు కేవలం వస్త్రాలకు సంబంధించింది మాత్రమే కాదు.. 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్'కు చిహ్నంగా మారింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఖాదీ, గ్రామీణ పరిశ్రమలకు సంబంధించిన తాత్కాలిక గణాంకాలను సోమవారం ఢిల్లీ రాజ్ఘాట్లో ఉన్న కార్యాలయంలో కేవీఐసీ ఛైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ విడుదల చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి, అమ్మకాలు, నూతన ఉపాధి కల్పనలో కేవీఐసీ కొత్త రికార్డును నెలకొల్పిందని ఆయన తెలిపారు. గత 11 ఏళ్లలో అమ్మకాల్లో 447 శాతం, ఉత్పత్తిలో 347 శాతం, ఉపాధి కల్పనలో 49.23 శాతం వృద్ధి నమోదైంది. 2013-14తో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల్లో 399.69 శాతం, ఉత్పత్తిలో 314.79 శాతం పెరుగుదల నమోదైంది.
2047 నాటికి 'వికసిత్ భారత్' సంకల్పాన్ని సాకారం చేయడానికి, భారతదేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి కేవీఐసీ కనబరిచిన ఈ అద్భుతమైన పనితీరు గణనీయంగా దోహదం చేసిందని చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ అన్నారు. ఈ చారిత్రాత్మక విజయానికి పూజ్యనీయులైన బాపూజీ స్ఫూర్తి, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వం, దేశంలోని మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్న కోట్లాది మంది చేతివృత్తి కార్మికుల అలుపెరగని కృషి కారణమని తెలిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి రూ. 26109.07 కోట్లు కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.116599.75 కోట్లకు చేరుకుందని తెలిపారు. అంటే ఇది దాదాపు నాలుగు రెట్లు పెరిగి 347 శాతం వృద్ధి నమోదు చేసింది. 2013-14లో అమ్మకాలు రూ.31154.19 కోట్లు కాగా.. 2024-25 లో రూ.170551.37 కోట్లకు చేరుకున్నాయి. అంటే 447 శాతం వృద్ధితో దాదాపు ఐదు రెట్ల పెరుగుదల నమోదైంది. ఇప్పటివరకు నమోదైన వార్షిక అమ్మకాల్లో ఇదే అత్యధికం కావటం గమనార్హం.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 11 ఏళ్లలో ఖాదీ వస్త్రాల ఉత్పత్తిలో భారీ వృద్ధి నమోదైనట్లు తెలిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఖాదీ వస్త్రాల ఉత్పత్తి రూ. 811.08 కోట్లు కాగా.. 2024-25లో రూ.3783.36 కోట్లకు చేరుకుంది. అంటే దాదాపు 366 శాతం వృద్ధితో నాలుగున్నర రెట్లు పెరిగింది. ఖాదీ దుస్తుల అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.1081.04 కోట్లుగా ఉన్న ఈ అమ్మకాలు.. 2024-25లో రూ.7145.61 కోట్లకు చేరుకున్నాయి. అంటే 561 శాతం వృద్ధితో ఆరున్నర రెట్లు పెరిగాయి.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పలు పెద్ద పెద్ద కార్యక్రమాల్లో ఖాదీని ప్రోత్సహించడం ఖాదీ దుస్తుల అమ్మకాలపై భారీ ప్రభావాన్ని చూపిందని ఆయన పునరుద్ఘాటించారు.
ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ లక్ష్యాల గురించి ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో గరిష్ట ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన ధ్యేయమని తెలిపారు. ఉపాధికి సంబంధించి కూడా కేవీఐసీ గత 11 ఏళ్లలో రికార్డు సృష్టించింది. 2013-14లో మొత్తం ఉపాధి 1.30 కోట్లు కాగా.. 2024-25 నాటికి 49.23 శాతం పెరుగుదలతో 1.94 కోట్లకు చేరుకుంది. దిల్లీలోని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల భవన్ వ్యాపారం భారీగా పెరిగింది. 2013-14లో దీని వ్యాపారం రూ.51.02 కోట్లు కాగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.110.01 కోట్లకు చేరుకుంది. అంటే115 శాతం వృద్ధితో దాదాపు 2 రెట్లు పెరిగుదల నమోదైంది. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి మొత్తం 1018185 యూనిట్లు ఏర్పడ్డాయి. వీటికి సంబంధించిన రూ .73348.39 కోట్ల రుణానికి గాను రూ .27166.07 కోట్ల రాయితీని (మార్జిన్ మనీ సబ్సిడీ) కేంద్ర ప్రభుత్వం అందించింది. పీఎంఈజీపీ ద్వారా ఇప్పటివరకు 90,04,541 మందికి ఉపాధి లభించింది.
గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో 2021-22లో రూ.25.65 కోట్లుగా ఉన్న కేవీఐసీ బడ్జెట్ను రూ.60 కోట్లకు పెంచారు. అంటే దాదుపు 134 శాతం పెరిగింది. ఇప్పటివరకు గ్రామోద్యోగ్ వికాస్ యోజన పథకం కింద 39244 ఎలక్ట్రిక్ కుండ చక్రాలు..227049 తేనెటీగ పెట్టెలు, తేనె కాలనీలు.. 2344 ఆటోమేటిక్, పెడల్ ఆపరేటెడ్ ధూపం తయారీ యంత్రాలు.. 7735 పాదరక్షల తయారీ, మరమ్మతు టూల్ కిట్లు.. 964 పేపర్ ప్లేట్, డోనా తయారీ యంత్రాలు.. 3494 ఏసీ, మొబైల్, కుట్టు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ టూల్ కిట్లు.. 4555 టర్న్ వుడ్, పనికిరాని చెక్కతో వివిధ వస్తువులు తయారు చేయటం, చెక్క బొమ్మల తయారీ యంత్రాలు.. 2367 తాటి బెల్లం, నూనె గని, చింతపండు ప్రాసెసింగ్ యంత్రాలను పంపిణీ చేశారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల విషయానికొస్తే 2022-23లో మొత్తం 22284.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 29854.. అత్యధికంగా 2024-25లో 37218 యంత్రాలు, పరికరాలు పంపిణీ చేశారు. గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద కేవీఐసీ ఇప్పటివరకు మొత్తం 287752 యంత్రాలు, టూల్కిట్లు, పరికరాలను పంపిణీ చేయడం ద్వారా స్వావలంబన కలిగిన భారత్ నిర్మాణానికి గణనీయమైన సహకారాన్ని అందించింది.
మహిళా సాధికారత గురించి కూడా ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో కేవీఐసీకి చెందిన 18 డిపార్ట్మెంటల్, 17 నాన్ డిపార్ట్మెంటల్ నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా 7,43,904 మందికి శిక్షణ ఇచ్చామని.. వీరిలో 57.45 శాతం అంటే 4,27,394 మంది మహిళలే ఉన్నారని తెలిపారు. 5 లక్షల మంది ఖాదీ కళాకారుల్లో 80 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. గత 11 ఏళ్లలో ఖాదీ కళాకారుల వేతనాలను 275 శాతం పెంచగా.. గత మూడేళ్లలో 100 శాతం పెంచారు.
(Release ID: 2123324)
Visitor Counter : 5