ప్రధాన మంత్రి కార్యాలయం

దాద్రా, న‌గ‌ర్ హ‌వేలికి చెందిన సిల్వాసాలో రూ.4850 కోట్ల విలువ గ‌ల ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేసి, ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి


న‌మో వైద్య విద్య‌, ప‌రిశోధ‌న సంస్థ సంద‌ర్శ‌న‌, జాతికి అంకితం

డ‌యూ, సిల్వాసాకు చెందిన పిఎంఏవై అర్బ‌న్ ల‌బ్ధిదారుల‌కు తాళాలు అంద‌జేత‌

“ఈ ప్రాజెక్టుల‌తో జీవ‌న సౌల‌భ్యం, ప‌ర్యాట‌కం, ర‌వాణా, వ్యాపారాల‌ మెరుగుద‌ల‌; కొత్త ప‌ని సంస్కృతికి స‌కాలంలో ప్రాజెక్టుల పూర్తికి ఇది ఉదాహ‌ర‌ణ”‌

“ప్ర‌తీ ఒక్క ప్రాంతం స‌మతూక‌మైన అభివృద్ధికి అధిక ప్రాధాన్యం”

“ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు సేవాభావంపై అవ‌గాహ‌న‌”

“విద్యార్థుల ఉజ్వ‌ల‌ భ‌విష్య‌త్తు విష‌యంలో ఎలాంటి అల‌స‌త్వం ఉండ‌ద‌ని ప్ర‌తీ ఒక్క విద్యార్థికి నేను హామీ ఇచ్చాను”

“భార‌త‌దేశ ప్ర‌జ‌లు, భార‌త‌దేశ‌ ప్ర‌త్యేక‌త‌ల కృషిపై చ‌ర్చ‌కు మంచి వేదిక‌గా మారుతున్న మ‌న్ కీ బాత్‌”

“డ‌మ‌న్‌, డ‌య్యూ, దాద్రా న‌గ‌ర్ హ‌వేలిల‌లో కోస్తా టూరిజంకు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తును నేను వీక్షిస్తున్నాను”.

“దేశం “తుష్టీక‌ర‌ణ్ లేదా బుజ్జ‌గింపు”ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డంలేదు; “సంతుష్టీక‌ర‌ణ్ లేదా సంతృప్తికే ప్రాధాన్య‌త‌”

“అట్ట‌డుగు ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు ప్రాధాన్య‌తే గ‌త 9 సంవ‌త్స‌రాలుగా స‌త్ప‌రిపాల‌న‌కు చిహ్నంగా మారింది”

“స‌బ్ కా ప్ర‌యాస్‌ తో విక్సిత్ భార‌త్‌,

Posted On: 25 APR 2023 6:37PM by PIB Hyderabad

దాద్రా, న‌గ‌ర్   హ‌వేలిలోని సిల్వాసాలో రూ.4850 కోట్ల‌కు పైబ‌డిన వివిధ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేయ‌డంతో పాటు ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌ను జాతికి అంకితం చేశారు. వాటిలో సిల్వాసాలో న‌మో వైద్య విద్య‌, ప‌రిశోధ‌న సంస్థను జాతికి అంకితం చేయ‌డంతో పాటు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, డ‌మ‌న్   లోని  ప్ర‌భుత్వ ఇంజ‌నీరింగ్   క‌ళాశాల‌ల నిర్మాణం;  వివిధ రోడ్ల సుంద‌రీక‌ర‌ణ‌, విస్త‌ర‌ణ‌;  చేప‌ల మార్కెట్‌, షాపింగ్  కాంప్లెక్స్, నీటి స‌ర‌ఫ‌రా స్కీమ్   సామ‌ర్థ్యం పెంపు వంటి 96 ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశాయి.  డ‌య్యూ, సిల్వాసాల్లో  పిఎంఏవై అర్బ‌న్  ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల తాళాలు అంద‌చేశారు.

అంతకు ముందు ప్రధానమంత్రి సిల్వాసాలో నమో వైద్య కళాశాల, పరిశోధన సంస్థను ప్రారంభించారు. కేంద్రపాలిత ప్రాంతం దాద్రా; నగర్   హవేలి;  డమన్, డయ్యూ; లక్ష ద్వీప్  ల
 అడ్మినిస్ర్టేటర్   శ్రీ ప్రఫుల్  పటేల్  ఆయనతో ఉన్నారు.  సంస్థను ప్రారంభించిన సందర్భంగా ఆయన ధన్వంతరి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. కళాశాల క్యాంపస్  నమూనాను పరిశీలించి అకాడమిక్  బ్లాక్   లో అనాటమీ మ్యూజియం, డిసెక్షన్   రూమ్  ను చూశారు. ఆ తర్వాత ఆయన సెంట్రల్  గ్రంథాలయం అంతా చూసిన అనంతరం సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. యాంఫి థియేటర్   ను కూడా సందర్శించి అక్కడ నిర్మాణ కార్మికులతో సంభాషించారు.

