ప్రధాన మంత్రి కార్యాలయం

న్యూఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ఇంటర్ పోల్ 90వ జనరల్ అసెంబ్లీ ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


స్థానిక సంక్షేమం కోసం ప్రపంచ వ్యాప్త సహకారానికి మా ఆహ్వానం

మన దగ్గర లేని దానిని సాధించుకోవడం, మన దగ్గర ఉన్న దానిని కాపాడుకోవడం, మనం పరిరక్షించిన వాటిని పెంచుకోవడం, మరియు వాటిని అత్యంత పాత్రత కలిగిన వర్గాలకు పంపిణీ చేయడంలో చట్టం అమలు అనేది తోడ్పడుతుంది

మన పోలీసు బలగాలు ప్రజలను కాపాడటం ఒక్కటే కాకుండా మన ప్రజాస్వామ్యానికి సేవను కూడా అందిస్తాయి

ఎప్పుడైతే బెదిరింపులు అనేది ప్రపంచ వ్యాప్తం అయ్యాయో వాటి పట్ల ప్రతిక్రియ అనేది కేవలం స్థానికంగా ఉండజాలదు. ఈ బెదిరింపులను అణచివేయడం కోసం ప్రపంచం కలసి కట్టుగా ముందంజ వేయవలసిన అవసరం ఉంది

భద్రమయిన ఆశ్రయాలను మటుమాయం చేయడం కోసం అంతర్జాతీయ సముదాయం మరింత శీఘ్రంగా కృషి చేసి తీరాలి

సమాచార సేకరణ, సహకారం, మరియు సమన్వయం ఇలా అండదండలతో నేరం, అవినీతి, ఇంకా ఉగ్రవాదాలను పరాజయం పాలు చేద్దాం

Posted On: 18 OCT 2022 3:52PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో 90వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు.

సభికులను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ 90వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ న్యూఢిల్లీలో జరుగుతున్న సందర్భంలో ఆ కార్యక్రమానికి విచ్చేసిన ఉన్నతాధికారులందరికి స్నేహపూర్వక స్వాగతవచనాలను పలికారు. భారతదేశం తన స్వాతంత్ర్యం యొక్క75 సంవత్సరాల వేడుకను జరుపుకుంటోందని ఇది ప్రజల మరియు సంస్కృతులకు సంబంధించిన ఒక మహోత్సవమని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రకటించారు. ఇంటర్ పోల్ 2023వ సంవత్సరంలో తన స్థాపనానంతర శతాబ్ధి ఘట్టాన్ని జరుపుకోనుందని కూడా ప్రధానమంత్రి తెలిపారు. ఇది సింహావలోకనానికి సంబంధించిన కాలం అని అంతేకాకుండా భవిష్యత్తును నిర్ణయించుకోవలసినటువంటి కాలం కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది సంతోషంగా ఉంటూ సాధించిన విజయాలను ఒకసారి స్ఫురణకు తెచ్చుకొని పరాజయాల నుండి నేర్చుకోవడంతో పాటు భవిష్యత్తు కేసి ఆశతో చూసేందుకు కూడా ఒక ఘనమయిన కాలం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఇంటర్ పోల్ పని విధానానికి భారతదేశం యొక్క సంస్కృతికి మధ్య గల బంధాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెబుతూ ఒక పదిలమైన ప్రపంచం తో పోలీస్ విభాగాన్ని సంధానించాలి అని ఇంటర్ పోల్ పెట్టుకొన్న ధ్యేయానికి అలాగే ‘ఆనో భద్ర క్రతవో యంతు విశ్వతహ:’ అని చెబుతున్న వేదాలలోని ఒక సూక్తి ఈ మధ్య గల పోలికను ఆయన గుర్తుకు తెచ్చారు. ఈ సూక్తికి పవిత్రమయిన ఆలోచనలు అన్ని దిక్కుల నుంచి రానిద్దాం అనేది భావం అని ఆయన అన్నారు. ప్రపంచాన్ని ఒక ఉత్తమమైనటువంటి ప్రదేశంగా తీర్చి దిద్దడం కోసం అన్ని వర్గాలు సహకరించుకోవాలి అనేదే దీని సారాంశం అని ఆయన వివరించారు. భారతదేశం అనుసరిస్తున్నటువంటి విశిష్టమయిన ప్రపంచ దృక్పథం గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ సాహసం మూర్తీభవించిన పురుషులను మరియు మహిళలను ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్య కలాపాల నిర్వహణకు పంపుతున్న అగ్రగామి దేశాలలో భారతదేశం ఒకటిగా ఉన్న సంగతిని ప్రముఖంగా ప్రస్థావించారు. మేము భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించుకోవడానికి పూర్వమే ప్రపంచాన్ని ఒక మెరుగైన స్థలంగా మార్చడానికి త్యాగాలను చేశాం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వేలకొద్ది భారతీయులు ప్రపంచ యుద్ధాలలో వారి ప్రాణాలను సమర్పణం చేశారు. అని కూడా ఆయన అన్నారు. కోవిడ్ టీకా మందు మరియు జల వాయు సంబంధి లక్ష్యాలను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ భారతదేశం ఏ విధమయిన సంకటంలో అయినా సరే ముందు వరుసలో నిలబడటానికి సుముఖతను వ్యక్తం చేసింది అని వెల్లడించారు. దేశాలు, మరియు సమాజాలు అంతర్ముఖంగా మారుతున్న కాలంలో భారతదేశం మరింతగా అంతర్జాతీయ సహకారం అనేది అవసరం అని పిలుపును ఇస్తోంది. స్థానిక సంక్షేమానికి ప్రపంచ వ్యాప్తంగా సహకారం ముఖ్యం అనేదే నేను ఇచ్చే పిలుపుగా ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రపంచం అంతటా విధి నిర్వహణలో ఉన్న పోలీసు బలగాలు ప్రజలను పరిరక్షించడం మాత్రమే కాకుండా సామాజిక సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకుపోతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. వారు ఏదయినా సంకటం ఎదురయినపుడు సమాజం నుండి వచ్చే ప్రతిస్పందన పరంగా ముందు వరుసలో నిలబడుతున్నారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. కోవిడ్ సంక్షోభం తాలూకు ఉదాహరణ ను ఆయన పేర్కొంటూ, ప్రజలను కాపాడడం కోసం పోలీసు సిబ్బంది వారి సొంత ప్రాణాలను ఫణంగా పెట్టారు అని తెలియజేశారు. వారిలో చాలా మంది ప్రజలకు సేవ చేయడం కోసం అంతిమ త్యాగానికి కూడా ఒడిగట్టారు అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి భారతదేశం యొక్క భౌగోళిక మరియు సాంస్కృతిక భిన్నత్వాన్ని గురించి స్పష్టం చేస్తూ భారతదేశం యొక్క విశాలత్వాన్ని గురించి ప్రస్థావించారు. సమాఖ్య స్థాయిలో రాష్ట్రాల స్థాయిలో 900 లకు పై చిలుకు జాతీయ చట్టాలను మరియు దాదాపుగా పదివేల సంఖ్యలో ఉన్న రాష్ట్ర చట్టాలను అమలు పరచడం కోసం భారతదేశ పోలీస్ దళం సహకరించుకుంటున్న సంగతిని ఆయన ప్రస్థావించారు. రాజ్యాంగం వాగ్దానం చేసినటువంటి ప్రజా హక్కులను మరియు భిన్నత్వాన్ని గౌరవిస్తూనే మా పోలీసు బలగాలు విధులను నిర్వహిస్తున్నాయి. వారు ప్రజలను రక్షించడం ఒక్కటే కాకుండా మా ప్రజాస్వామ్యానికి సేవలను కూడా అందిస్తున్నారు అని ఆయన అన్నారు. ఇంటర్ పోల్ యొక్క కార్యసాధనలను గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఇంటర్ పోల్ ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాలకు చెందిన పోలీస్ సంస్థలను గత 99 సంవత్సరాలుగా సంధానించింది. మరి ఈ వైభవోపేతమైనటువంటి సందర్భానికి గుర్తుగా భారతప్రభుత్వం ఒక స్మారక స్టాంపును మరియు నాణేన్ని విడుదల చేస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రపంచం ఉగ్రవాదం, అవినీతి మత్తు పదార్థాల అక్రమ తరలింపు, అతిక్రమణలు మరియు వ్యవస్థీకృత నేరాల వంటి నష్టదాయక ప్రపంచ వ్యాప్త బెదిరింపులను అనేకంగా ఎదుర్కొంటోందని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ఈ అపాయాలలో సంభవిస్తున్న మార్పుయొక్క గతి ఇది వరకటి కంటే వేగవంతం అయిపోయింది. బెదిరింపులు అనేవి విశ్వవ్యాప్తంగా మారితే ప్రతి క్రియ కేవలం స్థానికంగా ఉండజాలదు. ఈ విధమయిన బెదిరింపులను పరాజయం పాలు చేయడం కోసం ప్రపంచం కలిసి కట్టుగా ముందడుగు వేయవలసి ఉంది అని ఆయన అన్నారు.

దేశాంతర ఉగ్రవాదం యొక్క కీడులను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ భారతదేశం దీనితో అనేక దశాబ్దాలుగా పోరాడుతూ వచ్చింది. ఈ సంగతిని ప్రభుత్వం, ప్రపంచం గుర్తించేకన్నా ముందునుండే ఈ పోరాటం సాగుతోంది అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భద్రత మరియు సురక్షణ యొక్క మూల్యం ఏమిటి అనేది మాకు ఎరికే మా ప్రజలు వేల సంఖ్యలో ఈ సమరంలో అంతిమ త్యాగానికి నడుం కట్టారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదంతో దానియొక్క భౌతిక రూపంలో మాత్రమే కాకుండా ఆన్లైన్ లో సైతం ఎదుర్కోవలసి వస్తున్నది అని ప్రధాన మంత్రి వివరించారు. ఒక దాడిని అమలుపరచడం గానీ, లేదా ఒక బటన్ ను క్లిక్ చేసినంత మాత్రాననే వ్యవస్థలను దాసోహం చేసుకొనే పరిస్థితి ఉందని ప్రధానమంత్రి వివరించారు. అంతర్జాతీయ వ్యూహాలకు మరింతగా పదునుపెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధానమంత్రి పునరుద్ఘాటిస్తూ ప్రతి దేశం వాటికి వ్యతిరేకంగా అమలుపరిచే వ్యూహాలపై కృషి చేస్తోంది. అయితే మనం మన సరిహద్దుల లోపల ఏమి చేస్తున్నాము అనేది ఇక మీదట సరిపోనే సరిపోదు అని వివరించారు. ముందస్తు గుర్తింపు మరియు హెచ్చరిక వ్యవస్థల ఏర్పాటు, రవాణా సేవలను కాపాడుకోవడం, సమాచార ప్రసార సంబంధి మౌలిక సదుపాయాలకు సురక్షణ అందజేయడం, కీలకైమన మౌలిక సదుపాయాలకు సురక్ష, సాంకేతిక పరమైన మరియు సాంకేతిక విజ్ఞానపరమైన సహాయం, రహస్య సమాచారం పరస్పర మార్పుని మరియు అనేక ఇతర అంశాలను ఒక కొత్త స్థాయికి తీసుకుపోవలసి ఉంది అని కూడా ఆయన సూచించారు.

అవినీతి తాలూకు అపాయాలను గురించి ప్రధానమంత్రి అనేక అంశాలను ప్రస్థావించారు. అవినీతి మరియు ఆర్థిక నేరాలు అనేవి చాలా దేశాలలో పౌరుల సంక్షేమానికి హాని చేశాయి అని ఆయన అన్నారు. అవినీతి పరులు నేరం ద్వారా పోగేసుకొన్న సొమ్మును ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాలలో అట్టిపెట్టుకోవడానికి ఒక మార్గాన్ని వెదకుతారు. ఈ డబ్బు వారు కాజేసిన దేశం యొక్క ప్రజలది అని ఆయన అన్నారు. చాలా సందర్భాలలో దీనిని ప్రపంచంలోని అతి నిరుపేద ప్రజలలో కొన్ని వర్గాల నుండి లాగేసుకోవడం జరిగింది. పైపెచ్చు ఈ ధనాన్ని హానికారకమైన రీతిలో వినియోగించడం జరిగింది అని ఆయన అన్నారు.

భద్రమయిన ఆశ్రయాలను తుదముట్టించేందుకు ప్రపంచ సముదాయం మరింత వేగంగా పాటుపడవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. అవినీతి పరులకు, ఉగ్రవాదులకు, మత్తు పదార్థాల కూటములకు, అతిక్రమణల ముఠాలకు లేదా వ్యవస్థీకృత నేరానికి భద్రమయిన జాగాలు అంటూ ఉండకూడదు. ప్రజలకు వ్యతిరేకంగా చేసే ఆ తరహా నేరాలు ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా, మానవ జాతికి వ్యతిరేకంగా చేసే నేరాలే అవుతాయి అని ఆయన అన్నారు. పోలీసులు మరియు చట్టాన్ని అమలు పరిచే సంస్థలు సహకారాన్ని పెంపొందింపచేసుకోవడానికి విధివిధానాలను మరియు ఒడంబడికల ప్రాథమిక పత్రాలను రూపొందించుకోవలసిన అవసరం ఉంది. పరారీలో ఉన్న అపరాధుల కోసం రెడ్ కార్నర్ నోటీసులను సత్వరం జారీ చేయడం ద్వారా ఇంటర్ పోల్ సాయపడగలుగుతుంది అని ప్రధానమంత్రి అన్నారు. ఒక పదిలమైనటువంటి మరియు సురక్షితమైనటువంటి ప్రపంచం అనేది మన ఉమ్మడి బాధ్యత. మంచికి ప్రతీకలుగా ఉన్న శక్తులు సహకరించుకొన్నప్పుడు నేర సంబంధిత శక్తులు మనజాలవు అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.


ఉన్నతాధికారులు అందరూ న్యూఢిల్లీలోని జాతీయ పోలీస్ స్మారకాన్ని మరియు జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించే ఆలోచన చేయాలని మరి భారతదేశాన్ని సురక్షితంగా నిలబెట్టడం కోసం ప్రాణాలను త్యాగం చేసినటువంటి వీరులకు శ్రద్దాంజలిని ఘటించాలని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. 90వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ నేరాలు, అవినీతి, మరియు ఉగ్రవాదం లను ఎదురించి పోరాడడంలో ఒక ప్రభావశీలమయినటువంటి మరియు ఫలప్రదమయినటువంటి వేదికగా నిరూపించుకొంటుందన్న ఆశాభావాన్ని సైతం ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. సమాచార ప్రసారం, సమన్వయం, మరియు సహకారం అనేది నేరం, అవినీతి, ఇంకా ఉగ్రవాదాలను ఓడించేటట్లు చూద్దాం అని చెబుతూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

ప్రధానమంత్రి సభా స్థలికి చేరుకున్నప్పుడు ఇంటర్ పోల్ ప్రెసిడెంట్ ఆయనను కార్యనిర్వాహక సంఘానికి పరిచయం చేశారు. తరువాత ప్రధానమంత్రి ఒక సమూహ ఛాయా చిత్రంలో పాలుపంచుకొన్నారు. ఇంటర్ పోల్ సెంటినరీ స్టాండ్ ను ఆయన తిలకించారు. తదనంతరం ప్రధాన మంత్రి నేషనల్ పోలీస్ హెరిటేజ్ డిస్ ప్లే ను రిబ్బను కత్తింరించి ప్రారంభించారు. ఆ ప్రదేశం అంతటా ఆయన కలియ తిరిగారు.

ప్రధానమంత్రి వేదిక మీదకు చేరుకోవడంతోనే ఐటిబీపి దళం ద్వారా ఒక కవాతు జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంట్రెన్స్ ఆఫ్ ది కలర్స్ అనే పేరును పెట్టారు. ఆ తరువాత భారతదేశం జాతీయ గీతాన్ని మరియు ఇంటర్ పోల్ గీతాన్ని ఆలాపించడమైంది. ఇంటర్ పోల్ అధ్యక్షుడు ఒక బోన్సాయ్ మొక్క ను ప్రధాన మంత్రి కి కానుక గా ఇచ్చారు. ఆ తరువాత ప్రధాన మంత్రి ఇంటర్ పోల్ 90వ జనరల్ అసెంబ్లీకి గుర్తుగా ఒక స్మారక తపాలా బిళ్ళను మరియు 100 రూపాయల నాణేన్ని విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ శాహ్, ఇంటర్ పోల్ అధ్యక్షుడు శ్రీ అహ్మద్ నాసర్ అల్ రయీసీ, ఇంటర్ పోల్ సెక్రటరీ జనరల్ శ్రీ జర్గెన్ స్టాక్, మరియు సీబీఐ డైరెక్టర్ శ్రీ సుబోధ్ కుమార్ జైశ్వాల్ పాల్గొన్నారు.

పూర్వరంగం

ఇంటర్ పోల్ యొక్క 90వ జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 18వ తేదీ మొదలుకొని అక్టోబర్ 21వ తేదీ వరకు జరుగుతున్నది. ఈ సమావేశానికి 195 ఇంటర్ పోల్ సభ్యత్వ దేశాల నుండి ప్రతినిధులు హాజరు అవుతున్నారు. వారిలో మంత్రులు, ఆయా దేశాల పోలీస్ ఉన్నతాధికారులు, నేషనల్ సెంట్రల్ బ్యూరో ల అధిపతులు మరియు సీనియర్ పోలీస్ అధికారులు ఉంటారు. జనరల్ అసెంబ్లీ అనేది ఇంటర్ పోల్ లోని సర్వోన్నత పాలక మండలి ఇంటర్ పోల్ పనితీరుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాల ను తీసుకోవడం కోసం ఈ జనరల్ అసెంబ్లీ సంవత్సరం లో ఒకసారి సమావేశం అవుతుంటుంది.

భారతదేశం లో సుమారు 25 సంవత్సరాల అంతరం తరువాత ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశం జరుగుతున్నది. కడపటిసారి ఈ సమావేశం 1997వ సంవత్సరంలో జరిగింది. భారతదేశాని కి స్వాతంత్ర్యం వచ్చి 2022లో 75వ సంవత్సరం అయినందువల్ల ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీకి ఆతిథేయిగా ఉండే ప్రతిపాదన రాగా ఆ ప్రతిపాదనను జనరల్ అసెంబ్లీ భారీ మెజారిటీ తో ఆమోదించింది. ఈ కార్యక్రమం భారతదేశం యొక్క శాంతి భద్రతల వ్యవస్థలోని అత్యుత్తమ అభ్యాసాలను యావత్తు ప్రపంచం ఎదుట చాటిచెప్పేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నది.


*****

DS/TS

 

 

 



(Release ID: 1869084) Visitor Counter : 176