ప్రధాన మంత్రి కార్యాలయం
నవ్కార్ మహామంత్ర దివస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నవ్కార్ మహామంత్రం కేవలం ఒక మంత్రం కాదు, మన విశ్వాసాలకి అది కేంద్ర బిందువు: ప్రధానమంత్రి
నవ్కార్ మహామంత్రం నమ్రత, శాంతి, సార్వత్రిక సమభావన అంశాలను కలిగిన దివ్య సందేశం: ప్రధాని
పంచ పరమేష్టి ఆరాధన సహా... నవ్కార్ మహామంత్రం సవ్యమైన జ్ఞానం, దృక్పథం, ప్రవర్తన, ముక్తి మార్గాలను సూచించే మార్గదర్శి: శ్రీ మోదీ
భారతదేశ మేధో వైభవానికి జైన సాహిత్యం వెన్నెముక: ప్రధాని
విపరీత వాతావరణ పరిస్థితులు ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాలు – పర్యావరణ అనుకూల జీవనమే సమస్యకి సరైన సమాధానం.. జైన సమాజం ఈ విధానాన్ని కొన్ని శతాబ్దాలుగా పాటిస్తోంది.. ప్రభుత్వం చేపట్టిన మిషన్ లైఫ్ కి ఈ విధానం అత్యంత అనుకూలం: ప్రధానమంత్రి
నవ్ కర్ మహామంత్ర దివస్ సందర్భంగా 9 సంకల్పాలను సూచించిన ప్రధాని
Posted On:
09 APR 2025 11:06AM by PIB Hyderabad
న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ఈరోజు ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ్ కర్ మహామంత్ర దివస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మానసిక శాంతిని, స్థిరచిత్తాన్ని అందించే సామర్థ్యం గల నవ్ కర్ మంత్రం.. దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తుందని అన్నారు. మంత్ర పఠనం వల్ల సిద్ధించే నిర్వికార స్థితి మాటలకు, ఆలోచనలకు అతీతమైనదని, చేతనలో, అంతరాత్మలో ఆ భావన స్థిర నివాసం ఏర్పరుచుకుంటుందని అన్నారు. పవిత్రమైన నవ్కార్ మంత్రంలోని పంక్తులను చదివి వినిపించిన శ్రీ మోదీ- సంయమనం, స్థితప్రజ్ఞత, మనసు-అంతరాత్మల మధ్య సమన్వయం సాధించే నిరంతరాయ శక్తిప్రవాహంగా మంత్రశక్తిని అభివర్ణించారు. తన సొంత ఆధ్యాత్మిక అనుభూతిని గురించి చెబుతూ, నవ్ కర్ మంత్రం ఇప్పటికీ తన అంతరాళాల్లో ప్రభావాన్ని చూపుతూనే ఉందన్నారు. కొన్నేళ్ళ కిందట బెంగుళూరులో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన సామూహిక మంత్ర పఠన ప్రభావం ఇప్పటికీ తనని వీడి పోలేదన్నారు. దేశ విదేశాల్లోని పవిత్ర హృదయాలు ఒకే చైతన్యంతో ఒక సామూహిక అనుభవంలో భాగమవడం తిరుగులేని అనుభూతి అని సంతోషం వెలిబుచ్చారు. ఈ సామూహిక చర్య ద్వారా ఒకే లయలో ఒదిగే పంక్తుల పఠనం అసాధారమైన శక్తిని వెలువరించి మాటల్లో చెప్పలేని దివ్యానుభూతిని కలిగిస్తుందని శ్రీ మోదీ చెప్పారు.