ఆ తర్వాత సభకు హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తూ డమన్, డయ్యూ;  దాద్రా, నగర్  హవేలి అభివృద్ధి ప్రయాణం పట్ల హర్షం ప్రకటించారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారు సందర్శించే సిల్వాసాలో  కాస్మోపాలిటన్   వాతావరణం పెరుగుతోందన్నారు.  కేంద్రపాలిత ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పని చేస్తోందని చెప్పారు. ఇక్కడి ప్రజలు సాంప్రదాయం, ఆధునికతను ప్రేమిస్తారన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రూ.5500 కోట్ల కేటాయింపులతో కేంద్రపాలిత ప్రాంతంలో భౌతిక, సామాజిక మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. ఎల్ఇడి వీధి దీపాలు, ఇంటింటి వద్ద చెత్త సేకరణ, 100 శాతం వ్యర్థాల ప్రాసెసింగ్   గురించి కూడా ఆయన మాట్లాడారు. కేంద్రపాలిత ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలు పెంపు లక్ష్యంగా ప్రకటించిన కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. ‘‘నేడు రూ.5000 కోట్ల విలువ గల తాజా ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం నాకు కలిగింది’’ అన్నారు. ఈ ప్రాజెక్టులు ఆరోగ్యం, ఇంటి నిర్మాణం, పర్యాటకం, విద్య, పట్టణాభివృద్ధి రంగాలకు చెందిన ప్రాజెక్టులున్నాయి. ‘‘ఈ ప్రాజెక్టులు జీవన సౌలభ్యం, పర్యాటకం, రవాణా, వ్యాపార వాతావరణం మెరుగుపరుస్తాయి’’ అని చెప్పారు.

కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఒకప్పుడు ప్రధానమంత్రి హోదాలో వాటికి తానే శంకుస్థాపన చేయడం పట్ల హర్షం ప్రకటించారు. అధిక సమయం పాటు దేశంలో అభివృద్ధికి ఉద్దేశించిన ప్రభుత్వ ప్రాజెక్టులు స్తంభించిపోవడం లేదా వదిలివేయడం...కొన్ని సందర్భాల్లో ప్రాజెక్టులు పునాది రాళ్లకే పరిమితం చేయడం, తదుపరి అవి శిథిలాలుగా మారడం జరిగిందని ఆయన విమర్శించారు. కాని గత 9 సంవత్సరాలుగా కొత్త పని వాతావరణం అభివృద్ధి చేశామని, కొత్త పని సంస్కృతి ప్రవేశపెట్టామని ప్రధానమంత్రి చెప్పారు. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం కష్టపడి పని చేస్తున్నదని, ఒక ప్రాజెక్టు పూర్తి కాగానే మరో అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభిస్తోందని ఆయన నొక్కి చెప్పారు. ప్రభుత్వంలో కొత్త పని  సంస్కృతికి ఇదే చక్కని ఉదాహరణ అని ప్రధానమంత్రి చెబుతూ అభివృద్ధి పనుల పట్ల అందరినీ అభినందించారు.

కేంద్రప్రభుత్వం ‘‘సబ్  కా సాత్, సబ్   కా వికాస్, సబ్  కా విశ్వాస్, సబ్  కా ప్రయాస్’’ మంత్రంతో ముందుకు సాగుతున్నదని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. అన్ని ప్రాంతాల సమతూకమైన అభివృద్ధి ప్రభుత్వ అగ్రప్రాధాన్యత అని ఆయన అన్నారు. ఓటు బ్యాంక్   రాజకీయాల కోణంలోనే అన్నింటినీ చూసే దీర్ఘకాలిక ధోరణిని ప్రధానమంత్రి విమర్శించారు. దాని వల్ల గిరిజన, సరిహద్దు ప్రాంతాలు నిరాకరణకు గురయ్యాయని ఆయన అన్నారు. అంతే కాదు మత్స్యకారులను కూడా విధికి వదిలేశారని;  డమన్, డయ్యూ;  దాద్రా, నగర్  హవేలి ప్రజలు అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నారని ప్రధానమంత్రి చెప్పారు.  

