ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలతో ఇథనాల్ సేకరణ వ్యవస్థ!


ఇ.డి.పి.కింద అమలుకు సి.సి.ఇ.ఎ. ఆమోదం

2021-22వ సంవత్సరానికి ఇథనాల్ ధర సవరణకు ఓకె.

Posted On: 10 NOV 2021 3:46PM by PIB Hyderabad

   ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం (ఇ.బి.పి.) కింద చెరకు ఆధారిత ముడి పదార్థాలనుంచి సంగ్రహించే ఇథనాల్.కు మరింత ఎక్కువ ధరను ఖరారు చేసే ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతలోని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సి.సి.ఇ.ఎ.) ఆమోదం తెలిపింది. 2020-21వ సంవత్సరపు చక్కెర సీజన్ కోసం, అంటే,. 2020 డిసెంబరు 1వ తేదీనుంచి 2021 నవంబరు నెలాఖరు వరకూ గల వ్యవధికి ఈ నిర్ణయం వర్తిస్తుంది. 

   

ఈ కింది అంశాలకు సి.సి.ఇఎ. ఆమోద ముద్ర వేసింది.:

(1) సి-హెవీ మెలాసెస్ రూట్ నుంచి తీసే ఇథనాల్ ధరను లీటరుకు రూ. 45.69నుంచి, లీటరుకు రూ 46.66కు పెంచవచ్చు.  

(2) బి-హెవీ మెలాసెస్ రూట్ నుంచి తీసే ఇథనాల్ ధరను లీటరుకు రూ. 57.61నుంచి, లీటరుకు రూ 59.08కి పెంచవచ్చు.  

(3) చెరకు రసం, చెరకు సిరప్ రూట్ నుంచి తీసే ఇథనాల్ ధరను లీటరుకు రూ. 62.65 నుంచి లీటరుకు రూ. 63.45కుపెంచవచ్చు.

(4) ఆదనంగా వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) రవాణా చార్జీలు చెల్లించవలసి ఉంటుంది.

(5)   రెండవ తరం (2-జి) ఇథనాల్ ధరను నిర్ణయించే స్వేచ్ఛను ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల దేశంలో అధునాతన పరిజ్ఞానంతో జీవ ఇంధన (బయో ఫ్యూయెల్) రిఫైనరీలను స్థాపించేందుకు వీలుంటుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ధాన్యం ఆధారిత ఇథనాల్ ధరలను ఇప్పటికే చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒ.ఎం.సి.లు) నిర్ణయిస్తున్న విషయం ఇక్కడ గమనార్హం.

  సి.సి.ఇ.ఎ. ఆమోద ముద్రతో ఇథనాల్ సరఫరాదార్లకు ధర స్థిరీకరణను, గిట్టుబాటు ధరను కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం తన విధానాన్ని కొనసాగించేందుకు వీలుంటుంది. అంతేకాక, చెరకు రైతులకు పెండింగ్.లో ఉన్న బకాయిలను తగ్గించేందుకు, ముడి చమురు దిగుమతులపై ఆధారపడాల్సిన అగత్యాన్ని నివారించేందుకు కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేసేందుకు, పర్యావరణంపై ఒత్తిడిని తగ్గించేందుకు కూడా వీలు కలుగుతుంది.

.

   2-జి ఇథనాల్ ధరను నిర్ణయించేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు అనుమతి ఇవ్వాలన్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా అధునాతన పరిజ్ఞానంతో కూడిన బయో ఫ్యూయెల్ రిఫైనరీలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. 

  అన్ని డిస్టిల్లరీలు ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు వీలుంటుంది. ఎందుకంటే,.. ఇథనాల్ మిశ్రమ కార్యక్రమానికి (ఇ.బి.పి.కి)  కావలసిన ఇథనాల్.ను చాలావరకూ ఈ డిస్టిల్లరీలే సరఫరా చేసే అవకాశం ఉంది. 

  ప్రభుత్వం అమలు చేస్తున్న ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం (ఇ.బి.పి.) ప్రకారం, చమురు మార్కెటింగ్ కంపెనీలు పది శాతం వరకూ ఇథనాల్ మిశ్రమంతో పెట్రోలును విక్రయించేందుకు వీలుంటుంది. కాగా,..ప్రత్యామ్నాయ ఇంధనాలు, పర్యావరణ హితమైన ఇంధనాలను ప్రోత్సహించేందుకు ఇ.డి.పి.కార్యక్రమాన్ని అండమాన్-నికోబార్, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాలకు తప్ప దేశవ్యాప్తంగా మిగతా ప్రాంతాలకు విస్తరింపజేశారు. 2019 ఏప్రిల్ ఒకటవ తేదీనుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇంధన అవసరాలకోసం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు, వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేందుకు ఈ చర్య తీసుకున్నారు.