జైన మాట పరివ్యాప్తి ప్రతి వీధికీ చేరిన గుజరాత్ రాష్ట్రంలో తన మూలాలు ఉన్నాయన్న ప్రధాని, ఈ కారణం చేతనే చిన్నప్పటి నుంచి జైన ఆచార్యుల సాంగత్యం తనకు లభించిందని చెప్పారు. “నవ్కార్ మంత్రాన్ని ఒక మంత్రంగా మాత్రమే చూడలేం. అది మన విశ్వాసాలకి కేంద్ర బిందువు, జీవన సారం...” అని చెప్పారు. మంత్ర ప్రాముఖ్యం ఆధ్యాత్మిక పార్శ్వానికి మించినదని, సమాజానికి, వ్యక్తులకీ పథ నిర్దేశనం చేస్తుందని చెప్పారు. నవ్కార్ మంత్రంలోని ప్రతి పాదం, ప్రతి పదం అనంతమైన అర్ధాన్ని కలిగి ఉందన్నారు. మంత్రాన్ని పఠించే సమయంలో మనసులో పంచ పరమేష్టిని ప్రతిష్ఠాపించుకుంటామంటూ ఆ వివరాలను తెలియజేశారు. “కేవల జ్ఞానాన్ని” పొందిన అరిహంత్ లు భవ్య జీవులకు మార్గం చూపుతారని, వీరు 12 దివ్య లక్షణాలను కలిగి ఉంటారని, ఇక అష్టకర్మలను రూపుమాపి మోక్ష ప్రాప్తి పొందిన సిద్ధులు ఎనిమిది పరిశుద్ధమైన లక్షణాలను కలిగి ఉంటారని విశదీకరించారు. మహావ్రతుణ్ణి అనుసరించే ఆచార్యులు 36 సుగుణాలను కలిగి ఉంటారని, వీరు పథగాములని, ఇక మోక్ష మార్గాన్ని గురించి ఎరుక కలిగించే ఉపాధ్యాయులు 25 సుగుణాలను కలిగి ఉంటారని చెప్పారు. ఆ మహాత్ముల ఆధ్యాత్మిక సాంద్రత, వారికి అనుబంధంగా ఉన్న దివ్యమైన లక్షణాలను గురించి ప్రధాని తెలియజేశారు.
“నవ్కార్ మంత్రాన్ని పఠించే సమయంలో 108 దివ్య గుణాలకి నమస్కరించి, సర్వ మానవాళి సంక్షేమం కోసం ప్రార్థిస్తాం” అని శ్రీ మోదీ గుర్తు చేశారు. జ్ఞానం, కర్మ, ఈ రెండు మాత్రమే జీవితంలో నిజమైన దిశలని, మన హృదయంలో సాక్షాత్కరించే బాట గురువు కృప, మార్గదర్శనం వల్ల ఏర్పడుతుందన్న విషయాలు మంత్రాన్ని పఠించేటప్పుడు మనకు అవగతమవుతాయని అన్నారు. నవ్కార్ మంత్ర ప్రబోధాలు ఆత్మ విశ్వాసాన్ని కలుగజేసి సొంత బాటపై పయనాన్ని ప్రారంభించేందుకు ప్రోద్బలాన్ని కలిగిస్తాయన్నారు. ప్రతికూల ఆలోచనలు, అపనమ్మకం, విరోధ భావనలు, స్వార్థం వంటివి మన లోపల నివసించే అసలైన శత్రువులని, వాటిపై గెలుపే సిసలైన విజయమని అన్నారు. బాహ్య ప్రపంచంపై నియంత్రణ కన్నా, అంతర్ ప్రపంచాన్ని జయించాలని జైన మతం ప్రబోధిస్తుందని మోదీ చెప్పారు. “తమపై తాము గెలిచినవారు అరిహంత్ లుగా మారుతారు” అన్నారు. నవ్కార్ మంత్రం లౌకికపరమైన కోర్కెలు తీర్చే సాధనం కాదని, మనిషి అంతరాత్మను శుద్ధి చేసి, వారిని మైత్రి, సమాభావనల వైపు నడిపించే సూత్రమని అన్నారు.
