సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
42 మంది అంతిమ పోటీదారులను ప్రకటించిన వేవ్స్ 2025 యానిమేషన్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్
'ఒరిజినల్ యానిమేషన్, వీఎఫ్ఎక్స్, ఏఆర్/వీఆర్, వర్చువల్ ప్రొడక్షన్స్ ప్రదర్శనకు ప్రపంచ స్థాయి వేదికను అందించనున్న వేవ్స్
వేవ్స్ 2025లో తమ ప్రాజెక్టులను ప్రదర్శించనున్న ఈ ప్రతిభావంతులైన పోటీదారులు
Posted On:
19 APR 2025 12:03PM
|
Location:
PIB Hyderabad
'క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్-1'లో భాగంగా జరుగుతోన్న యానిమేషన్ ఫిల్మ్ మేకర్స్ పోటీలో (ఏఎఫ్సీ) అంతిమ పోటీదారులను ప్రకటించారు. సంప్రదాయ యానిమేషన్, వీఎఫ్ఎక్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), వర్చువల్ ప్రొడక్షన్తో సహా పూర్తి యానిమేషన్ విభాగాల్లో ఒరిజినల్ స్టోరీ టెల్లింగ్పై దృష్టి సారిస్తూ ఉత్తమ 42 ప్రాజెక్టులు తుది రౌండ్కు చేరుకున్నాయి. 2025 మే 1 నుంచి 4 వరకు ముంబయిలో జరిగే వేవ్ సదస్సులో ఈ ప్రతిభావంతులకు తమ ఒరిజినల్ ప్రాజెక్టులను సాకారం చేసుకునే అవకాశం లభిస్తుంది. మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారిలో ఒక్కొక్కరికి రూ.5 లక్షల వరకు నగదు బహుమతి లభిస్తుంది.
42 మంది తుది పోటీదారుల ఎంపిక.. డ్యాన్సింగ్ ఆటమ్స్ బృందం నేతృత్వంలో వేవ్స్ బృందం సహకారంతో తొమ్మిది నెలల కఠినమైన మూల్యాంకన ప్రక్రియ ద్వారా జరిగింది. పోటీలో పాల్గొన్న వారు అంకింతభావంతో చేసిన ప్రయత్నాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి న్యాయ నిర్ణేతల బృందం విచక్షణ కూడా తోడైంది. ఈ బృందంలో ఉన్న వారు:
-
అను సింగ్
-
ఫారూఖ్ ధోండీ
-
డాన్ సార్టో
-
జేమ్స్ నైట్
-
జాన్ నాగెల్
-
జియాన్మార్కో సెర్రా
-
ఇందూ రాంచందానీ
-
వైభవ్ పివ్లాట్కర్
తుది పోటీకి ఎంపికైన 42 మంది జాబితా, వారి ప్రాజెక్టుల వివరాలు అనుబంధంలో ఉన్నాయి.
ఒక్కో యానిమేటెడ్ వీఎఫ్ఎక్స్ చిత్రం 100 నుంచి 300 మందికి ఉపాధిని అందించగలదు. దీనివల్ల ఈ ప్రాజెక్టుల ఆర్థిక ప్రభావం కూడా గణనీయంగా ఉంటుంది. భారత సృజనాత్మక ప్రతిభలో కీలకమైన పెట్టుబడిగా వేవ్స్ ఏఎఫ్సీ 2025 నిలబడనుంది. ఇది ఉద్యోగ కల్పన, ప్రపంచ స్థాయి అవకాశాలను ప్రోత్సహిస్తుంది. అంతర్జాతీయ సహ-నిర్మాణాలను ప్రోత్సహించాలనే లక్ష్యం కూడా ఈ పోటీకి ఉంది.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మద్దతుతో డ్యాన్సింగ్ ఆటమ్స్ సారథ్యంలో జరిగిన ఈ అద్భుతమైన ప్రపంచ స్థాయి కార్యక్రమంలో మొదటి సారిగా ఏవీజీసీ రంగంలోని నాలుగు విభాగాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. ఇటువంటి పోటీలలో ఇలాంటి పరిణామం జరగటం ఇదే మొదటిసారి.
వేవ్స్ ఏఎఫ్సీ 2025కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులు, ప్రతిభావంతులైన విద్యార్థులు, అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి సుమారు 1900 రిజిస్ట్రేషన్లు, 419 వైవిధ్యమైన ఎంట్రీలను అందుకుంది. యానిమేషన్ పరిశ్రమలో కొత్త సృజనాత్మకను గుర్తించడం, ప్రోత్సహించడంలో ఈ పోటీ కీలక పాత్రను ఈ ఉత్సాహం తెలియజేస్తోంది.
ప్రతిభను ప్రదర్శించడానికి మించి ఈ కార్యక్రమం ప్రతి దశలో మార్గదర్శకత్వానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఆస్కార్ అవార్డు గ్రహీత గునీత్ మోంగా, ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ, సరస్వతి బయ్యాల వంటి పరిశ్రమకు చెందిన ప్రముఖుల నేతృత్వంలో జరిగిన అమూల్యమైన మాస్టర్ తరగతుల ద్వారా పోటీలో పాల్గొన్న వారంతా తమ తుది ఎంపికతో సంబంధం లేకుండా ప్రయోజనం పొందారు. ఈ సెషన్లు ప్రదర్శించే నైపుణ్యాలను మెరుగుపరచడం, సంక్లిష్టతల మధ్య పరిశ్రమలో ముందుకు సాగటంపై దృష్టి సారించాయి. ఈ ప్రాజెక్టులను వివిధ ఓటీటీ వేదికలు, పరిశ్రమలో కీలకమైన వారి ముందు ఉంచనున్నారు. అగ్రస్థానాల్లో ఉన్న ఈ 42 ప్రాజెక్టుల విషయంలో భాగస్వామ్యం కోసం డ్యాన్సింగ్ ఆటమ్స్ స్టూడియోస్ వ్యవస్థాపకురాలు సరస్వతి బుయ్యాల 17 దేశాల (ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, బ్రెజిల్, కెనడా, చైనా, కొలంబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్, ఇటలీ, కొరియా, న్యూజిలాండ్, పోలాండ్, పోర్చుగల్, రష్యా, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్) రాయబార కార్యాలయాలతో కలిసి చురుగ్గా పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టులను ప్రోత్సహించటానికి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లతో సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక వేస్తున్నారు. అగ్రస్థానాల్లో ఉన్న 42 ప్రాజెక్టులు వైవిధ్యమైన అంశాలకు సంబంధించినవి. వీటిలో 12 ఫీచర్ ఫిల్మ్స్, 9 టీపీ సిరీస్లు, 3 ఎఆర్ లేదా వీఆర్కు సంబంధించినవి, 18 లఘు చిత్రాలు ఉన్నాయి. ఇవి వీక్షకులు, భాగస్వామ్య సంస్థలకు గొప్ప వైవిధ్యాన్ని అందిస్తాయి.
ఏఎఫ్సీ 2025ను ప్రస్తుత స్థాయికి తీసుకురావడంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహకారం కీలక పాత్ర పోషించింది. యానిమేషన్, పీఎఫ్ఎక్స్, ఏఆర్/వీఆర్, వర్చువల్ ప్రొడక్షన్ రంగాలలో అసలైన స్టోరీ టెల్లింగ్ను ప్రోత్సహించటంలో అంకితభావంతో ఉండటం వల్ల అమూల్యమైన వనరులు, గుర్తింపు అందటం వల్ల ఈ ప్రపంచ స్థాయి వేదికపై వర్ధమాన ప్రతిభావంతులకు సాధికారత లభించింది. ఈ పోటీ, కఠినమైన స్క్రీనింగ్ ప్రక్రియలు, నేర్చుకునేందుకు లభించిన అవకాశాలు.. నిత్యం మారే యానిమేషన్ ప్రపంచంలో భారత సృజనాత్మక సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ప్రధానంగా తెలియజేస్తున్నాయి. ఎంపికైన ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన కథనాన్ని అందిస్తున్నాయి. ఉత్తేజభరితమైన అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులతో సహా వైవిధ్యమైన సృజనాత్మక విధానాలను తెలియజేస్తున్నాయి. యానిమేషన్, వీఎఫ్ఎక్స్, ఏఆర్ లేదా వీఆర్, వర్చువల్ ప్రొడక్షన్ స్టోరీ టెల్లింగ్ భవిష్యత్తును వేవ్స్ ఏఎఫ్సీ 2025లో ఆవిష్కరించనున్నారు.
వేవ్స్ వివరాలు:
మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ (ఎంఅండ్ఈ) రంగంలో మైలు రాయి లాంటి తొలి ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు (వేవ్స్)ను భారత ప్రభుత్వం 2025 మే 1 నుంచి 4 వరకు మహారాష్ట్రలోని ముంబయిలో నిర్వహించనుంది.
పరిశ్రమలోని నిపుణులు, పెట్టుబడిదారులు, క్రియేటర్ లేదా ఆవిష్కర్త.. ఇలా ఎవరైనా మీడియా, వినోద పరిశ్రమలో తన పాత్ర పోషించేందుకు, ఈ రంగానికి సహకరించడానికి, సృజనాత్మకతకు దోహదం చేయడానికి ప్రపంచ స్థాయి వేదికను వేవ్స్ అందిస్తుంది.
కంటెంట్ సృష్టి, మేధో సంపత్తి, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా భారతదేశ సృజనాత్మక శక్తిని పెంచేందుకు వేవ్స్ సిద్ధంగా ఉంది. ప్రసారాలు, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, ఫిల్మ్స్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సౌండ్ అండ్ మ్యూజిక్, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, జనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఎక్స్ టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్) రంగాలపై వేవ్స్ దృష్టి సారించింది.
***
Release ID:
(Release ID: 2122968)
| Visitor Counter:
32
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Nepali
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam