భారత ఎన్నికల సంఘం

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేయడానికి, పోలింగ్‌ పారదర్శకంగా జరిగేలా చూడడానికి ఈసీతో చేతులు కలుపుతున్న ప్రజలు


సీవిజిల్‌ ద్వారా గత రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు; 99.9% కేసులు పరిష్కారం

జియో-ట్యాగింగ్ సాయంతో ఘటనాస్థలానికి నిమిషాల్లో చేరుకుంటున్న అధికార బృందాలు

Posted On: 18 MAY 2024 1:23PM by PIB Hyderabad

2024 లోక్‌సభ ఎన్నికల్లో, భారత ఎన్నికల సంఘం ఆవిష్కరించిన సీవిజిల్‌ యాప్ అత్యంత ప్రభావవంతమైన సాధనంగా ఉద్భవించింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి 15 మే 2024 వరకు, ప్రజల నుంచి ఈ యాప్ ద్వారా 4.24 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయి. వీటిలో 4,23,908 ఫిర్యాదులను అధికార్లు పరిష్కరించారు. మిగిలిన 409 కేసులు విచారణలో ఉన్నాయి. దాదాపు 89% ఫిర్యాదులకు 100 నిమిషాల్లోపే పరిష్కారం దొరికింది, ఈసీఐ చేసిన వాగ్దానం దృఢంగా అమలవుతోంది.

నిర్ణీత సమయానికి మించి లేదా నిర్ణీత శబ్ద స్థాయికి మించి లౌడ్ స్పీకర్ల వినియోగం, నిషేధ కాలంలో ప్రచారం చేయడం, అనుమతి లేకుండా బ్యానర్లు లేదా పోస్టర్లు అంటించడం, అనుమతించిన పరిమితికి మించి వాహనాలు ఉపయోగించడం, ఆస్తుల విధ్వంసం, తుపాకీలను ప్రదర్శించడం లేదా బెదిరింపులు వంటి ఎన్నికల ప్రవర్తన నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయడానికి ప్రజలు ఈ యాప్‌ని ఉపయోగిస్తున్నారు. వర్గం వారీగా ఫిర్యాదులు ఇవి:

సీవిజిల్‌ యాప్‌ను ప్రతి ఒక్కరు సులభంగా వినియోగించవచ్చు. దీనిద్వారా, పౌరులు, జిల్లా కంట్రోల్ రూమ్, రిటర్నింగ్ అధికారులు, ఫ్లయింగ్ బృందాలు అనుసంధానమవుతారు. ప్రవర్తన నియమావళికి సంబంధించి ఏవైనా ఉల్లంఘనలను ప్రజలు గమనిస్తే, రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ యాప్‌ ద్వారా నిమిషాల్లో ఫిర్యాదు చేయవచ్చు. సీవిజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే, ఫిర్యాదుదారుకు ప్రత్యేకమైన ఐడీ నంబర్‌ అందుతుంది. దానిని ఉపయోగించి, ఫిర్యాదు స్థితిని మొబైల్‌ ఫోన్‌లోనే తనిఖీ చేయవచ్చు.

ఏకకాలంలో పని చేసే మూడు అధికార బృందాలు సీవిజిల్‌ను విజయవంతం చేస్తున్నాయి. ప్రజలు అప్పటికప్పుడే శబ్దాలు, ఛాయాచిత్రాలు లేదా దృశ్యాలను చిత్రీకరించి ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదుపై ప్రతిస్పందన కోసం "100 నిమిషాల" కౌంట్‌డౌన్ ఉంటుంది. సీవిజిల్‌ యాప్‌ ఉపయోగించడానికి పౌరులు తమ కెమెరా ఆన్ చేసిన వెంటనే, ఆ యాప్ స్వతంత్రంగా జియో-ట్యాగింగ్‌ను ఉపయోగిస్తుంది. దీనివల్ల, సంఘటనా స్థలం ఎక్కడుందన్న విషయం అధికార్లకు కచ్చితంగా తెలుస్తుంది. ప్రజలు పంపే సమాచారాన్ని న్యాయస్థానంలో సాక్ష్యంగా కూడా ఉపయోగించవచ్చు. ఫిర్యాదులు చేసే ప్రజల వివరాలను అధికార్లు గోప్యంగా ఉంచుతారు. సాంకేతికతను ఉపయోగించుకోవడానికి, ఓటర్లు & రాజకీయ పార్టీల పనిని సులభంగా మార్చడానికి ఎన్నికల సంఘం రూపొందించిన బలమైన యాప్‌లలో ఇది ఒకటి.

***



(Release ID: 2021125) Visitor Counter : 44