ధ్యానం, అభ్యాసం, ఆత్మశుద్ధికి అత్యంత అనువైన నవ్కార్ మంత్రం కాలానికి, సరిహద్దులకు అతీతమైనదని, ఇతర భారతీయ మౌఖిక, పుణ్య గ్రంథాల మాదిరిగానే తొలుత అనుశ్రుతంగా, తరువాతి కాలంలో లిఖిత రూపంలో – శాసనాలు, అనతి కాలంలో ప్రాకృత తాళపత్ర గ్రంథాల రూపంలో - ఒక తరం నుంచి మరో తరానికి అందిన సంపద అని చెప్పారు. నేటికీ ఈ మంత్రం మానవాళికి దారి చూపుతోందని వ్యాఖ్యానించారు. “పంచ పరమేష్టి ఆరాధన సహా నవ్కార్ మంత్రం సవ్యమైన జ్ఞానానికి, దృక్కోణానికి, ప్రవర్తనకి ప్రతిరూపమై ముక్తి మార్గాన్ని సూచిస్తోంది” అన్నారు. మానవ జీవితంలోని తొమ్మిది మూలకాలు సంపూర్ణత్వానికి దారితీస్తాయంటూ, ఈ సందర్భంగా భారతీయ తత్వంలో తొమ్మిది సంఖ్యకు గల ప్రాముఖ్యాన్ని ప్రస్తావించారు. జైన మతంలో ‘తొమ్మిది’ సంఖ్య ఎంతో ప్రత్యేకమైనదని, నవ్కార్ మంత్రం, నవ మూలకాలు, నవ సుగుణాలు వంటి అంశాలను ఉదాహరించారు. అదే విధంగా నవ సంపదలు, నవ ద్వారాలు, నవగ్రహాలు, నవదుర్గలు, నవివిధ భక్తి మార్గాలు వంటి ఇతివృత్తాలు ఇతర భారతీయ సంప్రదాయాల్లో అంతర్భాగమని గుర్తు చేశారు. మంత్ర పారాయణ సమయంలో ఆచరించే తొమ్మిది సార్ల పఠనం, తొమ్మిది గుణకాలైన 27, 54, 108 వంటి సంఖ్యలు ‘నవ’ సంఖ్య పరిపూర్ణతను ఆవిష్కరిస్తాయన్నారు. తొమ్మిది సంఖ్య గణితశాస్త్రానికి పరిమితమైనది కాదని, పరిపూర్ణతను సూచించే సిద్ధాంతమని చెప్పారు. పరిపూర్ణతను సాధించిన మనసు, బుద్ధి, నిశ్చలతను సాధించి, కొత్త వస్తువులు, అనుభూతులు, వాంఛల చట్రం నుంచి విముక్తి పొంది ఉన్నతమైన స్థితికి చేరుకోగలవని చెప్పారు. లౌకికపరమైన అభివృద్ధిని సాధించిన తరువాత కూడా ఈ జ్ఞానాన్ని మనసులో నిలుపుకునే ప్రజ్ఞను మంత్రం కలిగిస్తుందని, అదే నవ్కార్ మంత్ర మహిమ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
నవ్కార్ మంత్ర మూల సిద్ధాంతం భారత్ ను సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణమైనదని శ్రీ మోదీ చెప్పారు. ఈ సందర్భంగా తన ఎర్రకోట ప్రసంగాన్ని గుర్తు చేస్తూ, అభివృద్ధి చెందిన భారత్ ప్రగతి సాధించినప్పటికీ వారసత్వాన్ని మరువదని, తొట్రుపాటు లేకుండా మున్ముందుకు దూసుకువెళుతుందని, అభివృద్ధి పథంలో పైకి ఎగబాకినప్పటికీ సంప్రదాయ మూలాలను మరువదని చెప్పారు. అభివృద్ధి చెందిన భారత్ తన సంస్కృతిని చూసి గర్విస్తుందన్నారు. ఈ సందర్భంగా తీర్థంకరుల బోధనల పరిరక్షణ గురించి ప్రస్తావించారు. మహావీర జైనుని 2550వ నిర్వాణ మహోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ, విదేశాల నుంచి తీర్థంకరుల ప్రతిమలు సహా అనేక ప్రాచీన శిల్పాలు తిరిగి భారత్ చేరుకున్నాయన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో 20కి పైగా తీర్థంకరుల విగ్రహాలు