ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ భద్రత సలహాదారు సమావేశం


ద్వైపాక్షికంగా ప్రత్యేకించి ‘ఐసెట్’ కింద సహకారంలో
ప్రగతి గురించి ప్రధానికి వివరించిన ‘ఎన్ఎస్ఎ’ సలివాన్;

ప్రధానిగా ప్రస్తుత పదవీకాలంలో భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చడంపై నిబద్ధతను పునరుద్ఘాటించిన శ్రీ మోదీ

Posted On: 17 JUN 2024 7:35PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఎ) గౌరవనీయ జేక్ సలివాన్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి వివిధ రంగాల్లో ప్రగతిని... ముఖ్యంగా ‘ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఐసెట్) పురోగమనం గురించి ప్రధానికి వివరించారు. ఈ మేరకు సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ, టెలికాం, రక్షణ, కీలక ఖనిజాలు, అంతరిక్షం తదితరాలపై విశదీకరించారు.

   అన్ని రంగాలలో ఇనుమడిస్తున్న ద్వైపాక్షిక భాగస్వామ్య వేగం-స్థాయి సహా పరస్పర ప్రయోజనాల సంబంధిత ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపై రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయంపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల జి-7 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో తన అర్థవంతమైన చర్చను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. ప్రపంచ శ్రేయస్సు దిశగా రెండు దేశాల మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంసహా ప్రధానిగా ప్రస్తుత పదవీ కాలంలో దీన్ని కొత్త శిఖరాలకు చేర్చడంపై తన నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.



(Release ID: 2028162) Visitor Counter : 17