  భారత ప్రభుత్వం 2014నుంచి ఇథనాల్ ధరను నోటిఫై చేస్తూ వస్తోంది. అయితే, ఇథనాల్ ఉత్పత్తికి వాడే ఇథనాల్ ఆధారిత ముడి పదార్ధం ధరను ప్రభుత్వం తొలిసారిగా 2018లో ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల కారణంగా, ఇథనాల్ సరఫరాను గణనీయంగా మెరుగుపడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థల ద్వారా జరిగే ఇథనాల్ సేకరణ కూడా పెరిగింది. 2013-14 ఇథనాల్ సేకరణ సీజన్లో సేకరించిన ఇథనాల్ పరిమాణం 38 కోట్ల లీటర్లు ఉండగా, 2020-21 ఇథనాల్ సేకరణ సీజన్.లో అది ఏకంగా 350కోట్ల లీటర్లకు చేరింది.

   ఈ నేపథ్యంలో భాగస్వామ్య వర్గాల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఒక విధానాన్ని ప్రకటించింది. “ఇ.బి..పి. కార్యక్రమం కింద దీర్ఘకాలిక ప్రాతిపదికపై ఇథనాల్ సేకరణ విధానం” పేరిట ఈ విధానాన్ని ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా,..చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ఇథనాల్ సరఫరా కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశాయి. ఇథనాల్ తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇథనాల్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకోసం ఒప్పందాలు కుదుర్చుకోవడానికి తగిన అర్హత కలిగిన కంపెనీల పేర్లను కూడా చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రచురించాయి. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు మరిన్ని చర్యలు కూడా తీసుకున్నారు. త్వరలో ముగిసిపోనున్న 2021-22 ఎథనాల్ సీజన్ లోగా, పది శాతం వరకూ ఇథనాల్.ను పెట్రోల్.లో మిశ్రమం చేయాల్సిందిగా చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించారు. అలాగే, 2025-26 ఇథనాల్ సీజన్లోగా 20శాతం ఇథనాల్.ను పెట్రోల్.లో మిశ్రమం చేసేలా చర్యలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో 2021 జూన్ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా,.. నిపుణుల కమిటీ నివేదికను  ప్రధానమంత్రి విడుదల చేయడం ప్రభుత్వం వేసిన మరో ముందడుగుగా భావిస్తున్నారు. “2020-25నాటికి భారతదేశంలో ఇథనాల్ మిశ్రమ కార్యక్రమానికి కార్యాచరణ ప్రణాళిక” అన్న అంశంతో ఈ నివేదిక రూపొందించారు. దేశంలో సులభతర వాణిజ్య నిర్వహణకు, ఆత్మనిర్భర భారత్ లక్ష్యాల సాధనకు ఈ చర్యలన్నీ దోహదపడనున్నాయి.

  చక్కెర మిగులు ఉత్పత్తి క్రమం తప్పకుండా జరుగుతుండటంతో చక్కెర ధరలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఫలితంగా, రైతులకు చెల్లింపులు జరిపే సామర్థ్యం చక్కెర పరిశ్రమకు తగ్గిపోవడంతో రైతులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో చెరకు రైతుల బకాయిలను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. దేశంలో చక్కెర ఉత్పత్తిని పరిమితం చేసి, ఇథనాల్ స్వదేశీ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం బహుముఖ చర్యలు తీసుకుంది. బి-హెవీ మెలాసెస్, చెరకు రసం, చక్కెర, చక్కెర సిరప్ వంటి వాటిని ఇథనాల్ ఉత్పాదనకోసం మళ్లించడానికి ప్రభుత్వం అనుమతించింది. చెరకు గిట్టుబాటు ధర, మిల్లు ధరల్లో ఇపుడు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ దశలో విభిన్న రకాలైన చెరకు ఆధారిత ముడి పదార్థాలనుంచి తీసే ఇథనాల్ మిల్లు ధరను సవరించాల్సిన అవసరం ఏర్పడింది.

  మరో వైపు, రెండవ తరం (2-జి) ఇథనాల్ ఉత్పాదనా కార్యక్రమం ప్రారంభం కావలసి ఉంది. ఈ కార్యక్రమం కింద వ్యవసాయ అవశేషాలు, అటవీ అవశేషాలనుంచి ఈ రెండవ తరం ఇథనాల్ ఉత్పాదన జరగాల్సి ఉంది. (ఉదాహరణకు...బియ్యం, గోధుమ గడ్డి, మొక్కజొన్న కండెలు, తవుడు, బగాస్, కలప బయోమాస్ వంటి వాటినుంచి ఇథనాల్.ను ఉత్పత్తి చేస్తారు.) ఇందుకోసం ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కొన్ని ప్రాజెక్టులను చేపట్టాయి. ఇందుకోసం ప్రభుత్వం రూపొందించిన “ప్రధానమంత్రి జి.ఐ.-వి.ఎ.ఎన్. యోజన” పథకం నుంచి ఆర్థిక సహాయాన్ని తీసుకుంటున్నాయి. ఇందుకు సి.సి.ఇ.ఎ. ఇదివరకే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులన్నీ రానున్న 2021-22వ సంవత్సరపు ఇథనాల్ సీజన్.నుంచి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఇక 2-జి. ఇథనాల్ ధర ఖరారుపై నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది.

 

***



(Release ID: 1770757) Visitor Counter : 174