దేశానికి తిరిగివచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. దేశ విలక్షణతను తీర్చిదిద్దడంలో జైన మత పాత్ర సాటిలేనిదని, ఈ మహోన్నత ధర్మాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజాస్వామ్య ఆలయమైన నూతన పార్లమెంటు భవన నిర్మాణ శైలిని ప్రస్తావిస్తూ, జైన మత సంప్రదాయాల ప్రభావం సుస్పష్టమని వ్యాఖ్యానించారు. శార్దూల్ ద్వారం వద్ద గల వాస్తుకళ మందిరంలోని సమ్మేద్ శిఖర్, లోక్ సభ ద్వారం వద్ద ఆస్ట్రేలియా నుంచి తిరిగివచ్చిన తీర్థంకరుని ప్రతిమ, కాన్సిస్టిట్యూషన్ గ్యాలరీ పైకప్పు పై చిత్రీకరించిన అద్భుత మహావీరుని చిత్తరువు, సౌత్ బిల్డింగ్ గోడపై గల 24 తీర్థంకరుల కుడ్య చిత్రాల గురించి ప్రధాని గుర్తు చేశారు. భారత్ దేశ ప్రజాస్వామ్యానికి జైనం వంటి ఆధ్యాత్మికతలు మార్గ నిర్దేశం చేస్తాయన్నారు. “వత్తు సహవో ధమ్మో”, “చరిత్తం ఖలు ధమ్మో”, “జీవన రక్ఖనం ధమ్మో” వంటి ఆగమాల్లో ఉల్లేఖించిన జైన సిద్ధాంతాల లోతైన నిర్వచనాలని ఉటంకించారు. ఈ సూత్రాల స్ఫూర్తితో ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే ఆశయంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
‘‘భారత మేధో వారసత్వానికి వెన్నెముకగా జైన సాహిత్యం నిలిచింది... ఈ జ్ఞానాన్ని పరిరక్షించుకోవడం మన కర్తవ్యం’’ అని శ్రీ మోదీ అన్నారు. ప్రాకృత భాషకూ, పాలీ భాషకూ శాస్త్రీయ భాష హోదాను ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ప్రధానంగా చెబుతూ, జైన సాహిత్యం గురించి మరింత పరిశోధన చేసే అవకాశం దీంతో లభిస్తుందన్నారు. భాషను సంరక్షించుకొంటే జ్ఞానం మనగలుగుతుందనీ, భాషను విస్తరించినందువల్ల జ్ఞానం వృద్ధి చెందగలదన్నారు. జైన చేతిరాత పుస్తకాలు వందల సంవత్సరాల నుంచి భారత్లో ఉన్నాయన్న సంగతిని ప్రధాని చెబుతూ, లోతైన జైన ధర్మ ప్రభోధాల్లోని ప్రతి పేజీ చరిత్రకు అద్దంపట్టడమేకాక జ్ఞాన సాగరం లాంటివని అభివర్ణించారు. అనేక మహత్తర గ్రంథాలు మెల్లమెల్లగా అంతరించిపోతుండడం పట్ల ఆయన ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం బడ్జెటులో ప్రకటించిన ‘జ్ఞాన్ భారతం మిషన్’ను ప్రారంభించిన సంగతిని ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా లక్షలాది చేతిరాత పుస్తకాల సర్వేను చేపట్టి, ప్రాచీన వారసత్వాన్ని డిజిటలీకరించే ప్రణాళికలు కూడా ఉన్నాయని వెల్లడిస్తూ, ఈ పనులతో ప్రాచీనతను ఆధునికతతో జోడించవచ్చన్నారు. ఈ కార్యక్రమం ఒక ‘‘అమృత సంకల్పం’’ అని ఆయన అభివర్ణించారు. ‘‘న్యూ ఇండియా ఆధ్యాత్మికతతో ప్రపంచానికి మార్గదర్శనం చేస్తూనే కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా అవకాశాలను అన్వేషిస్తూ ఉంటుంద’’ని ఆయన స్పష్టం చేశారు.