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన దశాబ్దాల తర్వాత కూడా డమన్, డయ్యూ;  దాద్రా, నగర్  హవేలి ప్రాంతాలకు వైద్య కళాశాల లేకపోవడం పట్ల విచారం ప్రకటించారు. వైద్యులు కావడానికి ఈ ప్రాంత యువత సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వచ్చేదని చెప్పారు. ఇక ఆదివాసీ ప్రజలు పొందిన అవకాశాలు మృగ్యమని, దశాబ్దాల కాలం పాటు దేశాన్ని పాలించిన వారు వారి ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అన్నారు. 2014 సంవత్సరం తర్వాత వచ్చిన ప్రస్తుత ప్రభుత్వ అంకిత, సేవా  భావం వల్ల డమన్, డయ్యూ;  దాద్రా, నగర్  హవేలిలకు తొలి జాతీయ అకాడమిక్  వైద్య సంస్థ లేదా నమో వైద్య కళాశాల వచ్చిందని ఆయన నొక్కి చెప్పారు. ‘‘ఇప్పుడు ఈ ప్రాంతానికి చెందిన సుమారు 150 మంది యువత ప్రతీ ఏటా మెడిసిన్   చదివే అవకాశం పొందుతారు’’ అన్నారు. సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి సుమారుగా 1000 మంది డాక్టర్లు అందుబాటులోకి వస్తారని చెప్పారు. తన కుటుంబంలోనే కాకుండా ఈ ప్రాంతం నుంచి మెడిసిన్   చదువుతున్న తొలి వ్యక్తి తానేనని ఈ ప్రాంతానికి చెందిన ఒక యువతి చెప్పినట్టు  వార్తలు రావడాన్ని కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు.

ఈ ప్రాంత ప్రజలకు సేవాభావం ఎక్కువ అని చెబుతూ మహమ్మారి సమయంలో ఈ ప్రాంతానికి చెందిన  వైద్య విద్యార్థులు చేసిన సహాయం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. మన్   కీ బాత్  కార్యక్రమంలో స్థానిక విద్యార్థి ఒకరు గ్రామ దత్తత కార్యక్రమం గురించి ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ వైద్య కళాశాల స్థానిక వైద్య సదుపాయాలపై ఒత్తిడిని తగ్గిస్తుందన్నారు. ‘‘ఇక్కడ 300 పడకల ఆస్పత్రి నిర్మాణంలో ఉంది, కొత్త ఆయుర్వేద ఆస్పత్రికి కూడా అనుమతులు మంజూరయ్యాయి’’ అని చెప్పారు.

ముఖ్యమంత్రిగా తాను పని చేసిన రోజుల గురించి గుర్తు చేసుకుంటూ గిరిజన ప్రాంతాల్లో తాను సైన్స్  విద్యను ప్రవేశపెట్టానని ప్రధానమంత్రి అన్నారు. మాతృ భాషలో విద్య గురించి కూడా ప్రస్తావిస్తూ ‘‘ఇప్పుడు వైద్య, ఇంజనీరింగ్   విద్య కూడా స్థానిక భాషల్లో అందుబాటులో ఉంది, ఇది స్థానిక విద్యార్థులకు సహాయకారిగా ఉంటుంది’’ అన్నారు.

‘‘ఇక్కడ ఏర్పాటవుతున్న ఇంజనీరింగ్   కళాశాల ఏడాదికి 300 మంది విద్యార్థులు ఇంజనీరింగ్  చదివే అవకాశం కల్పిస్తుంది’’ అన్నారు. దాద్రా, నగర్  హవేలిలలో ప్రముఖ విద్యా సంస్థలు తమ క్యాంపస్  లు ప్రారంభించడం పట్ల ఆయన హర్షం ప్రకటించారు. డమన్  లో నిఫ్ట్  ఉపగ్రహ క్యాంపస్, సిల్వాసాలో గుజరాత్  జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, డయూలో వడోదర ఐఐఐటి క్యాంపస్  ఏర్పాటవుతున్నట్టు ఆయన చెప్పారు. ‘‘విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టేది లేదని నేను ప్రతీ ఒక్క విద్యార్థికి హామీ ఇస్తున్నాను’’ అని ప్రధానమంత్రి అన్నారు.  

