ప్రధాన మంత్రి కార్యాలయం

అగర్తలలో మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం కొత్త సమీకృత టెర్మినల్ను ప్రారంభించిన ప్రధానమంత్రి


త్రిపుర రాజధాని అగర్తలలో రెండు కీలక అభివృద్ధి పథకాలకు ప్రధాని శ్రీకారం;

“హీరా (హెచ్‌ఐఆర్‌ఏ) నమూనాలో అనుసంధానాన్ని
బలోపేతం చేయడంతోపాటు విస్తరించుకుంటున్న త్రిపుర”;

రోడ్డు.. రైలు.. వాయు.. జలమార్గ అనుసంధాన మౌలిక వసతులలో అనూహ్య పెట్టుబడులతో వాణిజ్య కారిడార్‌గా.. వర్తక-పారిశ్రామిక కూడలిగా త్రిపుర;

“రెండు ఇంజన్ల ప్రభుత్వానికి అర్థం వనరుల సద్వినియోగం- అంటే..
ప్రజల్లో అవగాహన-శక్తిసామర్థ్యాలను పెంచడం.. అంటే- సంకల్పాలు..
సేవల లక్ష్యం సాధించడంతోపాటు సౌభాగ్యం దిశగా సాగే సమష్టి కృషి

Posted On: 04 JAN 2022 5:42PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త్రిపుర రాజధాని అగర్తలలో మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం కొత్త సమీకృత టెర్మినల్‌ భవనాన్ని ప్రారంభించారు. దీంతోపాటు రెండు కీలక ప్రగతిశీల కార్యక్రమాలు… ‘ముఖ్యమంత్రి త్రిపుర గ్రామ సమృద్ధి యోజన’తోపాటు 100 విద్యాజ్యోతి పాఠశాలల ప్రాజెక్ట్‌ మిషన్‌లకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ విప్లవ్‌ కుమార్ దేవ్‌, కేంద్ర మంత్రులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, శ్రీమతి ప్రతిమా భౌమిక్ తదితరులు కూడా పాల్గొన్నారు.

   సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- ప్రస్తుత 21వ శతాబ్దపు భారతదేశం ‘సబ్‌కా సాథ్-సబ్‌కా వికాస్-సబ్‌కా విశ్వాస్’ తారకమంత్ర స్ఫూర్తితో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ ముందడుగు వేస్తున్నదని పేర్కొన్నారు. అసమతౌల్య అభివృద్ధి ఫలితంగా కొన్ని రాష్ట్రాల వెనుకబాటు, ప్రజలకు కనీస సదుపాయాలు కూడా కొరవడటం వంటిది ఎంతమాత్రం మంచిది కాదన్నారు. అయితే, త్రిపుర ప్రజలు దశాబ్దాలుగా ఇదే పరిస్థితిని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అవధుల్లేని అవినీతితోపాటు రాష్ట్రాభివృద్ధిపై తగిన దార్శనికత లేదా ఉద్దేశం లేని ప్రభుత్వాలే ఇందుకు కారణమని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఇటువంటి నేపథ్యంలో త్రిపురలో అనుసంధానం మెరుగు కనెక్టివిటీని దిశగా, ప్రస్తుత ప్రభుత్వం ‘హెచ్‌ఐఆర్‌ఎ’- హైవే, ఇంటర్నెట్,  రైల్వేస్, ఎయిర్‌వేస్’ (హీరా) మంత్రంతో ముందుకొచ్చిందని ప్రధాని చెప్పారు. ఈ ‘హీరా’ నమూనా ఆధారంగా నేడు త్రిపురలో అనుసంధానాన్ని బలోపేతం చేసుకోవడమేగాక విస్తరింపజేస్తున్నదని తెలిపారు.

   కొత్త విమానాశ్రయం గురించి వివరిస్తూ- త్రిపుర సంస్కృతి, సహజ సౌందర్యం, అత్యాధునిక సదుపాయాల సమ్మేళనంగా ఇది రూపుదిద్దుకున్నదని చెప్పారు. ఈశాన్య భారతానికి వాయు మార్గం అనుసంధానంలో ఈ విమానాశ్రయం ప్రముఖ పాత్ర పోషించగలదని చెప్పారు. త్రిపుర రాష్ట్రాన్ని ఈశాన్య భారత ముఖద్వారంగా తీర్చిదిద్దడానికి పూర్తిస్థాయిలో పనులు సాగుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రోడ్డు, రైలు, వాయు, జలమార్గ అనుసంధాన మౌలిక వసతుల కల్పనకు అనూహ్య రీతిలో పెట్టుబడు వస్తున్నాయని చెప్పారు. తద్వారా త్రిపుర రాష్ట్రం వాణిజ్య కారిడార్‌గానే కాకుండా వర్తక-పారిశ్రామిక కూడలిగానూ పరివర్తన ఆయన చెందగలదని వివరించారు. “రెట్టింపు వేగంతో పనిచేయడంలో ఈ జోడు ఇంజన్ల ప్రభుత్వానికి సాటిరాగలదేదీ లేదు. రెండు ఇంజన్ల ప్రభుత్వానికి అర్థం వనరుల సద్వినియోగం- అంటే.. ప్రజల్లో అవగాహన-శక్తిసామర్థ్యాలను పెంచడం.. అంటే- సంకల్పాలు.. సేవల లక్ష్యం సాధించడంతోపాటు సౌభాగ్యం దిశగా సాగే సమష్టి కృషి” అని ప్రధానమంత్రి అభివర్ణించారు.

   ప్రజ‌ల వద్దకు సంక్షేమ ప‌థ‌కాల‌ను తీసుకెళ్ల‌డంలో త్రిపుర‌ చరిత్ర సృష్టించడాన్ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు. ఎర్ర‌కోట‌పై నుంచి తాను ప్రసంగించిన సంద‌ర్భంలో ప్ర‌జ‌ల వద్ద‌కు ప‌థ‌కాల‌ను తీసుకెళ్ల‌డం, సంతృప్తస్థాయిలో వాటిని అమలు చేయడంపై ప్రకటించిన దార్శనికతకు అనుగుణంగా ‘ముఖ్య‌మంత్రి త్రిపుర గ్రామ‌ సమృద్ధి యోజ‌న’కు శ్రీకారం చుట్టడంపై ఆయన రాష్ట్రాన్ని ప్ర‌శంసించారు. ఈ పథకం కింద ప్రతి ఇంటికి కొళాయిద్వారా నీటి సరఫరా, గృహనిర్మాణం, ఆయుష్మాన్ సౌకర్యం, బీమా రక్షణ, కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పంపిణీసహా  గ్రామీణ ప్రజానీకంలో ఆత్మవిశ్వాసం పెంచే రోడ్ల నిర్మాణానికీ ప్రోత్సాహం లభిస్తుందని ప్రధాని వివరించారు. అర్హులందరికీ ‘పీఎంఏవై’ ప్రయోజనం లభించే విధంగా నిర్వచనాల్లో మార్పు దిశగా కృషి చేస్తున్నారంటూ ముఖ్యమంత్రిని ప్రధాని అభినందించారు. ఆయన కృషి ఫలితంగా రాష్ట్రంలో 1.8 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకూ 50 వేల ఇళ్లు అప్పగించబడ్డాయని పేర్కొన్నారు. ప్రస్తుత 21వ శతాబ్దంలో భారతదేశాన్ని అత్యాధునికంగా రూపుదిద్దడానికి శ్రమిస్తున్న యువతరంలో నైపుణ్యం పెంచడంలో భాగంగా నవ్య విద్యావిధానం అమలు చేస్తున్నామని ప్రధాని చెప్పారు. స్థానిక భాషలో అభ్యాసానికి కూడా ఈ విధానం సమాన ప్రాధాన్యమిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా త్రిపుర విద్యార్థులు ఇకపై ‘విద్యాజ్యోతి, మిషన్‌-100’ కార్యక్రమాల ద్వారా చేయూత పొందనున్నారని చెప్ప్పారు.

   దేశంలో 15-18 ఏళ్ల మధ్య వయస్కుల టీకాల కార్యక్రమం విద్యార్థుల చదువుకు భంగం వాటిల్లకుండా కొనసాగుతుందని ప్రధాని అన్నారు. కాబట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు  ఆందోళన చెందాల్సిన అవసరం తొలగిపోయిందన్నారు. త్రిపుర రాష్ట్ర జనాభాలో 80 శాతానికి తొలి మోతాదు టీకా పూర్తయిందని, రెండు మోతాదులూ తీసుకున్నవారు 65 శాతందాకా ఉన్నారని ప్రధానమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో 15-18 ఏళ్ల మధ్య వయస్కులకు టీకాల కార్యక్రమాన్ని త్రిపుర త్వరలోనే పూర్తిచేయగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వాడిపారేసే ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాన్ని దేశానికి అందించడంలో త్రిపుర కీలక పాత్ర పోషించగలదని ప్రధాని అన్నారు. ఈ దిశగా ఇక్కడ తయారయ్యే వెదురు చీపుళ్లు, వెదురు సీసాల ఉత్పత్తులకు దేశంలోనే భారీ మార్కెట్ ఏర్పరుస్తున్నామని తెలిపారు. తద్వారా వెదురు వస్తు తయారీలో వేలాది మంది ఉపాధి లేక స్వయం ఉపాధి పొందుతున్నారని చెప్పారు. అలాగే సేంద్రియ వ్యవసాయంలో రాష్ట్రం కృషిని కూడా ఆయన కొనియాడారు.

   హారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయ కొత్త సమీకృత టెర్మినల్ భవనాన్ని 30,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దాదాపు రూ.450 కోట్లతో నిర్మించారు. ఇది ఆధునిక సౌకర్యాలతో, తాజా సమగ్ర వ్యవస్థగల ఐటీ నెట్‌వర్కుతో అందుబాటులోకి వచ్చింది. ఇక రాష్ట్రంలో విద్యానాణ్యత మెరుగు లక్ష్యంగా 100 విద్యాజ్యోతి పాఠశాలల మిషన్‌ ప్రాజక్టు ఏర్పాటైంది. ఈ మేరకు ప్రస్తుతం నడుస్తున్న 100 ఉన్నత/ఉన్నత-మాధ్యమిక పాఠశాలలను నాణ్యమైన బోధన సదుపాయాలు, అత్యాధునిక సౌకర్యాలతో విద్యాజ్యోతి పాఠశాలలుగా మారుస్తారు. వీటిలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకూ సుమారు 1.2 లక్షల విద్యార్థుల విద్యాభ్యాసం రాబోయే మూడేళ్లలో రూ.500 కోట్లదాకా ఖర్చు చేయనున్నారు.

   రోవైపు గ్రామస్థాయిలో కీలక ప్రగతి రంగాల సంబంధిత సేవా ప్రదానంలో నిర్దేశిత ప్రమాణాల సాధనే ‘ముఖ్యమంత్రి త్రిపుర గ్రామ సమృద్ధి యోజన’ లక్ష్యం. ఈ పథకం కింద ఎంపిక చేసిన రంగాల్లో ఇళ్లకు కొళాయి కనెక్షన్లు, గృహవిద్యుత్‌ కనెక్షన్లు, అన్ని కాలాల్లోనూ ఉపయోగపడే రోడ్లు, ప్రతి కుటుంబానికీ అన్ని వసతులతో మరుగుదొడ్లు, ప్రతి బిడ్డకూ నిర్దిష్ట వ్యాధినిరోధక టీకాలు, స్వయం సహాయ బృందాల్లో మహిళల భాగస్వామ్యం పెంపు వంటివి అంతర్భాగంగా ఉన్నాయి.

***

DS/AK



(Release ID: 1787520) Visitor Counter : 233