జైన ధర్మం శాస్త్రీయవిజ్ఞానం, సూక్ష్మగ్రాహ్యత.. ఈ రెండిటినీ కలబోసుకొందని ప్రధాని అన్నారు. జైన ధర్మం తన మూల సిద్దాంతాల ద్వారా యుద్ధం, ఉగ్రవాదం, పర్యావరణ సంబంధిత అంశాల వంటి ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను అందిస్తోందని ఆయన చెప్పారు. జైన సంప్రదాయ చిహ్నంలో ‘‘పరస్పరోపగ్రహో జీవనం’’ అనే మాటలున్నాయనీ, జీవులన్నీ పరస్పరం ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణ, పరస్పర సద్భావన, శాంతిల సందేశాన్నివ్వడం ద్వారా జైన ధర్మం అహింస పట్ల... అది ఎంత సూక్ష్మస్థాయిలో అయినా కావచ్చు... నిబద్ధతతో ఉందని ప్రధాని అన్నారు. జైన ధర్మంలోని అయిదు ప్రధాన సిద్ధాంతాలను ఆయన పేర్కొంటూ, ప్రస్తుత యుగంలో అనేకాంతవాద తత్వానికి ఉన్న సందర్భశుద్ధిని వివరించారు. అనేకాంతవాదంలో నమ్మకాన్ని కలిగి ఉండడం వల్ల అది యుద్ధంతోపాటు సంఘర్షణ స్థితులను అడ్డుకొంటుందని, ఇతరుల భావనలతోపాటు దృష్టికోణాలను అర్థం చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. ప్రపంచం అనేకాంతవాద తత్వాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
భారతదేశం పట్ల ప్రపంచానికి నమ్మకం అంతకంతకు పెరిగిపోతోందని, భారత్ ప్రయత్నాలు, ఫలితాలు ప్రేరణాత్మకంగా మారుతున్నాయని శ్రీ మోదీ చెబుతూ, భారత్ సాధిస్తున్న ప్రగతి ఇతరులకు మార్గాలను చూపుతున్న కారణంగా ప్రపంచ సంస్థలు ఇప్పుడు భారత్కేసి చూస్తున్నాయన్నారు. ఈ పరిణామాన్ని, జీవనం- పరస్పర సహకారంపైనే ఆధారపడి మునుముందుకు సాగుతుందని సూచిస్తున్న ‘‘పరస్పరోపగ్రహో జీవనం’’ అనే జైన దర్శనంతో ప్రధాని జోడించారు.ఈ దృష్టికోణం భారత్ పట్ల ప్రపంచం అంచనాలను పెంచిందని, దేశం తన ప్రయత్నాలను ముమ్మరం చేసేసిందని ఆయన అన్నారు. వాతావరణ మార్పు వంటి తక్షణ శ్రద్ధ అవసరమైన అంశాన్ని ఆయన ప్రస్తావించి, సువ్యవస్థిత జీవనశైలులను ఒక సమాధానంగా పేర్కొంటూ ‘మిషన్ లైఫ్’ (Mission LiFE)ను భారత్ పరిచయం చేయడాన్ని గుర్తుకు తెచ్చారు. జైన సముదాయం వందల సంవత్సరాలుగా సీదాసాదాతనం, నియంత్రణ, స్థిరత్వ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని మనుగడ సాగిస్తూవస్తోందని ఆయన అన్నారు. జైనులు పాటించే ‘అపరిగ్రహ’ సిద్ధాంతాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ విలువలను విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ, వారు ఏ ప్రాంతంలో ఉన్నా, ‘మిషన్ లైఫ్’కు ప్రచారకులుగా మారాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతమున్న సమాచార ప్రపంచంలో తెలివి కావలసినంత ఉందనీ, కానీ జ్ఞానం లేనిదే దీనిలో గాఢత్వం లోపిస్తుందనీ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సరైన దారిని వెతకడానికి జ్ఞానానికీ, బుద్ధికీ మధ్య సమతౌల్యాన్ని ఏర్పరచుకోవడం గురించి జైన ధర్మం బోధిస్తుందని ఆయన చెప్పారు. యువతకు ఈ సమతౌల్య సాధనకు ప్రాధాన్యాన్నివ్వాలని ఆయన స్పష్టం చేస్తూ, టెక్నాలజీకి మానవీయ స్పర్శ పూరకంగా ఉండాలనీ, నైపుణ్యాలను ఆత్మతో సంధానించాలనీ ఉద్బోధించారు. నవ్కార్ మహామంత్రం కొత్త తరం వారికి జ్ఞానం, దిశ.. ఈ రెండిటి మూలంలా పనిచేయగలదని ఆయన అన్నారు.
