ప్రధాన మంత్రి కార్యాలయం

దేశంలో ఐదో తరం (5జి) సేవలకు ప్రధానమంత్రి శ్రీకారం 6వ ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’ను ప్రారంభించిన ప్రధానమంత్రి;


“5జి అంటే- దేశం తలుపు తడుతున్న కొత్త శకం...
5జి అంటే- అనంతాకాశం వంటి అవకాశాల పునాది”;

“నవ భారతదేశం కేవలం సాంకేతికత వినియోగదారుగా మిగిలిపోదు...
సాంకేతికత అభివృద్ధి.. అనుసరణలో క్రియాశీల పాత్రనూ పోషిస్తుంది”;

“5జితో భారత్‌ తొలిసారి టెలికాం సాంకేతికతలో ప్రపంచ ప్రమాణాలను నిర్దేశిస్తోంది”;

“దేశం నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతి 2014లో శూన్యం... నేడు
వేలకోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఎగుమతిదారుగా మారాం”;

“దేశంలోని సామాన్యుల అవగాహన.. జ్ఞానం.. శోధనాత్మక
మేధస్సుపై నాకు ఎప్పుడూ పూర్తి విశ్వాసం ఉంది”;

“చిన్న వ్యాపారులు.. వ్యాపారవేత్తలు.. స్థానిక హస్తకళాకారులు..
చేతివృత్తుల వారికి డిజిటల్ భారతం ఒక వేదికను ఏర్పరచింది”;

“5జి సాంకేతికత వేగవంతమైన ఇంటర్నెట్ లభ్యతకు మాత్రమే
పరిమితం కాదు.. జీవితాలనే తీర్చిదిద్దగల సామర్థ్యం దానికుంది”

Posted On: 01 OCT 2022 1:08PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సరికొత్త సాంకేతిక శకానికి నాంది పలుకుతూ 5జి (ఐదో తరం) టెలికాం సేవలకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు 6వ ‘ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌’ను కూడా ప్రారంభించిన ప్రధాని, దీనికి అనుబంధంగా ఏర్పాటు చేసిన ‘ఐఎంసి’ ప్రదర్శనను తిలకించారు. ఈ చారిత్రక సందర్భంగా పారిశ్రామిక దిగ్గజాలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

   రిలయన్స్‌ చైర్మన్‌ శ్రీ ముకేష్‌ అంబానీ మాట్లాడుతూ- భారత్‌ను 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశాన్ని ఈ లక్ష్యం వైపు నడిపించడంలో ప్రభుత్వం తాను చేపట్టే ప్రతి చర్యను, ప్రతి విధానాన్ని ఎంతో నేర్పుతో రూపొందిస్తోంది. ఇందులో భాగంగా భారతదేశాన్ని 5జి శకంలోకి వేగంగా తీసుకెళ్లడంలో ప్రధానమంత్రి తీసుకున్న చర్యలు ఆయన దృఢ సంకల్పానికి నిదర్శనాలు” అని ఆయన కొనియాడారు. విద్య, విజ్ఞానం, వాతావరణం వంటి కీలక రంగాల్లో 5జి సాంకేతికతకుగల అవకాశాలను ఆయన వివరించారు. “మీ నాయకత్వం భారతదేశ కీర్తిని, ప్రతిష్టను, శక్తిని మునుపెన్నడూ లేనంతగా ప్రపంచవ్యాప్తం చేసింది. వేగంగా మారిపోతున్న నేటి ప్రపంచంలో పునరుత్థాన భారతం అగ్రస్థానంలోకి దూసుకెళ్లడాన్ని అడ్డుకోగల శక్తి ఏదీ లేదు” అని శ్రీ అంబానీ తన ప్రసంగం ముగించారు.

