ఆర్థిక మంత్రిత్వ శాఖ

మహమ్మారి కారణంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితిని కమర్షియల్ బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పటి వరకు బాగానే ఎదుర్కొన్నట్లు వెల్లడించిన - ఆర్థిక సర్వే

11.6 శాతం మేర రెండంకెల వృద్ధిని నమోదు చేసిన - వ్యక్తిగత రుణాలు

10.4 శాతం మేర భారీగా పెరిగిన - వ్యవసాయ రుణాలు

12.7 శాతం మేర వేగం పుంజుకున్న - ఎం.ఎస్.ఎం.ఈ. రుణాలు

యు.పి.ఐ. ద్వారా 8.26 లక్షల కోట్ల రూపాయల విలువైన 4.6 బిలియన్ లావాదేవీలు: 2021లో ఈక్విటీ ద్వారా నిధుల సమీకరణలో 504.5 శాతం పెరుగుదల

29 శాతం కంటే ఎక్కువగా వృద్ధి చెందిన - ఎన్.పి.ఎస్. తోడ్పాటు

Posted On: 31 JAN 2022 2:58PM by PIB Hyderabad

"కొంత వెనుకబడిన ప్రభావం ఇంకా కొనసాగుతున్నప్పటికీ, మహమ్మారి కారణంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితిని వాణిజ్య బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పటివరకు బాగా ఎదుర్కొంది" అని, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటు లో ప్రవేశపెట్టిన 2021-22 ఆర్థిక సర్వే వెల్లడించింది.   2021 డిసెంబర్, 31వ తేదీ నాటికి బ్యాంకు రుణాల వృద్ధి 9.2 శాతంగా ఉందని కూడా సర్వే  పేర్కొంది.

వ్యక్తిగత ఋణాల వృద్ధి రెండంకెల స్థాయికి మెరుగుపడింది:

వ్యక్తిగత రుణాల వృద్ధి గత ఏడాది 9.2 శాతం తో పోలిస్తే, ఈ ఏడాది 11.6 శాతానికి మెరుగుపడినట్లు సర్వే ప్రత్యేకంగా పేర్కొంది.   వ్యక్తిగత రుణాలలో అతిపెద్ద భాగం అయిన గృహ నిర్మాణానికి ఇచ్చే రుణాలు 2021 నవంబర్ లో 8 శాతం వృద్ధిని నమోదు చేశాయి.  రెండవ అతిపెద్ద భాగం అయిన వాహన రుణాల వృద్ధి కూడా 2020 నవంబర్ లో 6.9 శాతం ఉండగా, 2021 నవంబర్‌ లో 7.7 శాతానికి పెరిగింది. 

రుణాల వృద్ధి:

వ్యవసాయ రుణాలు బలమైన వృద్ధిని నమోదు చేస్తూ,  2020 లో 7 శాతం మేర ఉండగా,  2021 లో 10.4 శాతం (వై.ఓ.వై) మేరకు పెరిగాయి.   అదే విధంగా, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎం.ఎస్.ఎం.ఈ) రంగానికి రుణాలు ఎక్కువగా అందజేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తో పాటు ఆర్.బి.ఐ. తీసుకున్న వివిధ చర్యల ప్రభావంతో, సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రుణాలు కూడా, గత ఏడాది 0.6 శాతం ఉండగా, 2021 లో అవి, 12.7 శాతానికి పెరిగాయి. 

ద్రవ్య ప్రసారం:

సర్వే ప్రకారం, పెద్ద మిగులు వ్యవస్థాగత లిక్విడిటీ, అనుకూలమైన వైఖరితో కొనసాగడానికి ఫార్వర్డ్ గైడెన్స్ మరియు ఎంపిక చేసిన రంగాలలో రుణాల ధరల కోసం బాహ్య బెంచ్‌ మార్క్ వ్యవస్థ ద్రవ్య ప్రసారానికి సహాయం చేస్తుంది.