నవకార్ మంత్రాన్ని సామూహికంగా జపించిన తరువాత ప్రతి ఒక్కరూ తొమ్మిది సంకల్పాలు చెప్పుకోవాలని శ్రీ మోదీ కోరారు. వీటిలో మొదటి సంకల్పం ‘జల సంరక్షణ’ అన్నారు. నీళ్లను దుకాణాల్లో అమ్ముతారని బుద్ధి సాగర్ మహారాజ్ జీ 100 సంవత్సరాల కిందటే చెప్పిన సంగతిని ప్రధాని గుర్తుచేశారు. ప్రతి ఒక్క నీటి చుక్క ఎంత విలువైందీ గ్రహించి, దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ‘తల్లి పేరిట ఒక మొక్కను నాటాల’నేది రెండో సంకల్పంగా ఉంది. ఇటీవల కొన్ని నెలల కాలంలో 100 కోట్లకు పైగా మొక్కలను నాటిన సంగతిన ఆయన ప్రస్తావిస్తూ, ప్రతి ఒక్కరూ వారి అమ్మ పేరిట ఒక మొక్కను నాటడంతోపాటు ఆమె ఆశీస్సుల మాదిరిగానే ఆ మొక్కను పెంచి పోషించాలని విజ్ఞప్తి చేశారు. 24 మంది తీర్థంకరులకు సంబంధించిన 24 మొక్కలను నాటే విషయంలో గుజరాత్లో తాను చేసిన ప్రయత్నాల్లో కొన్ని మొక్కలు అందుబాటులో లేకపోవడంతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోయినట్లు కూడా ఆయన చెప్పారు. ప్రతి వీధిలో, చుట్టుపక్కలా, నగరంలో స్వచ్ఛత పరిరక్షణ చాలా ముఖ్యమంటూ, అందరూ ఈ మిషన్కు వారి వంతు తోడ్పాటును అందించాలని ప్రధాని కోరారు. మూడో సంకల్పంగా ‘స్వచ్ఛతా మిషన్’ను శ్రీ మోదీ ప్రస్తావించారు. ‘వోకల్ ఫర్ లోకల్’ నాలుగో సంకల్పం. దేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రోత్సహించాలని, వాటికి ప్రపంచ స్థాయిలో ఆదరణ లభించేటట్లు చూడాలని, భారతీయ మట్టి, భారతీయ కార్మికుల కృషితో రూపుదిద్దుకొన్న సరుకులకు మద్దతివ్వాలని ఆయన అన్నారు. అయిదో సంకల్పం ‘భారత్ను దర్శించడం’. దేశంలో ప్రతి మూల ప్రాంతానికి తనదైన విశిష్టత, విలువ ఉన్నాయిని ప్రధానమంత్రి అంటూ, విదేశాల్లో పర్యటించే ముందు భారత్లోని వివిధ రాష్ట్రాలను చూసి, అక్కడి సంస్కృతులను, ప్రాంతాలను తెలుసుకోవాల్సిందిగా ప్రజలను కోరారు. ఆరో సంకల్పమైన ‘ప్రకృతి సేద్యానికి మొగ్గుచూపడం’ అనే అంశాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, ఒక ప్రాణి మరో ప్రాణికి నష్టం చేయకూడదన్న జైన సిద్దాంతాన్ని ఉదాహరించారు. ధరణి మాతను రసాయనాల బారి నుంచి విముక్తం చేయాలని, రైతులకు అండగా నిలవాలని, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఏడో సంకల్పంగా ‘ఆరోగ్యకరమైన జీవనశైలి’ని ప్రధాని ప్రతిపాదించారు. సిరిధాన్యాలు (శ్రీ అన్న) సహా భారతీయ ఆహార సంప్రదాయాలకు మళ్లడం, నూనె వినియోగాన్ని 10 శాతం మేర తగ్గించుకోవడం, సంయమనాన్ని, నియంత్రణను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన చెప్పారు. ‘యోగాభ్యాసం, క్రీడలను జీవనంలో ఓ భాగంగా చేర్చుకోవడాన్ని’ ఎనిమిదో సంకల్సంగా ఆయన ప్రతిపాదించారు. శారీరక స్వస్థతను, మానసిక ప్రశాంతిని పొందడానికి యోగాను, క్రీడలను ఇంట్లోగాని, పనిచేసే చోట గాని, బడిలో, లేదా పార్కులలో ఎక్కడైనా సరే దైనందిన జీవనంలో ఓ భాగంగా చేసుకోవాలని ఆయన స్పష్టంచేశారు. చేయిపట్టుకొని గాని, లేదా కడుపు నింపిగాని అణగారిన వర్గాలకు సాయపడడం ముఖ్యమని చెబుతూ, సేవ చేయడానికి సిసలైన అర్థం ‘పేదలకు సహాయాన్ని అందించడం’.. దీనిని తొమ్మిదో, చివరి సంకల్పంగా ఆయన ప్రతిపాదించారు. ఈ సంకల్పాలు జైన ధర్మ సిద్ధాంతాలతోపాటు ఒక స్థిరమైన, సామరస్యపూర్వక భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్న దార్శనికతతో సరిపోయేవిగా ఉన్నాయన్నారు. ఈ తొమ్మిది సంకల్పాలు వ్యక్తులలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటు యువ తరానికి ఒక కొత్త దిశను చూపుతాయి. వీటిని కార్యరూపంలోకి తీసుకువస్తే సమాజంలో శాంతి, సద్భావన, కరుణ పెంపొందుతాయి’’ అని ఆయన అన్నారు.