   భారతి ఎంటర్‌ప్రైజ్ చైర్మన్ శ్రీ సునీల్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ- 5జి ప్రారంభం కొత్త శకానికి నాంది అన్నారు. అందునా ఇది స్వాతంత్ర్య అమృత మహోత్సవ వేళ కావడం వల్ల మరింత ప్రత్యేకత సంతరించుకున్నదని చెప్పారు. “ప్రధానమంత్రి కృషితో దేశంలో ఇది కొత్త శక్తిని నింపుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యంత సూక్ష్మంగా అర్థం చేసుకుంటూ సాటిలేని రీతిలో దాన్ని దేశాభివృద్ధికి వినియోగించే నాయకుడు ప్రధానమంత్రి కావడం మన అదృష్టం” అని కొనియాడారు. శ్రీ మిట్టల్ తన ప్రసంగం కొనసాగిస్తూ- ఇది ప్రజలకు... ముఖ్యంగా మన గ్రామీణ ప్రజానీకానికి అపార అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులనుంచీ మౌలిక సదుపాయాలు, సాంకేతికత రంగంలో ప్రధానమంత్రి చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. మహమ్మారి సమయంలో గ్రామాలు, ఇళ్లవైపు దిశ మారిందని, అయినప్పటికీ దేశం గుండె చప్పుడు క్షణం కూడా ఆగలేదని ఆయన అన్నారు. ఇదంతా డిజిటల్‌ దార్శనికత ఘనతేనని పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనిక కార్యక్రమంలోని సాహసంతోపాటు దాని విజయాన్ని కూడా ఆయన ప్రశంసించారు. “డిజిటల్ భారతంతోపాటు స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి ముందుకు నడిపించారు. ఫలితంగా అనతి కాలంలోనే భారతదేశం యూనికార్న్‌ల ఆవిర్భావ గమ్యంగా మారింది” అని శ్రీ మిట్టల్ వివరించారు. “ఇక 5జి ఆగమనంతో మన దేశం కచ్చితంగా మరిన్ని ప్రపంచ యూనికార్న్‌ సంస్థలను జోడించగలదని నేను భావిస్తున్నాను” అన్నారు.

   దిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ శ్రీ కుమార మంగళం బిర్లా ప్రసంగిస్తూ- 5జి ఆగమనాన్ని ప్రపంచ వేదికపై భారత శక్తిసామర్థ్యాలను రుజువుచేసే పరివర్తనాత్మక సంఘటనగా పేర్కొన్నారు. భారతదేశ వృద్ధికి పునాదిగా టెలికాం సాంకేతిక పరిజ్ఞాన పాత్ర కీలకమైనదని ఆయన పునరుద్ఘాటించారు. ప్రపంచ వేదికపై భారతదేశం తనదైన ముద్రవేసే విధంగా సాంకేతికతను ఒక తరం మేర ముందడుగు వేయించడంలో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు, ఆయన నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మహమ్మారి సమయంలో టెలికాం పరిశ్రమకు మద్దతివ్వడంలో, పరిశ్రమకు మార్గనిర్దేశం చేసే టెలికాం సంస్కరణలు తేవడంలో స్ఫూర్తిదాయక పాత్ర పోషించారంటూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ 5జి ప్రారంభాన్ని భారతదేశ ఉత్తేజకర ప్రగతి పయనానికి నాందిగా శ్రీ బిర్లా అభివర్ణించారు. “మనం ఇకపై 5జి అభివృద్ధికి అపరిమిత సామర్థ్యాన్ని చూస్తాం... ఈ దృష్టాంతాలను రాబోయే ఏళ్లలోనూ వినియోగించుకుంటాం” అని ఆయన వ్యాఖ్యానించారు.

   దేశంలోని మూడు ప్రధాన టెలికం సేవల సంస్థలు 5జి సాంకేతికత సామర్థ్యాన్ని వెల్లడించే మూడు ప్రయోగాత్మక అంశాలను ప్రధానమంత్రి సమక్షంలో ‌ప్రదర్శించాయి. ఇందులో భాగంగా ‘రిలయన్స్‌ జియో’ మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిసా రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లోగల విద్యార్థులతో ముంబైలోని ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని అనుసంధానించి చూపింది. భౌతికంగా, భౌగోళికంగా సుదూరంలో ఉన్నప్పటికీ విద్యార్థులకు ఉపాధ్యాయులను చేరువ చేయడం ద్వారా విద్యారంగానికి తోడ్పాటులో 5జి సామర్థ్యం ఎంతటిదో ఈ ప్రయోగంతో రుజువైంది. అంతేకాకుండా అనుబంధ వాస్తవికత (ఏఆర్‌) శక్తి కూడా ఒక తెరపై ప్రదర్శించబడింది. దేశవ్యాప్తంగాగల పిల్లలకు ‘ఏఆర్‌’ పరికరంతో అవసరం లేకుండానే రిమోట్‌ పద్ధతిలో బోధనకు ఇదెలా ఉపయోగపడుతుందో కూడా దీంతో స్పష్టమైంది.

   సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే సమక్షంలో మహారాష్ట్రలోని రాయగఢ్‌లోగల జ్ఞానజ్యోతి సావిత్రీబాయి ఫూలే పాఠశాల విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషించారు. అలాగే గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని రోప్డా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ సమక్షంలో ప్రధానితో ముచ్చటించారు. అదేవిధంగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సమక్షంలో ఆ రాష్ట్రంలోని  మయూర్‌భంజ్‌లోగల ‘ఎస్‌ఎల్‌ఎస్‌’ స్మారక పాఠశాల విద్యార్థులతోనూ ప్రధానమంత్రి మాట్లాడారు. మరోవైపు ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, బీకేసి, ముంబైకి చెందిన శ్రీ అభిమన్యు బసు 5జి సాంకేతికత ఉపయోగాన్ని ప్రదర్శనాత్మకంగా వివరించారు. విద్యలో సాంకేతికతపై విద్యార్థుల్లో పెల్లుబికిన ఉత్సాహాన్ని ప్రధానమంత్రి స్వయంగా గమనించారు. రచయిత అమిష్ త్రిపాఠీ ఈ విభాగాన్ని పరిచయం చేశారు.

   వోడాఫోన్ ఐడియా సంస్థ తనవంతుగా ఢిల్లీ మెట్రో సొరంగం నిర్మాణంలోని కార్మికుల భద్రతకు సంబంధించిన అంశాన్ని ‘డిజిటల్‌ ట్విన్‌’ సాంకేతికత ద్వారా వేదికపై సృష్టించి ప్రదర్శించింది. ఈ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కార్మికుల పని ప్రదేశాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ సుదూర నుంచి ఎప్పటికప్పుడు భద్రత హెచ్చరికలు జారీ చేయవచ్చు. ఈ పరిజ్ఞానాన్ని వేదిక పైనుంచే ప్రధానమంత్రి ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఇందులో భాగంగా కృత్రిమ మేధస్సు (ఏఐ), వాస్తవిక సాదృశ (వర్చువల్‌ రియాలిటీ) మాధ్యమాల సాయంతో కార్మికుల పనిని ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అంతేగాక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ సక్సేనా సమక్షంలో ఢిల్లీ మెట్రో టన్నెల్ ద్వారకలో పనిచేస్తున్న శ్రీ రింకు కుమార్‌తో ప్రధాని స్వయంగా సంభాషించారు. సాంకేతికత అనుసరణకు అవసరమైన వినియోగానుభవం,  అభ్యాస సాధ్యత గురించి ఆయన వాకబు చేశారు. భద్రతపై కార్మికులలో విశ్వాసం నింపడంలో కొత్త సాంకేతికత కీలక సహకారం అందిస్తుందన్నారు. దేశాభివృద్ధికి కృషి చేస్తున్న భారత కార్మిక శక్తిని ఈ సందర్భంగా ప్రధాని అభినందించారు.

   యిర్‌టెల్‌ సంస్థ ప్రదర్శనలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని దన్‌కౌర్‌లోగల విద్యార్థులు వర్చువల్ (విఆర్‌), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్‌) పరిజ్ఞానాలద్వారా బోధనలో లీనమై, సౌర వ్యవస్థ గురించి తెలుసుకోవడం ద్వారా అభ్యాసంలో ప్రత్యక్ష అనుభవం పొందారు. వారిలో ఒక విద్యార్థి ఖుషీ, హోలోగ్రామ్ ద్వారా ఢిల్లీలోని వేదికపై కనిపిస్తూ- ఈ పరిజ్ఞానంతో విద్యాభ్యాసంపై తన అనుభవాన్ని ప్రధానితో పంచుకుంది. అలాగే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ నుంచి విద్యార్థులతో సంధానమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో ప్రధాని ఆమెతో ముచ్చటించారు. పాఠ్యాంశాలను చక్కగా అర్థం చేసుకోవడంలో ‘విఆర్‌’ అనుభవం ఎలా తోడ్పడిందో వాకబు చేశారు. దీనిపై స్పందిస్తూ- ఈ అనుభవంతో కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి తనలో మరింత పెరిగిందని ఆ బాలిక తెలిపింది.

   నంతరం ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- నేటి కార్యక్రమం ప్రపంచ స్థాయి సదస్సు అయినప్పటికీ దీని పర్యవసానాలు, దిశ స్థానికంగానే ఉంటాయన్నారు. వేగంగా పురోగమిస్తున్న 21వ శతాబ్దపు భారతదేశానికి ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు. “నేడు 130 కోట్ల మంది భారతీయులు దేశం నుంచి, దేశంలోని టెలికాం పరిశ్రమ నుంచి 5జి రూపంలో అద్భుతమైన బహుమతిని అందుకుంటున్నారు. 5జి అంటే- దేశం తలుపు తడుతున్న కొత్త శకం... 5జి అంటే- అనంతాకాశం వంటి అవకాశాల పునాది. దీనిపై ప్రతి భారతీయుడినీ నేను అభినందిస్తున్నాను” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇవాళ 5జి ప్రారంభం, సాంకేతికత ముందడుగులో గ్రామీణ ప్రాంతాలు, కార్మికులు కూడా సమాన భాగస్వాములుగా ఉండటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

   దో తరం సాంకేతిక ప్రారంభంపై మరో సందేశమిస్తూ- “నవ భారతం కేవలం సాంకేతికత వినియోగదారుగా మిగిలిపోదు... ఈ సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి, అనుసరణలోనూ క్రియాశీల పాత్ర పోషిస్తుంది. అలాగే భవిష్యత్‌ తంత్రీరహిత (వైర్‌లెస్‌) పరిజ్ఞానం రూపకల్పన, తయారీలోనూ ప్రధాన సూత్రధారి కాగలదు” అని ప్రధానమంత్రి ఆత్మవిశ్వాసం ప్రకటించారు. భారతదేశం 2జి, 3జి, 4జి సాంకేతిక పరిజ్ఞానాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వచ్చిందని ప్రధాని గుర్తుచేశారు. అయితే 5జి ద్వారా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. “5జితో భారత్‌ తొలిసారి టెలికాం సాంకేతికతలో ప్రపంచ ప్రమాణాలను నిర్దేశిస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక డిజిటల్‌ భారతం కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ- దీన్నొక ప్రభుత్వ పథకంగా మాత్రమే కొందరు భావిస్తున్నారని ప్రధాని అన్నారు. కానీ, “డిజిటల్‌ భారతం అన్నది కేవలం ఓ పేరు కాదు.. దేశాభివృద్ధికి అదొక విశాల దార్శనిక దృక్పథం. ప్రజల కోసం... ప్రజలతో అనుసంధానమై పనిచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు చేరువచేయడమే ఈ దార్శనిక దృక్పథం లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు.

   డిజిట‌ల్ ఇండియాకు స‌మ‌గ్ర దృక్ప‌థం అవ‌శ్యమని ప్ర‌ధానమంత్రి స్పష్టం చేశారు. “మేం  ఏకకాలంలోనే నాలుగు దిశ‌ల‌లో 4 లక్ష్యాలపై దృష్టి సారించాం. మొదటిది.. పరికరం ధర; రెండోది.. డిజిటల్ అనుసంధానం; మూడోది.. డేటాపై ధర; నాలుగోది-కీలకమైనది... ‘డిజిటల్ ఫస్ట్’ యోచన” అని ఆయన వివరించారు. వీటిలో మొదటి లక్ష్యం విషయానికొస్తే- స్వావలంబన ద్వారా మాత్రమే చౌకధరతో పరికరాల లభ్యత సాధ్యమని ప్రధాని చెప్పారు. ఎనిమిదేళ్ల కిందట దేశంలో కేవలం రెండే రెండు మొబైల్‌ ఫోన్‌ తయారీ పరిశ్రమలు ఉండేవని ఆయన గుర్తుచేశారు. అయితే, “ఈ సంఖ్య ఇప్పుడు 200 దాటింది” అని శ్రీ మోదీ ఉటంకించారు. అలాగే 2014లో దేశం నుంచి మొబైల్‌ ఫోన్ల ఎగుమతి శూన్యం కాగా, ఇవాళ రూ.వేలకోట్ల విలువైన మొబైల్‌ ఫోన్ల ఎగుమతిదారుగా భారత్‌ ఎదిగిందని ప్రధాని నొక్కిచెప్పారు. “ఈ కృషితో సహజంగానే పరికరం ధర ప్రభావితమైంది. ఇప్పుడు మనం తక్కువ ధరతో మరిన్ని ఫీచర్లను పొందడం కూడా ప్రారంభించాం” అన్నారు.

   క రెండో లక్ష్యమైన డిజిటల్‌ అనుసంధానం విషయానికొస్తే- దేశంలో 2014 నాటికి ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య 6 కోట్లు కాగా, నేడు 80 కోట్లకు పెరిగిందని ప్రధాని గుర్తుచేశారు. అలాగే 2014లో ఆప్టికల్‌ ఫైబర్‌ అనుసంధానిత పంచాయతీల సంఖ్య 100కన్నా తక్కువ కాగా, ఇప్పుడది 1.7 లక్షలకు పెరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో “ఇంటింటికీ విద్యుత్ సౌకర్యంపై కార్యక్రమం ప్రారంభించిన తరహాలో; ‘ఇంటింటికీ నీరు కార్యక్రమం’ ద్వారా ప్రతి ఒక్కరికీ పరిశుభ్ర, సరక్షిత నీరందించే లక్ష్యంతో పనిచేసిన తీరులో; ఉజ్వల పథకం ద్వారా నిరుపేదలకు వంటగ్యాస్ పంపిణీ చేసిన విధంగానే... ఇవాళ ‘అందరికీ ఇంటర్నెట్’ లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది” అని ఆయన చెప్పారు.

   అలాగే మూడో లక్ష్యమైన డేటా ఖర్చు విషయానికొస్తే- 4జి పరిజ్ఞానంపై పరిశ్రమకు విధానపరమైన మద్దతు లభించిన తరహాలోనే అనేక ప్రోత్సాహకాలు కల్పించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. తద్వారా డేటా ధర దిగిరావడంతోపాటు దేశంలో డేటా విప్లవం చోటుచేసుకున్నదని పేర్కొన్నారు. ఈ మూడు లక్ష్యాలు నెరవేరడంతో అన్నివైపులా బహుముఖ ప్రభావం స్పష్టమవుతున్నదని ఆయన చెప్పారు.

    నాలుగో లక్ష్యమైన ‘డిజిటల్‌ ఫస్ట్‌’ యోచన విషయానికొస్తే- అసలు ‘డిజిటల్‌’ అంటే ఏమిటో పేదలకు అర్థమవుతుందా? అని సంపన్న వర్గాల్లో కొందరు పెదవి విరిచారని, వారి సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేశారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అయితే, దేశంలోని సామాన్యుల అవగాహన, జ్ఞానం, శోధనాత్మక మేధస్సుపై తనకెప్పుడూ పూర్తి విశ్వాసం ఉందని ప్రధాని పేర్కొన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి దేశంలోని నిరుపేదలు సదా సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.

   డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రభుత్వ కృషిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ విషయంలో డిజిటల్ చెల్లింపులకు మార్గం సుగమం చేస్తూ ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. “ప్రభుత్వం స్వయంగా అనువర్తనం (యాప్) ద్వారా పౌర-కేంద్రక సేవా ప్రదానాన్ని ప్రోత్సహించింది. అటు రైతులు, ఇటు చిన్న వ్యాపారులు వంటివారు ఎవరైనప్పటికీ వారి రోజువారీ అవసరాలను యాప్ ద్వారా తీర్చడానికి మేమొక మార్గం చూపాం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. మహమ్మారి సమయంలో అనేక దేశాలు డిజిటల్‌ సేవల కొనసాగింపులో ఇబ్బంది పడినప్పటికీ డీబీటీ, విద్య, టీకాలుసహా ఆరోగ్య సేవలు, ఇంటి నుంచే పని వంటివి భారత్‌లో నిరంతరాయంగా కొనసాగడాన్ని ఆయన గుర్తుచేశారు.

   డిజిట‌ల్ ఇండియా ఒక వేదిక‌గా నిలవడంపై ప్ర‌ధానమంత్రి మాట్లాడుతూ- చిరు వ్యాపారులు.. వ్యాపారవేత్తలు.. స్థానిక హస్త కళాకారులు.. చేతివృత్తుల వారు ఇవాళ ప్రతి ఒక్కరికీ తమ ఉత్పత్తులను విక్రయించగలరని చెప్పారు. “ఈ రోజు మీరు స్థానిక మార్కెట్‌కి లేదా కూరగాయల మార్కెట్‌కి వెళ్లి చూడండి.. చిన్న వీధి వర్తకులు కూడా నగదు రూపంలో కాకుండా ‘యూపీఐ’ ద్వారానే లావాదేవీలు చేయాలని మీకు సూచిస్తారు” అని శ్రీ మోదీ వివరించారు. “ఒక సౌకర్యమంటూ అందుబాటులో ఉంటే దాన్ని వాడుకునే చొరవ కూడా వికసిస్తుంది” అనడానికి “ఇదే నిదర్శనం” అన్నారు. ప్రభుత్వ ఉద్దేశాలు స్వచ్ఛమైనవిగా ఉంటే పౌరులలోనూ మార్పు తథ్యమని ప్రధాని స్పష్టం చేశారు. “2జి, 5జి సాంకేతికతల విషయంలో కీలక వ్యత్యాసం ఇదే”నని ఆయన వ్యాఖ్యానించారు.

   భారతదేశంలో డేటా ఖర్చు కూడా ప్రపంచంలోనే అత్యల్పమని ప్రధాని అన్నారు. లోగడ ఒక్కో జీబీకి రూ.300 దాకా వెచ్చించాల్సి ఉండగా నేడు దాదాపు రూ.10కే లభిస్తోందని పేర్కొన్నారు. వినియోగదారు కేంద్రక ప్రభుత్వ కృషిని వివరిస్తూ- భారతదేశంలో డేటా ధర చాలా తక్కువని ప్రధాని వ్యాఖ్యానించారు. “దీనిపై మేం పెద్దగా డప్పు కొట్టుకోవడం, భారీ ప్రకటనలు ఇచ్చుకోవడం వంటివి చేయలేదన్న వాస్తవం అటుంచితే దేశ ప్రజలకు సౌకర్యం, జీవన సౌలభ్యం ఎలా పెంచాలనే అంశంపైనే మేం దృష్టి కేంద్రీకరించాం” అని ప్రధాని వివరించారు. “ప్రపంచంలో తొలి మూడు పారిశ్రామిక విప్లవాల నుంచి భారత్‌ ప్రయోజనం పొంది ఉండకపోవచ్చు. కానీ, 4వ పారిశ్రామిక విప్లవంలో సంపూర్ణ ప్రయోజనం పొందడమే కాకుండా వాస్తవానికి విప్లవాన్ని ముందుకు నడిపిస్తుందని నేను విశ్వసిస్తున్నాను” అని ఆయన అన్నారు.

   దో తరం (5జి) సాంకేతికత వినియోగం వేగవంతమైన ఇంటర్నెట్ లభ్యతకు మాత్రమే పరిమితం కాబోదని, జీవితాలనే తీర్చిదిద్దగల సామర్థ్యం దానికి ఉందని ప్రధాని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందించగల ప్రయోజనాలేమిటో మన జీవితకాలంలోనే సాకారం కాగలవని ఆయన చెప్పారు. దేశంలోని పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ ఈ కొత్త సాంకేతికతకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూలంకషంగా ఆవిష్కరించాల్సిందిగా టెలికాం పరిశ్రమ దిగ్గజాలను శ్రీ మోదీ కోరారు. ఎలక్ట్రానిక్ తయారీ రంగం కోసం ‘ఎంఎస్‌ఎంఈ’లు  విడిభాగాలను సిద్ధం చేసేందుకు అనువైన పర్యావరణ వ్యవస్థను రూపొందించాలని కూడా ఆయన వారిని కోరారు. “దేశంలో విప్లవం తేవడానికి 5జీ సాంకేతికతను ఉపయోగించాలి” అని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశంలో ఇటీవల ప్రవేశపెట్టిన డ్రోన్ విధానంతో ఆ డ్రోన్ సాంకేతికత వినియోగం సాధ్యం కావడం గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ మేరకు అనేకమంది రైతులు డ్రోన్లను నడపటం నేర్చుకుని పొలాల్లో పురుగుమందులు, ఎరువులు చల్లడానికి వాటిని ఉపయోగించడం ప్రారంభించారని గుర్తుచేశారు. భవిష్యత్‌లోని భారతదేశం కొత్త సాంకేతికతల రంగంలో ప్రపంచానికి మార్గనిర్దేశం చేయడమేగాక తద్వారా నాయకత్వ స్థానానికి దూసుకెళ్లగలదని ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.

   కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్, సహాయ మంత్రి శ్రీ దేవుసింగ్‌ చౌహాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీ ముఖేష్ అంబానీ, భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ శ్రీ సునీల్ మిట్టల్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ శ్రీ కుమార్ మంగళం బిర్లాసహా టెలికం శాఖ కార్యదర్శి శ్రీ కె.రాజారామన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

   5జి సాంకేతిక పరిజ్ఞానం సామాన్యులకూ అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఇది నిరంతర ప్రసారంతోపాటు అధిక డేటా లభ్యత, తక్కువ జాప్యం, అత్యంత విశ్వసనీయ సమాచార ఆదానప్రదానాలకు వీలు కల్పిస్తుంది. అలాగే ఇంధన పొదుపు, స్పెక్ట్రమ్ సామర్థ్యం, నెట్‌వర్క్ సామర్థ్యాలను పెంచుతుంది. వందల కోట్ల ఇంటర్నెట్‌ కార్యకలాపాల పరికరాలను ఈ 5జి సాంకేతికత అనుసంధానించగలదు. అధిక నాణ్యతగల వీడియో సేవలను అత్యధిక వేగం, చలనశీలతసహా టెలిసర్జరీ, అటానమస్ కార్ల వంటి సంక్లిష్ట సేవలు అందించడానికీ తోడ్పడుతుంది. విపత్తులపై ప్రత్యక్ష పర్యవేక్షణ, వ్యవసాయంలో కచ్చితత్వంసహా లోతైన గనులు, సముద్రాంతర కార్యకలాపాలు వంటి ప్రమాదకర పారిశ్రామిక కార్యకలాపాల్లో మానవ ప్రమేయాన్ని తగ్గిస్తుంది. ప్రస్తుత మొబైల్ నెట్‌వర్కుల తరహాలో కాకుండా ఒకే నెట్‌వర్క్‌ లో ప్రతి అవసరానికీ తగినట్లు భిన్న వినియోగాలకు 5జి నెట్‌వర్క్‌ ను వాడుకునే వీలుంటుంది.

   కాగా, ‘నవ్య డిజటల్‌ విశ్వం’ ఇతివృత్తంగా ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌-2022 అక్టోబరు 1 నుంచి 4వ తేదీవరకూ జరుగుతుంది. అగ్రశ్రేణి మేధావులు, వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులను ఇది ఒక వేదికపైకి తెస్తుంది. డిజిటల్ సాంకేతికతను వేగంగా అనుసరించడం, విస్తరించడం ద్వారా ఉత్పన్నం కాగల ప్రత్యేక అవకాశాలపై చర్చకు, ఆవిష్కరణకు వీలు కల్పిస్తుంది.



(Release ID: 1864322) Visitor Counter : 250