భారతదేశంలో కారకం:

ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఎం.ఎస్.ఎం.ఈ.ల లిక్విడిటీ కి ఫ్యాక్టరింగ్ ఒక ప్రధానమైన కారణమని సర్వే పేర్కొంది.  అందువల్ల, యు.కె. సిన్హా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా చేసిన సవరణలతో ఫాక్టరింగ్ రెగ్యులేషన్ (సవరణ) చట్టం, 2021 రూపొందించడం జరిగింది.  ఈ సవరణ చట్టానికి సంబంధించిన ముఖ్యమైన నిబంధనలను 2022 జనవరి నెలలో ఆర్.బి.ఐ. విడుదల చేసింది.  చట్టంలోని నిర్బంధ నిబంధనలను, ఈ సవరణలు సరళీకృతం చేయడంతో పాటు, అదే సమయంలో ఆర్.బి.ఐ. క్రింద పనిచేసే విధంగా, ఒక బలమైన నియంత్రణ / పర్యవేక్షణ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.  మొత్తం మీద, ఈ మార్పు దేశంలో ఫ్యాక్టరింగ్ పర్యావరణ వ్యవస్థ విస్తృతికి దారి తీయడంతో పాటు, రుణ సౌకర్యాలను పొందేందుకు వీలుగా అదనపు మార్గాలను అందించడం ద్వారా ఎం.ఎస్.ఎం.ఈ. లకు గణనీయంగా సహాయపడుతోంది. 

భారతదేశంలో డిపాజిట్ బీమా:

2021లో పార్లమెంట్ ఆమోదించిన డిపాజిట్ బీమా మరియు ఋణ హామీ కార్పొరేషన్ (సవరణ) చట్టం, భారతదేశంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చిందని సర్వే పేర్కొంది.  బ్యాంకుల వారీగా, మొత్తం డిపాజిట్లతో పోలిస్తే బీమా చేసిన డిపాజిట్ల శాతం ఆర్.ఆర్.బి. లకు 84 శాతం; సహకార బ్యాంకులకు 70 శాతం; ఎస్.బి.ఐ. కి 59 శాతం; పి.ఎస్.బి. లకు 55 శాతం; ప్రైవేట్ రంగ బ్యాంకులకు 40 శాతం; విదేశీ బ్యాంకులకు 9 శాతంగా ఉందని సర్వే పేర్కొంది.  డిపాజిట్ బీమా ప్రారంభమైనప్పటి నుండి 2021 మార్చి, 31వ తేదీ వరకు, క్లెయిమ్‌ ల కోసం మొత్తం 5,763 కోట్లరూపాయలు (27 వాణిజ్య బ్యాంకులకు సంబంధించి 296 కోట్ల రూపాయలు; 365 సహకార బ్యాంకులకు సంబంధించి 5,467 కోట్ల రూపాయలు) చెల్లించడం జరిగింది.

డిజిటల్ చెల్లింపులు:

ఈ సర్వే ప్రకారం, ప్రస్తుతం లావాదేవీల పరిమాణంలో, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యు.పి.ఐ), దాని విస్తృత ఆమోదాన్ని సూచిస్తూ, దేశంలో అతిపెద్ద రిటైల్ చెల్లింపు వ్యవస్థగా ఉంది.  2021 డిసెంబర్ నెలలో, యు.పి.ఐ. ద్వారా 8.26 లక్షల కోట్ల రూపాయల విలువైన 4.6 బిలియన్ లావాదేవీలు జరిగాయి.  యు.పి.ఐ. ని "పే-నౌ" తో అనుసంధానం చేయడానికి ఆర్.బి.ఐ. మరియు మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ కలిసి ఒక ప్రాజెక్టు ను ప్రకటించాయి.  ఇది 2022 జూలై నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.  భూటాన్ ఇటీవల తన క్యూ.ఆర్. కోడ్ కోసం యు.పి.ఐ. ప్రమాణాలను స్వీకరించిన మొదటి దేశంగా అవతరించింది.  సింగపూర్ తర్వాత వ్యాపార స్థానాల్లో బి.హెచ్.ఐ.ఎం-యు.పి.ఐ. ఆమోదం పొందిన రెండవ దేశం కూడా భూటాన్  నిలిచింది. 

ఎన్.బి.ఎఫ్.సి.లు:

ఎన్‌.బి.ఎఫ్‌.సి. రంగం మొత్తం రుణాలు 2021 మార్చి నెలలో 27.53 లక్షల కోట్ల రూపాయలు ఉండగా 2021 సెప్టెంబరు నాటికి స్వల్పంగా పెరిగి 28.03 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు సర్వే పేర్కొంది.  జి.డి.పి. యొక్క నిష్పత్తి గా ఎన్.బి.ఎఫ్.సి. రుణాలు ద్వారా కొలవబడిన ఎన్.బి.ఎఫ్.సి. క్రెడిట్ సామర్ధ్యం స్థిరంగా పెరుగుతూ, 2021 మార్చి చివరి నాటికి 13.7 శాతం వద్ద నిలిచింది.  రిటైల్ రుణాలు, సేవలను అనుసరించి, ఎన్‌.బి.ఎఫ్‌.సి. రంగం ద్వారా విస్తరించబడిన క్రెడిట్‌ లో పరిశ్రమ అతిపెద్ద గ్రహీతగా నిలిచింది.

ఈక్విటీ:

2020 ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో 14,733 కోట్ల రూపాయలను సేకరించిన 29 కంపెనీలతో పోలిస్తే, 2021 ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో, 75 కంపెనీలకు చెందిన ఐ.పి.ఓ. లు 89,066 కోట్ల రూపాయల మేర ఆర్జించడంతో, నిధుల సమీకరణ అద్భుతంగా, 504 శాతం మేర పెరిగినట్లు, సర్వే నివేదిక పేర్కొంది.   ఐ.పి.ఓ. ల ద్వారా సమీకరించిన మొత్తం గత దశాబ్దంలో ఏ సంవత్సరంలోనైనా సేకరించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది.  2021 ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో ప్రాధాన్యతా కేటాయింపు ద్వారా సేకరించిన మొత్తం, గత ఏడాది సేకరించిన మొత్తంతో పోలిస్తే 67.3 శాతం మేర పెరిగింది.  మొత్తం మీద, 2021 ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో, పబ్లిక్ ఆఫర్లు; హక్కులు; క్యూ.ఐ.పి. మరియు ప్రిఫరెన్షియల్ ఇష్యూలు వంటి విభిన్న విధానాల్లో ఈక్విటీ ఇష్యూల ద్వారా 1.81 లక్షల కోట్ల రూపాయలు సమీకరించడం జరిగింది. 

మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలు:

మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణ (ఏ.యు.ఎం) కింద 2020 నవంబర్ నెల చివరి నాటికి 30.0 లక్షల కోట్ల రూపాయల మేర ఉన్న నికర ఆస్తులు, 2021 నవంబర్ చివరి నాటికి 24.4 శాతం పెరిగి 37.3 లక్షల కోట్ల రూపాయలకు చేరాయని సర్వే ప్రత్యేకంగా పేర్కొంది.  2020 ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా 2.73 లక్షల కోట్ల రూపాయల మేర నికర వనరుల సమీకరణ జరగ్గా, 2021 ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో 2.54 లక్షల కోట్ల రూపాయల మేర మాత్రమే నికర వనరుల సమీకరణ జరిగింది.

పింఛన్ల రంగం:

నూతన పింఛను పథకం (ఎన్.పి.ఎస్) మరియు అటల్ పెన్షన్ యోజన (ఏ.పి.వై) కింద మొత్తం చందాదారుల సంఖ్య 2020  సెప్టెంబర్ నాటికి 374.32 లక్షలు ఉండగా 2021 సెప్టెంబర్ నాటికి 463 లక్షలకు పెరిగిందని, ఇది గత ఏడాది కంటే 23.7 శాతం వృద్ధిని నమోదు చేసిందని సర్వే ప్రశంసించింది.  2020 సెప్టెంబర్ నుండి 2021 సెప్టెంబర్ మధ్య కాలంలో ఎన్.పి.ఎస్. కింద మొత్తం చందా 29 శాతం కంటే ఎక్కువ పెరిగింది.  చందా వసూళ్ళలో గరిష్ట వృద్ధి ఆల్ సిటిజన్ మోడల్ (51.29 శాతం) కింద నమోదయ్యింది.  తరువాతి స్థానాల్లో కార్పొరేట్ రంగం (42.13 శాతం); ఏ.పి.వై. (38.78 శాతం);  రాష్ట్ర ప్రభుత్వ రంగం (28.9 శాతం); కేంద్ర ప్రభుత్వ రంగం (22.04 శాతం) తో ఉన్నాయి.   2021 సెప్టెంబర్ చివరి నాటికి ఎన్.పి.ఎస్. మరియు ఏ.పి.వై. నిర్వహణ కింద ఉన్న ఆస్తులు (ఏ.యు.ఎం) 6.67 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి.  తద్వారా 34.8 శాతం వృద్ధిని (వై.ఓ.వై) నమోదు చేసింది.  మహిళా చందాదారుల భాగస్వామ్యం పెరగడంతో, ఏ.పి.వై. కింద నమోదు చేసుకున్న వారిలో లింగ వ్యత్యాసం బాగా తగ్గింది. 2016 మార్చి లో 37 శాతంగా ఉన్న ఈ వ్యత్యాసం 2021 సెప్టెంబర్ నాటికి 44 శాతానికి పెరిగింది. 

షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (ఎస్.సి.బి.ఎస్):

ఎస్.సి.బి.ల స్థూల నాన్-పెర్ఫార్మింగ్ అడ్వాన్సులు (జి.ఎన్.పి.ఏ) 2021 సంవత్సరంలో 6.9 శాతానికి తగ్గగా, నికర నాన్-పెర్ఫార్మింగ్ అడ్వాన్సులు (ఎన్.ఎన్.పి.ఏ) 2.2 శాతం మేర ఉన్నట్లు, సర్వే గమనించింది.  ఎస్.సి.బి. ల  పునర్నిర్మించబడిన స్టాండర్డ్ అడ్వాన్సుల (ఆర్.ఎస్.ఏ) నిష్పత్తి 0.4 శాతం నుండి 1.5 శాతానికి పెరిగింది.  మొత్తం మీద, 2021 సెప్టెంబర్ చివరి నాటికి,  ఎస్.సి.బి.ల  ఒత్తిడికి గురైన  అడ్వాన్సుల నిష్పత్తి 8.5 శాతానికి పెరిగింది.  ఆస్తి నాణ్యతకు సంబంధించి అందించిన కోవిడ్-19 సంబంధిత మినహాయింపులు / తాత్కాలిక నిషేధాలు పునర్నిర్మించబడిన ఆస్తుల పెరుగుదలకు దోహదపడ్డాయని, ఫలితంగా, ఒత్తిడికి గురైన అడ్వాన్సుల నిష్పత్తి పెరిగిందని సర్వే పేర్కొంది.

ప్రభుత్వ రంగ బ్యాంకులు (పి.ఎస్.బి.లు):

2021 సెప్టెంబర్ చివరి నాటికి జి.ఎన్.పి.ఏ. 8.6 శాతానికి తగ్గిందని సర్వే ప్రముఖంగా పేర్కొంది.  పునర్వ్యవస్థీకరించబడిన అడ్వాన్సుల పెరుగుదల కారణంగా పి.ఎస్.బి.ల ఒత్తిడికి గురైన అడ్వాన్సుల నిష్పత్తి అదే సమయంలో 10.1 శాతానికి పెరిగింది.  2021 సెప్టెంబర్, 30వ తేదీ నాటికి మూలధన స్థానం ఆధారంగా, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు 2.5 శాతానికి పైగా క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ (సి.సి.బి)ని నిర్వహించాయి.

 

*****



(Release ID: 1794106) Visitor Counter : 246