ఆర్థిక మంత్రిత్వ శాఖ

గత దశాబ్ద కాలంలో సగటు వార్షిక అటవీ విస్తీర్ణం పెరిగిన దేశాల్లో భారత్ కు మూడో స్థానంలో : ఆర్థిక సర్వే 2022-23


భారతదేశంలో 75 రామ్ సర్ కేంద్రాలు మడ అడవుల విస్తీర్ణం 364 చ.కి.మీ. మేర పెరుగుదల

పునరుత్పాదక ఇంధనానికి అనుకూల గమ్యస్థానంగా భారత్ . ఏడేళ్లలో $ 78.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.

రూ.19,744 కోట్ల అంచనాతో జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ ప్రారంభం.

గ్రీన్ ప్రాజెక్టులకు ఎక్కువగా పెట్టుబడులు సమకూర్చేందుకు సార్వభౌమ గ్రీన్ బాండ్ల జారీ

శిలాజేతర విద్యుత్ సామర్థ్యాన్ని 50 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న భారతదేశం

Posted On: 31 JAN 2023 1:18PM by PIB Hyderabad

పరిశుద్ధ ఇంధన వినియోగం దిశగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ముందున్న    భారతదేశం  వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022-23 ఆర్థిక సర్వే నివేదికలో ఈ అంశాన్ని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, ప్రజలందరికీ   ప్రాథమిక శ్రేయస్సు కల్పించే లక్ష్యంగా అమలు జరుగుతున్న సమగ్ర అభివృద్ధితో  ముడిపడి ఉన్న వాతావరణం, పర్యావరణ అంశాలపై భారతదేశం అనుసరిస్తున్న విధానాన్ని, సాధించిన ప్రగతిని ఆర్థిక సర్వే నివేదిక ప్రస్తావించింది. 

 

భారత్ వాతావరణ కార్యాచరణ ప్రణాళిక అమలు లో  పురోగతి: 
ప్రతిష్టాత్మక వాతావరణ కార్యాచరణ లక్ష్యాలతో అభివృద్ధి లక్ష్యాలను అనుసంధానించి  సుస్థిర అభివృద్ధి  సాధించడంలో భారతదేశం   గణనీయమైన పురోగతిని సాధించింది.

1. దేశంలో అటవీ విస్తీర్ణం  
2010-2020 మధ్య సగటు వార్షిక అటవీ విస్తీర్ణంలో పెరిగిన దేశాల జాబితాలో  భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉంది. గ్రీన్ ఇండియా మిషన్ (జీఐఎం), ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం అమలు చేస్తున్న నిధులు, ప్రణాళిక (కాంపా) వంటి కార్యక్రమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పటిష్టమైన వ్యవస్థ,  విధానాల వల్ల దేశంలో అడవుల విస్తీర్ణం పెరిగిందని  సర్వే పేర్కొంది. దేశంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం  అత్యధికంగా ఉంది.  జమ్మూ, కాశ్మీర్ లో హెక్టారు భూమిలో  గరిష్టంగా 173.41 టన్నుల కార్బన్ నిల్వను అందిస్తుంది.
2. పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ:
 
పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ కోసం పటిష్ట కార్యక్రమాలు అమలు చేస్తున్న భారతదేశం ప్రస్తుతం   13.3 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో చిత్తడి నేలల  పరిరక్షణ కోసం 75 రామ్ సర్ కేంద్రాలు ఉన్నాయి. మడ అడవులను సంరక్షించి, అభివృద్ధి చేయడానికి అమలు చేస్తున్న  వివిధ నియంత్రణ, ప్రోత్సాహక చర్యల ఫలితంగా దేశంలో 2021 లో మడ అడవుల విస్తీర్ణం 364 చదరపు కిలోమీటర్ల మేరకు పెరిగింది అని  ఆర్థిక సర్వే పేర్కొంది. 
3. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం : 
పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు భారత్ క్రమంగా అనువైన గమ్యస్థానంగా మారుతోంది. 2014-2021 మధ్య కాలంలో భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో మొత్తం  $ 78.1 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు వచ్చాయి. 
2029-30 చివరి నాటికి స్థాపిత సామర్థ్యం 800 గిగావాట్ల కు పైగా ఉంటుందని ఆర్థిక సర్వే నివేదిక పేర్కొంది.  శిలాజేతర ఇంధనం 500 గిగావాట్ల కు పైగా ఉంటుంది. దీనివల్ల  2014-15 తో పోలిస్తే 2029-30 నాటికి సగటు ఉద్గారాల రేటు 29 శాతం తగ్గుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది.
ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి అన్న లక్ష్యాన్ని సాధించి,  కీలక రంగాల్లో కర్బన ఉద్గారాలు తగ్గించడానికి  ప్రభుత్వం 19,744 కోట్ల రూపాయల పెట్టుబడితో  నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు కేంద్రం ఆమోదం తెలిపిందని సర్వే పేర్కొంది. దీనివల్ల  దీని ఫలితంగా 2050 నాటికి 3.6 గిగా టన్నుల మేరకు కార్బన్  ఉద్గారాలు తగ్గుతాయి.
సుస్థిర అభివృద్ధి సాధనకు ఆర్థిక సహకారం  
వాతావరణ కార్యాచరణ లక్ష్యాలను సాధించే అంశంలో నిధులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం గుర్తించింది. నిధుల సమీకరణ కోసం ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించిందని సర్వే పేర్కొంది. 
1. గ్రీన్ బాండ్స్
 ఆర్థిక వ్యవస్థపై  కర్బన ఉద్గారాల తీవ్రతను తగ్గించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ రంగ ప్రాజెక్టులలో పెట్టుబడులను   పెట్టుబడిదారుల నుంచి సేకరించడానికి ప్రభుత్వం సావరిన్ గ్రీన్ బాండ్ల పథకానికి నాంది  పలికింది. ప్రభుత్వ రంగ ప్రాజెక్టులకు  అవసరమైన నిధులు సేకరించడానికి ఈ పథకం  సహాయపడుతుంది. ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్ అసోసియేషన్ (ఐసీఎంఏ) గ్రీన్ బాండ్ ప్రిన్సిపల్స్ (2021)కు అనుగుణంగా గ్రీన్ బాండ్స్  జారీ చేసినట్లు సర్వే పేర్కొంది. సావరిన్ గ్రీన్ బాండ్ల జారీ పై కీలక నిర్ణయాలు పర్యవేక్షించడానికి, ధృవీకరించడానికి గ్రీన్ ఫైనాన్స్ వర్కింగ్ కమిటీ ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.16,000 కోట్లతో సావరిన్ గ్రీన్ బాండ్ల జారీ చేయడానికి  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చేసింది.
2. బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్ట్ (బీఆర్ఎస్ఆర్) 
బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్ట్ (బీఆర్ఎస్ఆర్) కింద సెబీ కొత్త సస్టైనబిలిటీ రిపోర్టింగ్ మార్గదర్శకాలు జారీ చేసింది. 'బాధ్యతాయుత వ్యాపార ప్రవర్తన జాతీయ మార్గదర్శకాలు' లో  పొందుపరిచిన నిబంధనలకు  అనుగుణంగా పరిమాణాత్మక కొలమానాలతో మరింత విస్తృతంగా అమలు  2022-23 నుంచి   మొదటి 1000  సంస్థలకు (మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం) బీఆర్ఎస్ఆర్ దాఖలును  తప్పనిసరి చేసినట్లు సర్వే పేర్కొంది.
కాప్ 27 లో భారత్
2030 నాటికి శిలాజేతర ఇంధనాల నుంచి స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని 50 శాతానికి పెంచడం ద్వారా భారతదేశం తన జాతీయంగా నిర్ణయించిన ప్రమాణాలను  (ఎన్డిసి) సవరించింది. ఇంధన భద్రతకు సంబంధించి జాతీయ వనరులను హేతుబద్ధంగా వినియోగించుకోవడంపై దృష్టి సారించిన భారతదేశం  దీర్ఘ కాలంలో తక్కువ కార్బన్ అభివృద్ధి వ్యూహం (ఎల్టి-ఎల్ఇడిఎస్) సిద్ధం చేసిందని  సర్వే పేర్కొంది. పర్యావరణహిత జీవనశైలి (లైఫ్) విధానానికి అనుగుణంగా  ఈ వ్యూహం అమలు జరుగుతుంది. అనాలోచితంగా , వినాశకరమైన విధంగా కాకుండా సహజ వనరుల వినియోగం సక్రమంగా అవసరాల మేరకు జరగాలి అన్ని ప్రపపంచవ్యాప్తంగా అమలు జరుగుతున్న విధానాలకు అనుగుణంగా భారతదేశం రూపొందించిన ప్రణాళిక అమలు జరుగుతుంది అని  సర్వే నివేదిక వివరించింది.  
 పర్యావరణ సమస్యలకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు:

అడవులు, వన్యప్రాణుల రంగంలో సమన్వయం, సహకారాన్ని బలోపేతం చేయడానికి, పెంపొందించడానికి జీవవైవిధ్య పరిరక్షణకు భారత్, నేపాల్ 2022 ఆగస్టు లో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి.
2022 లక్ష్యానికి నాలుగేళ్ల ముందే అంటే 2018లో పులుల సంఖ్యను రెట్టింపు చేయడంలో భారత్ విజయం సాధించిందని  సర్వే నివేదిక వెల్లడించింది. ఆసియా జాతి  సింహాల జనాభా కూడా స్థిరమైన పెరుగుదలను చూపించింది, 2020 లో దేశంలో  674 సింహాలు ఉన్నాయి. దేశంలో 2015 లో దేశంలో 523 సింహాలు ఉండేవి. 
సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి కొత్త బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, 2022, మరియు ఇ-వేస్ట్ (మేనేజ్మెంట్) రూల్స్, 2022 ను కేంద్రం విడుదల చేసింది. 

***



(Release ID: 1895083) Visitor Counter : 623