హోం మంత్రిత్వ శాఖ

రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులు, ఎన్ ఎస్ బి , సీబీఐ, ఆర్బీఐ, ఇతర చట్ట అమలు సంస్థల పేరుతో 'బ్లాక్ మెయిల్' 'డిజిటల్ అరెస్ట్' అంటూ సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్ననేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Posted On: 14 MAY 2024 4:15PM by PIB Hyderabad

పోలీసు అధికారులు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇతర చట్ట అమలు సంస్థల పేరుతో సైబర్ నేరగాళ్లు బెదిరింపులు, బ్లాక్ మెయిల్, దోపిడీ "డిజిటల్ అరెస్టులు" లకు పాల్పడుతున్నారని ఇటీవల కాలంలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్ సి ఆర్ పి) లో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఈ తరహా నేరగాళ్లు గుర్తించిన వారికి ఫోన్ చేసి మీరు పంపిన లేదా వారికి వచ్చిన పార్శిల్ లో అక్రమ వస్తువులు, మాదకద్రవ్యాలు, మరేదైనా నిషిద్ధ వస్తువులు ఉన్నాయని బెదిరిస్తారు. కొన్నిసార్లు, బాధితుని సమీప లేదా దగ్గర వ్యక్తి నేరం లేదా ప్రమాదానికి పాల్పడినట్లు గుర్తించామని, వారు తమ కస్టడీలో ఉన్నారు అని కూడా సైబర్ నేరగాళ్లు తెలియజేస్తారు. "కేసు" ను రాజీ చేయడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో బాధితుడిని ' డిజిటల్ అరెస్ట్' చేశామని బెదిరించి స్కైప్ లేదా ఇతర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనిపించాలని హెచ్చరిస్తున్నారు. తమ డిమాండ్లకు అంగీకరించేంతవరకు సైబర్ నేరగాళ్లు ఈ విధానాన్ని అనుసరిస్తారు. తాము ప్రభుత్వ ఉద్యోగులు లేదా పోలీసులు అన్న భావన కలిగించేందుకు సైబర్ నేరగాళ్లు పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నట్టు మోసగిస్తున్నారు. వారు యూనిఫామ్ కూడా ధరించి ఉంటారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి దేశంలో అనేక మంది పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించవలసి వచ్చింది. వ్యవస్థీకృత ఆన్‌లైన్ ఆర్థిక నేరంగా అమలు జరుగుతున్న ఈ విధానంతో విదేశాలకు చెంది క్రైమ్ సిండికేట్‌లకు సంబంధం ఉంది. దేశంలో సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి సంబంధించిన కార్యకలాపాలను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) సమన్వయం చేస్తుంది. ఈ మోసాలను అరికట్టడానికి ఇతర మంత్రిత్వ శాఖలు మరియు వాటి సంస్థలు ,ఆర్ బి ఐ ఇతర సంస్థలతో కలిసి హోం మంత్రిత్వ శాఖ చర్యలు అమలు చేస్తోంది. కేసులను గుర్తించడం, దర్యాప్తు చేయడం కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు అధికారులకు అవసరమైన సమాచారం, సాంకేతిక సహాయాన్ని కూడా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అందిస్తోంది. మైక్రోసాఫ్ట్ సహకారంతో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడిన 1,000 కంటే ఎక్కువ Skype ID లను ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ బ్లాక్ చేసింది. ఇటువంటి మోసగాళ్లు ఉపయోగించే సిమ్ కార్డ్‌లు, మొబైల్ పరికరాలు, నకిలీ ఖాతాలను బ్లాక్ చేయడం కూడా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ చర్యలు అమలు చేస్తోంది. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'సైబర్‌డోస్ట్' తో పాటు X, Facebook, Instagram లో ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోల ద్వారా వివిధ హెచ్చరికలను కూడా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ జారీ చేసింది. ఈ తరహా మోసాలపై ప్రజలు అప్రమత్తంగా , అవగాహన కలిగి ఉండాలని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సూచించింది. అటువంటి ఫోన్ కాల్ వచ్చిన ప్రజలు వెంటనే సహాయం కోసం సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 లేదా or www.cybercrime.gov.in సంప్రదించాలని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కోరింది.



(Release ID: 2020677) Visitor Counter : 75