హోం మంత్రిత్వ శాఖ
డ్రగ్ సిండికేట్లపై ఎన్సీబీ సాధించిన విజయాన్ని ఎక్స్ లో పోస్టు చేసిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా: ముంబయిలోని అతి పెద్ద డ్రగ్ సిండికేట్ నిర్వీర్యం
11.54 కేజీల కొకైన్, 4.9 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎన్సీబీ
‘‘డ్రగ్ వ్యాపారులను భారత్ ఉపేక్షించదు’’ అంటూ ఈ విజయం గురించి వివరించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కలలు గన్న మాదక ద్రవ్యాల రహిత భారత్ ను సాకారం చేయడానికి అనుసరించిన సమగ్ర విధానం ఫలించింది: శ్రీ అమిత్ షా
5.5 కేజీల గంజాయి చాక్లెట్లు, రూ. 1.6 లక్షల నగదు సైతం సీజ్ చేసిన ఎన్సీబీ ముంబయి
జనవరి 2025 ఆరంభంలో 200 గ్రాముల కొకైన్ స్వాధీనం అనంతరం అందిన నిఘా వర్గాల సమాచారం, అవలంబించిన కార్యాచరణ ఫలితమే ఈ విజయం
విదేశాల్లోని వ్యక్తులు.. ఆధునిక పద్ధతుల ద్వారా మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది
ఈ విజయాన్ని సాధించిన ఎన్సీబీ బృందానికి హోంమంత్రి శ్రీ అమిత్ షా అభినందనలు
Posted On:
07 FEB 2025 5:59PM by PIB Hyderabad
ముంబయిలో అతి పెద్ద మాదకద్రవ్యాల నెట్వర్క్ను నిర్వీర్యం చేసి భారత్లోని డ్రగ్ సిండికేట్లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సాధించిన విజయాన్ని కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలియజేశారు. మాదకద్రవ్యాల రహిత భారత్ (నషా ముక్త్ భారత్) సాధించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా అనుసరిస్తున్న సమగ్ర దర్యాప్తు విధానం విజయవంతం అయిందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన అన్నారు.
‘‘నిషేధిత మాదకద్రవ్యాల వ్యాపారం చేసే వారిని భారత్ ఉపేక్షించదు. ముంబయిలో హై-గ్రేడ్ కొకైన్, గంజాయి, గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు నలుగురిని అరెస్టు చేయడం ద్వారా పెద్ద విజయం సాధించాం. మాదకద్రవ్య రహిత భారత్ను నిజం చేయాలన్న ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఆలోచనలకు అనుగుణంగా అనుసరించిన సమగ్ర దర్యాప్తు విధానం విజయవంతమైందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ విజయం సాధించిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కు శుభాకాంక్షలు’’ అని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఎక్స్ లో అన్నారు.
ఈ ఏడాది జనవరిలో 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న సమయంలో లభించిన ఆధారాలతో ఎన్సీబీ బృందం దర్యాప్తు చేపట్టింది. ఫలితంగా భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. ఈ కేసులో లభించిన ఆధారాలను, నిఘా సమాచారం, సాంకేతిక సహకారంతో విశ్లేషించిన అనంతరం ఎన్సీబీకి చెందిన ముంబయి జోనల్ యూనిట్ (ఎంజడ్యూ) మాదకద్రవ్యాల మూలాలను గుర్తించగలిగింది. మహారాష్ట్రలోని నవీ ముంబయిలో జనవరి 31, 2025న 11.540 కేజీల కొకైన్, 4.9 కేజీల హైబ్రిడ్ స్ట్రెయిన్ హైడ్రోఫోనిక్ వీడ్/గంజాయి, 200 ప్యాకెట్లు (5.5 కేజీల) గంజాయి చాక్లెట్లు, రూ. 1,60,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో మొదట ముంబయికి చెందిన కొరియర్ ఏజెన్సీ నుంచి ఆస్ట్రేలియాకు పంపుతున్న పార్సిల్ను రికవరీ చేశారు. మహారాష్ట్రలోని నవీ ముంబయిలో పెద్ద మొత్తంలో దాచిపెట్టిన మాదక ద్రవ్యాలను ఎన్సీబీ ఎంజడ్యూ విజయవంతంగా స్వాధీనం చేసుకుంది.
ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తులో ఈ సిండికేట్ను విదేశాల్లో ఉంటున్న ఓ బృందం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అలాగే స్వాధీనం చేసుకున్న నిషేధిత మాదకద్రవ్యాలు అమెరికా నుంచి ముంబయికి తీసుకువచ్చి, ఇక్కడి నుంచి దేశవిదేశాల్లోని రిసీవర్లకు కొరియర్/కార్గో సేవల ద్వారా చేరవేస్తునట్లు తేలింది. ఈ కేసుతో సంబంధమున్న వ్యక్తులకు ఒకరితో ఒకరికి పరిచయం లేదు. మాదకద్రవ్యాల గురించి మాట్లాడుకోవడానికి మారుపేర్లు ఉపయోగిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని గుర్తించేందుకు దర్యాప్తు జరుగుతోంది.
***
(Release ID: 2100943)
Visitor Counter : 24