రత్నత్రయ, దస్లక్షణ్, సోలహ్ కరణ్ వంటి జైన ధర్మ సిద్ధాంతాలు, పర్యూషణ్ వంటి పండుగలు ఆత్మకల్యాణానికి బాటలువేస్తాయని శ్రీ నరేంద్ర మోదీ చెబుతూ... ప్రపంచ నవ్కార్ మంత్ర దినోత్సవం ప్రపంచంలో సుఖ- శాంతులు, సమృద్ధి నిరంతరాయంగా వర్ధిల్లేటట్లు చేయగలదన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం నాలుగు సంప్రదాయాలు ఒక చోటుకు చేరినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇది ఏకతకు ప్రతీకగా నిలచిందని అభివర్ణించారు. ఐకమత్య సందేశాన్ని దేశమంతా విస్తరించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ‘‘భారత్ మాతా కీ జై’’ అని ఎలుగెత్తే ఎవరినైనా హృదయానికి హత్తుకొని వారితో అనుబంధాన్ని పెంచుకోవాలని, ఎందుకంటే ఈ శక్తి వికసిత్ భారత్ పునాదిని బలపరుస్తుందని ప్రధాని అన్నారు.
దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి గురు భగవంతులు ఆశీర్వాదాలు అందిస్తున్నందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రపంచ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు యావత్తు జైన్ సముదాయానికి ఆయన తన నమోవాకాలు సమర్పించారు. ఆచార్య భగవంతులకు, ముని శ్రేష్ఠులకు, శ్రావక్-శ్రావికాలతోపాటు దేశ విదేశాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ ఆయన వందనాలు తెలిపారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జేఐటీఓ ప్రయత్నాలను ఆయన అభినందిస్తూ, గుజరాత్ హోం మంత్రి శ్రీ హర్ష్ సంఘవీ, జేఐటీఓ అపెక్స్ చైర్మన్ శ్రీ పృథ్వీరాజ్ కొఠారీ, ప్రెసిడెంటు శ్రీ విజయ్ భండారీ, జేఐటీఓకు చెందిన ఇతర అధికారులు, ప్రపంచ వ్యాప్త ప్రముఖులు హాజరుకావడాన్ని గమనించి, ఈ అసాధారణ కార్యక్రమం విజయవంతం కావాలని తన శుభాకాంక్షలు తెలియజేశారు.
నేపథ్యం
నవ్కార్ మహామంత్ర దినోత్సవం ఆధ్యాత్మిక సద్భావన, నైతిక చేతనల ఉత్సవం. ఇది జైన ధర్మంలో అత్యంత ఆరాధ్య, సార్వజనిక మంత్రోచ్చారణ ‘నవ్కార్ మహామంత్ర’ను సామూహికంగా జపించే కార్యక్రమం ద్వారా ప్రజలను ఏకతాటి మీదకు తీసుకురాదలచే ఒక మహత్తర వేడుక. అహింస, నమ్రత, ఆధ్యాత్మిక ఉన్నతి అనే సూత్రాలపై రూపుదిద్దుకొన్న ఈ మంత్రం విజ్ఞుల సుగుణాలకు ప్రశంస పలుకడంతోపాటు మనిషి లోలోపల మార్పును ప్రేరేపిస్తుంది. ఈ దినోత్సవం మానవులంతా ఆత్మశుద్ధీకరణ, సహనం, సామూహిక అభ్యున్నతి వంటి విలువలను సంపాదించుకోవాలంటూ వారిని ఉత్సాహపరుస్తుంది.
శాంతినీ, సమష్టితత్వాన్నీ పెంపొందింపచేయడానికి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన జప కార్యక్రమంలో 108కి పైగా దేశాల ప్రజానీకం పాల్గొన్నారు. వారు శాంతిని, ఆధ్యాత్మిక జాగృతిని, సార్వజనిక సద్భావనను పెంచడానికే పవిత్ర జైన జపంలో పాలుపంచుకొన్నారు.
(Release ID: 2120499)
Visitor Counter : 37
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam