రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పత్రికా ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 06 JUN 2024 6:14PM by PIB Hyderabad

   భార‌త రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ సహ కమిషనర్లు శ్రీ జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధుతో కలిసి ఇవాళ సాయంత్రం 04.30 గంటలకు సమావేశమయ్యారు. భారత 18వ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 73 ప్రకారం- పార్లమెంటుకు ఎన్నికైన సభ్యుల పేర్లతో కూడిన జాబితాను, దీనిపై భారత ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్ ప్రతిని వారు ఆమెకు సమర్పించారు.

   మానవాళి చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య మహోత్సవమైన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడంపై ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లను రాష్ట్రపతి ఈ సందర్భంగా అభినందించారు. అలాగే ఎన్నికల సంఘం, దాని పరిధిలోని అధికారులు, సిబ్బంది,  ప్రచార-పోలింగ్ పర్యవేక్షణ-నిర్వహణలో పాలుపంచుకున్న ప్రభుత్వాధికారులుసహా కేంద్ర-రాష్ట్ర పోలీసు, భద్రత సిబ్బంది కృషిని దేశ పౌరుల తరఫున రాష్ట్రపతి ప్రశంసించారు. ఆ మేరకు ప్రజల ఓటు హక్కు పవిత్రతను నిలబెట్టడంలో అవిశ్రాంతంగా-శ్రద్ధగా కృషి చేయడంతోపాటు ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగడంలో తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించారని కొనియాడారు. అన్నింటినీ మించి, ఎన్నికల ప్రక్రియలో భారీగా భాగస్వాములైన కోట్లాది ఓటర్లను ఆమె ఎంతగానో అభినందించారు. ఇది మన రాజ్యాంగంతోపాటు సుసంపన్న, అచంచల భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అనుగుణంగా బాధ్యతను నెరవేర్చారని రాష్ట్రపతి పేర్కొన్నారు.

******


(రిలీజ్ ఐడి: 2023290) సందర్శకుల సూచీ సంఖ్య : : 160