తన గత సిల్వాసా సందర్శన గురించి గుర్తు చేస్తూ బాలల విద్య, యువతకు కొత్త ఆదాయ వనరులు, వయసు పైబడిన వారికి ఆరోగ్య సంరక్షణ, రైతులకు నీటి పారుదల వసతులు, సగటు పౌరుల ఫిర్యాదుల పరిష్కారం వంటి అభివృద్ధికి చెందిన ఐదు కొలమానాలు లేదా ‘పంచధార’ గురించి ప్రస్తావించారు. వాటికి తాను మరొకటి జోడిస్తున్నానంటూ అదే ప్రధానమంత్రి ఆవాస్  యోజన కింద మహిళా లబ్ధిదారులకు పక్కా ఇళ్ల నిర్మాణం అన్నారు. గత కొన్నేళ్ల కాలంలో ప్రభుత్వం 3 కోట్ల కన్నా  ఎక్కువ పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించినట్టు ఆయన చెప్పారు. అందులో భాగంగా 15 వేలకు పైబడిన పక్కా ఇళ్ల తాళాలు ప్రభుత్వం స్వయంగా అందిస్తున్నదన్నారు. నేడు 1200 పైగా కుటుంబాలకు ఇక్కడ పిఎం ఆవాస్  యోజన కింద నిర్మించిన సొంత ఇంటి తాళాలు అందిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు.  ‘‘డమన్, డయ్యూ, దాద్రా, నగర్  హవేలిలకు చెందిన వేలాది మంది మహిళలను ఇంటి యజమానులుగా మారుస్తున్నాం’’ అన్నారు. పిఎం ఆవాస్  యోజన కింద నిర్మించిన ఒక్కో ఇంటికి కొన్ని లక్షలు వ్యయం అయిందంటూ ఆ రకంగా మహిళలు ‘లక్షాధికారి దీదీలు’ అయ్యారని చెప్పారు.

అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ వాటిలో స్థానిక నగలి, నాచ్ని చిరుధాన్యాలు కూడా ఉన్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. శ్రీ అన్న కింద వివిధ రకాల స్థానిక చిరుధాన్యలను ప్రోత్సహిస్తున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే ఆదివారం జరుగనున్న మన్  కీ బాత్  నూరవ ఎపిసోడ్  గురించి ప్రస్తావిస్తూ ‘‘భారత ప్రజలు, భారతదేశ ప్రత్యేకతల గురించి మాట్లాడేందుకు మన్  కీ బాత్  మంచి వేదికగా మారింది. మీ అందరి వలెనే 100వ ఎపిసోడ్   కోసం నేను ఎదురు చూస్తున్నాను’’ అని ప్రధానమంత్రి అన్నారు.

‘‘డమన్, డయ్యూ;  దాద్రా, నగర్  హవేలిలను కోస్తా పర్యాటకానికి మంచి ప్రాంతాలుగా నేను వీక్షిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి చెప్పారు. అవి ప్రధాన పర్యాటక గమ్యాలుగా మారతాయన్నారు.  భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్ర పర్యాటక కేంద్రంగా తయారుచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. నానీ డమన్  మెరైన్  ఓవర్  వ్యూ (నమో) పేరిట రెండు పర్యాటక కేంద్రాలు పర్యాటకానికి ఉత్తేజం కల్పిస్తాయని, ఇక్కడ బీచ్  ప్రాంతంలో కొత్త టెంట్  సిటీ ఏర్పాటవుతోందని తెలిపారు. అలాగే ఖన్వేల్  రివర్  ఫ్రంట్, దుధాని జెట్టీ, ఎకో-రిసార్ట్,  కోస్టల్  ప్రొమెనేడ్ వంటివి పూర్తయితే ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా మారతాయని చెప్పారు.

ప్రధానమంత్రి  ప్రసంగాన్ని ముగిస్తూ ప్రస్తుత ప్రభుతవ్  ‘‘తుష్టీకరణ్’’  లేదా బుజ్జగింపులకు పాల్పడడంలేదని, ‘‘సంతుష్టీకరణ్’’ లేదా సంతృప్తికి ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. ‘‘గత 9 సంవత్సరాల కాలంలో సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాల అవసరాలు తీర్చడానికి ఇస్తున్న ప్రాధాన్యత  సత్పరిపాలనకు గీటురాయిగా మారింది’’ అన్నారు. సమాజంలో నిరాదరణకు గురవుతున్న ప్రతీ ఒక్క పౌరుడు, నిరాదరణకు గురవుతున్న ప్రతీ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చేయడానికి కేంద్రప్రభుత్వం కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు.  ప్రభుత్వం ప్రజల ముంగిటికి వెళ్లినప్పుడు అవినీతి, వివక్ష అంతరించిపోతుందని, పథకాలు సంతృప్త స్థాయికి చేరతాయని ఆయన అన్నారు. డమన్, డయ్యూ;  దాద్రా, నగర్  హవేలిలు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో సంతృప్త స్థాయికి చేరడం పట్ల శ్రీ మోదీ హర్షం ప్రకటించారు. ‘‘సబ్  కా ప్రయాస్’ స్ఫూర్తితో విక్సిత్  భారత్,  సుసంపన్నత సంకల్పాలు నెరవేరతాయి’’ అని ప్రధానమంత్రి అన్నారు.

దాద్రా, నగర్  హవేలి;  డమన్, డయ్యూ, లక్షద్వీపాల అడ్మినిస్ర్టేటర్  శ్రీ ప్రఫుల్  పటేల్;  దాద్రా, నగర్  హవేలి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కళాబెన్  మోహన్  బాయి దేల్కర్, కుశాంబి ఎంపి వినోద్  సోంకార్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పూర్వాప‌రాలు...

ప్ర‌ధాన‌మంత్రి సిల్వాసాలో న‌మో వైద్య విద్య‌, ప‌రిశోధ‌న సంస్థ‌ను సంద‌ర్శించి జాతికి అంకితం చేశారు. 2019 జ‌న‌వ‌రిలో స్వ‌యంగా ప్ర‌ధాన‌మంత్రి దానికి శంకుస్థాప‌న చేశారు. కేంద్ర‌పాలిత ప్రాంతం దాద్రా, న‌గ‌ర్   హ‌వేలి;  డ‌మ‌న్‌, డ‌య్యూలో ఆర్థిక స‌ర్వీసుల సేవ‌ల‌ను ఇది ప‌రివ‌ర్త‌న చేస్తుంది. ఈ అత్యాధునిక వైద్య క‌ళాశాల‌లో ఆధునిక ప‌రిశోధ‌న కేంద్రాలు;  జాతీయ‌, అంత‌ర్జాతీయ జ‌ర్న‌ల్స్  అందుబాటులో ఉండి నిరంత‌రం ప‌ని చేసే గ్రంథాల‌యం, స్పెష‌లైజ్  చేసిన వైద్య క‌ళాశాల‌, వైద్య ప్ర‌యోగ‌శాల‌లు, స్మార్ట్  లెక్చ‌ర్  హాళ్లు, ప‌రిశోధ‌న ప్ర‌యోగ‌శాల‌లు, అనాట‌మీ మ్యూజియం, క్ల‌బ్   హౌస్, క్రీడావ‌స‌తులు;  విద్యార్థులు, ఫ్యాక‌ల్టీ స‌భ్యుల‌కు నివాస భ‌వ‌నాలు కూడా అందులో ఉన్నాయి.

సిల్వాసాలోని సైలి మైదానంలో రూ.4850 కోట్ల విలువ గ‌ల 96 ప్రాజెక్టుల‌కు ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న చేసి, జాతికి అంకితం చేశారు. ఆ ప్రాజెక్టుల్లో దాద్రా, న‌గ‌ర్  హ‌వేలి జిల్లాలోని మోర్ఖ‌ల్‌, సిందోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు;   అంబావాడి, ప‌రియారి, డ‌మ‌న్  వాడా, ఖ‌రీవాడ్   ల‌లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు; డ‌మ‌న్  లోని ప్ర‌భుత్వ ఇంజ‌నీరింగ్  క‌ళాశాల‌లు;  దాద్రా, న‌గ‌ర్  హ‌వేలి జిల్లాలో వివిధ రోడ్ల ఆధునికీక‌ర‌ణ‌, ప‌టిష్ఠ‌త‌, విస్త‌ర‌ణ ప్రాజెక్టులు;  మోతీ డ‌మ‌న్‌,  నానీ డ‌మ‌న్  లో చేప‌ల మార్కెట్‌, షాపింగ్   కాంప్లెక్స్, నీటి స‌ర‌ఫ‌రా స్కీమ్   పెంపు ప‌థ‌కాలున్నాయి. 



(Release ID: 1920294) Visitor Counter : 113